తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 03 2024, 13:00

భూ రికార్డులపై కొత్త ఆర్వోఆర్‌..

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది.

భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్‌ సర్కారు సమాయత్తమైంది. ఈ మేరకు భూ రికార్డుల నిర్వహణ కోసం ‘2024-ఆర్వోఆర్‌’ను తెచ్చేందుకు సంకల్పించింది. తద్వారా ధరణి పోర్టల్‌ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్‌ను తెచ్చే చర్యలను వేగవంతం చేసింది. ఈ 2024-ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లును శుక్రవారం మంత్రి పొంగులేటి సభ ముందుంచారు. ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు కొత్త ఆర్వోఆర్‌ బిల్లుకు తుదిరూపమిచ్చి సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కారించడంతో పాటు భవిష్యత్తులోనూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ కొత్త సమగ్ర ఆర్వోఆర్‌-2024 ముసాయిదాకు రూపకల్పన చేసింది

ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ఇందుకుగాను సీసీఎల్‌ఏ ఈ నెల 23 వరకు గడువు విధింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ మెయిల్‌, లేదా పోస్టు ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. మొయిల్‌ ద్వారా అయితే ద్వారా తెలియజేయాలి. లేఖ ద్వారానైతే ల్యాండ్‌ లీగల్‌ సెల్‌, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి, ేస్టషన్‌ రోడ్‌, అన్నపూర్ణ హోటల్‌ ఎదురుగా, ఆబిడ్స్‌, హైదరాబాద్‌ 500001 చిరునామాకు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత.. బిల్లుకు తుదిరూపమిచ్చి.. సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. కాగా కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లులో ధరణిలో పరిష్కారానికి వీల్లేకుండా పోయిన సమస్యలన్నీ పరిష్కారానికి ప్రతిపాదనలు పెట్టారు.

ఈ మేరకు మొత్తంగా 20 సెక్షన్‌ల కింద వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకొనే వెసులు బాట కల్పించారు. వ్యవసాయ భూముల మ్యుటేషన్‌కు సంబంధించిన సమస్యలన్నీ తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలోనే పూర్తవుతాయి. గత ఆర్వోఆర్‌లను సవరించుకోవచ్చు. రికార్డుల్లో లేని భూమును రికార్డుల్లోకి ఎక్కించుకోవచ్చు. నమోదులో జరిగిన పొరపాట్లపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. సర్వే అనంతరం పర్మినెంట్‌ భూధార్‌ నంబరు కేటాయించనున్నారు.

సెక్షన్‌-5 కింద మ్యూటేషన్‌ పరమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ద్వారా వచ్చిన భూమి పత్రాలను పరిశీలించి నోటీసులు ఇస్తారు. ఆపై విచారణ చేసి మ్యూటేషన్‌ చేసే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తారు. సెక్షన్‌-7 కింద వారసత్వం ద్వారా వచ్చిన భూమి, భాగాల పంపకాల్లో వచ్చిన భూమి, వీలునామా కింద సక్రమించిన భూమిని కూడా తహసీల్దార్లకు మ్యూటేషన్‌ చేసే అధికారం ఉంటుంది.

సెక్షన్‌-8 కింద.. ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలు చేసిన భూమి, సాదాభైనామా కింద వచ్చిన భూమి, కౌలుదారు చట్టం కింద సక్రమించిన భూమి, ఇనాం ద్వారా వచ్చిన భూమి, ఓఆర్సీ ద్వారా వచ్చిన భూమిని మ్యూటేషన్‌ చేసే అధికారం ఆర్డీవోలకు కట్టబెట్టారు. మ్యూటేషన్‌ చేసేకంటే ముందు అభ్యంతరాలొస్తే మ్యూటేషన్‌ నిలిపివేసే అధికారం కూడా తహసీల్దార్లు, ఆర్డీవోలకు కల్పించారు

సెక్షన్‌-6 కింద సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ఇప్పటికే వచ్చిన 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించనున్నారు. వీటి పరిష్కారానికి ముందు విచారణ చేసి, నోటీసులు ఇచ్చి మ్యూటేషన్‌ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

కొత్త దరఖాస్తులు వస్తే రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఫీజలు వసూలు చేసి, సంబంధిత రైతులకు మ్యూటేషన్‌ చేయనున్నారు. ఇక నమోదులో తప్పులు జరిగితే అప్పీళ్లు చేసేందుకు ప్రస్తుతం ధరణిలో అవకాశం లేదు.

