ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు..

ముంబై నటి జత్వానీ కేసులో పోలీస్ అధికారులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

కేసును సీఐడీకి అప్పగించారని, కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు.

ముంబై నటి జత్వానీ(Jatwani) కేసులో పోలీస్ అధికారులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు (AP High Court)లో విచారణ జరిగింది. కేసును సీఐడీకి అప్పగించారని, కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు.

కేసు డిస్పోజ్ అయ్యే వరకూ పోలీస్ అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యే విధంగా చూడాలని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు అభ్యర్థించారు. ఈ అంశాలను నోట్ చేసుకున్న న్యాయస్థానం కేసు విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది.

ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు

ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు.. ఈసారి ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశం ఇచ్చారు. దీంతో తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల వారు కూడా భారీగా టెండర్లు వేశారు. వారికి కొన్ని వైన్ షాపులు దక్కాయి. ఏపీలోనే ఎక్కువ డిమాండ్ ఉన్న మద్యం దుకాణాలు తెలంగాణ వ్యాపారులకు దక్కడం ఇప్పడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.

ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 97వ నంబరు దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ మద్యం దుకాణాలకు రాష్ట్రంలోనే అత్యధికంగా డిమాండ్ ఉంది. అయితే.. ఈ మూడు షాపుల లైసెన్సులు లాటరీలో తెలంగాణ రాష్ట్రం వారినే వరించాయి.

96వ నంబరు వైన్ షాపు ఖమ్మం జిల్లా ఖానాపురం గ్రామానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు దక్కింది. 97వ నంబరు మద్యం దుకాణాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూష దక్కించుకున్నారు. 81వ నంబరు దుకాణం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు దక్కింది. ఎక్కువ డిమాండ్ ఉన్న షాపులు తమకు దక్కడంతో వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపారులు కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు. విజయవాడలోని 14, 18వ నంబరు వైన్ షాపులు మధ్యప్రదేశ్‌‌కు చెందిన రాహుల్‌ శివ్‌హరే, అర్పిత్‌ శివ్‌హరేకు దక్కాయి. మచిలీపట్నంలో ఓ దుకాణాన్ని కర్ణాటకకు చెందిన మహేష్‌ బాతే, మరో దుకాణాన్ని ఢిల్లీ వాసి లోకేశ్‌ చంద్‌ దక్కించుకున్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన లిక్కర్ వ్యాపారులకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి దుకాణాలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 10 మద్యం దుకాణాలు కర్ణాటక, తెలంగాణలకు చెందిన వ్యాపారులు దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులోని 80వ నంబరు దుకాణం పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తికి దక్కింది. ఎన్‌.రామకృష్ణ పదేళ్లుగా పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కొంతమందితో కలిసి దరఖాస్తు చేయగా.. లిక్కర్ లక్కు వరించింది.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, పూర్తి తేదీలివే

దేశంలో ఇటీవలే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ నెలలో ముగియనున్నాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న, జార్ఘండ్ అసెంబ్లీ గడువు జనవరి 5న ముగియనుంది. మహారాష్ట్రంలో మొత్తం 285 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 9 కోట్ల 63 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 186 పోలింగ్ బూత్‌లు, 29 వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 

మహారాష్ట్రలో అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 4 నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 285 అసెంబ్లీ స్థానాలను సింగిల్ ఫేజ్‌లో జరగనున్నాయి. 

ఇక 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మొత్తం 2.86 కోట్ల ఓటర్లున్నారు. జార్ఖండ్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 18న వెలువడనుంది. అక్టోబర్ 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. నవంబర్ 13న పోలింగ్ ఉంటుంది. ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.

ఇక రెండో దశ నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడనుండగా నామినేషన్లు అక్టోబర్ 29 వరకూ స్వీకరిస్తారు. అక్టోర్ 30 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 20 పోలింగ్, నవంబర్ 23న ఫలితాలు వెలుడనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరగనున్నాయి.

ఏపీలో ఈ రోజుతో మూతపడనున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు

ఏపీలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈరోజుతో మూతపడనున్నాయి. రేపటి నుంచి ప్రైవేట్ వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా... మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. లాటరీ పద్ధతి ద్వారా నిన్న మద్యం దుకాణాలను కేటాయించారు.

మద్యం దుకాణాలను సొంతం చేసుకున్నవారు రేపటి నుంచి షాపులను తెరుచుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటలకు కొత్త వైన్స్ తెరుచుకోనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ తెరిచి ఉంటాయి.

