సర్కారు బడుల్లో విద్యార్థులు పెరిగేనా❓️

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యేటా వేసవి సెలవుల అనంతరం బడి-బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు...మన బడి, మన బస్తీ.. మన బడి పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మెరుగైన మౌలికవసతులను కల్పించడంతోపాటు ఆకర్షణీయ రంగులతో ఆయా పాఠశాలలను ముస్తాబు చేస్తోంది. ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన చేస్తోంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్స్‌ అందిస్తోంది. సన్నబియ్యం భోజనంతోపాటు వారంలో మూడు రోజులు కోడిగుడ్లు, ప్రతిరోజు రాగి జావ, కిచిడి, వెజిటెబుల్‌ బిర్యానీతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు మెనూను ఖరారు చేసింది. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో విద్యార్థులు చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలకు నోచుకోలేదు. కొత్తగా నియామకాలను చేపట్టక పోవడంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారుల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. అదనపు భారంతో విధులు సక్రమంగా నిర్వహించలేక పోతున్నామని, నియామకాలు, పదోన్నతులు, బదిలీ ప్రక్రియ చేపట్టాలంటూ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

విద్యా వలంటీర్ల తొలగింపు

కొవిడ్‌ కారణంగా విద్యా వలంటీర్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వారిని విధుల్లోకి చేర్చుకోలేదు. గత ఏడాది ఆగస్టు వరకు కూడా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించలేదు. స్కావెంజర్ల కొరతతో పాఠశాలలు అపరిశుభ్రంగా మారాయి. లేక అపరిశుభ్రత వాతావరణంతో కొత్తగా చేరిన విద్యార్థులు కూడా తిరిగి ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లారని, మౌలిక వసతులతోపాటు ఈసారైనా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు సకాలంలో అందించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, పదోన్నతులు, బదిలీలు, విద్యా వలంటీర్ల నియామకాలపై ఆలోచించక పోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విముఖత వ్యక్తంచేస్తున్నారు. దీనితో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నైపుణ్యం కలిగిన సబ్జెక్టు టీచర్లను, ప్రధానోపాధ్యాయులను, మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల నియామకం చేపట్టక పోవడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకాలపై దృష్టిసారించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కొంతైనా మెరుగుపడే అవకాశాలుంటాయని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, విద్యాభిమానులు సూచిస్తున్నారు.

మన ఊరు.. మన బడి’తో ఆధునిక హంగులు

‘మన ఊరు...మన బడి... మన బస్తీ... మన బడి’ పథకంలో ఎంపికైన పాఠశాలల్లో ఆధునిక హంగులను కల్పిస్తున్నారు. జిల్లాలోని 230 పాఠశాలలను ఆధునీకరించేందుకు ఎంపిక చేసి పనులను ప్రారంభించింది. ఇప్పటి వరకు సగానికిపైగా ఈ స్కూల్స్‌లో ఈ పథకం కింద అదనపు తరగతి గదులు, ప్రహారీగోడ, విద్యుద్దీకరణ, కిచెన్‌ షెడ్లు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఆకర్షణీయమైన పేయింటింగ్స్‌ వంటివి చేపడుతున్నారు.

నేటి నుంచి బడి-బాట

జూన్‌ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించాలని విద్యాశాఖ ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహకారం, ప్రయోజనాలను వివరిస్తూ కరపత్రాలను రూపొందించారు...

ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్టు..

ములుగు: ఇద్దరు మావోయిస్టు కొరియర్లను ములుగు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు..

నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధం ఉన్న అనుమానితులు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో శుక్రవారం ఉదయం 7 గంటలకు పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది.

దీంతో పేరూరు ఎస్ఐ తన బృందంతో అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసిన కొరియర్ల గుంపు తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్కు చెందిన మడిని దేవదేవయ్య, పూజారి కాంకేర్ గ్రామానికి చెందిన కిక్కిడి హు అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకం ఉన్నారు.

వీరిద్దరు పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను అమర్చినట్లు నిర్ధారించారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఓఎస్డీ అశోక్కుమార్, సీపీఎస్ సీఐ శివప్రసాద్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు, పేరూరు హరీశ్ పాల్గొన్నారు..

ఒడిశా రైలు ప్రమాదంలో 233కు చేరిన మృతుల సంఖ్య

ఒడిశా :

ఒడిశా రైలు ప్రమాదం లో మ‌ృతుల సంఖ్య 233కు చేరింది. రైలు ప్రమాదంలో మరో 900 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. బాలాసోర్‌లో గూడ్స్ రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమండల్‌ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ 4 బోగీలు పట్టాలు తప్పాయి.

రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో 200 అంబులెన్స్‌లు సహాయక చర్యలు అందిస్తున్నాయి. రైలు ప్రమాద ఘటనతో రైల్వే శాఖ 18 రైళ్లను రద్దు చేసింది. రైలు ప్రమాదంలో చనిపోయినవారికి రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్టు తెలిపింది. ఇక తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనుంది.

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841) శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడిపోయాయి. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. కొద్దిసేపటికి.. ఆ రెండో ట్రాక్‌ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నంబర్‌ 12864) ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను ఢీకొంది. ఆ తాకిడికి బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రె్‌సకు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. తిరగబడిపోయిన బోగీల కింద వందలమంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా వారు చేస్తున్న ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడిన బోగీలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. సహాయకచర్యలకు చీకటి అడ్డంకిగా మారింది. వారిని ఆ బోగీల నుంచి తీసి ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. ఇక నేటి ఉదయం వరకూ మృతుల సంఖ్య 233కు చేరుకోగా.. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రె్‌సలలో ఏది తొలుత పట్టాలు తప్పి ప్రమాదానికి గురైందనే విషయంపై రెండు రకాల కథనాలు వినిపించాయి. తొలుత కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికార ప్రతినిధి అమితాభ్‌ శర్మ స్పష్టం చేశారు...

పొంగులేటి..జూపల్లి బాటలోనే ఈటెల... విజయశాంతి....!!

టాక్ పొలిటికల్ కారిడార్‌లో గుప్పుమంటోంది..!!

తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు..??

తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. వివిధ పార్టీల్లో అసంతృప్తులు, ఆశావాహులు తమకు కలిసివచ్చే అనువైన వేదికల కోసం అన్వేషణను ముమ్మరం చేశారంటూ జరుగుతున్న ప్రచారం హాట్ హాట్‌గా సాగుతోంది.

ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వీరితో పాటు కలిసి నడవబోతున్న నేతలెవరంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి ద్వయానికి గాలం వేసేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

పొంగులేటి, జూపల్లి బాటలో ఈటల?:

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికలకు మరో ఐదు నెలలే గడువే ఉండటంతో రాజకీయ నేతలంతా తమ స్థానాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు స్పీడప్ చేశారు. ఈ క్రమంలో తమ లక్ష్యాలు, ప్రాధాన్యతలకు ప్రయార్టీ ఇస్తున్నారు. దీంతో కేసీఆర్ టార్గెట్‌గా ఉన్న నేతలంతా ఏకం అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ ఇటీవల ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ పేరు మళ్లీ మళ్లీ తెరపైకి వస్తోంది. జూపల్లి, పొంగులేటి బాటలోనే ఈటల వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ విషయంలో అసంతృప్తితో ఉన్న ఈటల త్వరలో పార్టీ మారడం ఖాయం అనే చర్చ వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఒక వేళ ఈటల బీజేపీని వీడితో ఆయన ఒక్కరే వెళ్తారా లేక ఆయన వెనుక వెంట నడిచే నేతలెవరు అనేది ఇటు బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈటల వెంట ఆ ఫైర్ బ్రాండ్?

కేసీఆర్‌ను ఓడించడమే టార్గెట్‌తో బీజేపీలో చేరిన వారి లిస్ట్ పెద్దదే. అలాంటి వారిలో ఈటల, విజయశాంతి ప్రధానమైన వారు. గతంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఈటల, విజయశాంతి ఆ తర్వాత కేసీఆర్ తమను మోసం చేశాడని ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించేందుకు పొంగులేటి, జూపల్లి, కోదండరామ్ వంటి నేతలు ప్రయత్నాలు చేస్తుంటే వారి వెంటే ఈటల వెళ్లబోతున్నారనే, ఈటల బాటలోనే విజయశాంతి కూడా వెళ్తున్నారనే టాక్ పొలిటికల్ కారిడార్‌లో గుప్పుమంటోంది. ఏ మాత్రం ఛాన్స్ లభించినా కేసీఆర్‌పై విరుచుకుపడే విజయశాంతి గత కొంత కాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆమె బహిరంగంగానే అసంతృప్తిని వెల్లగక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ టార్గెట్‌గా నేతలంతా ఏకమైతే ఆ టీమ్‌లో చేరేందుకు విజయశాంతి సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కరీంనగర్ జిల్లాలో" మేమ్ ఫేమస్ "చిత్ర బృందం సందడి

కరీంనగర్ జిల్లా :

నూతన నటీనటులతో తెరకెక్కిన 'మేమ్ ఫేమస్' చిత్ర యూనిట్ శుక్రవారం కరీంనగర్ లో సందడి చేసింది. యూత్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా శుక్రవారం చిత్ర బృందం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

నగరంలోని శ్వేత హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ యువతపై తీసిన తమ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గంగాధర మండలం తాడిచెర్రి గ్రామంలో ఈ చిత్రాన్ని తీసినట్లు వారు తెలిపారు. ఆ గ్రామ ప్రజలు తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు.

