తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 09:11

నాగార్జునకే కాదు శోభిత ధూళిపాళకు కూడా హైడ్రా షాక్!

గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని తెలుగులో ఒక నానుడి ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరుతుంటే అలాంటి వారి ఎంట్రీతో శుభం జరిగితే వాళ్ల వలన శుభం జరిగిందని, అశుభం జరిగితే వాళ్ల వల్లనే అశుభం జరిగిందని చెప్పుకోవడం గతంలో ఉంది. ఇక తాజాగా కూడా కొత్త కోడలు శోభిత ధూళిపాళపై అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు లింక్ పెట్టి దారుణమైన చర్చ జరుగుతుంది

శోభిత ఇంట్లో అడుగుపెట్టడమే నాగార్జునకు నష్టం చేసిందని, ఎంగేజ్మెంట్ జరిగితేనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగి నాగార్జునకు తీవ్ర నష్టం జరిగితే ఇక పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో అని.. పాపం శోభితను టార్గెట్ చేస్తున్నారు . కొత్త కోడలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభిత దూళిపాళ్ల నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండి ఆమె పైన దారుణమైన ట్రోలింగ్స్, వేణు స్వామీ షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా నాగర్జున ఒక ఆస్తి విషయంలో ఇంతగా ఇబ్బంది పడడం నాగార్జున జీవితంలోనే తొలిసారి అని, ఇది 100% శోభిత ధూళిపాళ్ల ఎంట్రీ వల్లేనని జాతకాలను నమ్మేవారు జోరుగా చర్చలు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు మన సమాజంలో ఉన్న ఇలాంటి అపోహలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెంది ముందుకు దూసుకు వెళుతున్న నేటి రోజుల్లోనూ ప్రజలలో కనిపించడం ఒకింత ఆందోళన కలిగించే అంశం.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అది చెరువులో కట్టిన అక్రమ నిర్మాణం అని హైడ్రా గుర్తించి జరిపిన కూల్చివేత. అది ఆక్రమణ కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. దానిని అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అయితే దానిని శోభిత దూళిపాళ్ల ఎంట్రీ తో ముడిపెట్టడం సోషల్ మీడియాలో శోభితను ట్రోల్ చేయడం మాత్రం దారుణం.

సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభిత వల్లేనంటూ చర్చించటం అన్యాయం. ఇక కొందరైతే సమంతకు చేసిన అన్యాయం వల్లే ఇప్పుడు నాగార్జున కుటుంబంలో ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు. దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభిత కు కూడా అని ఈ చర్చతో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఏది ఏమైనా హైడ్రా కూల్చివేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభిత ధూళిపాళ గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చతో మహిళాలోకం ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారు.. అయ్యో పాపం అంటున్నారు. ఈ పరిస్థితి మారాలని అంటున్నారు. ఏది జరిగినా ఆడవాళ్ళను టార్గెట్ చేసే వ్యవస్థలో మార్పు రావాలని కోరుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 09:06

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం..పరుగులు తీసిన జనాలు !

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3:40 స్వల్ప భూకంపం చోటు చేసుకుంది.

దీంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మరోసారి ఉదయం 4:03 సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు.

దీంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 09:03

నేడు బెంగాల్లో 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం, హత్య కేసులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మంగళవారం బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు.

ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని కోరారు.

కాగా, మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ప్రజల బాధలను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఎలాంటి బంద్‌ను అనుమతించబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే బంద్ కారణంగా సాధారణ జన జీవనం దెబ్బ తినకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 07:45

హలో నేను సీజేఐని రూ.500 పంపగలరా

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుంటూ డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లా(Chief Justice DY Chandrachud) తనను తాను పరిచయం చేసుకుంటూ క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగిన ఓ సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోట్ చూసి అవాక్కయ్యారు. సీజేఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్‌(FIR)ను నమోదు చేసింది.

