నిజందాగదుక్షణంఆగదు

Sep 11 2023, 07:42

నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంటున్న : నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంటున్న : నాగం

నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు అందజేసిన డా.నాగం వర్షిత్ రెడ్డి.

నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ, నల్లగొండ గోస నాగం భరోసా అనే కార్యక్రమంతో ముందుకు వెళుతూ ప్రజల్లో తన స్థానాన్ని ముద్రించుకున్నారు.

ఈసారి తనకు అవకాశం కల్పించినట్లయితే, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 10 2023, 11:51

మన దేశ ప్రత్యేకత తెలిపేలా కొత్త జెర్సీ...

సెప్టెంబర్ వచ్చిందని క్రికెట్ లవర్స్ తెగ ఆనంద పడిపోతున్నారు. ఎందుకంటే ఎన్నడూ చూడని క్రికెట్.. ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చూడబోతున్నాం. ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ స్టార్ట్ అయింది. మరో 20 రోజుల్లో వరల్డ్ కప్ మెగా టోర్నీ జరగబోతుంది.

దీనికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే క్రికెట్ ఆడనుంది. వీటితో పాటు భారత మెన్ క్రికెట్ మొదటిసారి మెగా టోర్నీలో పాల్గొనబోతుంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి చైనా వేదికగా ప్రారంభం కాబోయే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా పాల్గొనబోతుంది. దీనికోసం బీసీసీఐ పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

భారత్ - పాక్ మ్యాచ్కు వాన గండం.. ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమించింది. భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఆసియన్ గేమ్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో క్రికెట్ టీం జెర్సీ ఇదేనంటూ ఓ మీడియా ఫొటోలు విడుదల చేసింది. దేశ వైవిధ్యం, ఏకత్వాన్ని తెలియజేసేలా ప్రత్యేకంగా ఈ జెర్సీని తయారుచేశారు.

కాగా, ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే భారత మహిళలు, పురుషుల క్రికెట్ జట్లకు బీసీసీఐ బెంగళూరులో క్యాంప్ ఏర్పాటుచేసింది. వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు విమెన్స్ టీంకు, 12 నుంచి 24వ తేదీ వరకు మెన్స్ టీంకు ట్రైనింగ్ ఉంటుంది.

నిజందాగదుక్షణంఆగదు

Sep 10 2023, 11:10

అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ...

జీఎస్టీ రాబడి డబుల్‌

తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే పటిష్ఠమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళుతున్నది.

ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూనే, వాటిని రెట్టింపు చేయడంపై దృష్టి సారించింది.

ఐదేండ్లలో తెలంగాణలో అనూహ్య వృద్ధి నమోదు

2019-20 ఆగస్టు వరకు జీఎస్టీ రాబడి రూ.11,639 కోట్లు

2023-24 ఐదు నెలల్లో రూ.24,052 కోట్లు

ఐదేండ్లలో రూ.12,413 కోట్లు పెరుగుదల

ఐదు నెలల్లోనే 47 శాతం రాబడి

ప్రతి రూపాయి సంక్షేమం కోసమే ఖర్చు

కేంద్రం సహకరించకున్నా.. సొంతకాళ్లపై బలమైన ఆర్థిక పునాది

 తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే పటిష్ఠమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళుతున్నది. ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూనే, వాటిని రెట్టింపు చేయడంపై దృష్టి సారించింది. ప్రతి రూపాయిని అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చిస్తున్నది. అందులో భాగంగానే వాణిజ్య పన్నుల శాఖపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పన్ను వసూళ్లు, అవగాహన కల్పించడం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. వాణిజ్య పన్నులశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలతో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో పన్ను రాబడి గణనీయంగా పెరిగింది. జీఎస్టీ వసూళ్లలో ఊహించని వృద్ధిరేటు నమోదైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.11,639 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.24,052 కోట్ల జీఎస్టీ వచ్చింది. అంటే.. కేవలం ఐదేండ్లలోనే జీఎస్టీ రాబడి డబుల్‌ అయ్యింది. 2019-20 ఆగస్టుతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో వసూలైన జీఎస్టీ రూ.12,413 కోట్లు ఎక్కువ. జీఎస్టీ వసూళ్లలో మొదటి నుంచి తెలంగాణ ఆశించిన ఫలితాలనే సాధిస్తున్నది. ప్రపంచమంతా కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన 2020-21వ ఆర్థిక సంవత్సరం మాత్రం ఆగస్టు వరకు కేవలం రూ.8,224 కోట్లు మాత్రమే వసూలైంది. ఆ తర్వాత మళ్లీ యథావిధి స్థాయికి చేరుకున్నది. 2021-22లో ఆగస్టు వరకు రూ.12,461 కోట్లు, ఆ తర్వాత ఏడాది ఆగస్టు వరకు రూ.16,332 కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం అనూహ్యమైన వసూళ్లను సాధించింది. నిరుడు ఆగస్టుతో పోలిస్తే ఈసారి ఆగస్టు వరకు రూ.7,720 కోట్ల జీఎస్టీ అధికంగా వసూలైంది. కేంద్రంలోని మోదీ సర్కారు సహకరించకున్నా, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మోకాలడ్డుతున్నా, తెలంగాణ మాత్రం సొంతకాళ్లపై నిలబడుతూ బలమైన ఆర్థిక పునాదిని వేసుకుంటున్నది.

