తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:06

తిరుమల లడ్డూ వ్యవహారంలో అనుకోని మలుపు- తెరపై సాధువులు

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తోన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోన్నారు.

అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద బహిరంగంగా ప్రమాణం చేశారు. తప్పు చేసివుంటే తాను, తన కుటుంబం సర్వనాశనం కావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నారు.

ఈ క్రమంలో మరో డిమాండ్ తెర మీదికి వచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనెను కల్తీ చేసిన వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలంటూ ఏపీ హిందూ సాధు పరిషత్ ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది

టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్ వద్ద ఈ ఉదయం సాధు పరిషత్ ప్రతినిధులు ధర్నాకు దిగారు. అక్కడే బైఠాయించారు. శంఖనాదం చేశారు. ఈ ఉదంతానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని, వారిపై అత్యంత కఠిన చర్యలను తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:31

కేఏ పాల్ పిటిషన్ ఎఫెక్ట్.. ఆ 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..!

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో పరిణామంతో.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేయగా.. ఆ పది మంది ఎమ్మల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్‌.. 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏకంగా హైకోర్టే నోటీసులు జారీ చేసేలా చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జరీ చేసిన ధర్మాసనం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత.. మరో పార్టీలోకి మారటమనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేఏ పాల్ కోరారు.

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద విజయం సాధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఆరు నెలల తిరగకముందే పార్టీ మారటమే కాకుండా.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినట్టుగా పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. తాను పోటీ చేసి గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే.. వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవిస్తున్నారని.. అది తప్పు అని అభిప్రాయపడ్డారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:19

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్..

హైడ్రా హైదరాబాద్ లోని చెరువులను పరిరక్షించడానికి నడుబిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరిహిల్స్ లోని పార్కులో అక్రమ కట్టడాలని హైడ్రా సోమవారం కూల్చివేసింది. ఆదివారం కూడా హైడ్రా అమీన్ పూర్, కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే కూకట్ పల్లిలో నల్ల చెరువు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని వారు వాపోయారు.

కనీసం సామాన్లు బయట పెట్టుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాగానే ఉన్నారు... భూమి లీజ్ ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు. కానీ తమ పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. హైడ్రా ఉన్నవారి పట్ల ఓ రకంగా.. పేదవారి పట్ల మరో రకంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కూకుట్ పల్లిలో బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు డిమాండ్ చేశారు.

చాలా మంది లీజ్ కు తీసుకుని రేకుల షేడ్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని ఇప్పుడు వారి ఉపాధి మీద దెబ్బపడిందని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న భవన యజమానులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు చుట్టూ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవన యజమానులు ఊరట లభించినట్లయింది.

వాపోయారు.

అలాగే 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు ప్రాంత వాసుల అభ్యంతరాలను పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అక్టోబర్ 4న భవన యజమానులు పరిరక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యజమానుల పరిగణనలోకి తీసుకుని అక్టోబరు 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలని లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీనికి చెప్పింది. నోటీసులు తీసుకున్న వారిలో సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. దుర్గం చెరువు 100 ఎకరాల్లో ఉండగా.. 84 ఎకరాలకు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:14

శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన వ్యాఖ్యలు

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వులను వాడారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు రావడం సంచలనంగా మారింది. భక్తులను ఇది ఆవేదనకు గురిచేస్తోంది. ఈ అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాల ఉన్నాయనే ఆరోపణలు యావత్తు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ కోట్లాది మంది భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. తాజాగా, ఈ అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్రంగా స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం అనేది అసహ్యకరమైనదని సద్గురు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు

భక్తులకు తినే ఆలయ ప్రసాదంలో జంతు మాంసం అనేది అసహ్యకరమైంది. అందుకే దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ ద్వారా కాకుండా భక్తులతో నడపాలి.. భక్తి లేనిచోట పవిత్రత ఉండదు.. హిందూ దేవాలయాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కాకుండా భక్తులైన హిందువులతో నిర్వహించాల్సిన సమయం వచ్చింది’ అని సద్గురు పేర్కొన్నారు. మరోవైపు, లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివేదిక ఆదారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సనాతనధర్మంపై జరిగిన చాలా ప్రమాదకమైన కుట్ర అని ఆయన అభివర్ణించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకీ కల్తీ నెయ్యిని వినియోగించారని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని సీఎం చంద్రబాబునాయడు గతవారం చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అయితే, వీటిని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు తోసిపుచ్చారు. లడ్డూ ప్రసాదానికి కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి, సేంద్రీయ ఉత్పత్తులనే వాడామని ఆయన చెప్పారు.

కాగా, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి.. శ్రీవారి క్షేత్రాన్ని అపవిత్రం చేశారని, దీనిపై మాజీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ యువజన విభాగం ఆదివారం ఆయన నివాసాన్ని ముట్టించింది. అటు,శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. వాస్తవానికి శ్రీవారికి ఏటా జరిగే పవిత్రోత్సవాలతోనే ఇలాంటి అపచారాలకు పరిహారం లభిస్తుందని, కానీ భక్తుల్లో నమ్మకం కలిగించడానికే శాంతిహోమం చేపట్టామని ఆయన చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:07

లడ్డూ వివాదంలో కేంద్రం సీరియస్.. ఆ కంపెనీకి నోటీసులు..

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. నెయ్యి తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించని తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో స్వామివారి ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.

ఈ మేరకు వాటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించింది. వాటిలో మూడు కంపెనీలు సరైన ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. అయితే తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు సరైన ప్రమాణాలు పాటించకుండా కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న ఆ కంపెనీకి FSSAI(ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు.. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. అయితే కొన్ని రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని, తాను ఏ తప్పూ చేయలేదని కరుణాకర్ రెడ్డి చెప్పారు. తన హయాంలో జంతువుల కొవ్వు కలపలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏదైనా తప్పు చేసి ఉంటే తనతోపాటు కుటుంబం మెుత్తం నాశనం అయిపోతామని చెప్పుకొచ్చారు. కుట్రపూరితంగానే కూటమి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కరుణాకర్ రెడ్డి చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 18:55

హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఆక్రమణ కూల్చివేతలపై దూసుకెళ్తున్న హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై న్యాయస్థానం స్టే విధించింది. స్థానికల పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు అయింది. దీంతో హైకోర్టు హైడ్రాకు కీలక సూచనలు చేసింది.

దుర్గం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ హైడ్రా స్థానికులకు నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నోటీసుల పైన స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జారీ చేసిన ప్రిలిమరి నోటిఫికేషన్ పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రొటెక్షన్ కమిటీ స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అక్టోబర్ 4న ప్రొటెక్షన్ కమిటీ ముందు నివాసితులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.

అదే సమయంలో అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల లోపు నోటిఫికేషన్ జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు తాజా ఆదేశాలతో దుర్గం చెరువు నివాసితులకు తాత్కాలికంగా ఊరట దక్కింది. మరోవైపు నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మాదాపూర్ లో హైడ్రా సిబ్బంది కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను కూల్చివేశారు.

పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. అనంతరం కావూరి హిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. అయితే కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్ల పాటు తాము లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు వాదిస్తున్నారు. గడువు మూగీకముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా హైకోర్టు హైడ్రాకు ఇచ్చిన ఆదేశాలతో దుర్గం చెరువు వాసులకు రిలీఫ్ దక్కింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 18:41

భారత్‌కు గుడ్ న్యూస్.. ఆ సంపదను తిరిగిచ్చేస్తున్న అమెరికా..

 4 వేల పురాతన వస్తువులను అమెరికా.. భారత్‌కు ఇచ్చేయడానికి సిద్ధమైంది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.