కానీ ఈ చట్టం ద్వారా బాధితులు అప్పీలుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. మొదటి అప్పీలు కింద కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్‌, రెండో అప్పీలు కింద సీసీఎల్‌ఏకు అధికారం కల్పించారు. వీరు ఇచ్చిన తీర్పులను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

రికార్డుల మార్పు కోసం సివిల్‌ కోర్టుకు వెళ్లనక్కర్లేదు. రెవెన్యూశాఖకు వీటిని సవరించే అధికారం కల్పించారు. యాజమాన్యం హక్కుల కోసం మాత్రమే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. ఈ ఆర్వోఆర్‌ ప్రకారం పహాణిలు మళ్లీ నమోదు చేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 21:20

మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ ఎవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓఎస్డీగా నియమించేందుకు సమర్థుడైన అధికారి కోసం లోకేష్ అన్వేషించారు.

కడప జిల్లా బద్వేల్ ఆర్డీవోగా ఉన్న వెంకటరమణను ఏరికోరి తీసుకొచ్చారు. బద్వేల్ ఆర్డీవోగా పనిచేయకముందు తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా పనిచేశారు. ఈ రెండుచోట్లా తన అద్భుతమైన పనితీరుతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.

ఉద్యోగం వచ్చినప్పటికీ చింతూరు ఐటీడీఏ అధికారిగా పనిచేసే సమయంలో అక్కడి గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు, ప్రభుత్వ పథకాలను వారి దరికి చేరేందుకు రమణ ఎంతో కృషిచేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆయన స్వస్థలంకాగా, తల్లిదండ్రులు ఆకుల శ్రీరాములు, లక్ష్మీనరసమ్మ. విద్యాభ్యాసం మొత్తం మార్కాపురంలోనే సాగింది. సొంతంగా ప్రిపేర్ అయి ఎంసెట్ రాశారు. అందులో వెయ్యి రాంకును సాధించి ఈసీఈ తీసుకున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

అప్పుడే లోటుపాట్లు గుర్తించారు ఆ ఉద్యోగం చేస్తూనే సహచర ఉద్యోగులతో కలిసి దగ్గరలో ఉన్న పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అలా చెపుతున్నప్పుడే లోటుపాట్లను చూసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే మరింత సేవ చేయవచ్చని భావించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరయ్యారు.

వ్యక్తిగత ఖర్చుల కోసం పాఠాలు చెప్పేవారు. 2011లో గ్రూప్-1కు హాజరుకాగా ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అదే సమయంలో ఆ పరీక్షను రద్దు చేశారు. మళ్లీ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేయగా వెంకటరమణ గ్రూప్-1కు మొదటి స్థానంలో నిలిచారు.

మార్కాపురంలోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పేరుతో సొంతంగా గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. మార్కాపురం వచ్చిన ప్రతిసారీ గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 17:42

సాగర్‌కు భారీగా వరద - 530 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా పరిస్థితి ఇదే..!

ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీశైలం నుంచి భారీగా నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ కూడా త్వరలోనే నిండిపోనుంది. ఇవాళ్టి(ఆగస్టు 1) మధ్యాహ్నం రిపోర్ట్ ప్రకారం… 533 అడుగుల నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 169.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇన్ ఫ్లో 2,08,917 క్యూసెకులుగా నమోదు కాగా… 8,344 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 103.71 అడుగుల నీటిమట్టం ఉంది. 1.11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 185 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరనుంది.

