ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ(TDP Candidates) అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్‌(Rajashekar)

కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటిరాజేంద్రప్రసాద్‌(Rajendra Prasad) పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

ఖరీఫ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వబోమని తెలిపింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రైతు భరోసాకు బదులుగా ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

’ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేము. మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తాం. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేసాం. రాష్ట్రంలో 42 లక్షల లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్లు అవసరం. 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15నే చేశాం. 20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. 2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుంది. తెల్ల రేషన్ కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబర్ లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తాం. 2500కోట్ల రూపాయలు వేస్తాం. రుణ విముక్తి కావాలంటే కొత్త రుణాలు రావు‘‘ అని తుమ్మల వ్యాఖ్యానించారు.

2 లక్షల పైన ఉన్న రుణాల వారి అంశం క్యాబినెట్ లో చర్చిస్తామని తెలిపారు. పంటల బీమా గతంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతీ రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, రాష్ట్రంలో పండే అన్ని పంటలను ఎంఎస్పీ ప్రకారమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 20% కేంద్రం కొనుగోలు చేస్తుందని తుమ్మల అన్నారు.

ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల రైతు రుణమాఫీ ఎక్కడా చేయలేదని ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగం, రైతుల విషయంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేసితీరుతామన్నారు. రాష్ట్రంలో కొత్త శకం స్టార్టైంది. రాబోయే రెండేళ్లలో అనేక మార్పులు తీసుకు వస్తామని కోదండరెడ్డి తెలిపారు.

ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు.

ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తుదముట్టడించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇంటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు. ఆ సమయంలో ప్రధాని ఆ చుట్టుపక్కల లేరని, ఆయన నివాసంపై దాడిలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.

ప్రధాని నివాసంపై యూఏవీని ప్రయోగించారు. ఆ సమయంలో ప్రధాని, ఆయన భార్య అక్కడ లేకపోవడంతో ఎవరూ గాయపడలేదు" అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు, ఇజ్రాయెల్ మిలటరీ దీనిపై మాట్లాడుతూ, లెబనాన్ నుంచి మూడు డ్రోన్లు దూసుకువచ్చాయని తెలిపింది. రెండు డ్రోన్‌లను మధ్యలోనే అడ్డుకోగా, ఒక డ్రోన్ సిజేరియాలోని భవవాన్ని ఢీకొన్నట్టు చెప్పింది. కాగా, డ్రోన్ దాడులకు తామే కారణమని హెజ్‌బొల్లా ఇంకా ప్రకటించ లేదు.

సిన్వర్‌ను మట్టుబెట్టడాన్ని కీలక విజయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి సైతం గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది.

ఈ దాడిలో 33 మంది పాలస్తీనా వాసులు మరణించడంతో ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 42 వేలకు చేరిందని గాజా అధికారులు ప్రకటించారు. ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను విడిచిపెట్టేంత వరకూ యుద్ధం ఆపేది లేదని నెతన్యాహూ ప్రకటించారు.

బస్సు లైఫ్‌.. తగ్గుతోంది బాసూ

సిటీ బస్సుల్లో(City buses) రోజూ 19 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 9 నుంచి 10 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. రద్దీ ఎక్కువై ఆర్డినరీ బస్సులపై లోడ్‌ పెరుగుతోంది. దీంతో టైర్లు, ఇంజన్లపై ఒత్తిడి పెరుగుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు.

