TeluguCentralnews

Feb 22 2023, 14:17

ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..

 రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది కావస్తోంది. కాగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలో చర్చలు జరిపారు. సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే నియంత ఎప్పటికీ ప్రజల స్వేచ్ఛను తగ్గించలేదని, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు. ఉక్రెయిన్ పర్యటన ముగిసిన తర్వాత పోలాండ్ వచ్చిన బైడెన్ అక్కడి ప్రజలు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఉక్రెయిన్ కు తమ మద్దతు కొనసాగుతుందని.. మిత్రపక్షాలతో కలిసి ఆ దేశానికి అండగా నిలుస్తామని అన్నారు. రాబోయే రోజులకు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ బలంగా ఉందని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రసంగంపై కూడా బైడెన్ స్పందించారు. పుతిన్ చెప్పినట్లు పశ్చిమ దేశాలు రష్యాపై దాడి చేయడానికి కుట్ర చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పొరుగువారితో జీవించాలనుకునే మిలియన్ల మంది రష్యన్లు మాకు శత్రువులు కారని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుదాతో భేటీ అయ్యారు బైడెన్. నాటో కూటమి మునుపెన్నడు లేనంత బలంగా ఉందని అన్నారు. అమెరికాకు పోలాండ్, నాటో ఎంత అవసరమో, నాటోకు అమెరికా అంత అవసరం అని అన్నారు. ఉక్రెయిన్ లో బైడెన్ ఆకస్మికంగా పర్యటించడాన్ని ఆండ్రెస్ పొగిడారు. ఉక్రెయిన్ లో ఇది చాలా ధైర్యా్న్ని నింపుతుందని అన్నారు.

TeluguCentralnews

Feb 22 2023, 14:06

ముంబై మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. 25కు పైగా ఇళ్లు దగ్ధం...

ముంబైలోని ధారవి షాహోనగర్ ప్రాంతంలోని కమలా నగర్ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. షాహునగర్ ప్రాంతంలో 25కు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 20 నుంచి 25 వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

రోడ్లు ఇరుకుగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

TeluguCentralnews

Feb 22 2023, 10:35

పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఇప్పుడు బాధగా ఉంది : రాహూల్ గాంధీ

పెళ్లి ఎందకుకు చేసుకోలేదో తనకే ఇప్పటి వరకు తెలియదని.. కానీ ఎందుకు చేసుకోలేదని మాత్రం ఇప్పుడు అనిపిస్తోందని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు ఇప్పుడు పిల్లలు కావాలని అనిపిస్తోందని చెప్పారు. ఇటలీ పత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ గాంధీ అనేక విషయాలను పంచుకున్నారు. నానమ్మ ఇందిరా గాంధీకి తానంటే చాలా ఇష్టమని, అమ్మమ్మ పోలా మైనోకు ప్రియాంక గాంధీ అంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు.

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3 వేల 500 కిలోమీటర్ల దూరం సాగిన భారత్‌ జోడో యాత్ర పూర్తయ్యే వరకు గెడ్డం గీసుకోరాదని తాను భావించినట్లు రాహుల్‌ తెలిపారు. ఇప్పుడు ఆ గెడ్డాన్ని ఉంచాలా లేదా తీసివేయాలా అనేది తాను నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు. భారత్‌లో నియంతృత్వం ప్రవేశించిందని అన్నారు. ప్రజాస్వామ్య నిర్మాణాలు కూలిపోతున్నాయని, పార్లమెంట్‌ సరిగ్గా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వానికి ప్రత్యామ్నాయ విజన్‌ను విపక్షాలు ప్రతిపాదించగలిగితే ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఓడించవచ్చని రాహూల్ గాంధీ అన్నారు.

TeluguCentralnews

Feb 22 2023, 10:16

దిల్లీ ట్రాఫిక్ నరకం.. ఇక్కడికి రావాలంటే ఇబ్బందిగా ఉంది: నారాయణమూర్తి

దిల్లీకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. దేశ రాజధానిలో ట్రాఫిక్ నిబంధనలు ఎవరూ పట్టించుకోరని.. ఇక్కడి ట్రాఫిక్ నరకమని అన్నారు. అందుకే ఇక్కడికి రావాలంటే తనకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ దిల్లీలో ఎవరూ ట్రాఫిక్‌ నిబంధనలు సరిగా పాటించరు. అందుకే ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.నిన్న నేను విమానాశ్రయంలో దిగి కారులో హోటల్‌కు వెళ్తున్నాను. మధ్యలో ఎన్నో రెడ్‌ సిగ్నల్స్‌ పడ్డాయి. కానీ, ఎవరూ వాహనాలు ఆపడం లేదు. అలాగే ముందుకు వెళ్లిపోతున్నారు. ’’ అని నారాయణమూర్తి అన్నారు. ఒకట్రెండు నిమిషాలు కూడా ఆగకపోతే ఎలా?అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కనీసం అక్కడ డబ్బులు వేస్తే అప్పుడైనా ఆగుతారేమోనని నారాయణమూర్తి అన్నారు.

