తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం.

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ :  తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున పంపినట్లు తెలిపారు. అలాగే తన కుమారుడు హర్షవర్దన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున, తన కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రూ.2.5 లక్షల చొప్పున సాయం చేసినట్లు వెల్లడింంచారు.
అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్

అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి:  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి

సెప్టెంబర్ 2, 2024 : ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లాలోని పెంచికల్ పేట మండలం పోతేపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్, పరిసరాలు, పిల్లలకు అందిస్తున్న పోషక ఆహారం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లల సంరక్షణకు కృషి చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఏ.ఈ. ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై దాడి చేసిన కాగజ్నగర్ టౌన్ పోలీసులు కాగజ్నగర్లోని గుంటూరు కాలనీ వద్ద ఒక ఇంటిలో ఆదివారం రోజున రాత్రి పేకాట ఆడుతున్న పేకాట స్థావరం పై దాడి చేసి మొత్తం ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకొని వారి నుండి మొత్తం 43 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడమైనదని టౌన్ ఇన్స్పెక్టర్ తుత్తూరు శంకరయ్య తెలిపారు. పేకాట స్థావరం పై దాడిలో కాగజ్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ తుత్తూరు శంకరయ్య ఎస్సై దీకొండ రమేష్ వారి సిబ్బంది పాల్గొన్నారు. కాగజ్ నగర్ టౌన్ లో ఎవరైనా పేకాట శిబిరాలు నడిపిచో చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించమని తెలిపారు.
ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కసరత్తు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,Sep 01, 2024, : ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కసరత్తు కాగజ్‌నగర్‌ పట్టణం ఎస్పీఎం మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. మిల్లు పునఃప్రారంభమైన తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో కార్మికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మిల్లులోని 15 గుర్తింపు సంఘాలు తమ సంవత్సర నివేదికలను అందజేయాలని డీసీఎల్ సునిత లేఖలు పంపించడంతో ఆయా సంఘాలు నివేదికల తయారీలో నిమగ్నమయ్యాయి. మరో వైపు తమ సంఘం తరపున ఎవరిని బరిలో దింపాలనే దానిపై సైతం కసరత్తు చేస్తున్నాయి.
2న ప్రజావాణి కార్యక్రమం రద్దు, విద్యా సంస్థలకు సెలవు: జిల్లా కలెక్టర్

కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా సెప్టెంబర్ 1, (స్ట్రీట్ బజ్ జిల్లా ప్రతినిధి): భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 2న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దుతో పాటు విద్యా సంస్థలకు  సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రాకూడదని, ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని, ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.6304686505 ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవలు నిమిత్తం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.
భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.

కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1,(స్ట్రీట్ బజ్ జిల్లా ప్రతినిధి): ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డి. జి. పి. డా. జితేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పి.లతో వరద ప్రభావిత పరిస్థితులు, చేపట్టవలసిన రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాల వారీగా నెలకొన్న వరద పరిస్థితులు,  చేపడుతున్న సహాయక చర్యల వివరాలను తెలుసుకున్నారు. మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున  ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని, అధికారులు క్షేత్రస్ధాయిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, భారీ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపిస్తామని, ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు వచ్చే వరకు వేచి చూడకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగిస్తూ ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్లాటూన్ల పోలీస్ బలగాలు అందుబాటులో ఉన్నాయని, చెరువులు, కుంటలు, వాగులు, రిజర్వాయర్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేయాలని తెలిపారు. ప్రస్తుత సమయంలో ఎవరు సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని, వర్ష ప్రభావిత జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలని, లో-లెవల్ వంతెనలు, కాజ్ వే లపై నుండి నీరు ప్రవహిస్తున్న మార్గాల నుండి వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల నుండి దారి మళ్లించాలని సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు తెగిపోకుండా ముందస్తు అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ వరద పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని, లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని, వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పని చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్.పి. డి.వి.శ్రీనివాస్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాగులు, కల్వర్టులు, నదుల వద్దకు ఎవరు వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధికారుల సమన్వయంతో ప్రజా రక్షణ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని అడ, కొమురం భీం ప్రాజెక్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి

➡️ వర్షంలో తడిచిన విద్యుత్ స్తంభాలు, తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు.

➡️ విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దు.

➡️ చిన్న పిల్లలు కరెంట్ వస్తువులకు దూరంగా ఉంచాలి.

➡️ ఇంట్లో ఇనుప తీగలపై దుస్తులు ఆరబెట్టుకోవద్దు.

➡️ ఉరుములు, మెరుపుల సమయంలో డిష్ వైర్, టీవీ నుంచి తీసివేయాలి.

➡️ రోడ్లపై నీరు నిలిచినప్పుడు మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్లాలి.

➡️ వరద భారీగా చేరే ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేయకూడదు.

భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి కూతుర్లు మృతి..!


నారాయణపేట జిల్లా, సెప్టెంబర్ 01: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుం డా జోరుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి తల్లి కూతుళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది..

నారాయణపేట జిల్లా , కొత్త పల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున వర్షాల ధాటికి ఇల్లు కూలిన ఘటనలో తల్లి కూతుళ్లు మృతి చెందారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమమ్మ (78) కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉండగా, భర్త చనిపోయిన రెండో కూతు రు అంజూలమ్మ (38)తో కలిసి నివాసం ఉండేది. కుమారుడు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు. 

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలడంతో నిద్రలోనే తల్లి కూతుళ్లు ఇద్దరు మృతి చెందారు.

విషయం తెలిసిన వెంటనే తహసిల్దార్ అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరు కుని ప్రమాదానికి గల కారణాలను తెలుసు కున్నారు.

తాహసిల్దార్ మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి వెళ్ళరాదని చెరువులు వాగులు సందర్శించరాదని ప్రజలకు సూచించారు...

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు.


వరంగల్ జిల్లా, సెప్టెంబర్01 :ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. 

రాయపర్తి మండలం మొరిపిరాల శివారులో జాతీయ రహదారిపై చెట్టు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వరంగల్ జిల్లా తోపనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

వేములవాడ నుంచి మహబూబాబాద్ కు శనివారం రాత్రి బయల్దేరిన ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నా రని తెలిపారు. అధికారులు స్పందించి తమను సురక్షి తంగా గమ్య స్థానాలకు చేర్చాలని కోరుతున్నారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఎటూచూసిన దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. 

ఉదయం, మధ్యాహ్నం అనే తేడా లేకుండా మొత్తం చీకటి అలుముకుంది. మరోవైపు, ముసురుతో పాటు, చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. చలిగాలి వీస్తుండటంతో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు...

స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,కాగజ్ నగర్,ఆగస్టు 31: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ కొరకు ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నూతన ఓటరు నమోదు, సవరణలు, మార్పులు, తొలగింపు అంశాలపై భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాబితా రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రమంలో ఓటరు జాబితా రూపొందించడంలో భాగంగా ఆన్ లైన్ లో టి - పోల్ పోర్టల్ లో ప్రతిరోజు లాగిన్ అయ్యి వివరాలను పరిశీలించాలని తెలిపారు. రేపు సాయంత్రం లోగా ఓటర్ల మర్జింగ్ పనులు పూర్తి చేయాలని, సెప్టెంబర్ 6వ తేదీన ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేయవలసి ఉన్నందున పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, అదనపు పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, తహసిల్దార్ కిరణ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.