బడ్జెట్‌ అంచనాల్లో 47 శాతం రాబడి

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పటిష్ఠ ఆర్థిక ప్రణాళికలతో రాష్ట్రం ఏటికేడు ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే ఉన్నది. ప్రత్యేకించి.. జీఎస్టీ వసూళ్లలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో రూ.5,622 కోట్ల జీఎస్టీ వసూలైంది. నిరుటితో పోలిస్తే రూ.667 కోట్లు (13%) ఎక్కువ. మేలో రూ.4,507, జూన్‌లో రూ.4,681, జూలైలో రూ.4,847, ఆగస్టులో రూ.4,393 కోట్లు వసూలైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో రూ.50,942 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేయగా మొదటి ఐదు నెలల్లోనే రూ.24,052 కోట్ల రాబడి వచ్చింది. అంటే బడ్జెట్‌ అంచనాల్లో మొదటి 5 నెలల్లోనే 47 శాతం రాబడి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 నెలలు మిగిలి ఉన్నాయి. ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఈసారి అంచనాల మించి రాబడి వస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 10 2023, 10:40

భాగ్యనగరం.. భూమి బంగారం

భాగ్యనగరం.. భూమి బంగారం

కోన్నేండ్ల కిందట హైదరాబాద్‌ అంటే అబిడ్స్‌.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి..

కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్‌ రింగ్‌ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది.

పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం..

నగరానికి మణిహారంగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌

ట్రిపుల్‌ ఆర్‌ లక్ష్యంగా డెవలప్‌మెంట్‌ 'రింగ్‌’

ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం

మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం

అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం

పదేండ్లలోనే పదుల కిలోమీటర్లమేర విస్తరణ

ఎల్లలులేని నగరం.. భూములకు భారీ ధరలు

దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామం

చుట్టూ టౌన్‌షిప్పులతో పంచరంగుల సౌధాలు

'రియల్‌’ భవితకు కేంద్రబిందువుగా మహానగరం

కొన్నేండ్ల కిందట హైదరాబాద్‌ అంటే అబిడ్స్‌.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్‌ రింగ్‌ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది.

తెలంగాణ సర్కారు రీజినల్‌ రింగ్‌ రోడ్డు లక్ష్యంగా అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులు కల్పిస్తుండటంతో అనతికాలంలోనే భాగ్యనగరం.. విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది. దేశంలో ఏ నగరానికీ లేనివిధంగా చుట్టూ కిలోమీటర్ల మేర భూములు ఉండగా.. ఎల్లలులేకుండా విస్తరిస్తున్నది.

సీఎం కేసీఆర్‌ విజన్‌, మంత్రి కేటీఆర్‌ నిరంతర పరి'శ్రమ'తో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయంగా మారి శాటిలైట్‌ టౌన్‌షిప్పులతో పంచరంగుల సౌధంగా రూపుదిద్దుకొంటున్నది. 'రియల్‌’ భవిష్యత్తుకు కేంద్రబిందువుగా మారుతున్నది.

హైదరాబాద్‌లో పదిహేనేండ్ల కిందట గచ్చిబౌలి.. పటాన్‌చెరు.. బోయిన్‌పల్లి.. ఉప్పల్‌.. ఎల్బీనగర్‌లాంటి ప్రాంతాలు దాటితే జనావాసాలు చాలా తక్కువగా కనిపించేవి. తర్వాత ఆయా మార్గాల్లోని గ్రామాలు వచ్చేవి. కానీ గత తొమ్మిదన్నరేండ్లుగా పట్టణీకరణ.. ఔటర్‌ రింగు రోడ్డును దాటిపోయింది. తెలంగాణ సర్కారు ఎస్సార్డీపీ కింద భారీ ఎత్తున ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాన్ని చేపట్టడంతో నిమిషాల వ్యవధిలో ప్రధాన నగరంలోకి రాకపోకలు సులువుగా మారడంతో జనాలు అవుటర్‌ దాటి నివాసాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. ప్రధానంగా ఇన్నర్‌-ఔటర్‌ రింగు రోడ్డుకు అనుసంధాన రోడ్లు (లింక్‌ రోడ్స్‌), మెట్రో రైలు రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి.