రేపు సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల చేయనున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో సాగర్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ నుంచి నీటి విడుదల చేయనున్నారు.

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,42,026 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,78,172 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు గురువారం శ్రీశైలంలోని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో ప్రదక్షణలు చేసి అనంతపరం మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రిగా శ్రీశైలం తొలిసారి వచ్చిన బాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. చంద్రబాబు నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 16:59

ప్రజలను రైలులో ప్రయాణించకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందా?..అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రీ

లోక్‌సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర ఆగ్రహం!

రోజూ 2 కోట్ల మంది రైల్లో ప్రయాణిస్తున్నారని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ వారి మనసుల్లో భయాన్ని నింపాలన్నారు.

రైల్వేను సజావుగా నడపడానికి ప్రతిరోజూ 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు కష్టపడుతున్నారు.

ప్రతిపక్షం 3 రైల్వే ప్రమాదాలను సమస్యగా మారుస్తోందని, కాంగ్రెస్ వారు తమ 58 ఏళ్ల పాలనలో రైల్వే ప్రమాదాల నివారణకు ఎలాంటి వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారన్నారు.

కవాచ్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంగా ప్రకటించింది.

2014లో, ప్రధాని మోదీ దీనిని గ్రహించి, పని ప్రారంభించారు.

మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదాల సంఖ్య 0.24 నుంచి 0.19కి తగ్గిందని చెప్పేవారు సభలో చప్పట్లు కొట్టేవారు.

ఈరోజు 0.19 నుంచి 0.3కి దిగజారినప్పుడు ఇలా ఆరోపణలు చేస్తుంటే ఈ దేశం ఇలాగే కొనసాగుతుందా?

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 14:02

96 మంది డీఎస్పీలు ‘బదిలీ’

రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో... వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించడంతోపాటు వివిధ కారణాలతో ఏకంగా 57 మందికి పోస్టింగ్‌ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సబ్‌ డివిజనల్‌ అధికారులతోపాటు సీఐడీ, ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌లో పనిచేస్తున్న కొందరు డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. వీరిలో శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ వైసీపీతో అంటకాగిన వారు

చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘సిట్‌’, ఇంటెలిజెన్స్‌లో ఉంటూ పీఎస్సార్‌ ఆంజనేయులు కనుసన్నల్లో పని చేసిన వారు, సీఐడీలో విధులు నిర్వహిస్తూ తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఉన్నారు.

శాంతిభద్రతల విభాగంలో 35 సబ్‌ డివిజన్లకు చెందిన 22 మంది డీఎస్పీలను అక్కడి నుంచి తప్పించారు. గన్నవరం డీఎస్పీగా ఉన్న జయసూర్యను మాత్రం భీమవరం బదిలీ చేశారు. మిగిలిన 21 మందికి కొత్తగా డీఎస్పీ పోస్టింగ్‌ లభించింది. వీరంతా ఐదేళ్లుగా లూప్‌లైన్‌లో ఉన్న వారే.

శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ... బదిలీ అయి పోస్టింగ్‌ దక్కని వారిలో... వై.శృతి (శ్రీకాకుళం), జి.నాగేశ్వర రెడ్డి (కాశీబుగ్గ), డి. బాలచంద్రారెడ్డి (టెక్కలి), ఎ.ఎస్‌, చక్రవర్తి(చీపురుపల్లి), హనుమంతరావు (కాకినాడ), విజయ్‌ పాల్‌ (రాజమండ్రి సెంట్రల్‌), అంబికా ప్రసాద్‌ (రాజమండ్రి దక్షిణ), పి. శ్రీకాంత్‌(గుడివాడ), నారాయణ స్వామి రెడ్డి (భీమవరం), మురళీ కృష్ణా రెడ్డి (విజయవాడ వెస్ట్‌), ఎం. రమేశ్‌ (తెనాలి), రవికాంత్‌ (గుంటూరు నార్త్‌), మహబూబ్‌ బాషా (గుంటూరు సౌత్‌), శ్రీనివాసరావు (గురజాల), కిశోర్‌ బాబు (ఒంగోలు), అశోక్‌ వర్ధన్‌ (దర్శి), బాలసుందర్‌ రావు (మార్కాపురం), వీరాంజనేయ రెడ్డి (నెల్లూరు రూరల్‌), బాజీజాన్‌ సైదా (పెనుకొండ), సూర్యనారాయణ రెడ్డి (గూడూరు), శ్రీనివాస రెడ్డి (నాయుడు పేట), ఉమా మహేశ్వర రెడ్డి (శ్రీకాళ హస్తి), శ్రీనివాస రెడ్డి (డోన్‌), శ్రీనివాసులు (ఏలూరు), ప్రసాద రెడ్డి (మదనపల్లె), వినోద్‌ కుమార్‌ (పులివెందుల), మురళీధర్‌ (ప్రొద్దుటూరు), శివభాస్కర్‌ రెడ్డి (గుంతకల్‌), బి. శ్రీనివాసులు(కళ్యాణదుర్గం), వాసుదేవన్‌ (పుట్టపర్తి), విజయ శేఖర్‌ (కర్నూలు), రవీంద్రనాథ్‌ రెడ్డి (నంద్యాల) ఉన్నారు. వీరిలో చాలామంది గత ప్రభుత్వంలో వైసీపీ భక్తులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:49

సగానికి పైగా నిండిన సాగర్‌..

కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.

కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. 312.05 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తు తం 161.97 టీఎంసీల నీరు ఉంది.

కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ దాదాపు గా నిండాయి. గోదావరి బేసిన్‌లో సాగునీటిని అందించే కీలక ప్రాజెక్టు ల్లో తప్పిస్తే.. మిగతా ప్రాజెక్టుల్లో వచ్చిన నీటిని వచ్చినట్లు గానే విడుదల చేస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పం గా తగ్గుతోంది. బుధవారం సాయంత్రం 44.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

కాగా, గురువారం ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:46

అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం: ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి తాజా ప్రకటనలు

ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడుమంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడంపై దాఖలైన పిటీషన్లపై విచారించడానికి ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రాంత్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం దీనిపై తుది తీర్పు ఇచ్చింది.

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని స్పష్టం చేసింది. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై 2004లో అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తూ వస్తోన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. ఈ తీర్పును కన్నీటితో స్వాగతించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పడం తమ పోరాటానికి నిదర్శనమని అన్నారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి తాము వర్గీకరణను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తాము అన్ని రాష్ట్రాల కంటే ముందుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారాయన.

తాము అధికారంలోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే అంటే.. 2023 డిసెంబర్ 23వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, అడ్వకేట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించామని, వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:32

సంజయ్‌, పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

దర్యాప్తు దశలో ఉన్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు వెల్లడించడంతో పాటు అందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సీఐడీ పూర్వ అడిషనల్‌ డీజీ సంజయ్‌, మాజీ అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

దర్యాప్తు దశలో ఉన్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు వెల్లడించడంతో పాటు అందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సీఐడీ పూర్వ అడిషనల్‌ డీజీ సంజయ్‌, మాజీ అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. 

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై నాడు దాఖలు చేసిన స్కిల్‌ కేసు వివరాలను పత్రికా సమావేశాలు నిర్వహించి వెల్లడించడం ద్వారా నిబంధనలు అతిక్రమించిన సంజయ్‌, పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ

ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ యునైటెడ్‌ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.గిరిబాబు వాదనలు వినిపించారు.

ఆంగ్లంలో తర్జూమా చేసిన వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:26

హమాస్ చీఫ్ హత్య.. ఇజ్రాయేల్‌పై దాడికి ఇరాన్ సుప్రీమ్ ఖమేనీ ఆదేశాలు

పశ్చిమాసియా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా (62)ను ఇజ్రాయేల్‌ అంతం చేసింది. లెబనాన్‌‌లో హెజ్‌బొల్లా ఉగ్రవాద కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌యే లక్ష్యంగా దాడులు టెల్ అవీవ్ జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. ఈ దాడికి ఇరాన్‌ వేదిక కావడం చర్చకు తెరతీసింది. అందరూ అనుకున్నట్టుగానే ఇరాన్ దీనిని తీవ్రంగా పరిగణించి, ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమైంది.

హామాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తమ భూభాగంలోనే హమాస్ నేతను హత్యచేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేపోతోంది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌లో మంగళవారం జరిగిన దాడిలో ఇస్మాయిల్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్‌పై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధమయ్యింది. టెల్ అవీవ్‌పై నేరుగా దాడికి ఇరాన్ సుప్రీమ్ నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు ఆ దేశ అధికారులను, రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఇద్దరు సభ్యులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

హనియా హత్యకు గురైనట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే బుధవారం ఉదయం జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన ఖమేనీ.. ఈ మేరకు ఆదేశాలు జరాచేసినట్టు పేర్కొంది. ఇస్మాయిల్‌ను ఇజ్రాయేల్ హత్య చేసిందని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. గత అక్టోబరు నుంచి గాజాలో ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకూ టెల్ అవీవ్ స్పందించలేదు. ఖండించడంగానీ తామే దాడిచేశామనిగానీ చెప్పలేదు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి హాజరై ఇంటికి తిరిగొచ్చిన వెంటనే హమాస్ చీఫ్‌‌ హత్యకు గురయ్యారు.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, సైనిక కమాండర్లతో సహా విదేశాలలో శత్రువులను చంపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. గాజాలో దాదాపు 10 నెలల యుద్ధం తర్వాత ఇరాన్ సమతౌల్యతను సాధించడానికి ప్రయత్నించింది. ఈ ప్రాంతంలో దాని మిత్రదేశాలు, తీవ్రంగా పెరిగిన శత్రువుల దాడులతో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యింది.

విదేశాల్లో ఇటీవల ఇజ్రాయేల్‌ జరిపిన అతిపెద్ద దాడి సిరియా రాజధాని డమాస్కస్‌లోది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్‌‌లు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది.

ఇరాన్ ప్రతిస్పందన ఎంత శక్తివంతంగా ఉంటుంది.. తీవ్రతరం కాకుండా ఉండటానికి అది మరోసారి దాడులు కొనసాగిస్తుందా అనేది అస్పష్టంగా ఉంది. ఇరాన్ సైనిక కమాండర్లు ఇజ్రాయేల్ రాజధాని టెల్ అవీవ్, హైఫా సమీపంలోని సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో మరొక దాడిని పరిశీలిస్తున్నారు.. కానీ పౌర లక్ష్యాలపై దాడులను నివారించడం ఒక పాయింట్’ ఇరాన్ అధికారులు చెప్పారు.

తీవ్రత ఎక్కువగా ఉండేందుకు యెమెన్, సిరియా సహా మిత్రదేశాల దళాలను సమన్వయం చేసుకుని.. సరిహద్దుల నుంచి దాడి పరిశీలనలో ఉందని, దీనిపై తుది నిర్ణయం ఖమేనీదే అని చెప్పాయి. ఒకవేళ యుద్ధం తీవ్రమై, ఇజ్రాయెల్‌పై దాడి, ప్రతిదాడులకు రెండింటికీ ప్రణాళికలను సిద్ధం చేయాలని రివల్యూషనరీ గార్డ్స్, సైన్యానికి సూచించారు.