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో, CJI పేరును దాని హ్యాండిల్‌గా, డిస్‌ప్లే ఇమేజ్‌కి ఆయన చిత్రాన్ని ఉపయోగించిన స్కామర్, కొలీజియం సమావేశానికి హాజరయ్యేందుకు క్యాబ్‌ కోసం రూ.500 కావాలని కైలాష్ మేఘ్‌వాల్‌ అనే ఎక్స్ వినియోగదారుడిని కోరాడు. ఆ డబ్బు సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. "హలో, నేను CJIని. ఇవాళ కొలీజియం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. నేను కనాట్‌లో చిక్కుకున్నాను. మీరు క్యాబ్ కోసం 500 రూపాయలు నాకు పంపగలరా?" అని సైబర్ నేరగాడు తన చాట్‌లో రాశాడు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో సంఘటనలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా నటించి, విలాసవంతమైన కార్లు, ఖరీదైన సెల్‌ఫోన్‌లను విక్రయిస్తామనే సాకుతో ఓ సైబర్ నేరగాడు ఇద్దరి నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 07:31

మూసీని.. మూసేసి..!

అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..!

అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..! రేవంత్‌ సర్కారు లండన్‌లోని థేమ్స్‌ నది మాదిరిగా మూసీని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయమైనా.. రూ. లక్షన్నర కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ మహా క్రతువుకు అడుగడుగునా అడ్డంకులుగా కబ్జాలు, పూడికలు, డంపింగ్‌ యార్డులు ఉన్నాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం కూడా హైదరాబాద్‌ నగర దాహార్తిని తీర్చి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటపొలాలకు నీరందించిన మూసీ.. ఇప్పుడు ఆక్రమణలతో కుంచించుకుపోయింది. కొన్ని చోట్ల ఉనికినే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ‘ఆంధ్రజ్యోతి’ బృందం నార్సింగ్‌ ఔటర్‌ నుంచి.. నాగోల్‌లోని మూసీ బ్రిడ్జి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూసీని మూసేసిన వైనంపై.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..!

అనంతగిరి కొండల నుంచి గండిపేట సమీపం వరకు మాత్రమే మూసీ నది నీరు స్వచ్ఛంగా ఉంటోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కలుషిత జలాలు ప్రవహిస్తున్నాయి. గండిపేట నుంచి టిప్పుఖాన్‌ బ్రిడ్జి వరకు నాలుగు కిలోమీటర్ల మేర మూసీ నది ఉండగా.. రెండు కిలోమీటర్ల మేర ఆర్మీ ఆర్టిలరీ సెంటర్‌ మీదుగా ప్రవహిస్తోంది. మిగతా రెండు కిలోమీటర్లలో.. నార్సింగ్‌, గండిపేట, మంచిరేవుల, పీరంచెరువు గ్రామ పంచాయతీల పరిధుల్లో.. బఫర్‌ జోన్లు ఆక్రమణలకు గురయ్యాయి.

యథేచ్ఛగా నిర్మాణాలు వెలుస్తున్నా.. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉన్న ఐటీ కారిడార్‌ బహుళ అంతస్తుల డ్రైనేజీ మొత్తం మూసీలోనే కలుస్తోంది. అంటే.. కోకాపేట, నార్సింగ్‌, పుప్పాల్‌గూడ, మణికొండ, రాయదుర్గంతోపాటు.. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల మురుగుకు మూసీ అడ్డా అవుతోందన్నమాట.టిప్పుఖాన్‌ బ్రిడ్జి నుంచి అత్తాపూర్‌ వంతెన వరకు మూసీని రెండు వైపులా మట్టితో నింపేసిన భూబకాసురులు.. యథేచ్ఛగా కబ్జాచేసి, లేఅవుట్లు వేశారు. ఆరు కిలోమీటర్ల మేర ఈ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. లంగర్‌హౌస్‌ బాపూనగర్‌ బస్తీ వెనక కబ్జా పరిస్థితి తారాస్థాయిలో ఉంది. బాపూఘాట్‌, డిఫెన్స్‌ కాలనీ వెనక వైపున్న మూసీ బఫర్‌ జోన్‌లో ఏకంగా రాజకీయ నాయకులే లేఅవుట్లు వేశారు. అంతేకాదు.. టోలిచౌకి, హకీంపేట్‌ ప్రాంతాల్లోని దాదాపు 100 కాలనీల మురుగునీరు బాపూఘాట్‌ వద్ద మూసీలో కలుస్తోంది. టిప్పుఖాన్‌ బ్రిడ్జి నుంచి అత్తాపూర్‌ వరకు మూసీ తీరమంతా చెత్త డంపింగ్‌ యార్డుగా మారిపోయింది.కార్వాన్‌లో మండపాల నిర్మాణం

కార్వాన్‌ గిర్కపల్లి, రాంసింగ్‌పుర, మొఘల్‌-కా-నాలా, అంద్రూనీ/బైరూనీ కార్వాన్‌ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించారు. రాంసింగ్‌పుర ప్రాంతంలో పరీవాహక ప్రాంతంలో మండపాలను నిర్మించారు. ఈ ప్రాంతంలో మూసీ నది వెడల్పు పూర్తిగా తగ్గిపోయి.. చిన్న కాలువలా కనిపించడం గమనార్హం..! పక్కనే ఉన్న జియాగూడలో సుమారు 15 గోదాములు మూసీ బఫర్‌జోన్‌లో కొనసాగుతున్నాయి.పహిల్వాన్లు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఈ గోదాములకు నెలవారీ అద్దెను వసూలు చేస్తున్నారు. నెలరోజుల క్రితం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించి.. రెండ్రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించినా.. ఇప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..! మొఘల్‌-కా-నాలా, కేసరి హనుమాన్‌, గిర్కపల్లి ప్రాంతాల్లో మూసీ బఫర్‌ జోన్‌లో దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇక జియాగూడలోని కబేలాలో మేకలు, గొర్రెల వ్యర్థాలను పైప్‌లైన్ల ద్వారా మూసీలోకి వదిలేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాలు దుర్గంధంగా తయారవుతున్నాయి. గౌలిగూడలోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ సమీపంలోని మూసీ ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి అనధికారికంగా నర్సరీని కొనసాగిస్తున్నాడు.పురానపూల్‌ వద్ద హిందూ శ్మశానవాటిక, ఒక దర్గా ఉంది. ఈ రెండూ మూసీ నదిలోనే కొనసాగుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండూ విస్తరిస్తూ.. మూసీని కుంచించుకుపోయేలా చేస్తున్నాయి. దూద్‌బౌలిలోని రమ్నా్‌సపురలో ఉన్న పశువధశాల నుంచి కూడా మూసీలోకి వ్యర్థాలను వదులుతున్నారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌వే బ్రిడ్జి కింద 18 ద్వారాలుండగా.. అటూఇటూ కలిపి.. 10 ద్వారాలు మూసుకుపోయేలా మట్టితో పూడ్చేశారు. దీంతో కేవలం 8 ద్వారాలే కనిపిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో మూసీ చాలా వరకు కబ్జాకు గురైంది. అంబర్‌పేట్‌ వరకు కబ్జాదారులు మూసీలో అరటి, కొబ్బరిచెట్లను పెంచుతూ.. వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు.వాహెద్‌నగర్‌లో మూసీని మట్టితో పూడ్చడంతో పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్తు తీగలతో ‘ఎర్త్‌’ వస్తుంది. దీంతో.. ఇక్కడ ఆడుకోడానికి వచ్చిన చిన్నారులు పలుమార్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ముసారాంబాగ్‌ బ్రిడ్జి కింద మట్టి, కోళ్ల వ్యర్థాలతో మూసీని కప్పేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మూసీని ఆక్రమించి దుకాణాలను నిర్మిస్తున్నారు. ఇక కొత్తపేట డివిజన్‌లోని జనప్రియ అవెన్యూ, సత్యానగర్‌ కాలనీల వద్ద పచ్చటి తడ్డి పొలాలు ఉన్నాయి. మూసీలో ఎగువ ప్రాంతాల మురుగు మూసీలోకి ప్రవహిస్తోంది. పరిసర కాలనీల మురుగను పైప్‌లైన్ల ద్వారా మూసీలో కలుపుతున్నారు.