సిటీ బస్సుల్లో(City buses) రోజూ 19 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 9 నుంచి 10 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. రద్దీ ఎక్కువై ఆర్డినరీ బస్సులపై లోడ్‌ పెరుగుతోంది. దీంతో టైర్లు, ఇంజన్లపై ఒత్తిడి పెరుగుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సిటీ బస్సులు 13 లక్షల కిలోమీటర్లు తిరగకముందే స్ర్కాప్‌కు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంటు న్నారు. సాధారణంగా 45 నుంచి 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో రద్దీ వేళల్లో వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఈ ప్రభావం బస్సుల ఫిట్‌నెస్(Fitness)‏పై పడుతుందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో ఆర్టీసీ 2,800 సిటీబస్సులు నడుపుతుండగా 1,653 ఆర్డినరీ, 906 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టక ముందు గ్రేటర్‌జోన్‌లో రోజూ 5 లక్షల మంది మహిళలు సిటీ బస్సులో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపయింది. మహిళల రద్దీ పెరగడంతో టికెట్‌ తీసుకొని బస్సుల్లో ప్రయాణం చేసేకొంతమంది ఆర్టీసీ బస్సులను వదిలేసి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రద్దీ వేళల్లో బస్సుల్లో ఎక్కేందుకు స్థలం లేకపోవడంతో దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, మెహిదీపట్నం(Dilsukhnagar, Uppal, Miyapur, Kukatpally, Mehidipatnam), ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, కోఠి ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆటోలకు డిమాండ్‌ పెరిగింది.

మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, ఏసీ బస్సుల్లో 65 శాతం మించడం లేదు. ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉండటం, కొన్ని రూట్లకే పరిమితం కావడంతో అనుకున్నస్థాయిలో ప్రయాణికులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ రూట్‌లో నడుపుతున్న 40 పుష్పక్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ 60 శాతం మించకపోయినా బస్‌ రూట్లలో మార్పులు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.

ఎలక్ర్టిక్‌ ఆర్డినరీ బస్సులను పెద్దసంఖ్యలో తీసుకువస్తే కానీ ఆర్డినరీ సిటీ బస్సులపై ఓవర్‌లోడ్‌ తగ్గే పరిస్థితులు కన్పించడం లేదు. గ్రేటర్‌లో 2024 డిసెంబర్‌ నాటికి 500 ఎలక్ర్టిక్‌ బస్సులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. దేశవ్యాప్తంగా ఈ బస్సులకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో బస్సుల రాక ఆలస్యం అవుతుందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలి

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోతో తాము నష్టపోతున్నామంటూ గురువారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్‌ -1 నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరఫున న్యాయవాది మోహిత్‌ రావు శుక్రవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని కోరారు. అయితే.. తక్షణమే విచారించలేమని, సోమవారం (ఈనెల 21న) విచారిస్తామని సీజేఐ స్పష్టం చేశారు.

రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు శ్రీనివాస్‌, అర్జున్‌, ఇందిరా నాయక్‌, రామ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు.

గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 1 అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తమకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమకు న్యాయం దక్కుతుందన్న నమ్మకంతో సుప్రీం కోర్టును ఆశ్రయించామని, జీవో 29ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాం

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. లిక్కర్ షాప్ ల లైసెన్స్ లు దక్కించుకున్న వ్యాపారులు అనేక ప్రాంతాలలో మద్యం దుకాణాలు ప్రారంభించారు.

అనేక జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మద్యం వ్యాపారులను ఎమ్మెల్యేల అనుచరులు బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా లిక్కర్ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మద్యం వ్యాపారం విషయంలో అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించినా కొంతమంది నాయకులు ఆయన మాటలను పెడచెవిన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు సీఎం చెప్పినా కూడా అధికార పార్టీ నాయకులు మారకపోవడంతో మద్యం వ్యాపారులు భయపడిపోతున్నారని తెలిసింది.

కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపుల లైసెన్సులు దక్కించుకున్న మద్యం వ్యాపారులు వాళ్లు అక్కడ లిక్కర్ షాపులు పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నయోజకవర్గాలలో అధికార పార్టీ నాయకులకు భయపడిపోయిన మద్యం వ్యాపారులు లిక్కర్ షాప్ ల లైసెన్సులు ఆ నాయకులకు ఇచ్చేసే వెళ్లిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకుల అనుచరులు మద్యం వ్యాపారులను బెదిరించి 30 శాతం నుంచి 50 శాతం వరకు వాటాలు అడుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అనేక నియోజకవర్గాలలో మద్యం షాపులు ప్రారంభించిన వ్యాపారులను బెదిరించి ఇష్టం వచ్చినట్లు వాటాలు అడుగుతున్నారని, మామాట వినకుంటే మీరు ఎలా వ్యాపారం చేస్తారో మేము చూస్తామని నాయకుల అనుచరులు బెదిరిస్తున్నారని తెలిసింది. ఇప్పుడు అనేక నియోజకవర్గాలలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కూడా లిక్కర్ షాప్ లలో వాటాలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చాలామంది మద్యం వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదులు చేయలేక, నాయకులకు వాటాలు ఇవ్వడానికి రాజీకాలేక సతమతం అవుతున్నారని సమాచారం.

రేవంత్ చేసేది మూసీ లూటిఫికేషనే: పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కేటీఆర్

మూసీ ప్రక్షాళనపై గురువారం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటూ ఎద్దేవా చేశారు. మూసీని మురికి కూపంగా తాము మార్చలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ఏం చేసింది, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసిందనేదానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

మూసీని మురికి కూపంగా మార్చిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని కేటీఆర్ అన్నారు. తాము ముసీని కరకట్టలతో కాపాడాలనుకున్నామని చెప్పారు. తాము రూ. 16,634 కోట్లతోనే మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లంటూ ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ ప్రాజెక్టుని తీసుకొచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.

నిన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు తాను ఏదో విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాన‌ని అనుకుని త‌న సంపూర్ణ‌మైన అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చేయ‌ని స‌ర్వేలను చేసిన‌ట్టు.. అబ‌ద్ధాలు, అర్ధ స‌త్యాల‌ను అర్థంప‌ర్థం లేని అసంబద్ద వాద‌న‌ల‌ను సంపూర్ణంగా బ‌య‌ప‌టెట్టి త‌న ప‌రువు తానే తీసుకున్నారని కేటీఆర్ విమ‌ర్శించారు.

మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఎలాంటి స‌ర్వే జ‌ర‌గ‌లేదు. మా ఇంటికి ఎవ‌రు రాలేదు.. స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లే చెబుతున్నారు. ఈయ‌నేమో(రేవంత్ రెడ్డి) రెండు నెల‌ల నుంచి స‌ర్వే చేస్తున్నామ‌ని అబ‌ద్ధాలు ఆడుతున్నారు. ఇక‌ జేసీబీల‌తో, కూలీల‌ను పెట్టి ఇళ్లు కూల‌గొడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా సోష‌ల్ మీడియాలో కూడా వీడియోలు వ‌చ్చాయి. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఇళ్లను కూలగొట్టేందుకు వ‌చ్చిన ఓ కూలీ కూడా బాధ‌ప‌డ్డ‌ట్టు సోష‌ల్ మీడియాలో వీడియోలు వ‌చ్చాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మండిపడ్డారు. ల‌క్ష‌న్న‌ర కోట్ల కుంభ‌ణానికి కాంగ్రెస్ నేత‌లు ప్లాన్ చేస్తున్నారు.. దాన్ని స‌మాజం గ‌మ‌నిస్తుందన్నారు.

మీరు ఆరు గ్యారెంటీల‌ను అట‌కెక్కించారు. 420 హామీల‌తో ప్ర‌జ‌ల గొంతు కోశారు. ముఖ్య‌మంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూట‌ల కోస‌మే అని తేలిపోయింది' అని రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై నల్గొండ మంత్రులు జ్ఞానం పెంచుకోవాలంటూ హితవు పలికారు.

అదానీ గొప్ప మనసు.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. స్కిల్ యూనివర్సిటీకి ఏకంగా రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు.

దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందజేశారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రకటించిన రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ గొప్ప ప్రయత్నానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.' అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఆయన ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. మొత్తం 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ప్రతి ఏడాది లక్ష మందికిపైగా శిక్షణ ఇచ్చేలా రానున్న రోజుల్లో ఈ స్కిల్ యూనివర్సిటీని విస్తరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవంతిలో ఈ స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదుకు లిమిట్.. లేకుంటే ఐటీ నోటీసులు తప్పదు

సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.

ఇటీవల కాలంలో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. ఖాతాదారుడికి ఖచ్చితంగా ఆధార్, పాన్ కార్డు ఉండి తీరాలి. అలా అయితేనే బ్యాంక్‌లో ఖాతా తెరుస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతాల్లో వివిధ రకాలు ఉన్నాయి. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ తదితర రకాలున్నాయి. కానీ చాలా మంది సేవింగ్ అకౌంట్‌లనే ఒపెన్ చేస్తారు.

అత్యధిక శాతం ఖాతాదారులు.. తాము సంపాదించిన నగదును ఈ ఖాతాల్లోనే పొదుపు చేస్తుంటారు. ఈ సేవింగ్ అకౌంట్లలో నగదు భద్రపరచడమే కాకుండా.. దీనిపై వడ్డీని సైతం పొందవచ్చు. మరికొన్ని సమయాల్లో.. ఇతరుల నగదును తమ ఖాతాల ద్వారా ఖాతాదారుడు లావాదేవీలు జరుపుతుంటాడు. అలాంటి వేళ సేవింగ్ అకౌంట్ పరిమితి దాటుతుంది. అసలు సేవింగ్ అకౌంట్‌లో లిమిట్ ఎంత ఉండాలి.

ఈ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేసుకోవచ్చు. ఓ వేళ ఆ పరిమితి దాటితే ఖాతాదారుడికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అంటే.. ఎదురయ్యే అవకాశాలున్నాయి. సేవింగ్ అకౌంట్లలో దాచుకునే సొమ్ము పరమితి దాటితే మాత్రం ఖాతాదారుడికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశముంది.

మరి అలా కాకూడదంటే.. సేవింగ్ అకౌంట్‌లో ఎంత నగదు ఉంచవచ్చు. అంటే.. సేవింగ్ అకౌంట్‌లో ఎంత నగదు అయినా జమ చేసుకోవచ్చు. అందుకు పరిమితి లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ.. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌లో నగదు జమ చేసేందుకు రూ.10 లక్షల వరకు పరిమితి విధించింది.

అంటే ఒక ఏడాదిలో బ్యాంక్ సేవింగ్ అకౌంట్‌లో రూ.10 లక్షల వరకు నగదు జమ చేయవచ్చు. ఆపై నగదు జమ చేస్తే మాత్రం ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేస్తారు. దాంతో జమ అయిన నగదుపై పన్ను చెల్లించవలసి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.

దీంతో సేవింగ్ అకౌంట్‌లో జమ అయిన నగదుకు.. రిటర్న్ ఫైల్ చేసే సమయంలో చూపిన వివరాలు కచ్చితంగా ఉండాలి. ఏ మాత్రం పొంతన లేకుంటే మాత్రం ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తుంది. దీంతో ఖాతాదారుడు.. ఆ నగదుకు సంబంధించిన కచ్చితమైన వివరాలు ఆదాయపు పన్ను శాఖ వారికి సమర్పించాల్సి ఉంటుంది.

ఆ క్రమంలో నగదు రాబడి అంశంలో ఏ మాత్రం తప్పు జరిగినట్లు భావించినా.. ఆదాయపు పన్ను శాఖ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. దీంతో జరిమానాతోపాటు చట్టపరమైన చర్యలకు సైతం ఆ శాఖ ఉపక్రమించే అవకాశముంది. ఈ నేపథ్యంలోల సేవింగ్స్ అకౌంట్‌లో నగదు ఎంత ఉండాలనే విషయాన్ని ఖాతాదారుడు ముందే తెలుసుకుని మసులుకుంటే మంచిది.

