Supreme Court: అమరావతి కేసులపై విచారణ మార్చి 28నే.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
దిల్లీ: రాజధాని అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి (AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది..
విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని.. జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది వరకు పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. 28వ తేదీ ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని.. నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపరాదని ధర్మాసనం తెలిపింది. దీనిపై సీజేఐ సర్క్యులర్ ఉందని గుర్తుచేసింది. ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని.. ఆ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ కేఎం జోసెఫ్ చెప్పారు..
అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్ అన్నారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందని చెప్పారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.
అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి గత సోమవారమే జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 3 రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు..
Mar 02 2023, 16:58