మద్యం షాపుల కోసం ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఆన్ లైన్లో దరఖాస్తులు వచ్చాయి. అమెరికాతో పాటు మరి కొన్ని దేశాల నుంచి కూడా అప్లికేషన్లను వేశారు.

ఐఏఎస్ అధికారులపై క్యాట్ సంచలన కామెంట్స్..

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సదరు ఐఏఎస్ అధికారులు క్యాట్‌(CAT)లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన క్యాట్.. ఐఏఎస్ అధికారుల తీరుపై సంచలన కామెంట్స్ చేసింది.

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో.. సదరు ఐఏఎస్ అధికారులు క్యాట్‌(CAT)లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన క్యాట్.. ఐఏఎస్ అధికారుల తీరుపై సంచలన కామెంట్స్ చేసింది. ఐఏఎస్ అధికారుల పిటిషణ్‌పై క్యాట్‌లో సీరియస్‌గా వాదనలు జరిగాయి. డీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అధికారుల తరఫున న్యాయవాదులు గట్టిగా వాదించారు. అయితే, ఐఏఎస్ అధికారుల తీరుపై క్యాట్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. వారికి సేవ చేయాలని మీకు లేదా? అంటూ ఐఏఎస్ అధికారులను క్యాట్ సూటిగా ప్రశ్నించారు. ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకీ పూర్తి అధికారాలున్నాయంటూ స్పష్టం చేసింది ధర్మాసనం. స్థానికత ఉన్నప్పటికీ.. స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా? అని క్యాట్ ప్రశ్నించింది. అయితే, వన్ మెన్ కమిటీ సిఫారసులను డీవోపీటీ పట్టించుకోవడం లేదంటూ ఐఏఎస్ తరఫున న్యాయవాదులు వాదించారు. దీంతో వన్ మెన్ కమిటీ ఏర్పాటుపై వివరాలు అడిగింది క్యాట్. అదే సమయంలో 1986 బ్యాచ్ అధికారులతో స్వాపింగ్ ఎలా చేసుకుంటారంటూ ప్రశ్నించింది. ఇలా.. క్యాట్‌లో వాడి వేడి వాదనలు జరిగాయి. మరి క్యాట్ ఎలాంటి తీర్పునిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ తమ క్యాడర్ కేటాయింపుల ప్రకారం ఏపీ, తెలంగాణకు కేటాయించారు. అయితే, ఇప్పుడు ఆ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లబోమంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఆ రాష్ట్రానికి వెళ్లాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రిలీవింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(CAT)ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామంటూ.. కాట ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, గుమ్మడి సృజన, రొనాల్డ్ రోస్ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

గుర్రంపోడు ఎస్ఐ నారాయణరెడ్డి సస్పెండ్...

ఓ మహిళ హత్య కేసును ఆత్మహత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎస్ఐ పై అభియోగం...

ఎస్పీ శరత్ చంద్రపవార్ నివేదికతో ఐజీ సత్యనారాయణ చర్యలు...

నిష్పక్షపాతంగా లోతు దర్యాప్తు చేసిన ఎస్పీ శరత్ చంద్రపవార్...

సీఐ ధనుంజయ్ గౌడ్ తో పాటు ఓ కానిస్టేబుల్ పైనా కొనసాగుతున్న విచారణ...

రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష

కోల్‌కతాలో అత్యాచారానికి, హత్యకు గురయిన ట్రైనీ డాక్టరుకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా వైద్యులు నిరాహార దీక్ష చేయనున్నారు.

కోల్‌కతాలో అత్యాచారానికి, హత్యకు గురయిన ట్రైనీ డాక్టరుకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా వైద్యులు నిరాహార దీక్ష చేయనున్నారు.

ఈ విషయాన్ని ఆదివారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రకటించింది. ఇదే విషయమై కోల్‌కతాలోని ఆర్‌.జి.కర్‌ వైద్యకళాశాల వద్ద జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఐఎంఏ ఈ ప్రకటన చేసింది.

ఇదిలా ఉండగా, ఆందోళనకారుల డిమాండ్లు సోమవారంలోగా పరిష్కరించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని బెంగాల్‌లోని కల్యాణి జేఎన్‌ఎం ఆస్పత్రికి చెందిన 77 మంది సీనియర్‌ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలి సహా ఆ ఇద్దరు.. క్యాట్‌లో పిటిషన్.. సీఎం రేవంత్ రంగంలోకి దిగుతారా..?