తెలంగాణ సర్కారు హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఇందుకు తొమ్మిదిన్నరేండ్లలో ఏకంగా రూ.90 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. వచ్చే మూడేండ్లలో మరో రూ. 80 వేల కోట్ల నుంచి 90 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించి, పక్కాగా అమలు చేస్తున్నది. ఇదే సమయంలో దేశంలోని ఇతర మెట్రోల నగరాలను తీసుకొంటే.. హైదరాబాద్‌తో పోల్చితే అన్నీ ప్రతికూల అంశాలే కనిపిస్తున్నాయి. ప్రతి నగరం ఏదో ఒక కీలకమైన మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది.

తమిళనాడు రాజధాని చెన్నైలో అక్కడి జనాభాకు అనుగుణంగా నీటిని అందించే పరిస్థితి లేదు. కృష్ణాజలాల కోసం తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలను అభ్యర్థించాల్సిన దుస్థితి. కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకవైపు ట్రాఫిక్‌ సమస్య వెంటాడుతుంటే.. మరోవైపు కరెంటు కోతలు కుదేలు చేస్తున్నాయి. మహారాష్ట్రలోని పుణె రోజుకు ఎనిమిది గంటల వరకు విద్యుత్తు కోతలతో అల్లాడిపోతున్నది. ముంబై, చెన్నైలకు మహానగరాలుగా పేరున్నా చిన్నపాటి వర్షానికే అతలాకుతలమవుతున్నాయి. వీటన్నింటికీ హైదరాబాద్‌ భిన్నంగా ఉన్నది. సకల వసతులతో అలరారుతుండడంతో ఇక్కడికి అంతర్జాతీయ పెట్టుబడులు క్యూకడుతున్నాయి. ఫలితంగా నగరం ఎల్లలు లేకుండా విస్తరించి ఔటర్‌కు ఆవల భూముల రేట్లుకూడా వందలరెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ భూమిపై పెట్టుబడి పెట్టేవారికి భవిష్యత్తు అంతా బంగారుమయంగా కనిపిస్తున్నది.

ట్రిపుల్‌ ఆర్‌ లక్ష్యంగా మౌలిక వసతులు

దేశంలోని ఇతర ఏ మెట్రో నగరాలు కూడా చుట్టూ (రేడియల్‌ డెవలప్‌మెంట్‌) విస్తరించేందుకు అవకాశం లేదు. చెన్నై, ముంబై ఆ రాష్ర్టాలకు ఒక కొనగా ఉండటంతోపాటు ఒకవైపు సముద్రం ఉన్నది. ఢిల్లీ విస్తరణ సాధ్యం కాక ప్రత్యేకంగా రీజియన్‌ ఏర్పాటుతో ఇతర రాష్ర్టాలకు అనుసంధానం అవుతున్నది. బెంగళూరు, కోల్‌కతాలాంటి నగరాలు కూడా ఆయా రాష్ర్టాలకు ఒక కొనగా ఉన్నాయి. కానీ హైదరాబాద్‌ వీటన్నింటికీ భిన్నం. చుట్టూ విస్తరించే భౌగోళిక అనుకూలత ఉండటంతోపాటు పుష్కలమైన ల్యాండ్‌ బ్యాంకు ఉంది. అందుకే సీఎం కేసీఆర్‌ ఈ అనుకూలతలను బలంగా చేసుకొని దేశంలోనే తిరుగులేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రధాన నగరంతోపాటు చుట్టూ ఔటర్‌ రింగు రోడ్డు వరకు మౌలిక వసతుల కల్పన చాలావరకు పూర్తయింది. తాగునీటి వ్యవస్థ సిద్ధంగా ఉంది. అనుసంధాన రహదారులు దాదాపుగా పూర్తయ్యాయి. మెరుగైన విద్యుత్తు వ్యవస్థ సైతం అందుబాటులో ఉన్నది. కొంతమేర మిగిలి ఉన్న పనులు కూడా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నగరం ఎంత మేర విస్తరించే అవకాశముందనే దానిపై ఇప్పటికే అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్‌ ఆ మేరకు ప్రణాళికల అమలుకు సిద్ధమయ్యారు. ఔటర్‌కు చుట్టూ సుమారు 20-50 కిలోమీటర్ల పరిధి వరకు నిర్మించనున్న రీజినల్‌ రింగు రోడ్డు (ట్రిపుల్‌ఆర్‌) లక్ష్యంగా విస్తరణ జరగనున్నది. అందుకు అనుగుణంగానే రూ.69,100 కోట్లతో మెట్రో విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నారు. దీంతో ఇప్పుడున్న ఔటర్‌, మెట్రో విస్తరణ ప్రాజెక్టులతోపాటు భవిష్యత్తులో రానున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు ఏకంగా ఎనిమిది జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారుల మీదుగా వెళ్లడమనేది హైదరాబాద్‌ విస్తరణలో అత్యంత కీలకమైన అంశం. విజయవాడ హైవే (ఎన్‌హెచ్‌-65)పై పెద్ద అంబర్‌పేట, ముంబై హైవే (ఎన్‌హెచ్‌-65)పై ఇస్నాపూర్‌, బెంగళూరు హైవే (ఎన్‌హెచ్‌-44)పై శంషాబాద్‌, నాగ్‌పూర్‌ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్లకోయ, వరంగల్‌ హైవే (ఎన్‌హెచ్‌-163)పై ఘట్‌కేసర్‌, శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్‌-765)పై తుక్కుగూడ, నర్సాపూర్‌ హైవే (ఎన్‌హెచ్‌-765డి)పై దుండిగల్‌, బీజాపూర్‌ హైవే (ఎన్‌హెచ్‌-163)పై టీఎస్‌ పోలీస్‌ అకాడమీ వద్ద కలుస్తున్నాయి. దీంతోపాటు రాజీవ్‌ రహదారిపై తూంకుంట-శామీర్‌పేట, నాగార్జునసాగర్‌ రహదారిపై బొంగుళూరు వద్ద మెట్రో కలుస్తుంది. తెలంగాణలోని ఏ మూల నుంచి నగరానికి రావాలన్నా వీటి మీదుగానే రావాలి. దీంతో హైదరాబాద్‌ మరింతంగా విస్తరించడంతోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలతో అనుసంధాన ప్రక్రియ మరింత బలోపేతం కానున్నది.

