TeluguCentralnews

Feb 21 2023, 11:54

Turkey : టర్కీలో మరో భూకంపం... రిక్టర్ స్కేల్ పై 6.4 గా నమోదు

తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. హతాయ్‌ ప్రావిన్సులో సోమవారం మరోసారి తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ మేరకు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వివరాలు వెల్లడించింది. ఈ తీవ్రతకు ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయాయి. భూకంపం ప్రభావం సిరియా, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది. ఈ ప్రమాదం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రత అధికంగా ఉండేలా తెలుస్తోంది. లటాకియాలో రెండుసార్లు దాదాపు 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలు ఇళ్లు, హోటల్, భవనాల నుంచి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

ఫిబ్రవరి 6న టర్కీ, పొరుగున ఉన్న సిరియాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ వరుస భూకంపాలతో 46 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. భూకంప ధాటికి చెల్లాచెదురైన టర్కీకి పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయక చర్యల్లో పాల్గొంటోంది. భారత్‌ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి తమకు ఎంతో సాయం చేస్తున్నాయని, అండగా ఉంటున్నారని ఆ దేశ ప్రజలు చెప్పారు.

ప్రకృతి బీభత్సానికి టర్కీ, సిరియాలు విలవిల్లాడిపోయాయి. రెండు వారాల క్రితం తెల్లవారు జామున వచ్చిన పెను భూకంపం ధాటికి రెండు దేశాలు వణికిపోయాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జనాలు శిథిలాల కిందే ప్రాణాలు కోల్పాయారు. ఈ విపత్తు ధాటికి.. రెండు దేశాల్లో కలిపి చనిపోయిన వారి సంఖ్య 46 వేలు దాటింది. టర్కీలోనే 40 వేలకు మందికి పైగా మృతి చెందారు. సిరియాలో 5800 కు పైగా చనిపోయారు.

భూకంపం కారణంగా 1,05,794 భవనాలు ప్రభావితం అయ్యాయి. ఇప్పటికే 20,662 భవనాలు పూర్తిగా కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియాలోనూ ఆస్తినష్టం భారీగానే ఉంటారు. సిరియాలోనూ భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుందని వెల్లడించింది. భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం కావడంతో అక్కడి పర్యావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. టర్కీలో సహాయక చర్యల కోసం భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ దోస్త్‌’ ముగిసింది.

TeluguCentralnews

Feb 16 2023, 14:50

అల్‌ఖైదా కొత్త చీఫ్‌ తలపై భారీ రివార్డు..

మాజీ ఈజిప్షియన్ ప్రత్యేక దళాల అధికారి, అల్ ఖైదాలో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉన్న సైఫ్ అల్-అదెల్ తలపై 10 మిలియన్ల డాలర్ల బహుమతిని యూఎస్ ప్రకటించింది. ఇప్పుడు కొత్త యూఎన్‌ నివేదిక ప్రకారం, ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా కొత్త చీఫ్‌గా సైఫ్‌ అల్‌-అదెల్‌ పోటీలేని నాయకుడిగా ఉన్నట్లు వెల్లడించింది. 2011లో దాని వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్యకు గురైనప్పటి నుండి ఉగ్రవాద సంస్థను అమెరికా దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా గత సంవత్సరం కాబూల్‌లో యూఎస్ క్షిపణి దాడిలో మరణించినట్లు విశ్వసిస్తున్న ఐమాన్ అల్-జవహిరీకి అల్ ఖైదా అధికారికంగా వారసుడిని ప్రకటించలేదు. జనవరిలో యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారి జవహిరి వారసత్వం గురించి అస్పష్టంగానే ఉందని చెప్పినప్పటికీ, సమూహం నుంచి వచ్చే నష్టాలను అంచనా వేసే ఐక్యరాజ్యసమితి నివేదిక ఇలా చెప్పింది. నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన చర్చలలో, అనేక సభ్య దేశాలు సైఫ్ అల్-అదెల్ నాయకుడిగా అల్‌ఖైదా పనిచేస్తోందని యూఎన్‌ అభిప్రాయపడింది.

జవహరి మరణం తర్వాత ప్రాణాంతక కార్యకలాపాలను జాగ్రత్తగా ప్లాన్ చేయగల, జిహాదీ నెట్‌వర్క్‌ను అమలు చేయగల వ్యూహాత్మక నాయకుడిని ఎన్నుకోవాలని సమూహంపై అల్ ఖైదా ఒత్తిడి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. సైఫ్‌ అల్‌-అదెల్‌ తన పూర్వీకుల మాదిరాగా కాకుండా.. అల్ ఖైదాను ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఉగ్రవాద సమూహంగా మార్చడంలో సహాయపడిన అదెల్ రహస్యంగా దాడులను ప్లాన్ చేసినట్లు నిపుణులు అంటున్నారు. టాంజానియా, కెన్యాలోని యూఎస్‌ రాయబార కార్యాలయాలపై బాంబు దాడుల్లో అతని పాత్రకు సంబంధించి యూఎస్ ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ నవంబర్ 1998లో అదెల్‌పై అభియోగాలు మోపింది. ఈ బాంబు దాడుల్లో 224 మంది పౌరులు మరణించగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. 

ఆఫ్రికాలో అల్‌ఖైదా కార్యకలాపాలు, శిక్షణా శిబిరాలను అతను ఏర్పాటు చేశాడు. 2002లో పాకిస్తాన్‌లో యూఎస్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యతో అతనికి సంబంధం ఉంది. అదెల్ ఇరాన్‌లో ఉన్నాడని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. డిపార్ట్‌మెంట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సైఫ్‌ అల్-అదెల్ గురించిన సమాచారం అందించిన వారికి 10 మిలియన్ల డాలర్ల వరకు అందిస్తామని ప్రకటన విడుదల చేసింది.

ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ ప్రధాన అంగరక్షకుడిగా, తీవ్రవాదుల సీనియర్ శిక్షకుడు, జిహాదీ ఉద్యమంపై నిపుణుడైన అదెల్ తన సుదీర్ఘ తీవ్రవాద కార్యకలాపాలను 1981లో ప్రారంభించాడని సమాచారం. ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ అల్-సదాత్‌ను ఇస్లామిస్ట్ సైనికులు చేసిన హత్యలో ప్రమేయం ఉన్నట్లు అనుమానించబడ్డాడు. కైరోలో కవాతు టెలివిజన్‌లో ప్రసారం చేయబడింది. అల్‌ఖైదా అమెరికాపై సెప్టెంబరు 11, 2001న జరిపిన విమానదాడుల్లో దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అల్‌ఖైదాను అతను స్వాధీనం చేసుకున్నాడు.

TeluguCentralnews

Feb 12 2023, 12:14

ఇదో రకమైన సంప్రదాయం.. మొగుళ్లను తన్నిన తరువాతే భోజనం పెట్టే పెళ్లాలు..!

ప్రపంచం అంతుచిక్కని రహస్యాలకు నెలవు. లక్షలాది జాతులకు ఆవాసం భూమి. విభిన్న జాతుల జంతువులు ఉన్నట్లు.. మనుషుల్లోనూ విభిన్న జాతుల వారు, తెగల వారు ఉంటారు. ఈ తెగలలో అనేక వింత సంప్రదాయాలు అనుసరించే వారు కూడా ఉన్నారు. వాటి గురించి తెలిస్తే కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ తెగలు విభిన్న ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రత్యేక సంప్రదాయాలను అనుసరిస్తాయి. వారి ఆచార సంప్రదాయాలు విన్నా, చూసినా గూస్‌బంప్స్ వస్తాయి. వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇవాళ మనం అలాంటి వింత ఆచారాన్ని పాటించే ఓ తెగ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తెగలో మహిళలు తమ భర్తలను తన్నిన తరువాతే భోజనం వడ్డిస్తారు. లేదంటే ఆ పూటకు పస్తులేనట. ఈ వింత ఆచారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నేపాల్ దేశంలోని థారు తెగ ప్రజల ఆచార సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ఒకప్పుడు భారతదేశంలో నివసించేవారు అయినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అక్కడ సెటిల్ అయ్యారు. నాటి నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను ఈ తెగ ప్రజలు నేటికి పాటిస్తుంటారు. ఈ తెగ ప్రజలది మాతృస్వామ్య సంప్రదాయం. తల్లే ఇంటికి అధినేత్రి. ఆమె ఆజ్ఞలను అందరూ పాటించి తీరాల్సిందే.

