తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:17

హైకోర్టులో క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌కు షాక్!

ముడా' కుంభ‌కోణం కేసులో క‌ర్ణాట‌కు ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది.

ద‌ర్యాప్తు కోసం గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా సిద్ధ‌రామ‌య్య దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. మైసూరు ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూ కేటాయింపుల విష‌యంలో ఖ‌రీదైన భూముల‌ను త‌న భార్య పార్వ‌తికి ద‌క్కేలా సిద్ధ‌రామ‌య్య కుట్ర చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:15

మెట్ల మార్గాన తిరుమలకు.. డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెట్ల మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన.. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

కాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిపోవడంతో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన పూనుకున్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు.

ఇవాళ ఇంద్రకీలాద్రికి పవన్..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (మంగళవారం) ఇంద్రకీలాద్రికిి వెళ్లనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.

దీక్ష తీసుకునే సందర్భంలో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. మరి హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని నిలదీశారు. కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలంతా ఆయన వెనుకే ఉంటారని అభిప్రాయపడ్డారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ అన్నారు.‘‘స్వామి వారి పూజా విధానాలను మార్చేశారు.శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారు. ఏ మతమైనా కావచ్చు. ఏ ప్రార్థనా మందిరం కావచ్చు. మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తీ జరుగుతోంది, నాణ్యత లేదని ముందు నుంచి చెబుతున్నాం. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదు. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటుంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని. ఆరోజు రాజకీయం చేయలేదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:11

నామినేటెడ్ పదవుల భర్తీ.. ఎంతమందికి అంటే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుంది. ఈ నేపథ్యంలో 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్‌ను కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేసింది. 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను మంగళవారం ప్రకటించింది. అందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది.

ఒక క్లస్టర్ ఇంఛార్జీను చైర్మన్ పదవిలో నియమించింది. అలాగే ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌తోపాటు వివిధ కార్పొరేషన్లకు సభ్యులను సైతం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన నామినేటేడ్ పోస్టుల్లో 99 శాతం పదవులు యువతకే ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ పదవులు కేటాయించారు.

గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. అలాగే పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో టీడీపీ -16, జనసేన -3, బీజేపీ -1 చొప్పున మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారు.

వక్ఫ్ బోర్డు: అబ్దుల్ అజీజ్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP): అనిమిని రవినాయుడు

AP హౌసింగ్ బోర్డ్: బత్తుల తాత్యబాబు

AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR): బొరగం శ్రీనివాసులు

AP మారిటైమ్ బోర్డ్: దామచర్ల సత్య

APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ (SEEDAP): దీపక్ రెడ్డి

20 పాయింట్ ఫార్ములా: లంకా దినకర్ (బీజేపీ)

AP మార్క్‌ఫెడ్: కర్రోతు బంగార్రాజు

AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: మన్నె సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC : మంతెన రామరాజు

AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ: నందం అబద్దయ్య

AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్: నూకసాని బాలాజీ

APSRTC చైర్మన్, APSRTC వైస్ చైర్మన్: కొనకళ్ల నారాయణ, పిఎస్‌ మునిరత్నం

AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పీలా గోవింద సత్యనారాయణ

లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పిల్లి మాణిక్యాల రావు

AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి: పీతల సుజాత

A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC): తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్: తోట మెహర్‌ సుధీర్‌ ( జనసేన)

ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC): వజ్జా బాబురావు

AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO: వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:06

తిరుమల లడ్డూ వ్యవహారంలో అనుకోని మలుపు- తెరపై సాధువులు

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తోన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోన్నారు.

అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద బహిరంగంగా ప్రమాణం చేశారు. తప్పు చేసివుంటే తాను, తన కుటుంబం సర్వనాశనం కావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నారు.

ఈ క్రమంలో మరో డిమాండ్ తెర మీదికి వచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనెను కల్తీ చేసిన వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలంటూ ఏపీ హిందూ సాధు పరిషత్ ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది

టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్ వద్ద ఈ ఉదయం సాధు పరిషత్ ప్రతినిధులు ధర్నాకు దిగారు. అక్కడే బైఠాయించారు. శంఖనాదం చేశారు. ఈ ఉదంతానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని, వారిపై అత్యంత కఠిన చర్యలను తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:31

కేఏ పాల్ పిటిషన్ ఎఫెక్ట్.. ఆ 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..!

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో పరిణామంతో.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేయగా.. ఆ పది మంది ఎమ్మల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్‌.. 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏకంగా హైకోర్టే నోటీసులు జారీ చేసేలా చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జరీ చేసిన ధర్మాసనం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత.. మరో పార్టీలోకి మారటమనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేఏ పాల్ కోరారు.

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద విజయం సాధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఆరు నెలల తిరగకముందే పార్టీ మారటమే కాకుండా.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినట్టుగా పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. తాను పోటీ చేసి గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే.. వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవిస్తున్నారని.. అది తప్పు అని అభిప్రాయపడ్డారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:19

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్..