ప్రతి ఇంటర్‌చేంజ్‌ ఒక నగరం

గతంలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందం టే అక్కడ నివాసయోగ్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎక్కడ రవాణా వ్యవస్థ ఏర్పాటవుతుందో అక్కడ నగరాలు వెలుస్తున్నాయి. చైనాలోని షాంఘై నగరానికి దూరంగా పది వరుసల రహదారిని నిర్మించారు. దీంతో మూడేండ్ల వ్యవధిలోనే షాంఘైకి ధీటుగా మరో నగరం ఎదిగింది. అక్కడే కాదు.. హైదరాబాద్‌లోనూ అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడున్న ఔటర్‌ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు (ఎక్కేందుకు-దిగేందుకు వీలున్న చోటు) ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు ఒక్కో నగరంగా ఎదిగాయి. డిమాండ్‌ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం నార్సింగి వద్ద ఒక ఇంటర్‌చేంజ్‌ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు అదొక నగరంగా అవతరించింది. దీంతోపాటు కోకాపేట, మల్లంపేట వద్ద మరో రెండు ఇంటర్‌చేంజ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ కూడా భూములు, నివాసయోగ్యాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇంకా అనేకచోట్ల ఇంటర్‌చేంజ్‌లు కావాలంటూ ప్రభుత్వానికి డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. రీజినల్‌ రింగు రోడ్డులోనూ సుమారు 23-24 ఇంటర్‌చేంజ్‌లు ప్రతిపాదిస్తుండగా.. అనేకచోట్ల మరిన్ని ఏర్పాటు చేయాలంటూ విపరీతమైన ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవుటర్‌కు అనుగుణంగా వచ్చే మెట్రో రైలు ప్రాజెక్టులో సుమారు 25 మెట్రో స్టేషన్లు రానుండటంతో అక్కడ కూడా మినీ నగరాలు ఏర్పాటయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఇంటర్‌చేంజ్‌లు అనేది కొత్త నగరాలకు పునాదులుగా మారుతున్నాయి

మెట్రోతో మారనున్న నగర ముఖచిత్రం

మెట్రో ఆఫ్‌ ప్యారిస్‌.. ప్రశాంతమైన నగర జీవితంతోపాటు ట్రాఫిక్‌ జంఝాటం, కాలుష్యానికి చెక్‌ పెడుతున్న మెట్రో మంత్రం ఇది. ఇక్కడ మెట్రోలో రోజుకు సుమారు 41 లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తారంటే ఆ ప్రజా రవాణా వ్యవస్థ ఎంత ప్రభావితంగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రధాన నగరంతోపాటు నగరం చుట్టూ మెట్రో ఉంటుంది. దీంతో ప్రధానమంత్రి మొదలు సామాన్యుడి వరకు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఇలా అన్ని రంగాలవారు నగరంలో ఏ మూలకు పోవాలన్నా నగరం వెలుపలే తమ వాహనాలను పార్క్‌ చేసి.. మెట్రోల్లో ప్రయాణిస్తారు. నిమిషాల వ్యవధిలో గమ్యాలను చేరడంతోపాటు ఎక్కడా ట్రాఫిక్‌ నరకం అనేది ఉండదు. భవిష్యత్తులో హైదరాబాద్‌ నగర ముఖచిత్రం కూడా ఇలాగే మారబోతున్నది. ఔటర్‌ చుట్టూ మెట్రోతోపాటు ఇప్పటికే ఉన్న 69 కిలోమీటర్లకు తోడు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన నగరంలో మరో ఎనిమిది మార్గాలు రానున్నాయి.

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు సామర్థ్యం 186 మెట్రో స్టేషన్లతో 415 కిలోమీటర్లకు పెరగనున్నది. దీంతో ప్రధాన నగరంపై భారం తగ్గడంతోపాటు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గనున్నది. ఫలితంగా హైదరాబాద్‌ చుట్టూ వందలాది మినీ నగరాలు వెలిసి.. తెలంగాణ నలుమూలలకు నగరం అనుసంధానం కానున్నది. ప్రధానంగా కొత్తగా వచ్చే మెట్రో ప్రాజెక్టుల్లో స్టేషన్ల వద్ద ఎకరాల మేర పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పించబోతున్నారు. దీంతో నగరం వెలుపల నుంచి వచ్చే వాహనాలు అక్కడే పార్క్‌ చేసుకొని మెట్రో ద్వారా నగరంలో పని చూసుకొని హాయిగా తిరిగి గమ్యస్థానాలకు వెళ్లే సౌకర్యం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ చుట్టూ భూములకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఓఆర్‌ఆర్‌, మెట్రో సేవలు విస్తరిస్తుండడంతో రియల్‌ వెంచర్లు ఔటర్‌ వెలుపలే వెలుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాల్లో చదరపు అడుగుల్లో భూమి లభిస్తుండగా.. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఎకరాలు.. చదరపు గజాల్లో భూమి దొరుకుతున్నది. దీనికితోడు అన్ని రకాల మౌలిక వసతులు.. మెరుగైన ప్రజారవాణా ఉండడంతో ఇక్కడ భూమి భవిష్యత్తులో బంగారం కానున్నది. హైదరాబాద్‌ నగరం నలుచెరుగులా విస్తరించి.. ఇక్కడ భూములపై పెట్టుబడులు పెట్టేవారికి కల్పతరువుగా మారనున్నది.

యజ్ఞంలా రహదారుల అభివృద్ధి

హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్నది. పట్టణీకరణ నేపథ్యంలో మూడున్నర దశాబ్దాలుగా హైదరాబాద్‌ విస్తరణ శరవేగంగా జరుగుతున్నది. కానీ అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన జరగలేదు. 2000 సంవత్సరంలో సుమారు 54 లక్షల వరకు ఉన్న జనాభా ఇప్పుడు 1.20 కోట్లకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాల హయాంలో ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఒక టర్మ్‌లో రెండు ఫ్లైఓవర్లు నిర్మించడమే గగనం. వాహనదారులు ఏండ్ల తరబడి నరకయాతన అనుభవిస్తే తప్ప ఒకటీ, రెండు ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరగలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) చేపట్టింది. మహా నగరం నలుమూలలా రాబోయే 40-50 ఏండ్లను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఓ యజ్ఞంలా రహదారులను అభివృద్ధి చేస్తుండడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పడింది. దీంతో ఎల్బీనగర్‌, ఉప్పల్‌ జంక్షన్లు ఊహించనిరీతిలో దర్శనమిస్తున్నాయి. దేశానికే ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు ఓ వైపు ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. హైదరాబాద్‌లో సుఖవంత ప్రయాణం ఐటీ, వ్యాపార దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తున్నది. మహానగరం అంతర్జాతీయ మెప్పు పొందుతున్నది.

త్రిమణిహార నగరం

సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌ దేశంలోనే ఏ మెట్రో నగరానికిలేని అద్భుతమైన హంగును సొంతం చేసుకోనున్నది. సాధారణంగా నగరాల చుట్టూ ఒక ఔటర్‌ రింగు రోడ్డు ఉంటుంది. కానీ సమీప భవిష్యత్తులోనే మూడు మణిహారాల నగరంగా హైదరాబాద్‌ అవతరించనున్నది. ఇప్పటికే నగరం చుట్టూ 158 కిలోమీటర్ల ఔటర్‌ రింగు రోడ్డు ఒక మణిహారంలా ఉన్నది. రాబోయే మూడేండ్లలోనే మెట్రో విస్తరణ ప్రాజెక్టులో భాగంగా ఔటర్‌ రింగు రోడ్డును అనుసరించి మెట్రో మార్గం ఏర్పాటు కానున్నది. తద్వారా నగరానికి రెండో మణిహారం వస్తుంది. అలాగే, సుమారు 346 కిలోమీటర్ల మేర నగరం చుట్టూ రీజినల్‌ రింగు రోడ్డు ఏర్పాటు కానున్నది. ఇది నగరానికి మూడో మణిహారంలా నిలువనున్నది. ఇలా మూడు మణిహారాలతో హైదరాబాద్‌ నగరం ఇతర ఏ మెట్రోలకు లేని హంగులతో అలరారనున్నది. ఇది కేవలం చూడటానికే కాదు.. దీని ద్వారా హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 50-60 కిలోమీటర్ల వ్యాసంలో అభివృద్ధి వేగంగా విస్తరించనుండటంతో ప్రధాన నగరంపై భారం తగ్గుతుంది. నిమిషాల వ్యవధిలో నగరంలో ఏమూలకైనా ప్రయాణించే మెట్రో, రింగురోడ్డులు ఉండటంతో నగరానికి దూరంగా నివాసం ఉండేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. తద్వారా హైదరాబాద్‌ చుట్టూ ఎక్కడికక్కడ టౌన్‌షిప్‌లు ఏర్పాటవుతాయి. నగరం ఔటర్‌ ఆవలకు విస్తరించి విశ్వనగరంగా మారిపోనున్నది.

