madagoni surendar

Apr 04 2023, 19:43

ఏపీ.అమరావతి:జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి

జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా ముందుగానే ప్రకటించి మరీ తదనుగుణంగా లబ్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్‌ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి

నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరిచారు. ఆ వివరాలను గమనిస్తే...

ఏప్రిల్‌ 2023 – జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మే 2023 – వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా

జూన్‌ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)

ఆగష్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర

సెప్టెంబర్‌ 2023 – వైఎస్సార్‌ చేయూత

అక్టోబర్‌ 2023 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)

నవంబర్‌ 2023 – వైఎస్సార్‌ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)

డిసెంబర్‌ 2023 – జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జనవరి 2024 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)

ఫిబ్రవరి 2024 – జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మార్చి 2024 – జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు

madagoni surendar

Apr 04 2023, 19:40

ఏపీ .చంద్రబాబు ఇఫ్తార్ విందుకు జయప్రదం చేయండి: పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరిముల్లా*

చంద్రబాబు ఇఫ్తార్ విందుకు జయప్రదం చేయండి: పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరిముల్లా

ఏప్రిల్ 11 మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం సమీపంలో గల సీకే కన్వెన్షన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టిడిపి జాతీయ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే ఆత్మీయ ఇఫ్తార్ విందులో మాజీ శాసనమండలి చైర్మన్ అహ్మద్ షరీఫ్ , రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ముస్తక్ అహ్మద్ , అనుబంధ సంఘాల అధ్యక్షులు నజీర్ , రాష్ట్ర టిడిపి మైనార్టీ నాయకులందరూ పాల్గొంటారని కావున పార్లమెంట్ పరిధిలోని రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ కమిటీ, నియోజకవర్గ, మండల, పట్టణ, డివిజన్ కమిటీలోని వివిధ హోదాలో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొనాలని విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా తెలిపారు.ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమన్నారు.టిడిపి హాయంలో ఇఫ్తార్ విందులు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించే వాళ్ళమని నేడు వైసిపి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే విందులు తూతు మంత్రంగా నిర్వహిస్తున్నాయన్నారు. రంజాన్ సందర్భంగా మజీద్ ల అభివృద్ధికి, శుభ్రతకు, ఖబరస్తాన్ లకు ప్రత్యేక నిధులు విడుదల చేసి, రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందన్నారు.

madagoni surendar

Apr 04 2023, 19:34

ఏపీ. హైకోర్టులో జస్టిస్ గంగారావుకు పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు

ఏపీ హైకోర్టులో జస్టిస్ గంగారావుకు పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు

అమరావతి,4 ఏప్రిల్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యం.గంగారావుకు మంగళవారం నేలపాడులో గల రాష్ట్ర హైకోర్టులోని ప్రధమ కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయవాద పట్టా పొందిన జస్టిస్ గంగారావు 1988లో న్యాయవాదిగా నమోదు అయిన పిదప జస్టిస్ బిఎస్ఏ స్వామి వద్ద జూనియర్ న్యాయవాదిగా చేరి ప్రాక్టీసు ప్రారంభించారన్నారు.ప్రభుత్వ న్యాయవాదిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గాను సేవలందించిన తదుపరి 2017 సెప్టెంబరు 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారని తెలిపారు.న్యాయమూర్తిగా జస్టిస్ గంగారావు 8వేల 100 కేసుల్లో తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు.న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పుల్లో కొన్ని ప్రత్యేక ల్యాండ్ మార్క్ తీర్పులు కూడా ఉన్నాయని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు.అంతేగాక జస్టిస్ గంగారావు అనేక కమిటీలకు సభ్యునిగా సేవలందించారని అన్నారు.నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మంచి న్యాయమూర్తిని కోల్పోతోందని ఆయన సేవలు హైకోర్టుకు అవసరమని పేర్కొంటూ జస్టిస్ గంగారావు శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో గడవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆకాంక్షించారు.