రామంతాపూర్‌, ఉప్పల్‌ భగాయత్‌ గడ్డి భూములలో మాజీ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పేరిట బస్తీలు వెలిశాయి. ఇవన్నీ మూసీ బఫర్‌జోన్‌లో ఏర్పాటైనవే కావడం గమనార్హం..! సందేట్లో సడేమియా అన్నట్లు కొందరు నేతలు ఇక్కడ లేఅవుట్లు వేసి, ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. ఇక్కడ ప్లాట్లు కొన్నవారికి ఠంచన్‌గా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ.. ఇతర విభాగాల అనుమతులు లభిస్తున్నాయి. ఇక్కడ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా.. అధికారులు, విజిలెన్స్‌ విభాగం వీటి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగోల్‌ ప్రాంతంలోనూ మూసీని కబ్జా చేస్తూ లేఅవుట్లు, వెంచర్లు వెలుస్తున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండీఏ అధికారులకు చేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసీ బఫర్‌జోన్‌లో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు కొనసాగుతున్నాయి.అంబర్‌పేట డివిజన్‌లో దుర్గానగర్‌, న్యూదుర్గానగర్‌, అహ్మద్‌నగర్‌, నరేంద్రనగర్‌, తదితర ప్రాంతాలు మూసీని ఆనుకుని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మూసీనది క్రమంగా కబ్జాలతో కుంచించుకుపోతోంది. కొందరు ప్లాట్లు చేసి, విక్రయించగా.. ఇంకొందరు గడ్డిని పెంచుతున్నారు. దీంతో దోమల వృద్ధికి ఈ ప్రాంతాలు దోహదపడుతున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు.. వ్యర్థాలను యథేచ్ఛగా మూసీలో వేస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 20:24

హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..!

ప్రస్తుతం హైదరాబాద్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది హైడ్రా కూల్చివేతలే. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. సామాన్యులే కాదు.. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులకు సంబంధించిన ఫౌమ్ హౌస్‌లు, ఫంక్షన్ హాళ్లు కూల్చేస్తూ.. సంచలనంగా మారింది. అయితే.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తున్న హైడ్రాను నడపిస్తుంది సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్. హైడ్రాకు కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్.. ఈ కూల్చివేతల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌‌కు భద్రత పెంచింది రేవంత్ రెడ్డి సర్కార్. రంగానాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌ పోస్టు కూడా ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో రంగనాథ్‌కు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే.. 18 ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభించినట్టు తెలుస్తుండగా.. అందులో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నిర్మాణాలు కూడా ఉండటం గమనార్హం. అందులోనూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేయటం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటున్న జన్వాడా ఫాంహౌస్ కూడా రేపో ఎల్లుండో కూల్చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు రంగానాథ్ బృందం. దీంతో.. హైడ్రా చర్యలపై కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. మిగతా రాష్ట్రాల్లోనూ దుమారం చెలరేగుతోంది.

కాగా.. ఈ హైడ్రా కూల్చివేతలపై అటు పలువురు రాజకీయ నేతల నుంచి.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. హైడ్రా పేరుతో సామాన్యులను రేవంత్ రెడ్డి సర్కార్ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. చాలా మంది నేతల ఫౌంహౌసులు.. ఇలా బఫర్ జోన్‌లోనే ఉన్నాయని ఇప్పటికే ఓ జాబితా కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. వాళ్లంతా మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెడుతున్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 20:20

కవిత బెయిల్ బీఆర్ఎస్-కాంగ్రెస్‌ల ఉమ్మడి విజయం - బండి సంజయ్ సెటైర్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ స్పందించారు. కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం అనేది కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయం అని సెటైర్లు వేశారు. వారి కృషి చివరికి ఫలించిందని వ్యాఖ్యానించారు. కవిత బెయిల్ ద్వారా బయటకు వస్తే.. కాంగ్రెస్ నేత తెలంగాణ నుంచి రాజ్యసభలోకి వెళ్తున్నారని విమర్శించారు.

ప్రసిద్ధ మద్యం కుంభకోణంలో BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయం. బీఆర్ఎస్ నేత బెయిల్ మీద బయటకు వచ్చారు - కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం.. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం.. ఈ క్విడ్ ప్రో కో నేరంలో పాలు పంచుకున్న భాగస్వామ్యులకు అభినందనలు. విలీనం మాట ముచ్చట పూర్తయింది.. ఇక "అప్పగింతలే" తరువాయి’’ అని బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ కౌంటర్

మద్యం పాలసీలో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష్యతో దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆధారాల్లేని కేసులో 5 నెలలు జైలులో ఉంచడం బాధాకరమని, సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని 2 రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని, ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని అన్నారు. కవిత కేసులో న్యాయవాది వృత్తిపరంగా వ్యవహరించారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు బయటపడి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దానితో సంబంధం ఉందని తెలుస్తున్నా, కోట్ల రూపాయలు అక్రమంగా అనుమానాస్పద ఖాతాల్లోకి మళ్లాయని ఆరోపణలు వస్తున్నా, ఇప్పటి వరకు ఈడీ చర్యలు తీసుకోక పోవడంతోనే ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పనిచేస్తుందో అర్ధమవుతున్నదని విమర్శించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 20:00

