సాములోరికి స్టార్‌ హోటల్‌

స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఆశ్రమాలు ఏర్పాటుచేసుకొని ఆధ్యాత్మిక బోధనలతో ధర్మప్రచారం నిర్వహిస్తుంటారు.

స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగులు. ఆడంబరాలు, విలాసాలకు దూరంగా ఉంటారు. ఆశ్రమాలు ఏర్పాటుచేసుకొని ఆధ్యాత్మిక బోధనలతో ధర్మప్రచారం నిర్వహిస్తుంటారు. అయితే, స్వాములందు ఈ స్వామి వేరయా అన్నట్లు శారదాపీఠం సాములోరు అవతరించారు. తొలుత వేద విద్య కోసం అంటూ గత ప్రభుత్వాన్ని భూమిని కోరారు. ఆ తర్వాత ఆ భూమిని మార్పించుకొని నచ్చిన భూమిని తీసుకున్నారు. అయితే, ఆయన అక్కడితో ఆగలేదు... ఆధ్యాత్మికం పేరిట భారీగా సొమ్ములు సంపాదించుకునేందుకు, బోర్డింగ్‌ హౌస్‌ల పేరిట సముద్రతీరం కనిపించేలా భారీ స్టార్‌ హోటల్‌ నిర్మించుకునేందుకు ఆయన సకల అనుమతులు పొందారు. తీసుకునే అనుమతి రికార్డుల్లో ఒకటి ఉంటుంది. ఆచరణలో దాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్తారు. ఇది ఆయన ఆచరణే. ఇలా సాములోరికి అడ్డగోలు మేలుచేయడానికి వీల్లేదని, ప్రజల ఆస్తులను సాములోరికి సమర్పించకూడదన్న కనీస స్పృహ నాటి రెవెన్యూ అధికారులకు లేకుండా పోయింది. నాటి ముఖ్యమంత్రి జగన్‌కు సాములోరు గురువు సమానులు కాబట్టి వారికి సందేహాలు వచ్చే చాన్స్‌ కూడా లేదు. అందుకే సాములోరు కోరినవన్నీ ఆనాడు అధికారులు చకచకా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ మరో నెల రోజుల్లో రావచ్చన్న సంకేతాలుండటంతో రెవెన్యూశాఖ పోటీపడి సాములోరి సేవలో ఆనాడు తరించిపోయింది. ఇందుకు ప్రత్యక్ష నిద ర్శనం ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన రెవెన్యూశాఖ ఇచ్చిన జీఓ 47.

శారదాపీఠం శ్రీ శంకరచార్యుల బోధనలకు అనుగుణంగా సనాతన ధర్మ సూత్రాలు ప్రచారం చేస్తుందని, సంస్కృత పాఠశాలను ఏర్పాటుచేసి, ప్రజల్లో వేద విద్య, వేద సంస్కృతిని పెంపొందిస్తామని కారణాలు చెప్పి పీఠం ప్రభుత్వం నుంచి 2021లో 225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని విశాఖ జిల్లా భీమిలీ మండలం కొత్తవలసలో పొందింది. ఇక భూ కేటాయింపులో రెవెన్యూశాఖ ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడింది. వాటిని ఇదివరకే ‘ఆం రఽధజ్యోతి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడు, కొత్త విషయం ఏమంటే, తమకు కేటాయించిన భూమిలో ముందు చెప్పినట్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణతోపాటు ఆదాయార్జన పనులు కూడా చేపడుతామని, కాబట్టి, అందుకు అనుమతి ఇవ్వాలని పీఠం 2023, నవంబరు 20న విశాఖ కలెక్టర్‌ను కోరింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకోలేదు. నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అధికారి విశాఖ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకురాగా, పీఠం రాసిన లే ఖపై తన రిమార్క్‌లు ప్రస్తావిస్తూ ఈ ఏడాది జనవరి 19న రెవెన్యూశాఖకు నివేదిక పంపారు. అంతే, 24 గంటల వ్యవధిలో శారదాపీఠం పంపించిన లేఖను ఆంధ్రప్రదేశ్‌ భూ నిర్వహణా వ్యవస్థ (ఏపీ ల్యాండ్‌మేనేజ్‌మెంట్‌ అథారిటీ-ఏపీఎమ్‌ఏ)లో ఆమోదించి, రెవెన్యూశాఖకు పంపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 6వ తేదీన రెవెన్యూశాఖ సాములోరి విన్నపాలను ఆచరణలోకి తీసుకొస్తూ జీవో జారీచేసింది.

