మృతులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా
•చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ
•రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి
ఒరిస్సా : ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 350 మందికిపైగా క్షతగాత్రులై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బహనాగ్ రైల్వేస్టేషన్ వద్ద సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. క్షతగాత్రులను సోరో, గోపాల్పూర్, ఖంటపాడ పీహెచ్సీలకు తరలించారు. బాలేశ్వర్లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు.
ఇదీ జరిగింది : గూడ్స్ రైలును ఢీ కొట్టడం వల్ల కోరమాండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. మరో ట్రాక్పై పడిన బోగీలను అటువైపుగా వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా లెక్కించలేదని ఒడిశా సీఎస్ వెల్లడించారు.
మృతులకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియో
ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్గ్రేషియో ప్రకటించారు. మృతులకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.
చాలా విషాదకరం : నవీన్ పట్నాయక్
ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన చాలా విషాదకరమన్నారు. శనివారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్టు తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి ప్రమీలా మాలిక్ను ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు.
చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ
ఈ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి
కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్ వద్ద ఈ సాయంత్రం గూడ్సు రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్ ఈస్ట్రన్ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని చెబుతూ.. 033-22143526/22535185 నంబర్లను ఆమె షేర్ చేశారు. ఘటనా స్థలానికి 5-6 సభ్యుల బృందంతో పాటు రైల్వే అధికారులను పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి తాను వ్యక్తిగతంగా అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు దీదీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన స్టేషన్లలో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
విశాఖలో హెల్ప్లైన్ నంబర్లు: 08912746330, 08912744619
విజయనగరం: 08922-221202, 08922-221206
విజయవాడ: 0866 2576924
రాజమహేంద్రవరం: 08832420541
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష..
అమరావతి : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనాస్థలికి ముగ్గురు అధికారుల బృందాన్ని పంపాలని ఆదేశించారు..
మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ల బృందం ఘటనాస్థలికి వెళ్లనుంది. ఆయా కలెక్టరేట్లలో విచారణ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
అవసరమైతే అంబులెన్స్లు సన్నద్ధం చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవలకు సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు..
SB NEWS
మధ్యాహ్నం భోజనంలో మార్పులు ప్రతిరోజు పప్పన్నం
కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు.కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు.
ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మధ్యాహ్న పథకంలో రోజు విడిచి రోజు పప్పును అందించేవారు. పోషకాహారంలో భాగంగా ఇకపై ప్రతిరోజు పప్పును భోజనంలో వడ్డిస్తారు.
సోమవారం కిచిడీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు,
మంగళవారం రైస్, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ,
బుధవారం రైస్, ఆకుకూర పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు,
గురువారం వెజిటబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ,
శుక్రవారం రైస్, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు,
శనివారం రైస్, ఆకుకూర పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో కొత్త మెనూను సిద్ధం చేశారు.
ప్రతిరోజు విద్యార్థులకు ఏదో ఒకరూపంలో పప్పు ఉండేలా మెనూ సిద్ధం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 28,606 బడుల్లోని 25,26,907 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు.
అసెంబ్లీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్!
పూర్తిగా పార్టీ కార్యకలాపాలపైనే కేసీఆర్ దృష్టి
జాతీయ స్థాయిలో విస్తరణ కోసం పార్టీని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చినా.. ప్రస్తుతానికి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాల విస్తరణ చేపట్టినా.. అంతకన్నా ముందు తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన నేతగా ఇప్పటికే గుర్తింపు పొందిన కేసీఆర్.. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఘనతను సొంతం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఈ ఏడాది ఏప్రిల్లోనే ఎన్నికల సన్నద్ధతను ప్రా రంభించిన కేసీఆర్.. తాజాగా ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహంలో అంతర్భా గం చేస్తున్నారు. 21 రోజుల పాటు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకోవడం దిశగా అడుగులు వేస్తున్నారు.
దశాబ్ది ఉత్సవాలు పూర్తికాగానే పూర్తిస్థాయిలో ఎన్నికల సమరానికి కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సభలు, సమావేశాల ద్వారా ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించి.. అక్టోబర్ 10న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభతో ఎన్నికల సన్నద్ధతను పతాక స్థాయికి తీసుకెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
జాతీయ స్థాయిలో గ్రాఫ్ పెంచుకునేందుకూ..
రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ద్వారా జాతీయస్థాయిలో గ్రాఫ్ పెంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తే.. 2024 ఆరంభంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఆకర్షణ పెరుగుతుందని సీఎం లెక్కలు వేస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలోని సుమారు 20 లోక్సభ స్థానాలపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవసరమైతే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశముందని మహారాష్ట్ర బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అప్పటిదాకా విపక్షాలకు దూరమే!
జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు విపక్ష పార్టీల ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు తాము సమ దూరమనే సంకేతాలు ఇవ్వకుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుంటాయనే అభిప్రాయంలో పార్టీ అధినేత ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు వివరిస్తున్నాయి.
ఇటీవల ప్రగతిభవన్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో జరిగిన భేటీ సందర్భంగా కూడా జాతీయ రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు వెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారని అంటున్నాయి. భావసారూప్య పార్టీలతో స్నేహభావంతో వ్యవహరిస్తామని చెప్తూనే.. జాతీయస్థాయిలో విపక్షాల ఐక్యతపై ఆచితూచి అడుగులు వేయాలని సీఎం భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నాయి...