సమాజంలో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలని నారాయణమూర్తి అన్నారు. అప్పుడే పిల్లలు సరైన మార్గంలో పయనించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడే పిల్లలు అనవసరమైన ఉద్రిక్తతలకు లోనుకాకుండా ఉంటారని చెప్పిన ఆయన..కార్పొరేట్‌ పాలన గురించి పాఠశాల వయస్సులోనే తాను నేర్చుకున్నట్లు తెలిపారు.

TeluguCentralnews

Feb 21 2023, 14:17

హెచ్ఐవీ ఆపై క్యాన్సర్.. అయినా కోలుకున్న రోగి.. ప్రపంచంలో మూడో వ్యక్తిగా రికార్డ్..

హెచ్ఐవీ, క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ రోగి రెండు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండు ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగిని ‘ డ్యూసెల్డార్ప్ పేషెంట్’గా వ్యవహరిస్తారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన ల్యూకేమియా కోసం స్టెమ్ సెల్ చికిత్స తీసుకున్న తర్వాత సదరు రోగి క్యాన్సర్, హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా కోలుకున్న వ్యక్తులు ప్రపంచంలో ముగ్గురే ఉన్నారు. గతంలో బెర్లిన్, లండన్ లోని ఇద్దరు రోగులు ఇలాగే కోలుకున్నారు. తాజాగా ఫ్రాన్స్ కు చెందిన రోగి ఈ రెండు వ్యాధుల నుంచి కోలుకున్నారు.

53 ఏళ్ల వ్యక్తికి 2008లో హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఆ తరువాత మూడు ఏళ్లకు అతను ప్రాణాంతకమైన మైలోయిడ్ లుకేమియా అనే రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయింది. 2013లో సీసీఆర్5 అరుదైన మ్యుటేషన్ తో ఒక మహిళా దాత మూలకణాలను ఉపయోగించుకుని బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్నాడు. ఆ తరువాత పరిశీలిస్తే ఈ మ్యూటేషన్ హెచ్ఐవీ కణాలు రోగి కణాల్లోకి చేరకుండా ఆపగలిగినట్లు తేలింది. 2018లో హెచ్ఐవీకి ఉపయోగించే యాంటీరెట్రో వైరల్ థెరపీని నిలిపివేశాడు. నాలుగు ఏళ్ల తరువాత పరీక్షిస్తే అతని శరీరంలో హెచ్ఐవీ జాడ కనుగొనబడలేదని అధ్యయనం తెలిపింది.

వైద్యరంగం ఇంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ హెచ్ఐవీ వ్యాధికి నివారణ తప్పితే క్యూర్ అనేది లేదు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే హెచ్ఐవీ, క్యాన్సర్ ఉన్న సమయంలో బోన్ బ్యారో మార్పిడి చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆపరేషన్, హెచ్ఐవీ, క్యాన్సర్ తో బాధపడుతున్న కొద్ది మంది రోగులకు మాత్రమే ఈ చికిత్స సరిపోతుంది. ఇందులో అత్యంత రిస్క్ ఏంటంటే సీసీఆర్5 మ్యుటేషన్ కలిగిన బోన్ మ్యారో కలిగిన వ్యక్తిని కనుగొనడం అని వైద్యులు చెబుతున్నారు. ఈ విధానంలో రోగి వ్యాధినిరోధక కణాలు పూర్తిగా దాత కణాలతో మార్చబడతాయి. దీంతో ఇన్ఫెక్షన్ కు గురైన కణాలు అదృశ్యం అవడంవ సాధ్యపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.

TeluguCentralnews

Feb 21 2023, 14:05

ముంద్రా ఎయిర్‌పోర్ట్‌ డ్రగ్స్ కేసులో సంచలనం.. ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌‌లో తెలుగు వ్యక్తి పేరు..!

