కేటిఆర్ పిటిషన్‌‌పై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha)పై దాఖలు చేసిన పిటిషన్‌ (Petition)పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టు (Nampally Special Court)లో విచారణ (Hearing ) జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా కేటీఆర్ పేర్కొన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటిఆర్ పిటిషన్‌ దాఖలు చేశారు.

2014-2023 వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని.. 5 సార్లు వరుసగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నానని.. 9 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని కేటీఆర్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానని, మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేశానన్నారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పనిచేశానని, తెలంగాణా వేగంగా అభివృద్ది చెందడంలో కృషి చేశానన్నారు. మంత్రి కొండా సురేఖ వాఖ్యలు తన పరువుకు తీవ్ర నష్టం చేకూర్చాయంటూ.. ఆమె మాట్లాడిన వీడియో, ఆడియో టేపులను కేటీఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. బీఎన్ఎస్ (BNS) యాక్ట్ 356 సెక్షన్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ.. 23 రకాల ఆధారాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.

కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కారణమంటూ మంత్రి కొండా సురేఖ (Minister konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్‌‌ను ఉద్దేశించి మంత్రి అనేక కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్‌‌లో పిటిషన్ వేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ ప్రారంభమై.. సోమవారం నాటికి వాయిదా పడింది. ఈరోజు విచారణ జరగనుంది.

మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టుకు నాగార్జున వ్యక్తిగతంగా హాజరయ్యారు. మరోవైపు నాగార్జున మేన కోడలు సుప్రియ కూడా ఈ కేసులో నాగార్జున తరుపున కోర్టుకు హాజరయి.. సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. అలాగే నాగ్ కుటుంబ సభ్యులు కూడా కోర్టులో సాక్షి వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరో ప్రయత్నంలో ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లు !

ఏపీ క్యాడర్ కేటాయించినా తెలంగాణలో పని చేస్తున్న ఎనిమిది మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు.. తెలంగాణ కేటాయించిన ఏపీలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లు పదహారో తేదీలోపు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.

కానీ వారెవరికి స్థానాలు మారడం ఇష్టం లేదు. అందుకే అత్యున్నత స్థాయిలో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తమను ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా కీలక స్థానంలో అమ్రపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఉండాలనుకుంటున్నారు. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఐపీఎస్ అంజనీకుమార్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆలాగే కృష్ణజిల్లా కలెక్టర్ సృజన తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తిగా లేరు. అందరూ .. తమ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నేరుగా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేయడానికి సమయం తక్కువగా ఉంది. పదహారో తేదీలోపు ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అందుకే న్యాయపోరాటం కూడా చేయాలనుకుంటున్నారు.

కానీ సోమేష్ కుమార్ విషయంలో ఇప్పటికే కోర్టు స్పష్టమైన తీర్పు వచ్చింది. మిగిలిన వారికి భిన్నంగా తీర్పులు వచ్చే అవకాశం లేదు. అయితే తమ స్థానికత విషయంలో వారు కొత్త వాదనలు వినిపించే అవకాశం ఉంది. యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన అడ్రస్ ఆధారంగా స్థానికత ఖరారు చేశారని.. కానీ తమ అసలు నేటివ్ తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలేనని వారు వాదించే అవకాశం ఉంది. మెత్తంగా ఆ ఐపీఎస్, ఆ ఐఎఎస్‌లకు కదలడం ఇష్టం లేదు. మరి వారి పవర్ పని చేస్తుందా ?

కుప్పకూలిన డీమార్ట్ షేర్లు.. ఒక్కరోజే రూ.27 వేల కోట్లు నష్టం.

సామాన్యుల సూపర్ మార్కెట్‌గా పేరు గాంచి దూసుకెళ్తున్న డీమార్ట్ షేర్లు కుప్పకూలుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 శాతానికిపైగా నష్టపోయింది. దీంతో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్కెట్స్ కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్లు తగ్గిపోయింది. మరి ఇంతలా పడిపోయేందుకు గల కారణాలేంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డీమార్ట్ గురించి తెలియని వారు ఉండరు. మధ్య తరగతి ప్రజల సూపర్ మార్కెట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం నిర్వహిస్తోంది. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రోజున కుప్పకూలాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపు 10 శాతానికిపైగా నష్టపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.27 వేల కోట్ల మేర ఆవిరైపోయింది. అందుకు ప్రధాన కారణంగా ఇటీవల ప్రకటించిన ఫలితాలేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ ప్రకటించిన ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోందని చెబుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో డీమార్ట్ ఏకీకృత నికర లాభం రూ.659.44 కోట్లుగా ప్రకటించింది.

గతేడాదితో పోలిస్తే ఈసారి నికర లాభం 5 శాతం మేర పెరిగింది. కంపెనీ ఆదాయం సైతం 14.41 శాతం పెరిగి రూ.14,444.50 కోట్లుగా నమోదు చేసింది. అదే సమయంలో కంపెనీ ఖర్చులు 14.94 శాతం మేర పెరిగాయి. అయితే, కంపెనీకి క్యూ2లో భారీ లాభాలు వస్తాయని అంతా అంచనా వేయగా.. ఆ అంచనాలను అందుకోలేకపోయిందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. దీంతో ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు డీమార్ట్ షేరుకు టార్గెట్ ప్రైస్ తగ్గించేశాయి. ఈ అంశాన్ని కలిసి డిమార్ట్ షేర్లు ఇవాళ క్షీణించాయి. అలాగే క్విక్ కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ సైతం డీమార్ట్ షేర్లు పడిపోయేందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్‌ మంత్రి ఎవరో కూడా తెలీదు.. పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని కొనియాడారు. నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు.

పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని కొనియాడారు. నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. అందుకే కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం నిర్వహించిన ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దెబ్బలు తట్టుకుని నిలబడ్డామని అందుకే ఇప్పుడు పనులు చేయగలుగుతున్నామని చెప్పారు.

గత పాలనతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదని పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో గ్రామసభలు కూడా పెట్టలేదని.. నిర్ణయాలు ఎలా తీసుకున్నారో తెలియదని అన్నారు. గత పాలనలో డబ్బులు ఎలా ఖర్చయ్యాయో ఎవరికీ తెలియదని విమర్శించారు. అభివృద్ధి జరగలేదు కానీ నిధులు మాయమయ్యాయని ఆరోపించారు. ఆగస్టు 23న రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు మొదలుపెట్టామని పేర్కొన్నారు. ప్రతి పనికి డిస్‌ప్లే బోర్డు ఉంటుందని అన్నారు.

గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం అంత ఈజీ కాదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పారదర్శకతతో తాము పాలిస్తున్నామని తెలిపారు. తాము పారదర్శకంగా ఉన్నా అధికారుల తీరు మారడం లేదని మండిపడ్డారు. మా పేరుతో ఓ అధికారి కాకినాడలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఏ అధికారి అయిన తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమలాగే అధికారులు కూడా పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇది లంచాల ప్రభుత్వం కాదు.. మంచి ప్రభుత్వమని స్పష్టం చేశారు.

రేవంత్ కు పరీక్షగా మారిన కొండా సురేఖ - హైకమాండ్ క్లారిటీ..!!

మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు...నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది. సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖ దూకుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో సమంత గురించి సురేఖ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద దుమారమే చెలరేగింది. కేటీఆర్ అంశం పక్కకు పోయి..సురేఖ టార్గెట్ అయ్యారు. పరోక్షంగా ప్రభుత్వం, కాంగ్రెస్ లక్ష్యంగా మారాయి. ఆ తరువాత సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహించుకున్నా.. వివాదం మాత్రం సమిసిపోలేదు. సురేఖ పైన హీరో నాగార్జున కేసు దాఖలు చేసారు. ఈ వ్యవహారం పైన అమల నేరుగా ప్రియాంక గాంధీతో మాట్లాడారు. పార్టీ నాయకత్వం సైతం సురేఖ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

అయితే, సురేఖ పైన వెంటనే చర్యలు తీసుకుంటే రాజకీయంగా సమస్యలు వస్తాయని సీఎం రేవంత్ భావించారు. దీంతో, సురేఖ తన వ్యాఖ్యలు ఉప సంహించుకొనేలా పార్టీ సూచించింది. ఇక, తాజాగా సొంత పార్టీ నేత రేవూరి ప్రకాశ్రెడ్డి వర్గీయులతో సురేఖ వర్గ మధ్య విభేదాలు పోలీసు స్టేషన్ కు చేరాయి. వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఫోటోతో మొదలైన వివాదం, తర్వాత ఫ్లెక్సీల చింపివేత, ధర్నాలు, దాడులు, అరెస్టుల దాకా వెళ్లింది. దీంతో మంత్రి రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం..సీఐ కుర్చీలో ఆమె కూర్చోవడం మరో వివాదానికి కారణమైంది. తమ వారిని విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ చెప్పటం మరింత వివాదంగా మారింది.

మంత్రి నేరుగా స్టేషన్ కు చేరటంతో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కూడా చేరుకున్నారు. తన వర్గీయులపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆమె వర్గీయులు అక్కడకు భారీగా చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

అధికారంలో ఉన్న సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా మంత్రి స్టేషన్ కు వచ్చి అధికారి కుర్చీలో కూర్చోవటం ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది. సురేఖ దూకుడు స్వభావం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యగా మారుతోంది. దీంతో..సురేఖ తీరు ఇదే విధంగా ఉంటే త్వరలోనే చర్యలు తప్పవనే సంకేతాలు పార్టీ నుంచి ఇస్తున్నట్లు సమాచారం.

17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన ‘బోయింగ్’

విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ మేరకు సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన 777 ఎక్స్ విమానాలను ఆ తర్వాతి ఏడాదికి అంటే 2026కు వాయిదా వేసింది.

ఇప్పటికే ఉన్న ఆర్డర్లు పూర్తయిన తర్వాత 2027 నుంచి 767 ఫ్రైటర్ విమానాల ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది. 

ఇక ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లు 1.7 శాతం పతనమయ్యాయి. కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో సంస్థ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది.

ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.

కూటమి ప్రభుత్వ ఇసుక విధానంపై జగన్ ఫైర్

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజలకు ఉచిత ఇసుక లభించడం లేదని అన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.  

గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అని జగన్ నిలదీశారు. అందుకే చంద్రబాబునే అడుగుతున్నా.. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదన్నారు. అసలు ఇసుక‌ కొందామంటేనే గతంలో కంటే రేటు రెండింతలు ఉందన్నారు. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైసీపీ ప్రభుత్వం స్టాక్‌ యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

 

2014 - 19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయిందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనికి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టు గా బిల్డప్‌ ఇచ్చారు, రెండు నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారని ఆరోపించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారన్నారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతి చోటా ఇసుకను కొల్లగొట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. 

 

'ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంటే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు గారు, ఆయన ముఠా వల్ల, ముఠా కొరకు, ముఠా చేతుల మీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగ చాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొన కుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?' అంటూ జగన్ ప్రశ్నించారు. 

 

అదే గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించిందన్నారు. 

'వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావటంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడం లేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైసీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు గారూ' అంటూ జగన్ ప్రశ్నించారు.

హిందూ ధర్మాన్ని, ఆలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది

రాబోయే తరాల వారికి హిందూ ధర్మాన్ని , హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా అధ్యక్షురాలు పాలకూరి రమాదేవి కోరుతా ,తిరుమల వేంకటేశ్వర స్వామిని తమ కుటుంబసమేతంగా దర్శనం దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు..

ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ..

మన పూర్వీకులు పెద్దలు వందల సంవత్సరాల క్రితమే ఆలయాలను నెలకొల్పి, ఆలయాల పవిత్రతను, ఆలయాల సంబంధించినటువంటి స్థలాలను మనకు అందించడం జరిగిందని ఇట్టి పవిత్రతను హిందూ ధర్మాన్ని ఆలయాల సంపదను రాబోయే తరాలకు అందించడానికి హిందూ సమాజం సంఘటితంతో ముందుకు వెళ్లాలని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా జిల్లా అధ్యక్షురాలు పాలకూరి రమాదేవి తెలిపారు..

ఆ కంపెనీలో వాటా కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ కొనుగోలుకు అనుమతులు పొందిన వేళ స్టీమింగ్ రంగంపై అంబానీ దృష్టి మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే మరో పెద్ద కొనుగోలుకు చూస్తున్నట్లు తెలుస్తోంది

అవును ముఖేష్ అంబానీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ కంపెనీలో కీలక వాటాదారుగా మారాలని చూస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. స్టేక్ కొనుగోలుకు ఇప్పటికే చర్చలు మెుదలయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు కరణ్ జోహార్ సంస్థ పూర్ & సన్స్, యే జవానీ హై దీవానీ, కల్ హో నా హో, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటెంట్ ప్రొడక్షన్ వ్యాపారంలో ముందుకు వెళ్లేందుకు ఈ వాటాల కొనుగోలుకు దిగుతోందని తెలుస్తోంది. అయితే డీల్ పరిమాణం ఎంత అనే వివరాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు.

ధర్మా ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ప్రస్తుతం 90 శాతానికి పైగా వాటాలను హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన 9.24 శాతం వాటాను ఆమె తల్లి హిరూ జోహార్ కలిగి ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన తన వాటాలను లిక్విడేట్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. వ్యాల్యుయేషన్ విభేదాలతో గతంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనారిటీ వాటా విక్రయానికి సంజీవ్ గోయెంకా మద్దతు ఉన్న సరేగామాతో ధర్మా ముందుగా చర్చలు జరిపింది. హిందీ చిత్ర పరిశ్రమలో హిట్స్ సంఖ్య తగ్గటంతో అనుకున్న స్థాయిలో విలువ లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు మారిపోవటంతో థియేటర్‌లలో ఫుట్‌ఫాల్స్ దెబ్బతినడంతో సినిమా నిర్మాణ ఖర్చులు కూడా పెరిగాయి.

అయితే రిలయన్స్ కంటెంట్ ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం జియో స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, కొలోస్సియం మీడియా అండ్ బాలాజీలో మైనారిటీ వాటాలు ఉన్నాయి. అంబానీ నేతృత్వంలో కొనసాగుతున్న జియో స్టూడియోస్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. FY23లో ధర్మ ప్రొడక్షన్స్ ఆదాయం రూ.1,040 కోట్లుగా ఉంది. ఇది దాదాపు నాలుగు రెట్లు పెరుగుదల. అంతకు ముందు ఏడాది ఆదాయం కేవలం రూ.276 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో నికర లాభం 59 శాతం పడిపోయింది. సినిమా నిర్మాణంలో ఉన్న ఇబ్బందులపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జోహార్ తన బాల్యంలో కొన్నిసార్లు నష్టాల నుంచి కోలుకోవడానికి, ఫైనాన్షియర్‌లకు తిరిగి డబ్బు చెల్లించడానికి వారు ఆస్తులు, ఆభరణాలను అమ్మేసిన సందర్భాలను సైతం గుర్తుచేసుకున్నారు.

హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..

మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధతపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దశాబ్ద కాలంగా అధికార వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయిన కాంగ్రెస్‌కు ఈ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

కావునా, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్‌తో పాటు విజయ్ వాడెట్టివార్, పృథ్వీరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, వర్షా గైక్వాడ్, రమేష్ చెన్నితలతో సహా ఇతర పార్టీ నేతలు ఈ సమావేశానికి రానున్నారు. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నేటి (సోమవారం) ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు.

అయితే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలను గెలుచుకుంది. కాగా, అనేక మంది ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన నేతలు ఉత్తరాది రాష్ట్రంలో కాంగ్రెస్ రచించిన వ్యూహాన్ని ప్రశ్నించారు. హస్తం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.

మహా వికాస్ అఘాడి (MVA)కి చెందిన పలువురు సభ్యులు మహారాష్ట్రలో పోటీ చేసేందుకు మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నందున కాంగ్రెస్ యొక్క ఎన్నికల సంసిద్ధతపై నేటి సమావేశానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎంవీఎస్ లో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి — కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) వర్గం, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఉన్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో వచ్చే నెల లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.