న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్నజస్టిస్ గంగారావు మాట్లాడుతూ 1971-76 మధ్య అనంతపురం జిల్లా పత్తికొండలో తన పాఠశాల విద్య సాగిందని,1987లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ పూర్తి చేసి 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి బిఎస్ఏ స్వామి వద్ద తన న్యాయవాద వృత్తిని ప్రారంభించినట్టు గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అసిస్టెంట్ జిపిగా,జిపిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా తదుపరి న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం కలిగిందన్నారు.తన కేరీర్ లో ఎంతో మంది సీనియర్ న్యాయమూర్తులు,జూనియర్ న్యాయమూర్తులు,న్యాయవాదులు తదితరులు అందరూ తనకు ఎంతో సహాయ సహకారాలను అందించినందుకు వారందరికీ పేరుపేరున జస్టిస్ గంగారావు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు.వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కాని వ్యవస్థ అనేది శాశ్వతమని కావున న్యాయవాద వృత్తిని చేపట్టే ప్రతి న్యాయవాది వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తగిన సత్వర న్యాయసేవలను అందించేందుకు ప్రయత్నం చేయాలని జస్టిస్ గంగారావు సూచించారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ జస్టిస్ గంగారావు న్యాయవాదిగా,ప్రభుత్వ న్యాయవాదిగా,కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ గా ప్రస్తుతం న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో పనిచేసి ప్రజల న్యాయవాదిగా నిలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి మట్లాడుతూ 1961 ఏప్రిల్ 8న అనంతపురం జిల్లాలో జన్మించిన జస్టిస్ గంగారావు 1987లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొంది వివిధ హోదాల్లో పనిచేసిన తదుపరి 2017 సెప్టెంబరు 21 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఎల్లపుడూ చిరునవ్వుతో చురుకుగా ఉండే జస్టిస్ గంగారావు తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మకమైన తీర్పులను ఇచ్చారని గుర్తు చేశారు.ఎపి హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మాట్లాడుతూ జస్టిస్ గంగారావు సామాన్యుల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు.డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరనాధ్ మాట్లాడుతూ జస్టిస్ గంగారావు శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి,రిజిష్ట్రార్లు,రిజిష్ట్రార్ జనరల్,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోయేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(కమీషనర్ సమాచార పౌరసంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వారిచే జారీ)

madagoni surendar

Apr 04 2023, 18:55

నల్గొండ జిల్లా.నకిరేకల్ :చిరు వ్యాపారులకు అండగా బి జి ఆర్ ఫౌండేషన్.

చిరు వ్యాపారులకు అండగా బిజిఆర్ ఫౌండేషన్

Streetbuzz news. నల్గొండ జిల్లా :

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బి జి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గొడుగులు పంపిణీ చేశారు. ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు దంపతులు సుమారు 100 గొడుగులు పంపిణీ చేశారు.

రోజంతా ఎండనక, వాననక చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న మహిళలు, వృద్ధులకు నీడనివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని వారు పేర్కొన్నారు. బిజీర్ ఫౌండేషన్ తరఫున రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, బీజిఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 04 2023, 18:37

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తి రూ.లక్ష కోట్లకు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ కుటుంబం ఆస్తి రూ.లక్ష కోట్లు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తి రూ.లక్ష కోట్లకు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై ఒక్క కేసు అయినా పెట్టారా?

అని ప్రశ్నించారు. భాజపా, భారాస మధ్య సంబంధాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. సంబంధం లేకపోతే కేసీఆర్‌ ఆస్తులపై ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు చేశానని.. ఒక్క దానిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు.

''రాష్ట్రంలో 80శాతం మంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ప్రజలు తమ వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు.. దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. పదేళ్లలో .. రాష్ట్రంలో భారాస, కేంద్రంలో భాజపా చేసిందేమిటో ప్రజలకు చెప్పగలరా? నీటిపారుదల విషయంలో కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ పార్టీ మొదలు పెట్టింది. ఇప్పుడు దాన్ని కేసీఆర్‌ మార్కెటింగ్‌ చేసుకున్నారు. పాదయాత్రలో అనేక విషయాలు స్థానిక ప్రజలకు సవివరంగా చెప్పగలిగాం. ప్రజలు అడిగినవి పక్కనపెడితే.. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? టీచర్‌ నియామకాలు చేపట్టారా? తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛనే కేసీఆర్‌ గుంజుకున్నారు.

madagoni surendar

Apr 04 2023, 18:30

Avalanche: సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురి మృతి!

Avalanche: సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురి మృతి!

గాంగ్‌టక్‌: సిక్కిం(Sikkim)లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది. ఇక్కడి నాథూలా (Nathu La) పర్వత లోయ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.

మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్‌(Gangtok)కు తరలించారు. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో దాదాపు 150 మందికిపైగా పర్యాటకులు అక్కడున్నట్లు సమాచారం.

గాంగ్‌టక్‌ను, చైనా సరిహద్దు సమీపంలోని నాథులా పాస్‌(Nathu La Pass)ను కలిపే జవహార్‌లాల్‌ నెహ్రూ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు రహదారుల సంస్థ(BRO), సిక్కిం పోలీసులు, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. ఇప్పటివరకు 22 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాల్లో చిక్కుకుపోయిన 350 మంది పర్యాటకులనూ కాపాడినట్లు తెలిపారు.

madagoni surendar

Apr 04 2023, 17:08

ఏపీ ::రూ.380 కోట్లకు పెరిగిన అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం

రూ.380 కోట్లకు పెరిగిన అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం

• జూలై నాటికి పూర్తి కానున్న విగ్రహ నిర్మాణం

• మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, ఏప్రిల్ 4: బీఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.268 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేద్కర్ నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున వెల్లడించారు. నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా జరుగుతున్న స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున అంబేద్కర్ స్మృతివనం పనులను సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో మారుమూలన రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ లో వేల కోట్ల రుపాయల విలువైన పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ భూములను అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి కేటాయించడంతో పాటుగా రూ.268 కోట్ల ను మంజూరు చేసారని తెలిపారు. అయితే స్మృతివనం లో చిరస్థాయిగా నిలిచిపోయేలా మరికొన్ని భవనాలను నిర్మించాలని, స్మృతివనం ప్రాంగణాన్ని అత్యాధునిక పద్ధతుల్లో సుందరీకరించాలని నిర్ణయించడంతో అదనంగా మరో రూ.106 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇది కాకుండా పురపాలక శాఖ కూడా మరో రూ.6 కోట్లను స్మృతివనం పనులకు మంజూరు చేసిందని ఈ లెక్కన ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం రూ.380 కోట్లకు చేరిందని వివరించారు. విగ్రహావిష్కరణ పూర్తయ్యే సమయానికి అంచనా వ్యయం రూ.400 కోట్లు దాటే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే నిర్మాణ వ్యయం ఎంతగా పెరిగినా స్మృతివనం పనులు చరిత్రలో మిగిలిపోయేలా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో దేశంలో మరెక్కడా లేని విధంగా ఈపనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం హరియాణలో జరుగుతుండగా దానికి సమాంతరంగా పీడబ్ల్యుడీ గ్రౌండ్స్ లో స్మృతివనం పనులు రాత్రీ పగలూ జరుగుతున్నాయని జరుగుతున్నాయన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాటికి స్మృతివనం పనులను పూర్తి చేయాలనుకున్నా అనివార్యకారణాలతో జూలై నాటికి స్మృతివనం పనులను పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాగార్జున తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, సందర్శకులకు ఒక మంచి అనుభూతిని కలిగించే విధంగా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్మృతివనంలో భాగంగా నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణపనులను వేగవంతం చేయాలని, మరింత ఎక్కువ మంది కార్మికులను ఈ పనుల్లో వినియోగించాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహ శిల్పి నరేష్ విగ్రహ నిర్మాణపనుల పురోగతిని వివరించారు. ఏపీఐఐసి అధికారులు స్మృతివనం పనుల ప్రగతిని పీపీటీ ద్వారా ప్రదర్శించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కే.హర్షవర్ధన్, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపుర్, విజయవాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్, ఏపీఐఐసి సిఇ నరసింహారావు, కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు.

• ఫోటోవార్త: అంబేద్కర్ స్మృతివనం పనుల పురోగతిని సమీక్షిస్తున్న మంత్రి మేరుగు నాగార్జున, సమావేశంలో పాల్గొన్న అధికారులు

madagoni surendar

Apr 04 2023, 16:21

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు.

ఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదే రోజున మోడీ ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ రైలు కావడం విశేషం. ఈ రైలు వలన సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8.30 గంటల వరకు తగ్గనుంది.

ఆనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ పరిశీలించారు.

madagoni surendar

Apr 04 2023, 16:17

పవన్ కళ్యాణ్ : అందర్నీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడతా: పవన్‌

పవన్ కళ్యాణ్ : అందర్నీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడతా: పవన్‌

దిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం హస్తినకు చేరుకున్న పవన్‌.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మురళీధరన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే..

భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గానూ ఉన్న మురళీధరన్‌తో పవన్‌ మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం మురళీధరన్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై పవన్‌ చర్చిస్తున్నట్లు సమాచారం. జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు పవన్‌ను కలవగా భాజపా ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని ఆయన చెప్పారు. సాయంత్రం కేంద్రహోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ అయ్యే అవకాశముంది.

madagoni surendar

Apr 04 2023, 11:14

ఏపీ. కృష్ణాజిల్లా :కదిలే ట్రైన్ ఎక్కాలని ఇద్దరు మిత్రులు సరదాగా వేసుకున్న పందెం కారణంగా, ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు.

కదిలే ట్రైన్ ఎక్కాలని ఇద్దరు మిత్రులు సరదాగా వేసుకున్న పందెం కారణంగా, ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు.

కృష్ణాజిల్లా గుడివాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, గుడివాడ రైల్వే స్టేషన్ సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ సమయంలో స్టేషన్లోకి వస్తున్న గూడ్స్ రైలు ఎక్కాలని ఇద్దరు విద్యార్థులు సరదాగా పందెం కాసుకున్నారు. రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి కాలు పోగొట్టుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆకతాయిగా వేసుకున్న పందెం కారణంగా, జీవితం నాశనం కావడంతో యువకుడి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.