భర్తను తన్నిన తరువాతే అన్నం..

ఈ తెగకు సంబంధించి, 1576 సంవత్సరంలో హల్దీఘాటి యుద్ధంలో, మహారాణా ప్రతాప్ సైన్యంలోని సైనికులు, రాజ ప్రముఖులు తమ కుటుంబాల భద్రత కోసం హిమాలయాల దిగువ ప్రాంతాలకు వెళ్లారు. అదే తెరాయ్ ప్రాంతం. ఈ ప్రాంతంలో వారు నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత దీనిని తరు అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత రాజ కుటుంబాలకు చెందిన మహిళలు తమ భద్రతకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి, సదరు మహిళలు తమ కంటే తక్కువ స్థానాల్లో ఉన్న సైనికులను వివాహం చేసుకున్నారు.

అయితే ఈ వివాహం పట్ల ఈ స్త్రీలందరూ ఏమాత్రం సంతోషంగా లేరు. దీంతో భర్తకు ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదు. వారు అగ్రవర్ణ, రాజకుటుంబానికి చెందినవారనే గర్వంతో ఉండేవారు. ఈ గర్వంలోనే సదరు మహిళలు తమను తాము కుటుంబ పెద్దలుగా భావించారు. ఈ క్రమంలోనే తమ భర్తలను తన్నిన తరువాత మాత్రమే ఆహారం పెట్టేవారు. ఇలా ఆహారం వడ్డించడం ద్వారా వారి రాజదర్పాన్ని అణచుకునేవారు. అయితే, కాలం మారినా ఈ తెగ ఆచార సంప్రదాయాలు మాత్రం మారలేదు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

TeluguCentralnews

Feb 12 2023, 11:58

చైనా పనేనా..? కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా

అమెరికాలో చైనీస్ స్పై బెలూన్ కలకలం రేపిన కొన్ని రోజుల్లోనే ఆకాశంలో అనుమానాస్పద వస్తువుల గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా కెనడా గగనతంలో మరో అనుమానాస్పద ఉన్న ‘అన్ ఐటెంటిఫైడ్ అబ్జెక్ట్’ను గుర్తించారు.. దీన్ని శనివారం కెనడా, అమెరికా కలిసి కూల్చేశాయి. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ధృవీకరించారు. యూఎస్ కు చెందిన ఎఫ్- 22 విమానం ఈ వస్తువును కూల్చేసింది. రెండు రోజుల్లో ఇది రెండో ఘటన. కెనడా భద్రతాదళాలు దీనికి సంబంధించిన శకలాలను సేకరించి, విశ్లేషించే పనిలో ఉన్నారు.

ఈ ఘటనలపై కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తో మాట్లాడారు. చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన తర్వాత అనుమానాస్పద వస్తువులు అమెరికా, కెనడా గగనతలాల్లో కనిపిస్తున్నాయి. ఇవి కూడా చైనా పనేనా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ ఘటనపై అమెరికా, కెనడా అధినేతలు బిడెన్, ట్రూడో శనివారం మాట్లాడుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అలస్కా సరిహద్దుల్లో యూకాన్ ప్రాంతంలో ఈ అన్ఐటెంటిఫైడ్ వస్తువును కూల్చేశారు.