హైడ్రా హైదరాబాద్ లోని చెరువులను పరిరక్షించడానికి నడుబిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరిహిల్స్ లోని పార్కులో అక్రమ కట్టడాలని హైడ్రా సోమవారం కూల్చివేసింది. ఆదివారం కూడా హైడ్రా అమీన్ పూర్, కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే కూకట్ పల్లిలో నల్ల చెరువు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని వారు వాపోయారు.

కనీసం సామాన్లు బయట పెట్టుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాగానే ఉన్నారు... భూమి లీజ్ ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు. కానీ తమ పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. హైడ్రా ఉన్నవారి పట్ల ఓ రకంగా.. పేదవారి పట్ల మరో రకంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కూకుట్ పల్లిలో బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు డిమాండ్ చేశారు.

చాలా మంది లీజ్ కు తీసుకుని రేకుల షేడ్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని ఇప్పుడు వారి ఉపాధి మీద దెబ్బపడిందని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న భవన యజమానులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు చుట్టూ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవన యజమానులు ఊరట లభించినట్లయింది.

వాపోయారు.

అలాగే 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు ప్రాంత వాసుల అభ్యంతరాలను పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అక్టోబర్ 4న భవన యజమానులు పరిరక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యజమానుల పరిగణనలోకి తీసుకుని అక్టోబరు 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలని లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీనికి చెప్పింది. నోటీసులు తీసుకున్న వారిలో సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. దుర్గం చెరువు 100 ఎకరాల్లో ఉండగా.. 84 ఎకరాలకు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:14

శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన వ్యాఖ్యలు

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వులను వాడారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు రావడం సంచలనంగా మారింది. భక్తులను ఇది ఆవేదనకు గురిచేస్తోంది. ఈ అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాల ఉన్నాయనే ఆరోపణలు యావత్తు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ కోట్లాది మంది భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. తాజాగా, ఈ అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్రంగా స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం అనేది అసహ్యకరమైనదని సద్గురు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు

భక్తులకు తినే ఆలయ ప్రసాదంలో జంతు మాంసం అనేది అసహ్యకరమైంది. అందుకే దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ ద్వారా కాకుండా భక్తులతో నడపాలి.. భక్తి లేనిచోట పవిత్రత ఉండదు.. హిందూ దేవాలయాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కాకుండా భక్తులైన హిందువులతో నిర్వహించాల్సిన సమయం వచ్చింది’ అని సద్గురు పేర్కొన్నారు. మరోవైపు, లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివేదిక ఆదారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సనాతనధర్మంపై జరిగిన చాలా ప్రమాదకమైన కుట్ర అని ఆయన అభివర్ణించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకీ కల్తీ నెయ్యిని వినియోగించారని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని సీఎం చంద్రబాబునాయడు గతవారం చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అయితే, వీటిని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు తోసిపుచ్చారు. లడ్డూ ప్రసాదానికి కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి, సేంద్రీయ ఉత్పత్తులనే వాడామని ఆయన చెప్పారు.

కాగా, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి.. శ్రీవారి క్షేత్రాన్ని అపవిత్రం చేశారని, దీనిపై మాజీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ యువజన విభాగం ఆదివారం ఆయన నివాసాన్ని ముట్టించింది. అటు,శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. వాస్తవానికి శ్రీవారికి ఏటా జరిగే పవిత్రోత్సవాలతోనే ఇలాంటి అపచారాలకు పరిహారం లభిస్తుందని, కానీ భక్తుల్లో నమ్మకం కలిగించడానికే శాంతిహోమం చేపట్టామని ఆయన చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:07

లడ్డూ వివాదంలో కేంద్రం సీరియస్.. ఆ కంపెనీకి నోటీసులు..

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో స్వామివారి ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.

ఈ మేరకు వాటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించింది. వాటిలో మూడు కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు సరైన ప్రమాణాలు పాటించకుండా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న ఆ కంపెనీకి FSSAI(ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు.. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. అయితే కొన్ని రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని, తాను ఏ తప్పూ చేయలేదని కరుణాకర్ రెడ్డి చెప్పారు. తన హయాంలో జంతువుల కొవ్వు కలపలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏదైనా తప్పు చేసి ఉంటే తనతోపాటు కుటుంబం మెుత్తం నాశనం అయిపోతామని చెప్పుకొచ్చారు. కుట్రపూరితంగానే కూటమి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కరుణాకర్ రెడ్డి చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 18:55

హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఆక్రమణ కూల్చివేతలపై దూసుకెళ్తున్న హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై న్యాయస్థానం స్టే విధించింది. స్థానికల పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. దీంతో హైకోర్టు హైడ్రాకు కీలక సూచనలు చేసింది.

దుర్గం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ హైడ్రా స్థానికులకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నోటీసుల పైన స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జారీ చేసిన ప్రిలిమరి నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రొటెక్షన్ కమిటీ స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అక్టోబర్ 4న ప్రొటెక్షన్ కమిటీ ముందు నివాసితులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.

అదే సమయంలో అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల లోపు నోటిఫికేషన్ జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు తాజా ఆదేశాలతో దుర్గం చెరువు నివాసితులకు తాత్కాలికంగా ఊరట దక్కింది. మరోవైపు నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మాదాపూర్ లో హైడ్రా సిబ్బంది కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను కూల్చివేశారు.

పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. అనంతరం కావూరి హిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. అయితే కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్ల పాటు తాము లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు వాదిస్తున్నారు. గడువు మూగీకముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా హైకోర్టు హైడ్రాకు ఇచ్చిన ఆదేశాలతో దుర్గం చెరువు వాసులకు రిలీఫ్ దక్కింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 18:41

భారత్‌కు గుడ్ న్యూస్.. ఆ సంపదను తిరిగిచ్చేస్తున్న అమెరికా..

 4 వేల పురాతన వస్తువులను అమెరికా.. భారత్‌కు ఇచ్చేయడానికి సిద్ధమైంది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.

 4 వేల పురాతన వస్తువులను (4 Thousand Antiques) అమెరికా (America).. భారత్‌ (India)కు ఇచ్చేయడానికి సిద్ధమైంది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అమెరికా పర్యటన (America Tour) సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2వేలు బీసీఈ (BCE) – 19వేల సీఈ (СЕ) - వరకు అంటే 4వేళ ఏళ్ల పరిధిలోని యాంటిక్విటీస్ ఉన్నాయని భారత్ అధికారులు తెలిపారు. ఇండియాకు రానున్న తూర్పు భారతంలోని టెర్రకోట బొమ్మలు, కళాకృతులు; ఇతర ప్రాంతాల్లోని రాతి, లోహ, కలప, ఐవరీ శిల్పాలు.. త్వరలోనే వీటిని భారత్‌కు తరలించనున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు.

కాగా ‘‘క్వాడ్‌ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్‌ అభిమతం. మేం(క్వాడ్‌ కూటమి) నిలబడతాం.. బలపడతాం’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో ఆదివారం జరిగిన క్వాడ్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లక్రితం ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌ కలిసి క్వాడ్‌ కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే..! ఈ కూటమి ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ, బైడెన్‌తోపాటు.. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనెస్‌, జపాన్‌ ప్రధాని కిషిదా పాల్గొన్నారు.

క్వాడ్‌కు వ్యతిరేకంగా చైనా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. మోదీ ఆ దేశం పేరును ప్రస్తావించకుండా తాము అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమ సందేశం ఒక్కటేనని, బలంగా నిలబడి, సభ్యదేశాల సహకారానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు చోటుచేసుకుంటున్న సమయంలో క్వాడ్‌ కూటమి ఏర్పాటైంది. మానవాళి శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కంకణబద్ధమైంది. క్వాడ్‌ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయి.

ప్రపంచానికి మేలు జరిగేలా ఇంకా సమర్థంగా పనిచేయాలని నిర్ణయించాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరించేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు ఆయన ‘క్వాడ్‌ క్యాన్సర్‌ మూన్‌షాట్‌ ఈవెంట్‌’లో మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు, గుర్తింపు, చికిత్సకు భారత్‌ తరఫున రూ.62.61 కోట్ల(7.5 మిలియన్‌ డాలర్లు)ను అందజేస్తామని ప్రకటిస్తూ.. తమ లక్ష్యం ‘ఒక భూగోళం.. ఒక ఆరోగ్యం’ అంటూ నినదించారు. ఈ రీజియన్‌లోని దేశాలకు 4 కోట్ల డోసుల క్యాన్సర్‌ టీకాలను అందజేస్తామన్నారు.

క్వాడ్‌ దేశాధినేతల తదుపరి సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఆవిర్భవించగా.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి ఈ సంవత్సరం భారత్‌ వంతు కాగా.. తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో తన స్వస్థలంలో సమ్మిట్‌కు అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. దాంతో.. వచ్చే ఏడాది సదస్సును భారత్‌లో ఏర్పాటు చేయాలని తీర్మానించారు

విల్మింగ్టన్‌లో శనివారం బైడెన్‌-మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే..! ఈ చర్చల్లో భాగంగా మోదీపై బైడెన్‌ పొగడ్తల వర్షం కురిపించినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. శాంతికోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించినట్లు వివరించారు. కొవిడ్‌ సమయంలో ‘టీకా మైత్రి’ మొదలు.. ఇటీవలి జీ20 సమ్మిట్‌ వరకు ప్రపంచ క్షేమం కోసం భారత్‌ చేస్తున్న కృషిని కొనియాడినట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల భేటీలో.. సెమీకండక్టర్లు మొదలు.. అంతరిక్షం దాకా పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిపారు. భారత్‌-అమెరికా మధ్య కీలకమైన రక్షణ, క్లీన్‌ ఎనర్జీ, గ్లోబల్‌ హెల్త్‌పై ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి కృషిచేస్తానని బైడెన్‌ పేర్కొన్నట్లు వివరించారు.