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సర్కార్.. ఇప్పుడు మరో దరఫా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన సర్కార్.. ఇప్పుడు మరో దరఫా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు మంజూరు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

కాగా, మంగళవారం నాడు స్పీడ్(స్మార్ట్ ప్రోయాక్టీవ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో అధికారులకు సీఎం కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు మరోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అలాగే, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌కు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి భూ బదలాయింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్‌తో డిజైన్లు రూపొందించాలన్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిని నిర్మించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు ఉండాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:39

తెలంగాణ గవర్నర్ ములుగు పర్యటనలో అపశ్రతి.. ఏం జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అయితే భద్రత నేపథ్యంలో వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తిని పాము కాటు వేసింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్‌ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు నేడు, రేపు.. వరుసగా రెండు రోజుల పాటు యాదాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ పర్యటనలో ఉన్నారు. పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల సందర్శన అనంతరం లక్నవరం హాలాండ్స్‌లో బస చేస్తారు. గవర్నర్ తొలిసారి పర్యటనకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆగస్టు 27వ తేదీన గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 25 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహితలతో గవర్నర్‌ పరస్పరం చర్చల అనంతరం.. వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో బసచేసి మరుసటి రోజు హనుమకొండకు చేరుకుంటారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:39

తెలుగోడు ఒక్కడు లేడు.. ఎందుకంటే!

ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 11కు రంగం సిద్దమైంది. అక్టోబర్ 18 నుంచి మళ్లీ కబడ్డీ కూత సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం పూర్తయింది. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లు కురిపించాయి. లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లు పలికారు.

రెండు రోజుల పాటు సాగిన వేలంలో సచిన్ తన్వార్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. ఈ వేలంలో 12 ఫ్రాంచైజీలు మొత్తం 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.అయితే తెలుగురాష్ట్రాలకు చెందిన కబడ్డీ ప్లేయర్లకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఒక్క ఆటగాడిని కూడా వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. గతేడాది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం వహించలేదు.

ప్రోకబడ్డీ టోర్నీలో హర్యానా ఆటగాళ్లదే పూర్తి ఆధిపత్యం నడుస్తోంది. ఆ రాష్ట్రం నుంచి 106 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగమయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 39 మంది, తమిళనాడు నుంచి 22 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 21 మంది కబడ్డీ ప్లేయర్లు ఈ ఫ్రాంచైజీ లీగ్‌లో భాగమయ్యారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ నుంచి ఒక్క ప్లేయర్ కూడా అవకాశం అందుకోలేకపోయారు.

చివరకు జమ్మూ కశ్మీర్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వగా.. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగు టైటాన్స్ కూడా ఒక్క ప్లేయర్‌ను తీసుకోలేదు. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాల్సిన సొంత ఫ్రాంచైజీ స్థానిక ఆటగాళ్లను పట్టించుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ క్రీడ అయిన కబడ్డీలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రాతినిథ్యం లేకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రీడాకారుల కోసం బాగా ఖర్చు పెడుతున్నాయని చెబుతున్నా.. ఒక్క ప్లేయర్ లేకపోవడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. పల్లె క్రీడ అయిన కబడ్డీకి సరైన ప్రోత్సాహకం లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో నైపుణ్యం కలిగిన కబడ్డీ క్రీడాకారులు ఎందరో ఉన్నారని, కానీ వారికి సరైన గైడెన్స్, ప్రోత్సాహకం లేక మధ్యలోనే వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.స్కూల్ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సరైన టోర్నీలు నిర్వహించకపోవడం.. కబడ్డీ అసోసియేషన్స్ అన్నీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారడంతో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు సరైన ప్రోత్సాహం లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. కబడ్డీని కెరీర్‌గా ఎంచుకున్న కొంతమంది ఆటగాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు ఆటలో కొనసాగి తర్వాత వదిలేయడం, మరికొంతమంది ఆర్థిక సమస్యలతో తప్పుకోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఛాంపియన్లకు భారీ నగదు ప్రోత్సాహకం అందించే బదులు.. మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.