ఇటీవల చైనాకు చెందిన బెలూన్ కూల్చేసిన తర్వాత అమెరికా-చైనా మధ్యలో ఉద్రిక్తత ఏర్పడింది. చైనా గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు అమెరికా నిందించింది. 5 ఖండాల్లో 40 దేశాలపై చైనా బెలూన్ సాయంతో నిఘా పెట్టిందని.. చైనా ఆర్మీ బెలూన్ ఫ్లీట్ నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుతం కూల్చేసిన బెలూన్ లోని పరికరాలను విశ్లేషించే పనిలో ఉంది అమెరికా. ఈ బెలూన్ నిర్మాణానికి సహకరించిన కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చింది. అమెరికాతో పాటు భారత్, జపాన్, వియత్నాం, ఫిలప్పిన్స్ ఇలా పలు దేశాలపై నిఘా పెట్టినట్లు చైనాపై ఆరోపణలు వస్తున్నాయి.

TeluguCentralnews

Feb 12 2023, 11:27

38ఏళ్ల కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. ఆమె చెప్పిన ప్రాబ్లమ్ విని అవాక్కైన డాక్టర్లు..

ఇది ఒక్క చైనాలోనే కాదు, ప్రపంచంలోని తల్లిదండ్రులందరికీ తమ పిల్లలపై ఇలాంటి ఆందోళనలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు వారి వయస్సును బట్టి అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. వారి జీవితం ఆ అంచనాలకు అనుగుణంగా సాగనప్పుడు, వారు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. అప్పుడు కొందరు దేవుడి దగ్గరకు వెళతారు. మరికొందరు డాక్టర్ దగ్గరకు వెళతారు. ఒక చైనా తల్లి తన 38 ఏళ్ల కొడుకు గురించి చాలా ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా ఇష్టపడలేదని, పెళ్లి చేసుకోవటం లేదని ఆందోళన చెందుతోంది. దాంతో ఆమె తన కొడుకును సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లింది. నివేదిక ప్రకారం, 2020 నుండి 2023 ఈ నూతన సంవత్సరం ఇప్పటి వరకు ఆ మహిళ తన కొడుకును మానసిక ఆసుపత్రికి క్రమం తప్పకుండా తీసుకువెళుతోంది. దీంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు చివరగా తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు. తనలోని ఫిలింగ్స్‌ని అతడు ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన కష్టాలను పంచుకున్నాడు. సెంట్రల్ చైనా ప్రావిన్స్ హెనాన్‌కు చెందిన వాంగ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, నెటిజన్లు పెళ్లి గురించి, దాని వల్ల కలిగే ఒత్తిడి గురించి చర్చించుకుంటున్నారు.

తమ కొడుకు ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా ఇంటికి తీసుకురాలేదని వాంగ్‌ తల్లి వాపోయింది.. అతడికి మానసిక రుగ్మత ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇలా చేశానని చెప్పింది. కానీ కొడుకుకి ఎలాంటి ఇబ్బంది లేదు. మానసికంగా దృఢంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. వీడయోలో అతడు చెప్పిన మాటలు…

‘నన్ను నేను పెళ్లికానివాడిగా గుర్తించాలనుకోవటం లేదన్నాడు. కానీ నేను నా పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. అలాగే ఇంతవరకు సరైన వ్యక్తిని కలవలేదు. నేనేం చెయ్యాలి.. నాకు పెళ్లి కాలేదని, మా అమ్మ పగలు రాత్రి నిద్రహారాలు మానుకుని ఆందోళన చెందుతోంది. ఇది నాకు బాధగా ఉంది’ అంటూ వాంగ్ అన్నారు.

అయితే, ఇంతవరకు పెళ్లి కాని ఈ వాంగ్ టెన్నిస్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఆసుపత్రికి వెళ్లాలని తల్లి పదే పదే పట్టుబట్టినప్పుడు, అతను ఆమెకు ఓదార్పు, ధైర్యాన్ని కల్పించాడు. అమ్మాయిలతో పరిచయం, స్నేహం, పెళ్లి విషయంలో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పుకున్నాడు. అంతేకాదు, అతడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు కూడా తెలిపారు. అయితే ఈ తల్లి రోదనకు ఏం చేయాలి? పెళ్లి అనేది వారి ఇష్టం. కాదా మనం ఎలా తీర్చగలం అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.

