తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 17:38

తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!

టీపీసీసీ చీఫ్ పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది.

టీపీసీసీ చీఫ్ (TPCC Chief) పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. మూడు రాష్ట్రాలను పీసీసీ చీఫ్‌లను ఏఐసీసీ ప్రకటించనుంది.

ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా దీపాదాస్ మున్సీ, కేరళ పీసీసీ అధ్యక్షుడుగా కేసీ వేణుగోపాల్ పేరు ఖరారైంది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ఉండనున్నారు. మూడు రాష్ట్రాలకు ఖరారైన నూతన పీసీసీ చీఫ్‌ల పేర్లను నేడో, రేపో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.

కాగా... తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌ గౌడ్ పేరును హైకమాండ్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ గౌడ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. బొమ్మ మహేష్ గౌడ్.. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మహేష్ గౌడ్ ఫేట్ మారిపోయింది. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీని ఏ తరుణంలోనూ వదిలిపెట్టలేదు. పైగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఇంత కాలానికి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలా సామాజిక సమీకరణాలు అన్నీ మహేష్‌కు కలిసొచ్చినట్టుగా సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 14:13

కోహ్లీ, రోహిత్ శర్మలకు పాకిస్థాన్ మాజీ స్టార్ ఆటగాడి కీలక విజ్ఞప్తి

ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్లినా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఏ దేశానికి వెళ్లి ఆడినా వీరిద్దరికీ ఫ్యాన్స్ మద్దతు ఇస్తుంటారు. అయితే క్రికెట్ ఆడే ప్రధాన దేశాల్లో ఒకటైన పాకిస్థాన్‌లో వీరిద్దరూ ఒక్కసారి కూడా పర్యటించలేదు. 2012-13లో పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఇక భారత్ 2006లో చివరిసారిగా పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. అప్పటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో వీరిద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్‌లో ఆడలేదు.

ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా భారత జట్టు పాల్గొనడంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్టార్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్ అయ్యే ముందు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలు ఒకసారి పాకిస్థాన్‌ సందర్శనకు రావాలని కోరాడు. పాకిస్థాన్‌లో వీరిద్దరికి లభించే ప్రేమ, అభిమానాలు అన్నింటినీ మించిపోతాయని అక్మల్ వ్యాఖ్యానించాడు.

ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరూ స్టార్‌ ఆటగాళ్లని, క్రికెట్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యటిస్తున్నారని అక్మల్ అన్నాడు. ‘‘ప్రతి క్రికెట్ ఫ్యాన్ వారిని అభిమానిస్తుంటారు. వారి అద్భుతమైన బ్యాటింగ్, మ్యాచ్‌లను గెలిపించే ప్రదర్శనల కారణంగా ఇద్దరికీ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్థాన్‌లో వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా అన్ని చోట్లా చూసిన దానిని మించిపోతుంది’’ అని అక్మల్ వ్యాఖ్యానించాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కోహ్లీ ఒక ఆదర్శవంతమైన క్రికెటర్ అని, పాకిస్థాన్‌లో అతడికి అపూర్వమైన ఆదరణ లభిస్తుందని అక్మల్ పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలో చాలా మందికి విరాట్ కోహ్లీ రోల్ మోడల్. రోహిత్ శర్మప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్. జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్. ఈ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో పర్యటిస్తే ఇక్కడ అందరికీ ప్రత్యేకంగా ఉంటుంది. విరాట్ అండర్-19 రోజులలో పాక్‌కు వచ్చాడు. కానీ అప్పుడు అతడికి అంత ఆదరణ లేదు’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ అండర్-19 క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్‌లో పర్యటించాడు. అయితే అప్పటికి కోహ్లీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 14:01

శంషాబాద్ లో ల్యాండ్ అయిన ఆకాశ తిమింగలం

ఆకాశ తిమింగలంగా పేరున్న ఎయిర్ బస్ సరకుల రవాణా ఎయిర్ క్రాఫ్ట్ తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి వచ్చింది. గురువారం అర్థరాత్రి ల్యాండ్ అయిన ఈ విమానం శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లిపోయింది. ఇంత భారీ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మొదటిసారి ల్యాండ్ కావటంపై ఆసక్తి వ్యక్తమైంది. 56.16 మీటర్ల పొడవు.. 17.25 మీటర్ల ఎత్తుతో పాటు.. రెక్కలు 44.84 మీటర్లు ఉంటాయి.