బోర్డింగ్‌ హౌస్‌ పేరిట సాములోరు కొత్తవలసలో తనకిచ్చిన భూమిలో స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు సకల సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు గుర్తించాయి. ఇటీవల ఈ ప్రాంతాన్ని ఓ సీనియర్‌ అధికారి సందర్శించారు. అక్కడ బోర్డింగ్‌ హౌస్‌ పేరిట భారీ స్టార్‌హోటల్‌ నిర్మాణానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు గుర్తించారు. నేరుగా హోటల్‌ అంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి ఎనిమిది అంతస్తుల బోర్డింగ్‌ హౌస్‌ నిర్మాణానికి రెడీ అవుతున్నట్లుగా గుర్తించారు. బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి కూడా అనుమతి పొందారు. దీనికి బోర్డింగ్‌ హౌస్‌ అని పేరుపెట్టారు. ఈ విషయం తెలిసి ఓ రెవెన్యూ అధికారి పీఠం ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. మీరు స్టార్‌హోటల్‌ కట్టకూడదు. అది తప్పు అని వారించినట్లు తెలిసింది. ‘‘ఆదాయార్జనకు భూమిని వినియోగించుకోవచ్చని (జగన్‌) ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాంటప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే ఏ మార్గాన్ని అయినా మేం అనుసరించవచ్చు కదా. ఇందులో ఉల్లంఘన ఏముంది?. మీరే అనుమతి ఇచ్చి, మీరే వద్దంటారా? ఇదెక్కడి న్యాయం?’’ అని పీఠానికి చెందిన ఓ వ్యక్తి... ఆ అధికారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో అప్పటి కప్పుడు పీఠానికి ఇచ్చిన అనుమతుల ఉత్తర్వుల ఫైలు, వాటి కి సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను తెప్పించి పరిశీలన చేశారు. ఇందులోనూ పెద్దగోల్‌మాలే నడిచినట్లు తెలిసింది.

ఆదాయార్జనకు అనుమతి ఇవ్వాలని తొలుత శారదాపీఠం ప్రతినిధులు నాటి సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌ను కలిసి విన్నవించారు. ఇందుకు ఆయన తిరస్కరించారు. అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఎల్‌ఎమ్‌ఏలోనూ దీన్ని అజెండాగా చేర్చాల్సిన అవసరం లేదని తేల్చారని తెలిసింది. ఇదంతా ఈ ఏడాది జనవరి తొలివారంలో జరిగింది. అయితే, సాయిప్రసాద్‌ జనవరి రెండోవారంలో సెలవుపెట్టారు. దాన్ని అదేనెల 25 వరకు పొడిగించుకున్నారు. అప్పుడు ఓ జూనియర్‌ అధికారికి ఇన్‌చార్జి సీసీఎల్‌ఏ పదవిని కట్టబెట్టారు. సరిగ్గా ఇదే సమయం అనుకున్న పెద్దలు ఆ ఇన్‌చార్జి సీసీఎల్‌ఏ ద్వారా మంత్రాంగం నడిపించారు. జనవరి 19న కలెక్టర్‌తో లేఖ తెప్పించుకొని, 20వ తేదీన ఆదాయార్జనకు అనుమతి ఇవ్వాలన్న పీఠం డిమాండ్‌కు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వానికి ఫైలు పంపించారు. ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత సాయిప్రసాద్‌ సెలవు ముగించుకొని వచ్చి ఉద్యోగంలో చేరారని తెలిసింది. ఇదంతా ఇప్పుడు బయటపడటంతో రెవెన్యూ అధికారులు విస్తుపోతున్నారు. ఇది ఫక్తు ప్రైవేటు వ్యాపారమేనని ముక్కున వేలేసుకుంటున్నారు!