ఇప్పుడు వరకూ లేని ఓ కొత్త కోణం.. ఊహకు కూడా అందని ఓ పచ్చినిజం.. ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అది కూడా విజయవాడకు సంబంధించిన వారి పేరు ఎంటరైంది. అవును, ఇందులో కాకినాడకు చెందిన వ్యక్తి, విజయవాడ కేంద్రంగా బిజినెస్ చేస్తున్న మాచవరం సుధాకర్ పేరు కూడా ఉంది. మీకు గుర్తుందో లేదో.. 2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 3వేల కేజీల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో జరిగిన దిగుమతి ఇది. ఇంతలా టాల్కమ్‌ పౌడర్‌ని ఇంపోర్ట్ చేసుకుంటోంది ఎవరో అని ఆరా తీస్తే విజయవాడలోని సత్యనారాయణపురం.. గడియారం వీధి అడ్రస్‌పేరుతో ఓ కంపెనీ రిజిస్ట్రర్ అయ్యి ఉంది. ఆ కంపెనీ పేరే ఆషీ ఎంటర్‌ ప్రైజెస్‌. దీని ఓనర్లుగా ఉన్న వ్యక్తులు మాచవరం సుధాకర్‌, ఆయన భార్య వైశాలి. ఆషి సంస్థపై అప్పట్లో ఎన్ఐఏ దాడులు చేసి ఈ మొత్తం వివరాలను సేకరించింది.

ముంద్రా డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు హర్‌ప్రీత్‌ తల్వార్. హరిప్రీత్‌కి ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి లైసెన్స్‌ లేదు. అందుకు టాల్కమ్‌ పౌడర్ బిజినెస్‌ చేస్తున్న మాచవరం సుధాకర్‌ లైసెన్స్‌ను వాడుకున్నారా? ఇదంతా సుధాకర్‌కి తెలిసే జరిగిందా? అరెస్ట్‌కు ముందు వరకూ ఆషీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఎన్ని కిలోలు, టన్నుల మేర టాల్కమ్‌ పౌడర్ వచ్చింది. అందులో మిక్సై వచ్చిన డ్రగ్స్ ఎన్ని కేజీలు? ఈ వచ్చిన ఆదాయం ఎంత.. లష్కరే తోయిబాకు తరలింది ఎంత? ఎన్ఐఏ చార్జ్‌షీట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన అనుమానాలివి.

మొత్తంగా ఆఫ్గన్ డ్రగ్స్‌ గుజరాత్‌ పోర్టు నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతున్నాయి. అందుకు సహకరిస్తోంది విజయవాడకు చెందిన కంపెనీ. డ్రగ్స్‌పై వచ్చిన ఆదాయం పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్‌లకు వెళ్తోంది. టోటల్‌గా అతిపెద్ద మిస్టరీని చేదించింది ఎన్ఐఏ.

TeluguCentralnews

Feb 21 2023, 14:03

శివుడి వేషంలో పెళ్లిచేసుకున్న భక్తుడు.. ఒళ్లంత విభూతితో కల్యాణ మండపానికి.. నోరెళ్లబెట్టిన గ్రామస్తులు..

దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లిళ్ల హడావుడితో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. దీంతో ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడే కనిపిస్తుంది. ఇకపోతే, పెళ్లంటే బంధువుల హడావుడి.. స్నేహితుల అల్లర్లతో సరదాగా సాగిపోతూ ఉంటుంది. బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా జరుగుతుంటాయి వివాహాలు. నేటి రోజుల్లో పెళ్లిళ్లను కలకాలం గుర్తుండిపోయేలా చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌ల ట్రెండ్ కూడా పెరుగుతోంది. మరోవైపు పెళ్లిళ్లలో కూడా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య గోద్రాకు చెందిన ఓ శివ భక్తుడు అపూర్వంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

కాచివాడ్ ప్రాంతానికి చెందిన రిషబ్ పటేల్ అనే యువకుడు శివుడి వేషధారణలో పెళ్లి చేసుకున్నాడు. రిషబ్ పటేల్ శివ భక్తుడు కావడంతో ఆ శివయ్య వేషంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శివుడి వేషధారణతో రిషబ్ పటేల్ వధువు మెడలో మూడుముళ్లు వేశాడు. పెళ్లి అనంతరం నగరంలోని ప్రధాన రహదారిపై డీజే, ధోల్ నగారా బీట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిన గోద్రాలోని అంకలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. అఘోరీ సాధు, సాధువులు కూడా రిషబ్ పటేల్ వివాహ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రస్తుతం రిషబ్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

TeluguCentralnews

Feb 21 2023, 12:10

మరో ఐటీ సెక్టార్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు... మైగేట్ 30 శాతం మందిని...

ఐటీ సెక్టార్ లో లేఆఫ్ పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఐటీ ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లో ఉంది. అయితే తాజాగా ఇండియాకు చెందిన పలు కంపెనీలు కూడా నెమ్మదిగా ఉద్యోగులను తీసేసే పనిలో ఉన్నాయి.

తాజాగా ప్రముఖ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ ‘మైగేట్’ తన మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం మందిని తొలగించింది. బెంగళూర్ కు చెందిన ఈ స్టార్టప్ మిడ్ మేనేజ్మెంట్, జూనియర్ రోల్స్ లో ఉన్నవారిని ఉద్వాసన పలికింది. ఈ సంస్థలో మొత్తం 600 మంది ఉద్యోగులు ఉంటే 400 మందికి తగ్గించింది. గత డిసెంబర్ లో కూడా మైగేట్ ఇదే విధంగా కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందికి రెండు నెలల జీతాన్ని ఇవ్వనున్నట్లు తెలిసింది.

2016లో విజయ్ అరిసెట్టి, వివైక్ భరద్వాజ్, శ్రేయాన్స్ దాగా, అభిషేక్ కుమార్‌ లు ‘మైగేట్’ను స్థాపించారు. అపార్మెంట్ల భద్రతాకు సంబంధించిన పలు సేవలను ఈ సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. పెట్టుబడులు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియాలోని చాలా స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. బైజూస్, కార్స్ 24, ఓఎల్ఎక్స్, ఎంపీఎల్, ఉడాన్, అన్ అకాడామీ, వేదాంతు, ఓయో, లీడ్, ఓలా వంటి భారతీయ స్టార్టప్స్ 2022 నుంచి ఇప్పటి వరకు 22,000 మంది ఉద్యోగులను తొలగించాయి.

TeluguCentralnews

Feb 21 2023, 11:54

Turkey : టర్కీలో మరో భూకంపం... రిక్టర్ స్కేల్ పై 6.4 గా నమోదు

తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. హతాయ్‌ ప్రావిన్సులో సోమవారం మరోసారి తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ మేరకు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వివరాలు వెల్లడించింది. ఈ తీవ్రతకు ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయాయి. భూకంపం ప్రభావం సిరియా, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది. ఈ ప్రమాదం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రత అధికంగా ఉండేలా తెలుస్తోంది. లటాకియాలో రెండుసార్లు దాదాపు 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలు ఇళ్లు, హోటల్, భవనాల నుంచి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

ఫిబ్రవరి 6న టర్కీ, పొరుగున ఉన్న సిరియాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ వరుస భూకంపాలతో 46 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. భూకంప ధాటికి చెల్లాచెదురైన టర్కీకి పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయక చర్యల్లో పాల్గొంటోంది. భారత్‌ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి తమకు ఎంతో సాయం చేస్తున్నాయని, అండగా ఉంటున్నారని ఆ దేశ ప్రజలు చెప్పారు.

ప్రకృతి బీభత్సానికి టర్కీ, సిరియాలు విలవిల్లాడిపోయాయి. రెండు వారాల క్రితం తెల్లవారు జామున వచ్చిన పెను భూకంపం ధాటికి రెండు దేశాలు వణికిపోయాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జనాలు శిథిలాల కిందే ప్రాణాలు కోల్పాయారు. ఈ విపత్తు ధాటికి.. రెండు దేశాల్లో కలిపి చనిపోయిన వారి సంఖ్య 46 వేలు దాటింది. టర్కీలోనే 40 వేలకు మందికి పైగా మృతి చెందారు. సిరియాలో 5800 కు పైగా చనిపోయారు.

భూకంపం కారణంగా 1,05,794 భవనాలు ప్రభావితం అయ్యాయి. ఇప్పటికే 20,662 భవనాలు పూర్తిగా కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియాలోనూ ఆస్తినష్టం భారీగానే ఉంటారు. సిరియాలోనూ భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుందని వెల్లడించింది. భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం కావడంతో అక్కడి పర్యావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. టర్కీలో సహాయక చర్యల కోసం భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ దోస్త్‌’ ముగిసింది.