 4 వేల పురాతన వస్తువులను (4 Thousand Antiques) అమెరికా (America).. భారత్‌ (India)కు ఇచ్చేయడానికి సిద్ధమైంది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అమెరికా పర్యటన (America Tour) సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2వేలు బీసీఈ (BCE) – 19వేల సీఈ (СЕ) - వరకు అంటే 4వేళ ఏళ్ల పరిధిలోని యాంటిక్విటీస్ ఉన్నాయని భారత్ అధికారులు తెలిపారు. ఇండియాకు రానున్న తూర్పు భారతంలోని టెర్రకోట బొమ్మలు, కళాకృతులు; ఇతర ప్రాంతాల్లోని రాతి, లోహ, కలప, ఐవరీ శిల్పాలు.. త్వరలోనే వీటిని భారత్‌కు తరలించనున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు.

కాగా ‘‘క్వాడ్‌ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్‌ అభిమతం. మేం(క్వాడ్‌ కూటమి) నిలబడతాం.. బలపడతాం’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో ఆదివారం జరిగిన క్వాడ్‌ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లక్రితం ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌ కలిసి క్వాడ్‌ కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే..! ఈ కూటమి ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ, బైడెన్‌తోపాటు.. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనెస్‌, జపాన్‌ ప్రధాని కిషిదా పాల్గొన్నారు.

క్వాడ్‌కు వ్యతిరేకంగా చైనా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. మోదీ ఆ దేశం పేరును ప్రస్తావించకుండా తాము అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమ సందేశం ఒక్కటేనని, బలంగా నిలబడి, సభ్యదేశాల సహకారానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు చోటుచేసుకుంటున్న సమయంలో క్వాడ్‌ కూటమి ఏర్పాటైంది. మానవాళి శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కంకణబద్ధమైంది. క్వాడ్‌ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయి.

ప్రపంచానికి మేలు జరిగేలా ఇంకా సమర్థంగా పనిచేయాలని నిర్ణయించాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరించేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు ఆయన ‘క్వాడ్‌ క్యాన్సర్‌ మూన్‌షాట్‌ ఈవెంట్‌’లో మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు, గుర్తింపు, చికిత్సకు భారత్‌ తరఫున రూ.62.61 కోట్ల(7.5 మిలియన్‌ డాలర్లు)ను అందజేస్తామని ప్రకటిస్తూ.. తమ లక్ష్యం ‘ఒక భూగోళం.. ఒక ఆరోగ్యం’ అంటూ నినదించారు. ఈ రీజియన్‌లోని దేశాలకు 4 కోట్ల డోసుల క్యాన్సర్‌ టీకాలను అందజేస్తామన్నారు.

క్వాడ్‌ దేశాధినేతల తదుపరి సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఆవిర్భవించగా.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, భారత్‌లలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి ఈ సంవత్సరం భారత్‌ వంతు కాగా.. తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో తన స్వస్థలంలో సమ్మిట్‌కు అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విజ్ఞప్తి చేశారు. దాంతో.. వచ్చే ఏడాది సదస్సును భారత్‌లో ఏర్పాటు చేయాలని తీర్మానించారు

విల్మింగ్టన్‌లో శనివారం బైడెన్‌-మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే..! ఈ చర్చల్లో భాగంగా మోదీపై బైడెన్‌ పొగడ్తల వర్షం కురిపించినట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. శాంతికోసం ఆయన చేస్తున్న కృషిని అభినందించినట్లు వివరించారు. కొవిడ్‌ సమయంలో ‘టీకా మైత్రి’ మొదలు.. ఇటీవలి జీ20 సమ్మిట్‌ వరకు ప్రపంచ క్షేమం కోసం భారత్‌ చేస్తున్న కృషిని కొనియాడినట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల భేటీలో.. సెమీకండక్టర్లు మొదలు.. అంతరిక్షం దాకా పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిపారు. భారత్‌-అమెరికా మధ్య కీలకమైన రక్షణ, క్లీన్‌ ఎనర్జీ, గ్లోబల్‌ హెల్త్‌పై ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి కృషిచేస్తానని బైడెన్‌ పేర్కొన్నట్లు వివరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 18:34

బీహార్‌‌లా తెలంగాణను మారుస్తున్నారు.. హరీష్ ఆగ్రహం

పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి

సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి (Former Minister Sunitha Laxma reddy) ఇంటిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తోందన్నారు. ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని మండిపడ్డారు. ‘‘మొన్న సిద్దిపేటలో తన కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండాల రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతోంది’’ అని విమర్శించారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బీహార్ లాగా తెలంగాణను మారుస్తున్నారన్నారు.