TeluguCentralnews

Feb 12 2023, 10:28

వరల్డ్​వార్​–2 నాటి బాంబు ఇంగ్లాండ్​లో పేలింది

రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబు ఒకటి గ్రేట్​ యార్​మౌత్​ ఏరియాలో బయటపడింది. నార్ ఫోక్ టౌన్​లోని రివర్​ క్రాసింగ్​ వద్ద సుమారు 250 కిలోలు ఉన్న బాంబును గుర్తించారు. డిఫ్యూజ్​ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బాంబు పేలిపోయిందని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు. నార్​ ఫోక్ టౌన్​లో రివర్​క్రాసింగ్​ వద్ద మరమ్మత్తులు చేస్తున్న కాంట్రాక్టర్​ మంగళవారం నాడు ఈ బాంబును గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని పరిశీలించిన అధికారులు అది రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబు అని తేల్చారు. బాంబు బరువు సుమారు 250 కిలోలు ఉంటుందని, 3.2 అడుగుల పొడవు ఉందని చెప్పారు.

ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఆంక్షలు విధించి, చుట్టుపక్కల ఏరియాలోని జనాలను ఖాళీ చేయించారు. గురువారం బాంబును డిఫ్యూజ్​ చేసే ప్రక్రియ ప్రారంభించారు. బాంబుతో పాటు ఇతర ఆయుధాలను క్లియర్ చేసేందుకు ఆర్మీ స్పెషలిస్టులు స్లో బర్న్ టెక్నిక్​(పేలుడు పదార్థాలను మెల్లగా కాల్చేయడం లేదా నిర్వీర్యం చేయడం) ఉపయోగించారని చెప్పారు. ఈ ప్రక్రియలో అనుకోకుండా బాంబు పేలిపోయిందని అధికారులు చెప్పారు. పేలుడు ధాటికి రివర్​ వాల్​ కొంత డ్యామేజ్​ అయిందని, నష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు. బాంబ్ బ్లాస్ట్ అనంతరం 400 మీటర్ల పరిధి వరకు ఆంక్షలు విధించామని నార్ ఫోక్ పోలీసు అధికారులు చెప్పారు. పబ్లిక్ సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. బాంబు పేలుడు ఘటనతో పట్టణవాసులు కొంత అసౌకర్యానికి గురయ్యారని, ఆయుధాలను క్లియర్ చేసే పనులు ముగిసిన తర్వాత ఆంక్షలను ఎత్తివేస్తామని వివరణ ఇచ్చారు.

TeluguCentralnews

Feb 12 2023, 10:24

China: ‘బాబ్బాబు వీర్యం దానం చేయండి.. డబ్బులైతే ఇస్తాం’.. చైనాలో వింత పరిస్థితి..

మొన్నటి దాకా జనాభా ఎక్కువై ఇబ్బందులు పడ్డ చైనా.. ఇప్పుడు అదే జనాభా కోసం తాపత్రయపడుతోంది. ఒక్కసారిగా పడిపోయిన జననాల రేటును పెంచేందుకు.. ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్ధులు, యువతకు భారీ ఆఫర్లు ఇస్తోంది డ్రాగన్ కంట్రీ. జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం చైనా. 2021 నాటికే ఆ దేశ జనాభా 141 కోట్లకు పైగా ఉన్నారు. అయినప్పటికీ ఆ దేశం కొన్ని వినూత్న సమస్యలను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి.. యువత శాతం తగ్గిపోవడం. రెండోది.. జనాభా పెరుగుదల శాతం భారీగా పడిపోవడం. చైనాలో ప్రస్తుతం జనాభా పెరుగుదల రేటు కేవలం 0.1శాతం మాత్రమే.

ఐదేళ్లుగా పడిపోతున్న జనాభా వృద్ధి రేటు..

ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దు అనే కండీషన్ కారణంగా ఆ దేశం ఊహించని సమస్యను కొని తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన డ్రాగన్.. పిల్లలు కనే విషయంలో సడలింపులు ఇచ్చింది. ఇద్దరు, ముగ్గురిని అయినా కనండి అంటూ ఆఫర్లు ప్రకటించింది. అయినప్పటికీ పెద్దగా మార్పు రాలేదు. గడిచిన ఐదేళ్లుగా జనాభా వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. 61 ఏళ్ల తర్వాత తొలిసారి చైనా జనాభా వృద్ధిలో ప్రతికూలత నమోదైంది. ఇలాంటి సమయంలో పుట్టిందే స్పెర్మ్ బ్యాంక్ కాన్సెప్ట్.

8 నుంచి 12 సార్లు వీర్యం దానం చేస్తే 4,500 యూవాన్లు..

వీర్యాన్ని దానం చేయాలంటూ యూనివర్సిటీ విద్యార్థులను చైనా స్పెర్మ్ బ్యాంకులు కోరుతున్నాయి. ఫిబ్రవరి 2న నైరుతి చైనాలోని యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ తొలిసారి దీనిపై ప్రకటన ఇచ్చింది. స్పెర్మ్ డొనేషన్ విధానం, రిజిస్ట్రేషన్ షరతులు, చెల్లించే ఫీజు గురించి అందులో స్పష్టంగా వివరించింది. 20 నుంచి 40 ఏళ్ల వయసు, 165 సెంటీమీటర్ల కంటే ఎత్తుగా ఉండి, డిగ్రీ పూర్తైన, లేదంటే చదువుతున్న ఆరోగ్యవంతులైన వారు దీనికి అర్హులు. స్పెర్మ్ దాతలు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. అలాంటి వారు 8 నుంచి 12 సార్లు వీర్యం దానం చేస్తే 4,500 యూవాన్లు.. అంటే మన కరెన్సీలో 55వేల రూపాయలు ఇస్తారు.

7,000 యువాన్లను ఇస్తామంటున్న షాంఘై స్పెర్మ్ బ్యాంక్..

షాంగ్జీ స్పెర్మ్ బ్యాంక్ కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. వీర్య దాతలు కనీసం 168 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని తెలిపింది. వారికి 5,000 యూవాన్లు చెల్లిస్తామని చెప్పింది. షాంఘై స్పెర్మ్ బ్యాంక్ ఇంకాస్త ఎక్కువ రేటే ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఒక్కో దాతకు 7,000 యువాన్లను ఇస్తామంటోంది. అయితే బట్టతల, దృష్టి లోపం, బీపీ వంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. స్మోకింగ్‌, మద్యం సేవించే అలవాట్లు లేనివారే అర్హులు. ఇలా చైనాలోని అన్ని స్పెర్మ్‌ బ్యాంకులు యూనివర్సిటీ విద్యార్థులకు ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో స్పెర్మ్ ఇచ్చేందుకు విద్యార్ధులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.

TeluguCentralnews

Feb 09 2023, 15:43

‘ఆ రోజు నా ప్యాంటులోకి ఎలుక దూరింది’.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన బిగ్ బీ..

బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా విడుదలై 43 ఏళ్లు ఆవుతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర ఘటనను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో తాను బెల్‌బాటమ్ ధరించిన సందర్భంలో తన ప్యాంటులోకి ఓ ఎలుక దూరిందని చెప్పుకొచ్చారు బిగ్ బీ. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకోవాలనుకున్న అమితాబ్ తన పోస్ట్‌తో ‘2+2=5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో..! బెల్ బాటమ్స్ ఇంకా అన్నీ !!! …. ఆ రోజుల్లో బెల్ బాటమ్‌లు చాలా ఆహ్లాదకరంగా ఉండేవి.. థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు, నా ప్యాంట్‌లోకి ఎలుక ఎక్కింది.. బెల్ బాటమ్‌కి ధన్యవాదాలు’ అంటూ లాఫింగ్ ఎమోజీలను కూడా జతచేశారు.

