/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణ నుండి మరొకరికి కేంద్రమంత్రి పదవి.. ఆ నలుగురు ఎంపీల్లో ఒకరికి చాన్స్..? Yadagiri Goud
తెలంగాణ నుండి మరొకరికి కేంద్రమంత్రి పదవి.. ఆ నలుగురు ఎంపీల్లో ఒకరికి చాన్స్..?

వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి దక్కే చాన్స్ ఉన్నది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కేబినెట్‌లోకి తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం.

ఆ చాన్స్ ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం నుంచి బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్) లోక్‌సభకు ఎన్నికవగా.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరిలో కేంద్రమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఆ ఒక్కరు ఎవరు..?

తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ సెకండ్ బెర్త్ విషయంపై కొంతకాలంగా ఢిల్లీ బీజేపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రెండేండ్ల క్రితం జరిగిన కేబినెట్ మార్పులు చేర్పుల్లో పన్నెండు మందిని బయటకు పంపగా.. 17 మందికి కొత్తగా అవకాశం లభించింది. గత నెలలో కిరణ్ రెజిజును న్యాయ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి ఎర్త్ సైన్స్ శాఖకు మాత్రమే పరిమితం చేశారు.

ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున.. ఈ నాలుగు పెద్ద రాష్ట్రాలకు చెందిన వారికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం కల్పించాలన్నది ప్రధాని మోడీ ఆలోచిస్తున్నట్టు టాక్.

మరి తెలంగాణ నుంచి ఎవరికి చాన్స్ దొరుకుతుందన్నది అంతుచిక్కడంలేదు. బండి సంజయ్ ఇప్పటికే స్టేట్ చీఫ్‌గా కొనసాగుతున్నందున, ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచన లేదని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ క్లారిటీ ఇచ్చారు. కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన కూడా ఖండించారు.

ఒకే వ్యక్తికి రెండు కీలక పదవులు ఇవ్వరాదన్నది బీజేపీ నిర్దేశించుకున్న విధానం. దీంతో కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్ చేరిక దాదాపు లేనట్లే. మరి అర్వింద్, సోయం బాపూరావ్, లక్ష్మణ్‌లలో ఎవరికి చాన్స్ లభిస్తుందో వేచి చూడాల్సిందే. పీఎం లాడ్స్ నిధులను తన కుమారుడి పెండ్లికి, ఇల్లు కట్టుకోడానికి వాడుకున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోయం బాపూరావుకు చాన్స్ ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

అర్వింద్ లేదా లక్ష్మణ్..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించాలనుకుంటున్నందున నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నందున ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జూలై ఫస్ట్ వీక్‌లోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలను, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల నుంచి విశ్లేషించి ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోనున్నారు. ఏకకాలంగా అటు పార్టీకి కలిగే ప్రయోజనాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో బుధవారం రాత్రి ఐదున్నర గంటల పాటు చర్చలు జరిపి కేబినెట్‌లో మార్పులు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పు గురించి లోతుగా చర్చించారు..,

Amarnath Yatra 2023: అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

: ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జులై 2 నుంచి ప్రారంభమయ్యే యాత్ర చేపట్టేందుకు పెద్దఎత్తున సాధువులు సహా 1500 మందికి పైగా యాత్రికులు జమ్ముకు చేరుకున్నారు..

ఈ క్రమంలో నగరంలోని షాలిమార్‌ ప్రాంతంలో అధికారులు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సాధువుల కోసం ప్రత్యేకంగా పురానీ మండీ ప్రాంతంలోని రామాలయం ఆవరణలో మరో కేంద్రాన్ని ఆరంభించారు..

SB NEWS

నేడే పొడు పట్టాల పంపిణీ

ఆసిఫాబాద్ జిల్లా:జూన్ 30

తెలంగాణ పోడు పట్టాల పంపిణీపై నాలుగేళ్ళుగా నడుస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్రం మొత్తంమీద సుమారు 11.5 లక్షల ఎకరాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పంపిణీ చేయడానికి జాబితాను సిద్ధం చేసింది మాత్రం నాలుగు లక్షల ఎకరాలకే. మిగిలినవారికి ఎప్పుడు అందుతాయన్నదానికి అధికారుల నుంచి సమాధానం లేదు. ఈ ఒక్క ఫేజ్‌తోనే ఈ ప్రక్రియ ఆగిపోతుందా?.. లేక మరికొన్ని విడతల్లో మొత్తం అర్హులందరికీ ప్రభుత్వం నుంచి పట్టాలు అందుతాయా అన్నది అంతుచిక్కడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం పట్టాల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15,254 మంది లబ్ధిదారులకు 44,750 ఎకరాల మేర పోడు భూములకు పట్టాల పంపిణీ జరగనున్నది.