భారత్‌తో సంబంధాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసిన నవాజ్ షరీఫ్,

భారత విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ పర్యటన తర్వాత, పాకిస్థాన్ "మర్యాద"లో ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 16న పాకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భారత్‌తో సంబంధాలపై పాకిస్థాన్‌కు కొత్త ఆశలు చిగురించాయి, పాకిస్థాన్‌ అధికార పార్టీ పీఎంఎల్‌ఎన్‌ అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. జైశంకర్ పాకిస్థాన్ పర్యటన నాంది అని నవాజ్ షరీఫ్ అన్నారు. ఇక్కడి నుంచి భారత్, పాకిస్థాన్ తమ చరిత్రను వదిలిపెట్టి ముందుకు సాగాలి.

పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధ్యక్షుడు షరీఫ్, భారతీయ పాత్రికేయులతో మాట్లాడుతూ, జైశంకర్ పాకిస్తాన్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలకు ముఖ్యమైనదని అన్నారు. దీని కారణంగా ఇంధన సంక్షోభం మరియు వాతావరణ మార్పుల వంటి వాటి సమస్యలపై దృష్టి సారించే అవకాశాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ పొందవచ్చు. ఇరు దేశాలు శాంతి ప్రక్రియను పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

75 ఏళ్లు కోల్పోయాం: షరీఫ్

ఈ వ్యవహారం ఇలాగే సాగుతుందని షరీఫ్ అన్నారు. ఇది ముగియకూడదు. మోడీ సాహెబ్ స్వయంగా ఇక్కడికి వచ్చి అడ్రస్ సమర్పించి ఉంటే బాగుండేది, జైశంకర్ కూడా రావడం విశేషం. ఇప్పుడు మనం ఎక్కడ వదిలేశామో అక్కడి నుండి తీయాలి. 75 ఏళ్లు కోల్పోయాం, ఇప్పుడు రాబోయే 75 ఏళ్ల గురించి ఆలోచించాలి.

ప్రధాని మోదీ లాహోర్‌ పర్యటనను ప్రశంసించారు

2015 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్‌లో చేసిన ఆకస్మిక పర్యటనను ప్రశంసించిన షరీఫ్, రెండు దేశాల మధ్య సంబంధాలలో "సుదీర్ఘంగా ఉన్న స్తబ్దత"తో తాను సంతోషంగా లేనని, ఇరుపక్షాలు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పొరుగు దేశాలను మార్చలేమని, పాకిస్థాన్‌ను లేదా భారత్‌ను మార్చలేమని నవాజ్ అన్నారు. మనం మంచి పొరుగువారిలా జీవించాలి.

రిలేషన్స్‌లో సుదీర్ఘ విరామంతో నవాజ్ సంతోషంగా లేడు

మా నాన్న పాస్‌పోర్ట్‌లో ఆయన జన్మస్థలం అమృత్‌సర్ అని రాసి ఉందని నవాజ్ షరీఫ్ అన్నారు. మనం ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష, ఆహారం పంచుకుంటాం. మా రిలేషన్‌షిప్‌లో సుదీర్ఘ విరామం ఉన్నందుకు నేను సంతోషంగా లేను. నాయకుల మధ్య సత్ప్రవర్తన లేకపోవచ్చు కానీ, ప్రజల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. భారతదేశ ప్రజల కోసం ఆలోచించే పాకిస్థాన్ ప్రజల తరపున నేను మాట్లాడగలను మరియు భారతీయ ప్రజల కోసం నేను అదే చెబుతాను.

చెడిపోయిన సంబంధాలకు ఇమ్రాన్ ఖాన్‌ను బాధ్యులను చేశాడు

ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించడానికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని షరీఫ్ పేర్కొన్నాడు మరియు ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. షరీఫ్ వాడిన భాష భారత్ తో సంబంధాలను దెబ్బతీసిందని అన్నారు. ఇలాంటి భాష మాట్లాడటం వదిలేయండి, నాయకులు ఆలోచించకూడదు.