సునీత లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి అని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లుగా సీఎం రేవంత్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్నారు. ‘‘ఎమ్మెల్యే ఇంటి ముందు టపాయలు కాల్చడం, ఇంట్లోకి టపాకాలయు విసరడం, ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య’’ అని అన్నారు. ఈ విషయంపై ఎస్పీ, ఐజీతో మాట్లాడానని.. వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే కింద పడిపోయారన్నారు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నేతలు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేదని... కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారన్నారు. ‘‘పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి. దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. హింసాత్మక ఘటనలు జరగకుండా మేం జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం. అదే విధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది. ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తాం’’ అని హరీష్‌ రావు స్పష్టం చేశారు.

ఈరోజు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక నాయకులు చేరుకున్నారు. దాడి వివరాలను ఎమ్మెల్యే‌ను అడిగి తెలుసుకున్న హరీష్.. సునీత లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి దాడికి కారకులైన వారిని అరెస్టు చేయాలని మాజీ మంత్రి కోరారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో హరీష్‌రావు ఫోన్లో మాట్లాడారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 10:57

హైడ్రా ఇంత ఆగం ఎందుకు.. గంట కూడా టైమ్ ఇవ్వలేరా..!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించింది. దీంతో హైడ్రా చెరువుల్లోని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి. అయితే కొంత మంది బిల్డర్లు.. చెరువులు కబ్జా చేసి అపార్ట్ మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి విక్రయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన చేశారు.

బఫర్, ఎఫ్టీఎల్ ఉన్న మధ్యతరగతి వారి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కట్టడాలు, కొత్తగా నిర్మిస్తూన్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. తాజాగా ఆదివారం కూకట్ పల్లిలోని నల్ల చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న వాణిజ్య కార్యాకాలాపాలు కొనసాగిస్తున్న నిర్మాణాలను హైడ్రా పడగొట్టింది. ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయితే ఇక్కడే నివాసం ఉంటున్న ఇళ్లను మాత్రం హైడ్రా ముట్టుకోలేదు. కేవలం కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే హైడ్రా కూల్చివేసింది.

అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నల్ల చెరువును కొంత మంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఆక్రమించారు. భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందడం కోసం మధ్య తరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీజ్ కు తీసుకున్నారు. అందులో లక్షలు పెట్టి తాత్కాలిక షేడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలా మంది అప్పులు చేసి, బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు.

ఆదివారం సడెన్ గా హైడ్రా అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని.. నిర్మాణాల్లోని వస్తువులను తీసుకునే వారమని బాధితులు చెబుతున్నారు. ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ.. కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా.. హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. తమకు శనివారం సాయంత్రమే సమాచారం ఇచ్చారని వాపోయారు. మరోవైపు తము నోటీసులు ఇచ్చామని హైడ్రా పేర్కొంది. ఈ ఘటనలో చెరువు కబ్జా చేసి లీజ్ కు ఇచ్చిన ఓనర్లు లాభం పొందారు. కష్టాన్ని నమ్ముకున్నవారు అన్యాయం అయిపోయారు.వారికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు.. బడా బాబులకు భూమి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 10:51

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయి. రాష్ట్రంలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడగా, మయన్మార్ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో రెండో ఆవర్తనం కొనసాగుతోందని, వీటి ప్రభావంతో నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అక్కడి సమీపంలోని అండర్‌పాస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్తున్న కారు చిక్కుకుపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు.