టీడీపీని వీడి వైసీపీలో చేరిన కీలక నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ట్విస్ట్ ఇస్తూ కీలక నేత ఒకరు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ముదునూరి ముర‌ళీకృష్ణంరాజు ఆ పార్టీని వీడారు. ఆయన తాడేప‌ల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముర‌ళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీలో ఉండేవారు.. 2023లో టీడీపీ చేరారు. మళ్లీ ఇప్పుడు తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో సార్వత్రిక ఎన్నికలు వైఎస్సార్‌సీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పేశారు.. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిన నేతల్ని చూశాం.. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీ. అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరి షాకిచ్చారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఆయనకు కండువా కప్పిన అధినేత జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు ముదునూరి మురళీకృష్ణంరాజు. మురళీకృష్ణంరాజు అధికార పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలతో ఆయన టీడీపీని వీడినట్లు తెలుస్తోంది.

ముదునూరి మురళీకృష్ణంరాజు 2023 ఏప్రిల్‌లో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన్ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా నియమిచంచారు. మురళీకృష్ణంరాజు ఆయన చేరినప్పటి నుంచి ప్రత్తిపాడులో విభేదాలు మొదలయ్యాయి. ఆయనపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మురళీరాజు టీడీపీకి ద్రోహం చేశారని.. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ కోసం పనిచేయకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల కోసం డబ్బులు పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ సత్యప్రభకు ఓటు వేయొద్దని గ్రామాల్లో ప్రలోభాలకు గురి చేశారని నేతలు ఆరోపించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి పార్టీ నుంచి పొందిన పదవులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి, కూటమి అభ్యర్థికి వెన్నుపొటు పొడిచిన మురళీరాజుపై అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటి నుంచే టీడీపీ కేడర్ మురళీరాజుపై విమర్శలు చేసింది.. అయితే తాజా పరిణామాలతో ఆయన టీడీపీని వీడి మళ్లీ వైఎస్సార్‌సీపీల ోచేరారని చెబుతున్నారు.

హైడ్రాకు సర్వాధికారాలు..

గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రా (Hydra)కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.,) ఉత్తర్వులు జారీచేసింది. గురువారం నుంచి అధికారులు హైడ్రా డైరెక్షన్ లోనే నోటీసులు (Notices) జారీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో (GO) 199 విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ (Power) హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ (GHMC) చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు. అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా చేయనుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)కు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ-1955 చట్టంలోని సెక్షన్‌ 374-బీ ప్రకారం చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లు, డ్రైన్‌ల పరిరక్షించాల్సి ఉంటుంది. ఈ అధికారాలను హైడ్రాకు బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మంత్రివర్గ ఆమోదంతో ఆర్డినెన్సు ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపింది. దీనిని ఆమోదిస్తూ ఈ నెల 3వ తేదీన గవర్నర్‌.. గెజిట్‌ విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా పురపాలక శాఖ జీవో 191ను జారీ చేసింది. ఆర్డినెన్స్‌, జీవో జారీతో హైడ్రా చర్యలకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తాజా అధికారాలతో ఆక్రమణలకు సంబంధించి హైడ్రా నోటీసులు జారీ చేయనుంది. ఆయా నిర్మాణదారులు సంబంధిత అనుమతి పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించని పక్షంలో స్పీకింగ్‌ ఆర్డర్స్‌ జారీ చేస్తుంది. వారు ఇచ్చే వివరణ అప్పటికీ సహేతుకంగా లేకుంటే నిర్మాణం కూల్చివేత/సీజ్‌ చేసే అధికారం హైడ్రాకు ఉంటుంది. చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలపై ఆదిలో ఉక్కుపాదం మోపిన హైడ్రా... హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొంత కాలంగా ఆచితూచి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు చెరువుల వాస్తవ విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణపై దృష్టి సారించింది. ఇందుకోసం సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ సాంకేతిక సహకారం తీసుకుంటోంది.

జీవో జారీ నేపథ్యంలో ఇక నుంచి చట్టపరంగా ముందుకు వెళ్లాలని సంస్థ భావిస్తోంది. వాస్తవానికి రోడ్లు, పార్కులు, చెరువుల్లో ఆక్రమణలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాలు జీహెచ్‌ఎంసీతోపాటు మునిసిపాలిటీలకు ఉన్నాయి. కానీ, కూల్చివేతలపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నోటీసుల జారీ, స్పీకింగ్‌ ఆర్డర్స్‌ తర్వాతే హైడ్రా నిర్ణయం తీసుకోనుంది. ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు హైడ్రా పరిధి ఉన్న నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వరకు జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం, ఆవలి ప్రాంతాల్లోని 27 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో మునిసిపల్‌ చట్టం ప్రకారం ముందుకు సాగనున్నట్టు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. తాజా జీవోతో హైడ్రా మరింత బలపడిందని, పూర్తి స్థాయిలో అధికారాలు వచ్చాయ న్నారు. అనధికార భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారికీ హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని తెలిపారు.