ప్రత్యేకంగా గ్రామస్థుడు రామిడి సతీష్ సురేందర్ ఎంతో సహకరించారని తెలిపారు. అదేవిధంగా ఉప్పర్ మల్యాల గ్రామంలో సైతం సినిమా షూటింగ్ చేసినట్లు వారు తెలిపారు. ఈ చిత్రం యువతకు హత్తుకునేలా ఉంటుందని, సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరూ మేమ్ ఫేమస్ గా ఫీల్ అవుతారని తెలిపారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆరిజన్‌ పాల సంస్థ భాగస్వామి శైలజ విషం తాగారు.

వెంటనే ఆమెను ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సుసైడ్‌ లెటర్‌ రాశారు. అందులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన అనుచరులు భీమా గౌడ్‌, సంతోష్‌, పోచన్న, కార్తీక్‌ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే చిన్నయ్య నన్ను చంపుతానని అనుచరులతో బెదిరిస్తున్నారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న నా ఫోటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేశారు. అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో నేను తీవ్రమైన మనస్థాపానికి గురయ్యాను. ఈ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా సమస్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. అంతేగాక నాపైన తప్పుడు కేసులు పెడుతున్నారు. నేను చనిపోయిన తర్వాతనైనా న్యాయం జరుగుతుందని సూసైడ్ లెటర్ రాస్తున్న’ అని లేఖలో పేర్కొన్నారు.

కాగా ఎమ్మెల్యే చిన్నయ్యకు, అరిజిన్‌ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపిస్తోంది. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవలె జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

ఆ బాధ తట్టుకోలేక ఎమ్మెల్యే దగ్గరకు అమ్మాయిలను పంపించాను

దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శైలజ ఆరోపించారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమల :

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శనివారం టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 76,963 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.97 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 37,422 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.....

SB NEWS

Karnataka CM: 'ఐదు గ్యారంటీల'కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.. ఈ ఏడాదే అమలు!.

బెంగళూరు: ఎన్నికల ముందు తాము ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య పేర్కొన్నారు..

'గృహజ్యోతి' (Gruha Jyothi) కింద రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందజేస్తాం. ఈ పథకాన్ని జులై 1 నుంచి అమలు చేస్తాం. కానీ, అంతవరకు పెండింగులో ఉన్న బిల్లులు మాత్రం చెల్లించాలి.

గృహలక్ష్మి (Gruha Lakshmi) పథకం కింద కుటుంబంలోని మహిళకు (కుటుంబ పెద్ద) నెలకు రూ.2వేలు అందజేస్తాం. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభమతుంది. ఇందుకోసం జూన్‌ 15 నుంచి జులై 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. మహిళలు ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి అకౌంట్లలో ఆగస్టు 15నుంచి డబ్బులు జమ అవుతాయి.

'అన్నభాగ్య' (Anna Bhagya) పథకం కింద బీపీఎల్‌ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తాం. జులై 1 దీన్ని ప్రారంభిస్తాం.

యువనిధి (Yuva Nidhi) పథకం ద్వారా నిరుద్యోగులకు 24 నెలల పాటు భృతి అందజేస్తాం. డిగ్రీ అభ్యర్థులకు రూ.3వేలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1500 ఇస్తాం. 2022-23లో పాసైన వారికి ప్రతినెల వీటిని అందజేస్తాం. డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

శక్తి (Shakti) పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. జూన్‌ 11 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఏసీ, లగ్జరీ మినహా అన్ని బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితం.

ప్రజా క్షేత్రంలోకి పవన్

ఈనెల 14వ తేదీ నుండి తూర్పుగోదావరి జిల్లా నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర..

ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు..

క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమం రూపకల్పన..

ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పాటు పర్యటన..

పర్యటనలో భాగంగా మొదటి రోజు ఫీల్డ్ విజిట్..

రెండవ రోజు వివిధ వర్గాల ప్రజా సమస్యలు తెలుసుకుంటారు..

ఈ యాత్ర ఉభయగోదావరి జిల్లాలో రెండు నెలపాటు కొనసాగుతుంది..

మొత్తం 12 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది..

ఏపీ పర్యటనకు అమిత్ షా, జేపీ నడ్డా

అమరావతి..

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయింది..

తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు..

ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా… బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు.

ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ చెపుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు..