కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
దిల్లీ: దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సతీమణి సునీత అన్నారు..
ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ మేరకు మరో వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు.
''నా భర్త నిజమైన దేశభక్తుడు. కోర్టులో నిల్చుని నిజానిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతం ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు మనమంతా ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేం ప్రత్యేక డ్రైవ్ మొదలుపెడుతున్నాం. కేజ్రీవాల్ కోసం 8297324624 వాట్సప్ నంబరుకు మీ సందేశాలు పంపండి. అవన్నీ నేను ఆయనకు చేరవేస్తాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారు'' అని సునీత (Sunita Kejriwal) తన సందేశంలో వెల్లడించారు..
మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ను గురువారం ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జడ్జి అనుమతితో సీఎం స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతోనే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. అటు సునీత కూడా నిన్న కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఆరోగ్యం బాలేదని, ఆయనను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..
Apr 23 2024, 17:36