ప్రధానితో చంద్రబాబు, పవన్ భేటీ - గేమ్ ఛేంజర్..!!

సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ హర్యానా వెళ్తున్నారు. హర్యానా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఆ తరువాత ఎన్డీఏ సమావేశంలో ఈ ఇద్దరు పాల్గొంటారు. జమిలి ఎన్నికల వేళ కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో ఈ భేటీ కీలకం కానుంది. ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి. సీఎం చంద్రబాబు...డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక విమానంలో హర్యానాకు వెళ్తనున్నారు.

ప్రమాణ స్వీకారం తరువాత ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొంటారు. ఈ భేటీలో రానున్న రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటుగా నాలుగు నెలల ఎన్డీఏ మూడో విడత పాలన గురించి చర్చించనున్నారు. జమిలి ఎన్నికల విషయంలో వ్యూహాల పైన ప్రధాని తమ భాగస్వామ్య పక్ష నేతలకు వివరించే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరు కావటం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రధానిగా మోదీ ఎన్నిక జరిగిన సమావేశంలో పవన్ ను ఉద్దేశించి ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. చాలా కాలం తరువాత ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించనున్నారు.

అదే విధంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. కేంద్ర మంత్రుల తో పాటుగా ఎన్డీఏ పక్షాల సీఎంలు..డిప్యూటీ సీఎంలు హర్యానా చేరుకుంటున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి అధికారం చేపడుతోంది.

వాయు'గండం'గా మారిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 17వ తేదీన చెన్నై-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అల్పపడీనం నెల్లూరుకు 590 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 500 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ములుగు, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీచేశారు. రెండు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈరోజు కూడా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

కూకట్ పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రామంతపూర్, ఉప్పల్, మూసాపేట, బోరబండ, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రానికి మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు.

అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ తడిసి ముద్దవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు హైఅలర్ట్ జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

మెదక్ జిల్లాలో కారు బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు.. అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పైగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు.. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జయింది. చనిపోయిన ఏడుగురిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడే ప్రాణాలు విడిచారు. ఇక వారంతా పాముబండా తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా.. వేగంగా వచ్చిన ఆ కారు.. రహదారిపై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి ఆ తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో గాల్లోకి ఎగిరి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కకు ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం అదే వేగంతో కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లోనే చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు.

ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని మృతదేహాలను బయటికి తీసి.. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఆ ఏడుగురు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించిన పోలీసులు.. వారిది పాముబండ తండా అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాద ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

సీఎం చెప్పినా వినరా?

స్టేడియాలను ఇకపై బహిరంగ సభలు, సమావేశాలు, క్రీడేతర కార్యక్రమాలకు వినియోగించబోమని సాక్షాత్తూ సీఎం రేవంత్‌ రెడ్డి రెండునెలల కిందట ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పిన మాటలను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) యంత్రాంగం బేఖాతరు చేస్తోంది.

వచ్చే శనివారం గచ్చిబౌలి ప్రధాన స్టేడియంలో దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.16 కోట్లకు పైగా వెచ్చించి, స్టేడియంలోని సీట్లు, ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఆధునికీకరించింది. అథ్లెటిక్‌ ట్రాక్‌ను కూడా మరమ్మతు చేసే ఆలోచనలో ఉన్న సమయంలో ఈ సంగీత విభావరికి స్టేడియంను ‘శాట్‌’ ఎలా కేటాయించిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇళయరాజా సంగీత విభావరికి స్టేడియాన్ని ఇచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ మైదానంలో గుంతలు తవ్వడం, ఆహార పదార్థాల వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు పడేసి చిందరవందరగా తయారు చేశారు.

ఇప్పటికే సంగీత విభావరి నిర్వాహకులు అథ్లెటిక్‌ సింథటిక్‌ ట్రాక్‌పైన స్టేజ్‌ కూడా వేయడంతో ‘శాట్‌’ అధికారుల తీరుపై క్రీడాకారులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు.

వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

గురువారం ఉదయం 10:30గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. విచారణ నిమిత్తం మంగిళగిరి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులో తెలిపారు. 2021 అక్టోబర్ 19న అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్మిచర్, కార్లు, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించగా.. తాజాగా సజ్జలకు నోటీసులు ఇచ్చారు.

మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సన్నిహితుడు చైతన్య సోమవారం రోజున మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధించిన నాటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అయితే తాజాగా అతను కోర్టులో లొంగిపోయారు.

అలాగే సోమవారం నాడు వైసీపీ నేతలు అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలసిల రఘురామ్‌ను మంగళగిరి పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. దాడి సమయంలో తీసిన ఫొటోలను చూపించి పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కేసు విచారణ పూర్తిగా సీఐడీ చేతికి వెళ్లే వరకూ మంగిళగిరి పోలీసులు దర్యాప్తు చేస్తారు.

మట్టే బంగారమాయెనే..

అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, మంచాల్‌, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్‌ అండ్‌ జియాలజీ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, మంచాల్‌, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్‌ అండ్‌ జియాలజీ డిపార్టుమెంట్‌ అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధి కోహెడ గ్రామంలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయంటూ పలువురు ఆగస్టులో జిల్లా మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ మైనింగ్‌ ఆపాలని సెప్టెంబర్‌ 9వ తేదీన అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేయాలని అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల తహసీల్దార్‌లను ఆదేశించారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు నిలిపి వేయడంతో లారీల యజమానులు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని నగరానికి తరలిస్తున్నారు. అయితే దాదాపు రెట్టింపు ధర తీసుకుంటున్నారు. ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, తూఫ్రాన్‌పేట్‌, సరళ మైసమ్మ, రాచకొండ గుట్టలు, మల్కాపురం, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొస్తున్నారు.

మైనింగ్‌ శాఖ మట్టి తవ్వకాలను ఆపివేయడంతో కొరత ఏర్పడడంతో ధర పెరిగింది. గతంలో 300 ఫీట్ల లారీ మట్టికి రూ. 3,500 తీసుకునే వారు, ప్రస్తుతం రూ. 6,500 వరకు తీసుకుంటున్నారు. 600 ఫీట్ల లారీకి రూ. 6,500 తీసుకుంటుండగా ఇప్పుడు రూ. 10 వేలు తీసుకుంటున్నారు. 12 టైర్ల లారీ మట్టికి రూ. 10 వేలకుగాను ప్రస్తుతం రూ. 15 వేలు తీసుకుంటున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి నగరానికి మట్టి తరలిస్తున్న లారీలను పోలీసులు టార్గెట్‌గా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. లారీకి సుమారు రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ప్రశ్నిస్తే.. వే బిల్లు చూపించమంటున్నారని వాపోయారు. కంకర లారీలను వే బిల్లులు అడగడం లేదంటున్నారు. తమకు వచ్చే లాభం పోలీసుల పరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌ తెచ్చిన అప్పు 10 నెలల్లో రూ.80,500 కోట్లు

రేవంత్‌ రెడ్డి గద్దె నెక్కిన రోజు నుంచి పది నెలల్లో రూ.80,500 కోట్ల అప్పు తెచ్చారని, రికార్డు స్థాయిలో అప్పులు తెచ్చి దేనికి ఖర్చు చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించారు.

అప్పు చేయడమే తప్పు అన్నోళ్లను ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని.. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని.. అలాంటప్పుడు అప్పు తెచ్చిన రూ.80 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.

బడా కాంట్రాక్టర్ల బిల్లులకు ఆ మొత్తం ధారాదత్తం చేశారా? కమీషన్లకు కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ప్రాజెక్టులు నిర్మించామని, ప్రతి పైసా మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశామన్నారు. తెచ్చిన అప్పులతో దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు.

రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా.. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా.. నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇన్ని వేల కోట్లు ఏం చేశారని నిలదీశారు.

రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రయత్నం చేయకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ అప్పులు రాష్ట్ర భవిష్యత్‌ కే పెను ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.

11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ లకు రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం 11 మంది ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే అందరినీ రిలీవ్ చేసినట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. డీఓపీటీ ఆదేశాల ప్రకారమే రిలీవ్ చేసినట్లు పేర్కొంది. రిలీవ్ అయిన వారితో తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ రిలీవ్ చేసిన వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, సృజనలు ఉన్నారు.

ఏపీ కేడర్ కు చెందిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరంతా తమను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం ప్రభుత్వం వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది. వీరంతా ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. అయినప్పటికీ వీరిలో కొంత మంది క్యాట్ ను ఆశ్రయించారు.మంగళవారం విచారణ చేపట్టిన క్యాట్ ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. డీవోపీటీ ప్రకారం ఎక్కడి వారు అక్కడే రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.

బుధవారం యథావిధిగా రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని.. వారికి సేవ చేయాలని మీకు లేదా అని ప్రశ్నించింది.దీంతో ఈ 11 మంది IAS, IPS అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు తెలంగాణ క్యాడరే కావాలని పిటిషన్ లో కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ కు చెందిన అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్ ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లను రిలీవ్ చేయడంతో వీరంతా ఏపీలో రిపోర్ట్ చేస్తారా.. హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి. గతంలో తెలంగాణలో పని చేసిన సోమేశ్ కుమార్ ను కూడా ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆయన ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.