త్రిమణిహారాలు:1. ఔటర్‌ రింగ్‌రోడ్డు,

2. ఔటర్‌ను అనుసరిస్తూ ఏర్పాటుకానున్న మెట్రో,

3. 346 కిలోమీటర్లలో విస్తరించనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు

మౌలిక వసతులకు రాష్ట్ర సర్కారు కేటాయింపులు

సంవత్సరం : నిధులు

2014-2023 : 90 వేల కోట్లు

రాబోయే మూడేండ్లు : 80-90వేల కోట్లు(ప్రణాళిక)

హైదరాబాద్‌ పై ప్రముఖుల కామెంట్స్‌

హైదరాబాద్‌కు వస్తే న్యూయార్క్‌కు వచ్చినట్టుంది

-సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

హైదరాబాద్‌లో ఉంటే లాస్‌ఏంజిల్స్‌లో ఉన్నట్టుంది

-సినీనటి లయ

హైదరాబాద్‌ అభివృద్ధి చూస్తుంటే పెట్టుబడులు పెట్టాలనిపిస్తున్నది

-సినీనటి సోనాల్‌ చౌహాన్

నిజందాగదుక్షణంఆగదు

Sep 10 2023, 10:03

పండుగలా 'పాలమూరు' ప్రారంభోత్సవం

పండుగలా 'పాలమూరు' ప్రారంభోత్సవం

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.

లక్షన్నర మంది రైతులను భాగస్వాములు చేయాలి

ప్రాజెక్టు విశిష్ఠత తెలిసేలా కార్యాచరణ ఉండాలి

స్వరాష్ట్ర ఉద్యమ స్వప్నం..నెరవేరిన ఉజ్వలపథం

ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. ఈ నెల 16న జరిగే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కేటీఆర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నప్పటి నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ప్రజల కలగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో ఆ కల నెరవేరుతున్నందుకు తెలంగాణ బిడ్డగానే కాకుండా భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. 

ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు ఆకుపచ్చని సిరులతో తులతూగబోతున్నాయని తెలిపారు. గతంలో ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేదని, నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నందుకు సంబురంగా ఉన్నదని అన్నారు. గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డిలాంటి గొప్ప ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తవుతాయని తెలిపారు.

తీరిన ప్రజల కష్టాలు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 'పాలమూరు, రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది. అనేక అడ్డంకులను దాటుకొని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో పూర్తయి న ప్రాజెక్టు ఇది' అని చెప్పారు. రైతుల పొలాలకు సాగునీరు, రాజధాని ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీటి అవసరాలు పాలమూరుతో తీరనున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు విశిష్ఠతను ప్రతి ఒక్కరికీ తెలిసేలా కార్యాచరణ ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న కనీ సం లక్షన్నర రైతులతో ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభ నిర్వహించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా చర్చించిన కేటీఆర్‌.. సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకోవాలని కోరారు.

సమీక్షలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఇతర ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఉన్నతాధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, రఘునందన్‌రావు, ఈఎన్సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 10 2023, 09:54

హైదరాబాద్‌ అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే: కేటీఆర్

హైదరాబాద్‌ అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే

హైదరాబాద్‌ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.

రియల్‌ ఎస్టేట్‌ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు.

విజన్‌తో కూడిన సినిమా ముందుంది

ఏ నగరమూ ఒక్కరోజులో నిర్మితం కాదు

నలుమూలలా విస్తరిస్తున్న మహానగరం

రియల్‌ పెట్టుబడులు నలువైపుల విస్తరించాలి

2050 దాకా తాగునీటికి ఢోకా లేదు

ప్రశాంతంగా శాంతి భద్రతల పరిస్థితి

అందుకే వెల్లువలా వస్తున్న పెట్టుబడులు

రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పోలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై మీరు చూసింది ట్రైలర్‌ మాత్రమే.. ఇంకా అనేక ప్రాజెక్టులతో, గొప్ప విజన్‌తో నగర అభివృద్ధి సినిమా ముందున్నదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. నగరంలో శనివారం నిర్వహించిన టైమ్స్‌ మెగా ప్రాపర్టీ షోను కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో అతి తక్కువగా ఇండ్ల ధరలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నదని, ఈ ఒరవడిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టేందకు ప్రాధాన్యమివ్వాలని సూ చించారు. నగరంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లు ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోటీపడుతూ, వినూత్నమైన ఆకృతులతో అద్భుతమైన భవనాలను నిర్మించాలని కోరారు. ఆ భారీ భవనాలు హైదరాబాద్‌ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తాయన్న విషయాన్ని తమ డిజైన్ల రూపకల్పన సమయంలోనే పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. దేశంలో ముంబై తర్వాత అతి ఎత్తయిన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.