తమ అభిమాన హీరో ఇలాంటి సరదా విషయాన్ని తమతో పంచుకుంటే ఫ్యాన్స్ ఆగుతారా..? ఈ పోస్టుకు తమ స్పందనగా తెగ కామెంట్లు, లైకులు, షేర్లు చేస్తున్నారు. ఇంకా అమితాబ్ బచ్చన్ బెల్‌బాటమ్ లుక్స్‌ను గుర్తు చేసుకున్న నెటిజన్లు ఆ రోజుల్లో ఆయన స్టైల్ వేరే లెవెల్‌‌లో ఉండేదంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ‘‘నాటి నుంచీ నేటి దాకా మీలో ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు’’ అంటూ మరికొందరు బిగ్‌ బీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan 1980లో విడుదలైన ఈ చిత్రంలో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ తదితరులు నటించారు. ఈ మూవీకి రాకేశ్ కుమార్ దర్శకత్వం వహించగా సాండో ఎమ్ఎమ్ఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. ఇక కళారంగానికి బిగ్ బీ చేసిన సేవకు గాను భారత ప్రభుత్వం ఆయనను 2015లో పద్మ విభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే.

TeluguCentralnews

Feb 09 2023, 13:43

చికిత్స కోసం భారత్‌కు వచ్చి అదృశ్యమైన కువైట్ మహిళ.

Kuwait Woman: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన కువైట్‌కు చెందిన మహిళ(31) గత నెలలో కోల్‌కతా నుంచి తప్పిపోయింది. ఈ వారం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో సదరు మహిళ ఉన్నట్లు ఆచూకీ లభ్యమైంది ఓ పోలీసు అధికారి వెల్లడించారు. క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత, కోల్‌కతా పోలీసులు కువైట్ ఎంబసీకి సమాచారం అందించారు. ఒక వ్యక్తితో పాటు మహిళ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి అంతర్జాతీయ సరిహద్దును దాటింది. అప్పుడు కువైట్ రాయబార కార్యాలయం బంగ్లాదేశ్ సహాయం కోరింది. సోమవారం ఆ దేశంలోని ఒక ఇంటి నుండి మహిళను కనుగొని అక్కడి పోలీసులు ఆమెను కువైట్ అధికారులకు అప్పగించారని పోలీసు అధికారి తెలిపారు.

ఆ మహిళ జనవరి 20న తన తమ్ముడితో కలిసి కోల్‌కతాకు వచ్చి తూర్పు కోల్‌కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసింది. కొన్ని చర్మ సంబంధిత సమస్యలతో ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోల్‌కతాలోని ఇతర పర్యాటక ఆకర్షణలను సందర్శించిన తర్వాత, ఆమె తన తమ్ముడితో కలిసి జనవరి 27న అలీపూర్ జంతుప్రదర్శనశాలకు వెళ్లి అక్కడ నుంచి ఆమె తప్పిపోయిందని అధికారి వెల్లడించారు.

ఆమె సోదరుడు అలీపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన దాని గురించి ఆంగ్లంలో అధికారికి తెలియజేశాడు. కువైట్ సిమ్ ఉన్న ఆమె మొబైల్ ఫోన్ ట్రాక్ కాకపోవడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. “సీసీటీవీ ఫుటేజీలో ఆమె సూట్, క్యాప్, మాస్క్ ధరించిన వ్యక్తితో పసుపు రంగు టాక్సీలో ఎక్కినట్లు చూపించింది. కాబట్టి అతన్ని గుర్తించడం చాలా కష్టం. మేము టాక్సీ డ్రైవర్‌ను గుర్తించాము. వారు మార్క్విస్ స్ట్రీట్ (సెంట్రల్ కోల్‌కతాలో) సమీపంలో దిగినట్లు తెలుసుకున్నాము, ”అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అక్కడి నుంచి మరో టాక్సీలో బంగ్లాదేశ్ సరిహద్దుకు పొరుగున ఉన్న నార్త్ 24 పరగణాల జిల్లాలోని బంగాన్ సమీపంలోకి చేరుకున్నారు.