సర్కారు బడుల్లో విద్యార్థులు పెరిగేనా❓️
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా వేసవి సెలవుల అనంతరం బడి-బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు...మన బడి, మన బస్తీ.. మన బడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన మౌలికవసతులను కల్పించడంతోపాటు ఆకర్షణీయ రంగులతో ఆయా పాఠశాలలను ముస్తాబు చేస్తోంది. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేస్తోంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందిస్తోంది. సన్నబియ్యం భోజనంతోపాటు వారంలో మూడు రోజులు కోడిగుడ్లు, ప్రతిరోజు రాగి జావ, కిచిడి, వెజిటెబుల్ బిర్యానీతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు మెనూను ఖరారు చేసింది. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో విద్యార్థులు చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలకు నోచుకోలేదు. కొత్తగా నియామకాలను చేపట్టక పోవడంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారుల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. అదనపు భారంతో విధులు సక్రమంగా నిర్వహించలేక పోతున్నామని, నియామకాలు, పదోన్నతులు, బదిలీ ప్రక్రియ చేపట్టాలంటూ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
విద్యా వలంటీర్ల తొలగింపు
కొవిడ్ కారణంగా విద్యా వలంటీర్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వారిని విధుల్లోకి చేర్చుకోలేదు. గత ఏడాది ఆగస్టు వరకు కూడా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించలేదు. స్కావెంజర్ల కొరతతో పాఠశాలలు అపరిశుభ్రంగా మారాయి. లేక అపరిశుభ్రత వాతావరణంతో కొత్తగా చేరిన విద్యార్థులు కూడా తిరిగి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారని, మౌలిక వసతులతోపాటు ఈసారైనా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు సకాలంలో అందించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, పదోన్నతులు, బదిలీలు, విద్యా వలంటీర్ల నియామకాలపై ఆలోచించక పోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విముఖత వ్యక్తంచేస్తున్నారు. దీనితో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నైపుణ్యం కలిగిన సబ్జెక్టు టీచర్లను, ప్రధానోపాధ్యాయులను, మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల నియామకం చేపట్టక పోవడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాలపై దృష్టిసారించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కొంతైనా మెరుగుపడే అవకాశాలుంటాయని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, విద్యాభిమానులు సూచిస్తున్నారు.
మన ఊరు.. మన బడి’తో ఆధునిక హంగులు
‘మన ఊరు...మన బడి... మన బస్తీ... మన బడి’ పథకంలో ఎంపికైన పాఠశాలల్లో ఆధునిక హంగులను కల్పిస్తున్నారు. జిల్లాలోని 230 పాఠశాలలను ఆధునీకరించేందుకు ఎంపిక చేసి పనులను ప్రారంభించింది. ఇప్పటి వరకు సగానికిపైగా ఈ స్కూల్స్లో ఈ పథకం కింద అదనపు తరగతి గదులు, ప్రహారీగోడ, విద్యుద్దీకరణ, కిచెన్ షెడ్లు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆకర్షణీయమైన పేయింటింగ్స్ వంటివి చేపడుతున్నారు.
నేటి నుంచి బడి-బాట
జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహకారం, ప్రయోజనాలను వివరిస్తూ కరపత్రాలను రూపొందించారు...
ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్టు..
ములుగు: ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు..
నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధం ఉన్న అనుమానితులు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో శుక్రవారం ఉదయం 7 గంటలకు పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది.
దీంతో పేరూరు ఎస్ఐ తన బృందంతో అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసిన కొరియర్ల గుంపు తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్కు చెందిన మడిని దేవదేవయ్య, పూజారి కాంకేర్ గ్రామానికి చెందిన కిక్కిడి హు అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకం ఉన్నారు.
వీరిద్దరు పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను అమర్చినట్లు నిర్ధారించారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఓఎస్డీ అశోక్కుమార్, సీపీఎస్ సీఐ శివప్రసాద్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు, పేరూరు హరీశ్ పాల్గొన్నారు..
ఒడిశా రైలు ప్రమాదంలో 233కు చేరిన మృతుల సంఖ్య
ఒడిశా :
ఒడిశా రైలు ప్రమాదం లో మృతుల సంఖ్య 233కు చేరింది. రైలు ప్రమాదంలో మరో 900 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. బాలాసోర్లో గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్ రైలు బోగీలపై యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి.
రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో 200 అంబులెన్స్లు సహాయక చర్యలు అందిస్తున్నాయి. రైలు ప్రమాద ఘటనతో రైల్వే శాఖ 18 రైళ్లను రద్దు చేసింది. రైలు ప్రమాదంలో చనిపోయినవారికి రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్టు తెలిపింది. ఇక తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనుంది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయాయి. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్పై పడ్డాయి. కొద్దిసేపటికి.. ఆ రెండో ట్రాక్ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 12864) ట్రాక్పై పడి ఉన్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ కోచ్లను ఢీకొంది. ఆ తాకిడికి బెంగళూరు-హౌరా ఎక్స్ప్రె్సకు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. తిరగబడిపోయిన బోగీల కింద వందలమంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక తిరగబడ్డ కోచ్ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా వారు చేస్తున్న ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడిన బోగీలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. సహాయకచర్యలకు చీకటి అడ్డంకిగా మారింది. వారిని ఆ బోగీల నుంచి తీసి ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. ఇక నేటి ఉదయం వరకూ మృతుల సంఖ్య 233కు చేరుకోగా.. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ప్రె్సలలో ఏది తొలుత పట్టాలు తప్పి ప్రమాదానికి గురైందనే విషయంపై రెండు రకాల కథనాలు వినిపించాయి. తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికార ప్రతినిధి అమితాభ్ శర్మ స్పష్టం చేశారు...
Jun 03 2023, 13:27