తెలంగాణ ఐఏఎస్ అధికారికి ఏపీలో తొలి పోస్టింగ్-ఎక్కడో తెలుసా ?

గతంలో ఏపీ-తెలంగాణ విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణకు వెళ్లిపోయారు. పాలనా పరమైన కారణాలతో ఇన్నాళ్లూ తెలంగాణలో ఉండిపోయిన ఆ నలుగురు ఐఏఎస్ లను తాజాగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. దీన్ని వారు క్యాట్ తో పాటు తెలంగాణ హైకోర్టులోనూ సవాల్ చేసినా ఊరట దక్కలేదు. దీంతో నలుగురు ఐఏఎస్ లు కాటా అమ్రపాలి, ప్రశాంతి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణలు ఏపీలో రిపోర్ట్ చేశారు.

అయితే ఇలా ఏపీలో రిపోర్ట్ చేసిన ఈ నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు.

కానీ ఇవాళ అందులో ఒకరైన ఎం ప్రశాంతికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమెను అటవీ, పర్యావరణశాఖలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

మరోవైపు మిగిలిన ముగ్గురు ఐఏఎస్ లకు ఏపీ ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ లు ఇవ్వబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇందులో కాటా ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ లను తెలంగాణ ప్రభుత్వం డిప్యూటేషన్ మీద వెనక్కి రప్పించనుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వీరికి ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే మరో తెలంగాణ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం రేపు, ఎల్లుండిలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిన కొడంగల్

రైతు భరోసా ఎగ్గొట్టేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. రైతు భరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆదివారం ఆందోళనకు దిగాయి.

రైతు భరోసా ఎగ్గొట్టేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.

రైతు భరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆదివారం ఆందోళనకు దిగాయి. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించాయి. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని దౌల్తాబాద్‌ మండలం కేంద్రంలోనూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసనలు చేపట్టారు. రేవంత్‌ రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

డిసెంబర్ లోగా రుణ మాఫీ పూర్తి.. గిదైనా ఫైనలా సారూ..!

తెలంగాణలో గతంలో రైతు బంధు ఉండేది. ఈ పథకంలో భాగంగా ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందించేవారు. అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా సంబంధం లేకుండా

డబ్బులు ఇచ్చే వారు. ఇలా కోటిశ్వరులకు కూడా రైతు బంధు ఇచ్చారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే అందరికి కాకుండా అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది.

అయితే వాన కాలం సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు.

రాష్ట్ర మంత్రివర్గ సబ్కమిటీ రిపోర్ట్ఇచ్చాకే రైతు భరోసా అమలు చేస్తామన్నారు. అయితే కమిటీ రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారో చెప్పలేదు. సీజన్ కు ఎకరాకు రూ.7500 ఇస్తామన్నారు. మరోవైపు రైతు రుణ మాఫీ కాకుండా చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణ మాఫీ అవుతుందో కాదో అని ఆందోళనలో ఉన్నారు.

దీనిపై కూడా తుమ్మల మాట్లాడారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉండి, నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి వారికి డిసెంబర్ లోగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. రూ.2 లక్షలకుపైగా రుణాలున్న వారి కోసం త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. అయితే ఇదే మంత్రి దీపావళిలోకా రుణ మాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. తాజాగా డిసెంబర్ లోగా చేస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఏది ఏమైనా రుణ మాఫీ చేసి తీరుతామని మాత్రం చెబుతున్నారు.

42 బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 25 లక్షల కుటుంబాల్లోని 42 లక్షల మంది లబ్ధిదారులకు రుణమాఫీకి అవసరమైన నిధులు రూ.31 వేల కోట్లని మంత్రి చెప్పారు. ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామని తెలిపారు. ఇంకా 20 లక్షల మందికి రుణ మాఫీ కాలేదని.. తెల్ల రేషన్‌కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబరులో కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తామన్నారు. అయితే రేషన్ కార్డు ఉన్నా రుణ మాఫీ కాలేదని లక్షలాది మంది అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుమల మాఢ వీధుల్లో పబ్లి్క్ న్యూసెన్స్ చేశారని వారిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. దివ్వల మాధురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వారిద్దరు కలిసి మాఢ వీధుల్లో హల్‌చల్ చేశారు. ఫోటోలకు ఫోజులివ్వడంతో పాటు తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కోర్టుల్లో కేసులు కొలిక్కివచ్చాక పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు.

అయితే తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. దివ్వల మాధురిపై కేసు నమోదైంది. అయితే తిరుమలలో తాము రీల్స్ చేశామనే ఆరోపణల్లో నిజం లేదని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

అయినప్పటికీ టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేశారు.

యాదాద్రికి రైల్వే లైన్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. వీకెండ్ డేస్, సెలవు దినాలు, ప్రత్యేక రోజుల్లో వేల సంఖ్యల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఆలయం ఉండటంతో నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశ్యంతో నగరం నుంచి యాదాద్రికి MMTS ట్రైన్లు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది. ఈ రైల్వే లైనుపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు.

ప్రతి రోజూ వేల మంది భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మెుక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు పది వేల మంది భక్తులు వెళ్తారని అంచనా. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. నగరంలో విపరీతమైన ట్రాఫిక్‌ సమస్య కారణంగా గంటన్నర పాటు నగరం దాటేందుకు సమయం పడుతోంది. నగరం దాటిన తర్వాత మరో రెండు రెండు గంటలు. మెుత్తంగా నాలుగైదు గంటలు ప్రయాణానికే పోతుంది. ఇక బస్సుల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. యాదాద్రి వరకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన టెండర్లు పూర్తి అయ్యాయని అన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ.450 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నేడు కిషన్ రెడ్డి సందర్శించారు.

చర్లపల్లి టెర్మినల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని.. తర్వలోనే ప్రధాని మోదీ స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. యాదాద్రితో పాటుగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు. అది కూడా పూర్తి అయితే యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక ట్రైన్లు నడుస్తాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

కాగా, యాదాద్రికి MMTS ట్రైన్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. MMTS ట్రైన్లు యాదాద్రి సమీపంలోని రాయగిరి స్టేషన్‌ వరకు పొడగించాలని గత ఏడేళ్ల క్రితమే నిర్ణయించారు. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాల్సి ఉంది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

కొన్ని నెలల క్రితం ఘట్‌కేసర్- రాయగిరి రైల్వేలైన్ పూర్తి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మౌలాలి నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఘట్‌కేసర్ నుంచి మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నగరం నుంచి కేవలం రూ.20 టిక్కెట్‌తో యాదాద్రి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అది కూడా గంటలోపే ప్రయాణం చేయవచ్చు.

నడిరోడ్డుపై వదిలేశారు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం..

మార్గ మధ్యల్లో ప్యాసింజర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తమ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ బయలుదేరిన నవీన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖలో ప్రయాణీకులను ఎక్కించుకుని హైదరాబాద్ వస్తుండగా బస్సులో ఏసీ పనిచేయకపోవడంతో ..

విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు కొందరు ప్రయాణీకులు నవీన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో ఏసీ టికెట్లు బుక్ చేసుకున్నారు. విశాఖ నుంచి బయలుదేరిన బస్సులో ఏసీ పనిచేయడం మానేసింది. అలాగే బస్సులో కుర్చీలు విరిగిపోయి ఉండటంతో ప్రయాణీకులు కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రయాణీకులు బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించడంతో మధ్యమధ్యలో బస్సు ఆపి మరమ్మతులు చేస్తూ తీసుకువచ్చారు. చివరకు విసుగుచెందిన ప్రయాణీకులు హనుమాన్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడలో మరో బస్సు ఏర్పాటు చేస్తామని ప్రయాణీకులకు హామీ ఇచ్చారు.