అనంతరం భారత భూభాగంలో వారు కనిపించలేదు. వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత బంగ్లాదేశ్‌ జాతీయుడైన ఓ వ్యక్తి ఫొటో లభించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఆ వ్యక్తిపై రెడ్ అలర్ట్ ప్రకటించారు. కోల్‌కతా పోలీసులు అలీపూర్ పోలీస్ స్టేషన్, యాంటీ రౌడీ సెక్షన్ సిబ్బందితో మాట్లాడగా.. వారు అంతర్జాతీయ సరిహద్దును దాటినట్లు స్పష్టంగా తెలియడంతో వారు న్యూఢిల్లీలోని కువైట్ ఎంబసీకి సమాచారం అందించారు. మహిళను రక్షించడంలో తమ అధికారుల పాత్రను ప్రశంసిస్తూ ఎంబసీ కోల్‌కతా పోలీసులకు ప్రశంసా పత్రాన్ని పంపిందని అధికారి తెలిపారు. ఆమె అందగత్తె కావడంతో ఆమెకు ఏమైనా జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కువైట్ పౌరురాలు లభించిన బంగ్లాదేశ్‌లోని లొకేషన్ గురించి మీడియాతో ఎలాంటి వివరాలు పంచుకోలేదు.

TeluguCentralnews

Feb 09 2023, 12:27

*మసీదులో మహిళలు నమాజ్ చేయవచ్చని ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది*


మహిళలు మసీదుకు వచ్చి ప్రార్థనలు చేయకూడదా? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ప్రకారం, మసీదులో ప్రార్థనలు చేయడానికి మహిళలకు అనుమతి ఉంది.వాస్తవానికి మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని ఏఐఎంపీఎల్‌బీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదులోకి ప్రవేశించడానికి స్వేచ్ఛ ఉందని, మసీదులో ప్రార్థనలు చేసే హక్కును వినియోగించుకోవాలా వద్దా అనేది వారి ఇష్టం అని బోర్డు పేర్కొంది.దీనితో పాటు, ఇస్లాంలో మహిళలు రోజుకు ఐదుసార్లు సామూహికంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పబడింది.

AIMPLB కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఈ సమాచారం ఇచ్చింది. ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వెళ్లేందుకు సంబంధించిన పిటిషన్‌కు సంబంధించి ఈ అఫిడవిట్ దాఖలు చేయబడింది. న్యాయవాది MR శంషాద్ ద్వారా దాఖలు చేయబడిన అఫిడవిట్, ప్రార్థనా స్థలాలు (ప్రస్తుత కేసులో ఉన్న మసీదులు) పూర్తిగా ప్రైవేట్ సంస్థలు మరియు మసీదుల 'ముత్తవలీలు' (నిర్వాహకులు) నియంత్రణలో ఉన్నాయని పేర్కొంది.AIMPLB అనేది నిపుణుల సంఘం అని, దానికి ఎలాంటి అధికారాలు లేవని, ఇస్లాం సూత్రాలపై సలహాలు మాత్రమే జారీ చేయగలదని అఫిడవిట్ పేర్కొంది. ఇస్లాం అనుచరుల మత గ్రంథాలు, సూత్రాలు, మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటే మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు చేసేందుకు మహిళలకు అనుమతి ఉందని అఫిడవిట్ పేర్కొంది.

ఇస్లాం సూత్రాల ప్రకారం, ముస్లిం మహిళలు ఇంట్లో నమాజ్ చేసినా లేదా మసీదులో నమాజ్ చేసినా, వారికి సమానమైన సవాబ్ (మెరిట్) లభిస్తుందని పేర్కొంది.

భారతదేశంలోని మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆరోపించిన నిషేధానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని మరియు దీనిని చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫరా అన్వర్ హుస్సేన్ షేక్ 2020లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని మీకు తెలియజేద్దాం. ఈ పిటిషన్ మార్చిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.