ఈ భారీ విమానంలో ఏకంగా 40 టన్నుల (ఒక టన్నువెయ్యి కేజీలు)సరకుల్ని రవాణా చేసే సామర్థ్యం దీని సొంతం. ఇంధనం లేకుండా ఈ భారీ విమనం బరువు 133.8 టన్నులు కాగా.. ల్యాండింగ్ బరువు 140 టన్నులు. టేకాఫ్ బరువు 155 టన్నులు. ఇందులో ఒకసారి 23,860 లీటర్ల ఇంధనాన్ని నింపొచ్చు. ఒకసారి ఇంధనాన్ని నింపిన తర్వాత నాన్ స్టాప్ గా 1650కి.మీ. దూరం ప్రయాణించే సత్తా దీని సొంతం.

ఇక.. దీని ఎత్తు విషయానికి వస్తే.. లో డబుల్ క్రాస్ సెక్షన్ ఎత్తు 71. మీటర్లుకాగా.. లో డబుల్ క్రాస్ సెక్షన్ వెడల్పు 7.1 మీటర్లుగా చెబుతున్నారు. ఇంతకు ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వేస్తే.. ఆసక్తికర సమాధానం వస్తుంది. నిజానికి ఈ ఎయిర్ బస్ విమానం మస్కట్ లో బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఇది థాయ్ లాండ్ లో సరకుల్ని లోడింగ్ కోసం వెళ్లాల్సి ఉంది.

అయితే.. మధ్యలో ఈ విమానం ఇంధనం నింపుకోవటంతో పాటు.. క్రూ సిబ్బంది విశ్రాంతి తీసుకోవాల్సి రావటంతో విమానాన్ని దారి మళ్లించి శంషాబాద్ కు తీసుకొచ్చారు. శంషాబాద్ లో ల్యాండింగ్ చేసిన తర్వాత 15 గంటల పాటు ఇది ఎయిర్ పోర్టులోనే ఉంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వేళలో థాయ్ లాండ్ కు బయలుదేరింది. ఈ బాహుబలి లోహ విహంగం 2022 డిసెంబరులోనూ.. 2023 ఆగస్టులోనే వచ్చింది. తాజాగా మరోసారి ఆగస్టు నెలలోనే శంషాబాద్ కు రావటం ఆసక్తికరం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 13:46

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో శని, ఆదివారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావ‌ర‌ణ‌ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

అలాగే నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రానికి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 08:38

కొత్త పోరాటానికి సమంత సిద్దం - రేవంత్ కు అప్పీల్..!!

ప్రముఖ సినీ నటి సమంత మరో పోరాటానికి సిద్దం అవుతుననారు. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు..సమస్యల పైన ఇచ్చిన నివేదికను వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ కు అప్పీల్ చేసారు. మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్‌ హీరోయిన్ సమంత ప్రశంసించారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం స్పందన ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

సినీ నటి సమంత ఇనస్టాలో చేసిన పోస్టు సంచలనంగా మారుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ నివేదిక పైన సమంత స్పందించారు. హేమీ కమిటీ నివేదిక పని తీరును ప్రశంసించారు. ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు.

ఇదే తరహాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదిక పైన సమంత పోరాటానికి సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. సమంత చేసిన పోస్టులో.." 'తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాము. దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాము. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్‌‌ కూడా ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ గ్రూప్‌ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.

దీనికి కొనసాగింపుగా..."‌ తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని ఇందుమూలంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము..'' అని సమంత చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలు అంశాల పైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమంత చేసిన అప్పీల్ పైన ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 08:32

టర్మ్‌ పాలసీలకు జీఎస్‌టీ మినహాయింపు?

బీమా కంపెనీలు అందించే టర్మ్‌ పాలసీలపై ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ పాలసీల ను జీఎ్‌సటీ నుంచి మినహాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 9న జరిగే

బీమా కంపెనీలు అందించే టర్మ్‌ పాలసీలపై ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ పాలసీల ను జీఎ్‌సటీ నుంచి మినహాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వచ్చే నెల 9న జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశం లో ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారని అధికార వర్గాలు చెప్పాయి. ఇతర బీమా పాలసీల్లానే ఈ పాలసీలపైనా ప్రస్తుతం 18 శాతం జీఎ్‌సటీ విధిస్తున్నారు. పన్ను మినహాయింపు లభిస్తే ఈ పాలసీలకు మరింత ఆదరణ లభించనుంది.

10 నుంచి 30 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఈ పాలసీల గడువులో.. పాలసీదారుడు మరణిస్తే.. అతడి కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా పాలసీలో పేర్కొన్నంత మేరకు ఆర్థిక రక్షణ లభిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదిస్తే ఏటా రూ.200 కోట్ల మేర జీఎ్‌సటీ ఆదాయం మాత్రమే నష్టపోతుందని అంచనా.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 08:29

జోరు తగ్గిన ఆర్థికం

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో జోరు తగ్గింది. దేశంలో స్థూల వస్తూత్పత్తిలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతానికి పరిమితమైంది. ఇది 15 నెలల లేదా ఐదు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో జోరు తగ్గింది. దేశంలో స్థూల వస్తూత్పత్తిలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతానికి పరిమితమైంది. ఇది 15 నెలల లేదా ఐదు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి. వ్యవసాయ, సేవల రంగాలు ప్రదర్శించిన నిరాశావహమైన పనితీరు ఇందుకు కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు దిగజారినప్పటికీ ప్రపంచంలో త్వరితగతిన వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్‌ నిలబెట్టుకుంది. మన పోటీ ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఇదే త్రైమాసికంలో 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతంలో జీడీపీ వృద్ధి రేటులో కనిష్ఠ స్థాయి 6.2 శాతం 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైంది. 

స్థిర ధరల ప్రకారం క్యూ1లో జీడీపీ పరిమాణం రూ.43.64 లక్షల కోట్లున్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.40.91 లక్షల కోట్లుగా (6.7% వృద్ధి) ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం ఇది రూ.77.31 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 9.7 వృద్ధితో జీడీపీ పరిమాణం రూ.70.50 లక్షల కోట్లుగా ఉంది. మరిన్ని వివరాలు..

వ్యవసాయ రంగంలో స్థూల విలువ జోడింపులో (జీవీఏ) వృద్ధి 3.7% నుంచి 2 శాతానికి దిగజారింది. ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, వృత్తి సర్వీసుల్లో జీవీఏ 12.6% నుంచి 7.1 శాతానికి తగ్గింది.

వాణిజ్య, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల రంగం 9.7% నుంచి 5.7 శాతానికి మందగించింది.

తయారీ రంగం జీవీఏ మాత్రం 5% నుంచి 7 శాతానికి పెరిగింది. గనులు, క్వారీ రంగాల్లో జీవీఏ 7% నుంచి 7.2 శాతానికి, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసుల్లో జీవీఏ 3.2% నుంచి 10.4 శాతానికి దూసుకుపోయింది. నిర్మాణ రంగంలో వృద్ధి 8.6% నుంచి 10.5 శాతానికి పెరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 29 2024, 13:15

యూపీఎస్సీకి ఆధార్ వెరిఫికేషన్ అనుమతి

మోసపూరిత విధానంలో ఎంపికయ్యారని తేలడంతో పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణిని ఇటీవలే యూపీఎస్సీ డిబార్ చేసింది. అయితే ఈ వ్యవహారంతో అభ్యర్థుల గుర్తింపు విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టమైంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా యూపీఎస్సీకి కేంద్ర ప్రభుత్వం ఆధార్ వెరిఫికేషన్‌కు అనుమతి నిచ్చింది. ఈ విధంగా అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి.

దీంతో అభ్యర్థులకు సంబంధించిన వివరాల నమోదుతో పాటు పరీక్ష వివిధ దశలు, రిక్రూట్‌మెంట్ సమయంలో కూడా అభ్యర్థుల గుర్తింపునకు ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌ను యూపీఎస్సీ ఉపయోగించనుంది.

ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ దశల పరీక్ష‌తో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థుల గుర్తింపును ధ్రువీకరించేందుకు స్వచ్ఛంద ప్రాతిపదికన 'వన్ టైమ్ రిజిస్ట్రేషన్' పోర్టల్‌పై యూపీఎస్సీ ఆధార్ వెరిఫికేషన్‌ను చేయనుందని తెలిపింది. ఈ మేరకు అనుమతి ఇచ్చామని వివరించింది. యూఐడీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా యూపీఎస్సీ ఆధార్ పరిశీలన చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

అర్హత విషయంలో మోసానికి పాల్పడ్డారనే కారణంతో గత నెలలో ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌ను యూపీఎస్సీ డీబార్ చేసింది. అంగ వైకల్యం సర్టిఫికేట్‌తో పాటు ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) కోటా విషయంలోనూ పూజా ఖేద్కర్ దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం యూపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా ప్రతి ఏడాది లక్షలాది మంది యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాస్తున్న విషయం తెలిసిందే.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 29 2024, 13:13

గుజరాత్‌లో కొనసాగుతున్న వర్ష బీభత్సం.. నాలుగు రోజుల్లో 28 మంది మృతి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సొంత రాష్ట్రం గుజరాత్‌లో వర్ష బీభత్సం (Gujarat Rains) కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం అతలాకుతలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఐదో రోజైన గురువారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు

మోర్బి, వడోదర, బరూచ్‌, జామ్‌నగర్‌, ఆరావలి, పంచమహల్‌, ద్వారకా, డాంగ్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఆనంద్‌లో ఆరుగురు, అహ్మదాబాద్‌లో నలుగురు మరణించారు. గాంధీనగర్‌, ఖేడా, మహిసాగర్‌, దహోద్‌, సురేంద్రనగర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 18 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వరద పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌ ద్వారా సంభాషించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎంని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరోవైపు దేవభూమి ద్వారక, ఆనంద్‌, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్‌ సహా వరద ప్రభావిత జిల్లాల్లో భారత వైమానిక దళం, భారత తీరగస్తీ దళాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 29 2024, 13:09

నిధులిస్తాం, కానీ - ఏపీకి కేంద్రం కొత్త మెలిక..!!

కేంద్రం తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా ఏపీకి సంబంధించిన అంశాల్లో సానుకూలంగా స్పందిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పోలవరం నూతన డీపీఆర్ కు ఆమోద ముద్ర లభించింది. ఇదే సమయంలో కేంద్రం కొన్ని షరతులు విధించింది. ప్రాజెక్టు నిర్మాణం పైనా నిర్దేశించింది. 2027 ప్రారంభానికి ఈ పనులన్నీ పూర్తిచేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించినట్లు సమాచారం.

పోలవరం కొత్త డీపీఆర్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ 30,436.95 కోట్లను తొలి దశ నిర్మాణ పనులు పూ్తి చేసేందుకు డీపీఆర్ ఆమోదించగా రాష్ట్రానికి రూ 12,157 కోట్లు దక్కనున్నాయి. ఈ సమయంలో కొన్ని షరుతులు విధించింది. 2026 మార్చి నాటికి తొలి దశలో నీళ్లు నిలబెట్టేలా పూర్తి చేయాలని నిర్దేశించింది. 2027 ప్రారంభానికి పనులు పూర్తి చేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించింది. తాజా డీపీఆర్ మేరకు రెండేళ్లల్లోనే నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్దత వ్యక్తం చేసింది.

తాజా డీపీఆర్ తో 41.15 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు తొలిదశను 2027 మార్చినాటికే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్రం నిధులు కేటాయించటం నిరాశ, నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఫేజ్-1 కు 30వేల 437 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్రం తరపున 4 వేల 730 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా నిర్ణయించామని అన్నారు.

కేంద్రం నుంచి 25 వేల 706 కోట్లు రావాల్సి ఉంటే, ఇప్పటికే 15 వేల 146 కోట్లు విడుదల చేశారని సీఎం వెల్లడించారు. భూ సేకరణ, మిగిలిన 12 వేల 127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 194 టీఎంసీల నీరు నిలబెట్టాలంటే మరో రూ 25 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో నిర్వాసితుల భూసేకరణ, పునరావాసానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో, మరో డీపీఆర్ ఆమోదం పొందాలంటే 2027 ప్రారంభానికి పనులు పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.