తెలంగాణలో కొనసాగుతోన్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం.. ఉత్తర్వులు జారీ చేయగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో రిపోర్ట్ చేసేందుకు మరో రెండు రోజులే ఉండగా.. తాము మాత్రం తెలంగాణలోనే ఉంటామంటూ క్యాట్‌ను ఆశ్రయించారు. తమకు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలంటూ క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆమ్రపాలి సహా ఇద్దరు ఐఏఎస్‌లు పిటిషన్లు దాఖలు చేయగా.. రేపు విచారణ జరగనుంది.

తెలంగాణలో కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్‌ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఏపీలో కొనసాగుతున్న తెలంగాణ కేడర్ అధికారులు.. తమ సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‎గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మిగతా 10 మంది అధికారులకు డిపార్ట్‏మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఐఏఎస్‌లు ట్విస్ట్ ఇచ్చారు. డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్‎లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించారు. ఐఏఎస్‎లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, సృజన, వాణి ప్రసాద్ వేర్వేరుగా క్యాట్‏లో పిటిషన్లు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ, వాణి ప్రసాద్ క్యాట్‎కు విజ్ఞప్తి చేశారు. ఇక.. తనను ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కూడా క్యాట్‎లో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్‎లు వేసిన పిటిషన్లపై రేపు (అక్టోబర్ 15న) క్యాట్ విచారణ చేపట్టనుంది.

అయితే.. తమను తెలంగాణ కేడర్‌లోనే కొనసాగించాలంటూ 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనకు తెలంగాణ కేడర్ కావాలని ఆమ్రపాలి కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె విజ్ఞప్తిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్‌ను కేటాయించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలోనే.. తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్‌కు కూడా ఇవే ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోక్యంతో కేంద్రాన్ని ఒప్పించేందుకు ఐఏఎస్‌లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో.. ఆమ్రపాలి కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతారా అన్న ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

2014 ఏపీ విభజన తర్వాత.. తెలంగాణ కేడర్ కావాలని కేంద్రాన్ని 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలిండియా సర్వీసెస్ అధికారుల మార్పులను చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 10 సంవత్సరాలలో డీఓపీటీకి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటేషన్ మీద పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పని చేస్తున్న 11 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు తక్షణమై రిలీవ్ అయి తమ కేడర్‌ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. ఇటీవల ఢిల్లీలో జరిగిన డీఓపీటీ సమావేశానికి ఈ అధికారులంతా హాజరుకాగా.. సొంత రాష్ట్రాలకు వెళ్లలేమని పిటిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆ పిటిషన్ క్యాన్సిల్ అయింది. కానీ.. కేంద్రం మాత్రం సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు ప్రస్తుతం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

14వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

15వ తేదీన... నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

16వ తేదీన... ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

17వ తేదీన... ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.

18వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.

ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు.. లాటరీలో మహిళల హవా

ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయింపు కోసం మొత్తం 89, 882 దరఖాస్తులు రాగా.. లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను తలపించింది.

ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ రాష్ట్రాల నుంచి టెండర్లు వేసి వ్యాపారులు షాపులను దక్కించుకున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు 3 నుంచి 5 వరకు షాపులు దక్కినట్లు సమాచారం. 50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్‌కు ఐదు నుంచి 10 షాపులు దక్కినట్లు తెలిసింది. విశాఖ, విజయవాడ, కృష్ణ వంటి పలు జిల్లాల్లో మద్యం దుకాణాలను మహిళలు చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఏడు, విశాఖ జిల్లాలో 11 షాపులను మహిళా మణులు కైవసం చేసుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులు వేసినా అదృష్టం తలుపు తట్టకపోవడంతో కొంతమంది దరఖాస్తుదారులు నిరాశతో వెనుదిరిగారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగింది.

ఇవాళ షాపు పొందిన వారి నుంచి డబ్బు కట్టించుకొని అధికారులు ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తున్నారు. రేపు సాయంత్రం నుంచి డిపోలో స్టాక్ తీసుకొని 16వ తారీఖున దుకాణాలను వ్యాపారులు తెరవనున్నారు.

రేపు సాయంత్రం వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. అనంతరం షాపులు దక్కించుకున్నవారు మద్యం అమ్మకాలను జరపనున్నారు.