రాష్ట్రం ఆవిర్భవించే సమయానికి పోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ, గిరిజన కుటుంబాలకు పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల నుంచి పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందాయని, మొత్తం 11.5 లక్షల ఎకరాలుగా తేలిందని వివరించారు. ఇకపైన పోడు నరకబోమంటూ గ్రామ సభల్లో తీర్మానం చేయడంతో పాటు ప్రభుత్వానికి లబ్ధిదారులు అండర్‌టేకింగ్ ఇవ్వాలని, ఆ తర్వాతనే పట్టాలను ఇస్తామని, ఒకవేళ ఆ తర్వాత అడవిని నరికితే పట్టాలను రద్దు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాత్రం 4.05 లక్షల ఎకరాలకే నిర్ణయం జరిగింది. మిగిలిన భూమికి ఎప్పుడు పట్టాలు వస్తాయన్నదానికి అధికారులకూ స్పష్టత లేదు.

చివరి గంటల్లో జాబితాలో మార్పులు

ప్రతీ జిల్లాలో ఎన్ని ఎకరాలకు, ఎంతమంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేయాలో ప్రభుత్వం ముందుగానే జాబితాను సిద్ధం చేసింది. ఆ ప్రకారం అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 1.51 లక్షల ఎకరాలను 50,595 మంది లబ్ధిదారులకు ఇచ్చేలా లిస్టు తయారైంది. ఆ తర్వాతి స్థానాల్లో మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, నిర్మల్, ఖమ్మం తదితర జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు లబ్ధిదారులకు కలిపి కేవలం ఒక్క ఎకరం మాత్రమే మూడు పట్టాల రూపంలో పంపిణీ కానున్నది. ఆ తర్వాతి స్థానంలో నారాయణపేటలో ముగ్గురికి 8 కరాలు, జగిత్యాలలో 15 మందికి 19 ఎకరాలు, మహాబూబ్‌నగర్‌లో 19 మందికి 22 ఎకరాల చొప్పున పంపిణీ కానున్నది.

నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేట నియోజకవర్గ పరిధిలోని తండాల్లో బుధవారం రాత్రి వరకూ లిస్టులో ఉన్న పేర్లు గురువారం రాత్రికి మాయమయ్యాయని, దీని గురించి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ దగ్గర కూడా క్లారిటీ లేదని ఆ గ్రామస్తులు మొత్తుకున్నారు. జాబితాలో పేర్లు ఎందుకు మారాయో తమకు కూడా తెలియదని, ఉన్నతాధికారుల నుంచి ఈ లిస్టు వచ్చిందని, చివరి గంటల్లో పేర్లలో ఎందుకు మార్పులు చోటుచేసుకున్నాయో తమకు తెలియదని బదులిచ్చినట్లు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లిలో సైతం గిరిజనులు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి పేర్లు మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను నిలదీయడానికి వెళ్ళినా అక్కడ ఆయన లేకపోవడంతో రోడ్డు మీద నిరసన తెలపాల్సి వచ్చింది. కేసీఆర్ తండా, ఏఎస్ఆర్ తండాలకు చెందిన 200 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నా తొలుత ఎంపిక చేసినట్లు ప్రకటించి చివరకు పరిశీలించే ప్రాసెస్‌లో అర్హత లేదని తేలిందనే సమాధానాన్ని ఇచ్చారని స్థానికులు తెలిపారు.

సాగులో ఉన్న మొత్తం పోడు భూమికి పట్టాలను ఇస్తామని చెప్పినా చివరకు రెండొంతులకు కోత పెట్టి ఒక్క వంతుకు మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసిందని, చివరు ఆ జాబితాలోనే స్థానికంగా ఉన్న అధికార పార్టీ లీడర్లు పేర్లను మార్చారన్న ఆరోపణలు వినిపించాయి. లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులకు బదులుగా అధికార పార్టీకి చెందిన నేతలే పెత్తనం చేస్తున్నారని ఇంతకాలం ఉన్న సాధారణ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరే విధంగా ఇప్పుడు పోడు భూముల జాబితాలో పేర్లు గల్లంతు కావడం ఆదివాసీ, గిరిజన రైతుల్లో ఆగ్రహానికి కారణమైంది. గొత్త కోయలకు పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి గందరగోళం చోటుచేసుకుంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.....

నేడు ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

•జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గిరిజన, ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన అక్కడి నుంచే శ్రీకారం చుడతారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్‌ ఆసిఫాబాద్‌ చేరుకుంటారు.

జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి గోండు వీరుడికి నివాళులర్పిస్తారు. తర్వాత బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కోట్నక్‌ భీమ్‌ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటిస్తారు.

ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయాన్ని, ఆసిఫాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులకు పోడు పట్టాలను అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మహబూబాబాద్‌లో నిర్వహించే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు...

నేడు తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 30

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం స్వామివారిని 62,005 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 34,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే....

•బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్. బిజెపి మహాజన్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల కాలంలో చేసిన సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఎలికట్టే శక్తి కేంద్రం ఇంచార్జ్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్ అందిస్తూ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రధాన మంత్రికి మద్దతు తెలపండి అని ప్రచారం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో అంత్యోదయ స్ఫూర్తి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6, 000 రూపాయల ఆర్థిక సహాయం, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అపూర్వ వృద్ధి, ఈశాన్య రాష్ట్రాల చారిత్రక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వంలో కొత్త శకం, రైతు సంక్షేమానికి పెద్దపీట,

నారీ నారాయణి: మహిళా సాధికారత, భారతదేశ అమృతకాలం భావితరం సశక్తీకరణ, అందరికీ ఆరోగ్యకరమైన జీవితం, మధ్య తరగతికి సులభతర జీవితం, సశక్త భారతదేశం, నేడు భారతదేశంలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా కష్టకాలంలో దేశ ప్రజలకు వాక్సినేషన్, వందే భారత్ మిషన్, భారతదేశం భద్రత పటిష్టం, ఆర్టికల్ 370 రద్దు, వసుదైవ కుటుంబం, డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దాడన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్, ఎలికట్టే బూత్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి సందీప్, లింగస్వామి, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ కోరబోయిన లింగస్వామి బూత్ కమిటీ అధ్యక్షులు రావుల వెంకన్న, ఈదుల పవన్, శ్రీనివాస్, నవీన్, రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జనగర్జనకు భారీ ఏర్పాట్లు

•వంద ఎకరాల్లో నిర్వహణకు కసరత్తు

•పనులు, జనసమీకరణలో నిమగ్నమైన హస్తం శ్రేణులు, పొంగులేటి వర్గీయులు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వర్గీయుల చేరిక నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో 2వతేదీన నిర్వహించ తలపెట్టిన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రాహుల్‌గాంధీ రానున్న ఈ సభకు తెలంగాణ జనగర్జన సభగా పేరుపెట్టిన నేతలు.. సభను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్‌ఆర్‌గార్డెన సమీపంలోని వంద ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి.. యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో చదును చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం ఆ స్థలానికి సమీపంలోని మరో 50ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఓ వైపు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు త్వరలో పార్టీలో చేరబోయే పొంగులేటి అనుచరులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు అన్ని జిల్లాల నుంచి 4లక్షల నుంచి 5 లక్షల మంది వరకు జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. రాహుల్‌గాంధీతోపాటు కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఈ సభ ఎన్నికల శంఖారావానికి వేదిక కానుందని, రాష్ట్ర కాంగ్రె్‌సలో కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని నేతలు ఆశిస్తున్నారు. రాహుల్‌సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నామని, 5 లక్షల మంది అంచనాతో సభా ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తెలంగాణ జనగర్జన పేరిట జరిగే ఈసభతో తెలంగాణలో కాంగ్రె్‌సను ఎన్నికల దిశగా నడిపించేందుకు సిద్ధమవుతున్నామన్నారు.

రేపు ఖమ్మానికి రేవంత్?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి గురువారం ఖమ్మం రానున్నారు. 2వతేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన ఖమ్మం రానున్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, జనసమీకరణ తదితర అంశాలపై చర్చించి సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించున్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరొక భారీ మోసం..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరొక భారీ మోసం వెలుగు చూసింది. పన్ను రిఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసింది. 40 కోట్ల రూపాయల స్కామ్‌ని ఐటీ అధికారులు బయటపెట్టారు..

దీనిలో 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్‌లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు జరిగాయి. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై కేసులు నమోదుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

ముందస్తుగా కంపెనీలు, వ్యక్తులకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. అదనపు కన్సల్టెంట్‌లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ స్కాం లో కన్సల్టెంట్లు, ఉద్యోగులు ఉన్నారని ఐటీ అధికారులు తెలిపారు. కన్సల్టెంట్‌లు, ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10% కమీషన్ కోసం రిటర్న్‌లను దాఖలు చేశారు. 2017లో సైతం ఐటీ ఇదే తరహా మోసాన్ని గుర్తించింది. 200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేశారని ఐటీ అధికారులు తెలిపారు..

తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

సాయిచంద్ మృతిపట్ల ముఖ్యమంత్రి సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు.

చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని కొనియాడారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు...

Festivals: ఒకే రోజు రెండు పండగలు.. ఆలయాలు, ఈద్గాల్లో భక్తుల రద్దీ

తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తొలి ఏకాదశి, బక్రీద్ పండగలు ఒకే రోజు కావడంతో ప్రార్థనలు, పూజలతో భక్తులు నిమగ్నమైపోయారు. ఆలయాల వద్ద భక్తులు..

మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తూ కొంతమంది ఉపవాస దీక్ష ఉంటున్నట్లు తెలిపారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని భక్తులు చెప్పారు.

పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు నిర్ణయించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే రూట్లకు మళ్లించనున్నారు. ప్రయాణికులు సహకరించి వారు సూచించిన మార్గాల్లో ప్రయాణం సాగించాలని పోలీసులు కోరారు..

ఆలయాలు, మసీదుల దగ్గర పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఒకే రోజు హిందూ-ముస్లిం పండగలు రావడం సంతోషంగా ఉందని పలువురు తెలిపారు..