హామాష్ చీఫ్ హత్యపై చేసిన బహిరంగ ప్రకటనలో ఇరాన్ నేరుగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఖమేనీ సంకేతాలు ఇచ్చారు.. ‘అతడి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడం మా బాధ్యత’ అని నొక్కిచెప్పారు. తమ భూభాగంలో జరిగిన ఈ ఘటనతో ఇజ్రాయేల్ కఠినమైన శిక్షను స్వీకరించడానికి వేదికను ఏర్పాటు చేసిందని ఇరాన్ సుప్రీమ్ అన్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఖమేనీతో పాటు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ శాఖ, రివల్యూషనరీ గార్డ్స్, ఐరాసలోని ఇరాన్ మిషన్ సైతం ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయేల్‌పై దాడి చేస్తామని ప్రకటించాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:22

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది..

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా.. ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా.. జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని.. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కనబెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది.

సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎఫ్.సి.లుగా వర్గీకరించింది. షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటరానితనానికి గురవుతున్న కులాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వారికి రిజర్వేషన్ అవకాశాలు కల్పించింది. అయితే ఇలా కులపరంగా రిజర్వేషన్ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్ర భాగాన ఉన్నారని ఆరోపిస్తూ, ఈ తేడాను సవరించాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేస్తూ ఎ, బి, సి, డి కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలను కోరుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ద పంజాబ్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (రిజర్వేషన్‌ ఇన్‌ సర్వీసెస్‌) యాక్ట్‌-2006’ను సవాలు చేస్తూ పదుల సంఖ్యలో ధర్మాసనంకు పిటిషన్లు వచ్చాయి. ఇందులో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిటిషినర్‌గా ఉన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు 22.5% రిజర్వేషన్‌ కల్పిస్తుండగా.. పంజాబ్‌లో అది 25శాతంగా ఉంది. పంజాబ్‌ రిజర్వేషన్ల చట్టంలోని సెక్షన్‌ 4(5) ప్రకారం.. ఎస్సీ రిజర్వేషన్లలో వాల్మీకి, మజ్హబీ సిక్కులు పోటీలో ఉంటే.. వారికి ప్రాధాన్యతనిస్తూ 50% కోటాను కేటాయించాలి. ఈ చట్టం వల్ల ఎస్సీల్లోని ఇతర కులస్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పంజాబ్‌-హరియాణా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2010లో పంజాబ్‌ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. 2011లో పంజాబ్‌ సర్కారు దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా.. ఇతర పిటిషనర్లు సైతం వ్యాజ్యాలను దాఖలు చేశారు. 2020 ఆగస్టు 27న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా(ప్రస్తుతం రిటైర్‌ అయ్యారు) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టం చేశారు. అసలు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేయొచ్చా? అనే అంశంపై న్యాయపరమైన ప్రశ్నలను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తోపాటు.. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రాల ధర్మాసనం ఈ విచారణను ప్రారంభించింది.

ఈ కేసులో పిటిషనర్లు 2004 నాటి ‘ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ(చట్టం ముందు అంతా సమానులే)ను ఉల్లంఘిస్తోందని 2004 నాటి తీర్పు స్పష్టం చేస్తోంది. దీనికి తోడు.. ఎస్సీ కులాల గుర్తింపు బాధ్యత పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని, ఆయా కులాలను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 మేరకు రాష్ట్రపతి మాత్రమే నోటిఫై చేస్తారని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేర్కొనడం జరిగింది. ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఈ క్రమంలోనే.. ఇవాళ 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది.

ఎస్సీ రిజర్వేషన్లలో క్యాటగిరి చేసుకునే అంశంపై పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో ఆయా వర్గాలు, నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పేదలకు న్యాయం జరగాలన్నదే మోదీ సర్కార్ ఉద్దేశమని.. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని చెప్పుకొచ్చారు.

మరోవైపు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ‘మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని మరోసారి గుర్తు చేశారు. త్వరలో విజయోత్సవ సభ.. ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞత సభలు ఉంటాయని మందకృష్ణ వెల్లడించారు.