విజయవాడ బెంజ్ సర్కిల్ చేరుకున్న తర్వాత ప్రయాణీకులను బస్సు నుంచి దించివేసి, మరో బస్సు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని బస్సు యాజమాని చెప్పడంతో ప్రయాణీకులంతా మరోసారి ఆందోళనకు దిగారు. వేల రూపాయిలు తీసుకుని తమను నడిరోడ్డుపై వదిలేశారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని అధికారులను ప్రయాణీకులు వేడుకుంటున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణీకులను ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి.

టికెట్ కొన్న తర్వాత బస్సులో ఏదైనా సమస్య వస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ప్రత్యామ్నాయంగా బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకులు సకాలంలో గమ్య స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ(TDP Candidates) అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్‌(Rajashekar)

కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటిరాజేంద్రప్రసాద్‌(Rajendra Prasad) పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

ఖరీఫ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వబోమని తెలిపింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రైతు భరోసాకు బదులుగా ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

’ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేము. మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తాం. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేసాం. రాష్ట్రంలో 42 లక్షల లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్లు అవసరం. 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15నే చేశాం. 20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. 2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుంది. తెల్ల రేషన్ కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబర్ లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తాం. 2500కోట్ల రూపాయలు వేస్తాం. రుణ విముక్తి కావాలంటే కొత్త రుణాలు రావు‘‘ అని తుమ్మల వ్యాఖ్యానించారు.

2 లక్షల పైన ఉన్న రుణాల వారి అంశం క్యాబినెట్ లో చర్చిస్తామని తెలిపారు. పంటల బీమా గతంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతీ రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, రాష్ట్రంలో పండే అన్ని పంటలను ఎంఎస్పీ ప్రకారమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 20% కేంద్రం కొనుగోలు చేస్తుందని తుమ్మల అన్నారు.

ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల రైతు రుణమాఫీ ఎక్కడా చేయలేదని ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగం, రైతుల విషయంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేసితీరుతామన్నారు. రాష్ట్రంలో కొత్త శకం స్టార్టైంది. రాబోయే రెండేళ్లలో అనేక మార్పులు తీసుకు వస్తామని కోదండరెడ్డి తెలిపారు.

ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు.

ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తుదముట్టడించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇంటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు. ఆ సమయంలో ప్రధాని ఆ చుట్టుపక్కల లేరని, ఆయన నివాసంపై దాడిలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.

ప్రధాని నివాసంపై యూఏవీని ప్రయోగించారు. ఆ సమయంలో ప్రధాని, ఆయన భార్య అక్కడ లేకపోవడంతో ఎవరూ గాయపడలేదు" అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు, ఇజ్రాయెల్ మిలటరీ దీనిపై మాట్లాడుతూ, లెబనాన్ నుంచి మూడు డ్రోన్లు దూసుకువచ్చాయని తెలిపింది. రెండు డ్రోన్‌లను మధ్యలోనే అడ్డుకోగా, ఒక డ్రోన్ సిజేరియాలోని భవవాన్ని ఢీకొన్నట్టు చెప్పింది. కాగా, డ్రోన్ దాడులకు తామే కారణమని హెజ్‌బొల్లా ఇంకా ప్రకటించ లేదు.

సిన్వర్‌ను మట్టుబెట్టడాన్ని కీలక విజయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి సైతం గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది.

ఈ దాడిలో 33 మంది పాలస్తీనా వాసులు మరణించడంతో ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 42 వేలకు చేరిందని గాజా అధికారులు ప్రకటించారు. ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను విడిచిపెట్టేంత వరకూ యుద్ధం ఆపేది లేదని నెతన్యాహూ ప్రకటించారు.