TeluguCentralnews

Feb 16 2023, 14:50

అల్‌ఖైదా కొత్త చీఫ్‌ తలపై భారీ రివార్డు..

మాజీ ఈజిప్షియన్ ప్రత్యేక దళాల అధికారి, అల్ ఖైదాలో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉన్న సైఫ్ అల్-అదెల్ తలపై 10 మిలియన్ల డాలర్ల బహుమతిని యూఎస్ ప్రకటించింది. ఇప్పుడు కొత్త యూఎన్‌ నివేదిక ప్రకారం, ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా కొత్త చీఫ్‌గా సైఫ్‌ అల్‌-అదెల్‌ పోటీలేని నాయకుడిగా ఉన్నట్లు వెల్లడించింది. 2011లో దాని వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్యకు గురైనప్పటి నుండి ఉగ్రవాద సంస్థను అమెరికా దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా గత సంవత్సరం కాబూల్‌లో యూఎస్ క్షిపణి దాడిలో మరణించినట్లు విశ్వసిస్తున్న ఐమాన్ అల్-జవహిరీకి అల్ ఖైదా అధికారికంగా వారసుడిని ప్రకటించలేదు. జనవరిలో యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారి జవహిరి వారసత్వం గురించి అస్పష్టంగానే ఉందని చెప్పినప్పటికీ, సమూహం నుంచి వచ్చే నష్టాలను అంచనా వేసే ఐక్యరాజ్యసమితి నివేదిక ఇలా చెప్పింది. నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన చర్చలలో, అనేక సభ్య దేశాలు సైఫ్ అల్-అదెల్ నాయకుడిగా అల్‌ఖైదా పనిచేస్తోందని యూఎన్‌ అభిప్రాయపడింది.

జవహరి మరణం తర్వాత ప్రాణాంతక కార్యకలాపాలను జాగ్రత్తగా ప్లాన్ చేయగల, జిహాదీ నెట్‌వర్క్‌ను అమలు చేయగల వ్యూహాత్మక నాయకుడిని ఎన్నుకోవాలని సమూహంపై అల్ ఖైదా ఒత్తిడి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. సైఫ్‌ అల్‌-అదెల్‌ తన పూర్వీకుల మాదిరాగా కాకుండా.. అల్ ఖైదాను ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఉగ్రవాద సమూహంగా మార్చడంలో సహాయపడిన అదెల్ రహస్యంగా దాడులను ప్లాన్ చేసినట్లు నిపుణులు అంటున్నారు. టాంజానియా, కెన్యాలోని యూఎస్‌ రాయబార కార్యాలయాలపై బాంబు దాడుల్లో అతని పాత్రకు సంబంధించి యూఎస్ ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ నవంబర్ 1998లో అదెల్‌పై అభియోగాలు మోపింది. ఈ బాంబు దాడుల్లో 224 మంది పౌరులు మరణించగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. 

ఆఫ్రికాలో అల్‌ఖైదా కార్యకలాపాలు, శిక్షణా శిబిరాలను అతను ఏర్పాటు చేశాడు. 2002లో పాకిస్తాన్‌లో యూఎస్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యతో అతనికి సంబంధం ఉంది. అదెల్ ఇరాన్‌లో ఉన్నాడని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. డిపార్ట్‌మెంట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సైఫ్‌ అల్-అదెల్ గురించిన సమాచారం అందించిన వారికి 10 మిలియన్ల డాలర్ల వరకు అందిస్తామని ప్రకటన విడుదల చేసింది.

ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ ప్రధాన అంగరక్షకుడిగా, తీవ్రవాదుల సీనియర్ శిక్షకుడు, జిహాదీ ఉద్యమంపై నిపుణుడైన అదెల్ తన సుదీర్ఘ తీవ్రవాద కార్యకలాపాలను 1981లో ప్రారంభించాడని సమాచారం. ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ అల్-సదాత్‌ను ఇస్లామిస్ట్ సైనికులు చేసిన హత్యలో ప్రమేయం ఉన్నట్లు అనుమానించబడ్డాడు. కైరోలో కవాతు టెలివిజన్‌లో ప్రసారం చేయబడింది. అల్‌ఖైదా అమెరికాపై సెప్టెంబరు 11, 2001న జరిపిన విమానదాడుల్లో దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అల్‌ఖైదాను అతను స్వాధీనం చేసుకున్నాడు.