ఒక్క రోజులో నగరాలు నిర్మాణం కావు

ఏ నగరమైనా ఒక రోజులో నిర్మాణం కా దని, ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికతో ముందుకు వెళితేనే నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం కోటిమంది ఉన్న హైదరాబాద్‌ జనాభా మూడు కోట్లకు చేరుకున్నా, 2050 వరకు తాగునీటికి ధోకా లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వచ్చిన అద్భుతమైన మార్పులపై సినీ హీరో రజనీకాంత్‌ మొదలు అనేకమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు సైతం హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రత్యేకంగా తమ నివేదికల్లో పేర్కొంటున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే నగరంలో మౌలిక వసతుల కల్పన వేగంగా కొనసాగుతున్నదని, నగర ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలు బాగుంటేనే భారీగా పెట్టుబడులు వస్తాయని అన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 22:58

నల్లగొండ అప్పాజీపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కంచర్ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక

అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో

 అప్పాజీపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు,

ఓర్సు సైదులు,ఓర్సు భీమేష్,ఓ ర్సు సత్యనారాయణ,ఓర్సు రాజు,ఓర్సు వెంకన్న,ఓర్సు క్రిష్ణయ్య,ఓర్సు అంజయ్య,ఓర్సు సతీష్,ఓర్సు శ్రీను,ఓర్సు నరేష్, శేషాద్రి,ఒరుగంటి స్వామి,

పోలె లింగయ్య,బొప్పని మధు,బొప్పని గోపాలు,కట్ట వెంకన్న,బొప్పని అజయ్,కాసర్ల సరిత, పోలె పార్వతమ్మ,రూపని ముత్యాలు,వాడపల్లి రమేష్,దాదాపుగా 100 కుటుంబాలు* BRS పార్టీలో చేరినారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు,సర్పంచ్ పబ్బతి రవిందర్ రెడ్డి గారు,PACS వైస్ చైర్మన్ తవిటి క్రిష్ణ గారు,వార్డ్ మెంబర్ P, క్రిష్ణయ్య,A శ్రీను,కట్ట వెంకటేశ్వర్లు,

P శివాజీ,G చిరంజీవి,P రాములు,

BRS ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 22:01

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి :ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్

 

తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 6 వ రోజు రిలే దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం ఆరో రోజు రోజు రిలే నిరాహార దీక్షలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మద్దతు ప్రకటించి మాట్లాడుతూ

విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని,మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా ప్రాజెక్టు నందు జిల్లా, మండల, స్కూల్ కాంప్లెక్స్ , పాఠశాల స్థాయిలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఐఈఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, మేస్పెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్లు, కేజీబీవి యుఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు, సిఆర్టీలు, పీఈటి, ఎఎన్ఎం, అకౌంటెంట్, కంప్యూటర్ టీచర్లు, ఒకేషనల్ ఇన్స్ ట్రక్టర్స్, వంటమనుషులు, వాచ్మెన్లు, అటెండర్లు మరియు కేజీబీవీ టైప్ -4 (మోడల్ స్కూల్ హస్టల్స్ లో పనిచేస్తున్న కేర్ టెకర్, ఎఎన్ఎం,కుక్స్,వాచ్ వమేన్స్ , జిల్లా స్థాయిలో ఎపిఓ, సిస్టమ్ ఎనలిస్ట్, డిఎల్ఎంటి , డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్ పర్సన్, ఆఫీస్ సబార్డినేటర్స్ గా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీ కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం( మినిమమ్)

టైమ్ స్కేల్ను ) అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సమగ్ర శిక్షా, కెజిబివి, యుఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేసి ఉద్యోగాల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు.సమగ్ర శిక్షా, కెజిబివి యుఆర్ఎస్ ను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని,

సుప్రీకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికి మినిమమ్ టైమ్ స్కేలును (కనీస వేతనం) అమలు చేయాలన్నారు.

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రూప్ ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించి,నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలి (హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని కొరారు.

విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వేయిటేజ్ కల్పించి,

మరణించిన, గాయపడిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.

కరోనా సమయంలో పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్ల లకు 18 నెలల వేతన బకాయిలు చెల్లించాలని తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 21:04

అంగన్వాడీలను గుండెల్లో పెట్టుకుంది కేసీఆర్:మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ

అంగన్వాడీలను గుండెల్లో పెట్టుకుంది కేసీఆర్ 

 మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ 

ఈనెల 11వ తేదీ నుండి అంగన్వాడీల సమ్మెకు సంబంధించి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రెటరీ జనరల్ జ్యోతి పద్మ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అంగనవాడి టీచర్లు హెల్పర్లు సమ్మెలో భాగస్వామ్యం కావద్దని శాంతియుత పద్ధతులో సమస్యను పరిష్కరించుకోవాలి తప్పితే చిన్నారులను , గర్భిణీలను, బాలింతలను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు చేపట్ట వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడిలో చేసిన మేలు పై ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు. అంగన్వాడి వర్కర్ నుండి టీచర్ అనే పదోన్నతిని దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వాల ముఖ్యమంత్రి ల దీటుగా కేసీఆర్ ఇంటికి పిలిచి మరి సహపంక్తి భోజనం చేసి జీతాలు పెంచిన విషయం అంగన్వాడీలు మర్చిపోలేదని అని తెలియజేశారు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా వారికి పిఆర్సి పెరిగినప్పుడల్లా అంగన్వాడీలకు ముపై శాతం జీతం పెంచిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. కరోనా సమయంలో అంగనవాడి సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 20వేల రూపాయల మట్టి ఖర్చులు ఇచ్చిన ఘనత కేసీఆర్ కీ దక్కుతుందిఅని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మినీ టీచర్లను మెయిన్ టీచర్ గా గుర్తించిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ ఘనత రాష్ట్ర ప్రభుత్వం కే దక్కుతుందని తెలిపారు. అంగనవాడి టీచర్ల రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాల కి అనే ఒక నిమిత్త కాలం పెట్టడంతోపాటు, అంగనవాడి టీచర్ల ఉద్యోగ నియమాకాలలో పారదర్శకత పాటించింది రాష్ట్ర ప్రభుత్వమేనని, గ్రేడ్ టు సూపర్వైజర్ల పోస్టుల నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా 149 మందినీ జేఎన్టీయూ సహకారంతో పారదర్శకంగా నియమించడం జరిగింది అని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో మొదటి సంతకం మహిళా శిశు సంక్షేమ శాఖ ఫైల్ మీద పెట్టిన విషయం ఎవరు మర్చిపోలేదని తెలిపారు. అంగన్వాడి టీచర్లు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్వ ప్రాథమిక విద్యలో ఒకే సిలబస్ ఉండే విధంగా పొందుపరిచిన ఘనత కూడా ఈ ఈ ప్రభుత్వం దేనని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారుల పిల్లలు ఆడుకోవడానికి ప్రతి సంవత్సరం ఐదువేల రూపాయలు విలువగల ప్రీస్కూల్ కిట్ అందజేస్తుందని, నిజంగా సమ్మెకు పోయే అంగనవాడిలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఒక్కసారి అక్కడే అమలవుతున్న పథకం తీరును పరిశీలించాలని కోరారు.

గతంలో ధర్నాలు సమ్మెలతో గత ప్రభుత్వంలో సాధించింది ఏమీలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు నిర్వహించి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలి తప్ప చిన్నారులను, గర్భిణీలను, బాలింతలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఏదైనా సామరసపూర్వకంగా శాంతియుత పద్ధతిలో పోరాటం కొనసాగిస్తే మేలు జరుగుతుంది తప్ప ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే మన శాఖకే నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Sep 09 2023, 20:54

నలగొండ మదీనా మసీదులో జరిగిన ఖిరాత్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల, హోంమంత్రి మహమూద్ అలీ

నేడు తెలంగాణ రాష్ట్ర హోం శాఖామాత్యులు మహమూద్ అలీ గారు.. స్థానిక మదీనా మస్జీదులో.. జరుగుతున్న ఖిరాత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన సందర్భంగా.. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తమ క్యాంప్ కార్యాలయంలో.. పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ మైనార్టీ నాయకులతో కలిసి.. ఘనంగా స్వాగతం పలికారు.

 

మదీనా మస్జిద్ లో 13 సంవత్సరాల తర్వాత జరిగిన ఆల్ ఇండియా కాంపిటీషన్.. ఖిరాత్ కార్యక్రమంలో... కంచర్ల తో కలిసి పాల్గొన్నారు..

 

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో., సెక్యులర్ బావాలు కలిగిన ప్రభుత్వం నడుస్తుందని.. వారి నాయకత్వంలో ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... అమలు చేస్తున్నారని.. వారి నాయకత్వం మరింతగా పటిష్ట పరచవలసిన అవసరం ముస్లిం మైనార్టీ లకు ఉందని అన్నారు...

 

నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తాను గెలిచినప్పటి నుంచి కూడా నల్లగొండ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని... ముఖ్యంగా ముస్లింల కొరకు... ఏ అవసరమున్న... దగ్గరుండి చూసుకుంటున్నారని స్థానిక నాయకులు తెలిపారని.. ఇలాంటి వ్యక్తులను తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని వారి గెలుపుకు అందరూ.. కృషి చేయాలని కోరారు.