తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 13:12

మరో మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వానలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఆగస్టు 15 వరకు వర్షాలు పడనున్నాయి. దేశంలో వాతావరణ పరిస్థితి గురించి ఐఎండీ అంచనా ఏంటో చూద్దాం..

భారత వాతావరణ విభాగం (IMD) ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మరింత వర్షపాతాన్ని అంచనా వేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధానిలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

అయితే కొన్ని ప్రాంతాల్లో రవాణా, రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అనవసర ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలని, వాతావరణ అప్‌డేట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఢిల్లీలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ధన్సా స్టాండ్ సమీపంలోని నజాఫ్‌గఢ్-ఫిర్ని రోడ్, బహదూర్‌ఘర్ స్టాండ్‌తో సహా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్ రద్దీకి కారణమైంది. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కోరారు.

మరోవైపు కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో పగటిపూట భారీ వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో విస్తృతమైన వర్షపాతం, వాయువ్య భారతదేశంలోని మైదానాలలో చెదురుమదురు వర్షాలు వారం పొడవునా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది

ఆగస్ట్ 12 నుండి 15 వరకు కేరళ, తమిళనాడు, కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో వానలు ఎక్కువగా పడనున్నాయి. హైదరాబాద్ లో ఆగస్టు 15 వరకూ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరికి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఆగస్టు 18 వరకు, హర్యానాలో ఆగస్టు 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈశాన్య, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 13:09

డిబేట్ లో బైడెన్ ను చిత్తుగా ఓడించా. : ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ ను తప్పించడం ఓ కుట్ర అని రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చివరి వరకూ తానే పోటీలో ఉంటానన్న వ్యక్తి సడెన్ గా వైదొలగడం కుట్ర కాకుండా ఏంటని ప్రశ్నించారు. బైడెన్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేశారని, ఆయనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 

ఎన్నికల ప్రచారం సందర్భంగా బైడెన్ తో జరిగిన డిబేట్ తన గొప్ప చర్చల్లో ఒకటని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ డిబేట్ లో బైడెన్ ను చిత్తుగా ఓడించానని, దాని ప్రభావంతో డెమోక్రాట్లు కుట్ర చేసి ఆయనను పోటీ నుంచి తప్పించారని ఆరోపించారు. ఈమేరకు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తో జరిగిన తాజా ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) లో జరిగిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

పెన్సిల్వేనియా ప్రచార సభలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. హత్యాయత్నం నుంచి బయటపడ్డ తర్వాత దేవుడిపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. కాల్పులు జరిగినపుడు తల తిప్పడమే తనను కాపాడిందని, బుల్లెట్ గాయం తర్వాత వెంటనే తనపై కాల్పులు జరిపారనే విషయం అర్థం చేసుకున్నానని వివరించారు. ఆ క్షణమే తేరుకున్నానని, మళ్లీ ప్రసంగం కొనసాగించాలని భావించగా సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పారని తెలిపారు.

అమెరికా సరిహద్దు వివాదాలు, వలసదారులకు అడ్డుకట్ట వేయడంపై ట్రంప్ స్పందిస్తూ.. బార్డర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశాలు తమ దేశంలోని నేరస్థులను, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని అమెరికాకు పంపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

దేశంలోకి అక్రమ వలసలను కఠినంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ కూడా అంగీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు అసలు ఐక్యూయే లేదని ట్రంప్ విమర్శించారు. బైడెన్ కు ఐక్యూ చాలా తక్కువని గతంలో తాను చెప్పానన్న ట్రంప్.. ఆయన పాలన చూశాక అసలు బైడెన్ ఐక్యూ జీరో అని అర్థం చేసుకున్నానని వివరించారు.

మస్క్ తో ఇంటర్వ్యూ జరుగుతుండగా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో తన ట్విట్టర్ ఖాతాను నిషేధించడంతో ట్రంప్ సొంతంగా ట్రూత్ పేరుతో ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసుకున్నారు.

ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్రంప్ పై నిషేధం ఎత్తివేశారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ పలు ట్వీట్లు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 13:05

యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్

మంగళవారం రష్యా భూభాగంలోని యుద్ధ ట్యాంకులు, సాయుధ దళాలతో చొచ్చుకొచ్చిన ఉక్రెయిన్ సైన్యం.. దూకుడుతో ముందుకు సాగుతోంది. కీవ్ సేనలతో పోరాటంలో మాస్కో దళాలు వెనుకబడిపోయాయి. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ దాడిని తిప్పికొడుతున్నామని రష్యా చెబుతున్నా.. అది కేవలం మాటలకే పరిమితం. ప్రస్తుతం యుద్ధంలో ఉక్రెయిన్‌దే పైచేయి. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లాయి. వారం రోజుల కిందట కుర్స్క్‌ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కుర్స్క్‌ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఒలెక్సాండర్‌ సిర్‌స్కీ ప్రకటించారు

అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ మొదటిసారి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా తమ సైనికుల ధైర్యసాహసాలను అభినందించిన జెలెన్‌స్కీ.. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఇతరులపై రష్యా ప్రారంభించిన యుద్ధం.. ఇప్పుడు ఆ దేశానికే తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఈ చొరబాటుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. డాన్‌బాస్‌లో మాస్కోను నిలువరించేందుకు కీవ్ చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌ సైన్యంతో సాగుతున్న భీకర పోరులో రష్యా తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా ఉన్నతస్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్‌.. ఆగస్టు 6న ఉక్రెయిన్‌ దాడులు ప్రారంభమైనట్టు తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పుతిన్ ఆరోపించారు. ‘శత్రువు స్పష్టమైన లక్ష్యాలలో ఒకటి అసమ్మతి, కలహాలు, ప్రజలను భయపెట్టడం, రష్యన్ సమాజం ఐక్యతను దెబ్బతీయడం’అని మండిపడ్డారు.

ఇరు సైన్యాలు భీకర దాడులతో కర్క్స్ రీజియన్‌లో 1.21 లక్ష మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 60 వేల మందిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, 28 గ్రామాలను ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని కస్క్ గవర్నర్ వెల్లడించారు.

దాడుల్లో 12 మంది పౌరులు చనిపోయినట్టు ఆయన తెలిపారు. గత మంగళవారం రష్యా భూభాగంలోకి మొదటిసారి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యాలు.. సరిహద్దుల నుంచి 30 కి.మీ. దూరం చొచ్చుకొచ్చాయి. ఇది ఉక్రెయిన్‌కు నైతికస్థైర్యాన్ని కలిగించినా.. మరో ముప్పుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ఈ పరిణామాలతో రగిలిపోతున్న మాస్కో.. ఉక్రెయిన్ పౌరులు, మౌలిక వసతులపై దాడులను రెట్టింపు చేసే ప్రమాదం ఉందని బ్రిటిష్ సైన్యానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు అంతర్జాతీయ సంస్థలు ఆహారం సహా మానవతా సాయం అందిస్తున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 08:43

నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది.

ఇప్పటివరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు.

ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను బొత్స సత్యనారాయణ పొందు పరిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చూపించారు. టీడీపీ తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ పోటీ చేస్తుందో లేదో వేచి చూడాలి.

మరోవైపు.. గ్రేటర్ విశాఖ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానంతో ముందస్తుగా వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. దుష్టులకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సభ్యులను క్యాంపులకు పంపించామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.

మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి.

మరీ టీడీపీ పోటీలో నిలుస్తుందా లేదా అనేది కాసేపట్లో ఖరారు కానుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 17:56

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలి

రెండవ విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేసి, అనంతరం దళిత బంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుపేద దళితులను గుర్తించి ఆర్థిక భరోసగా దళిత బంధులో లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని తెలిపారు.

ఎంపిక సమయంలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుండి వాటికి సంబంధించిన అన్ని పత్రాలను తీసుకొని పరిశీలన చేసి దళిత బంధు పోర్టల్ లో పేర్లను నమోదు చేశారని పేర్కొన్నారు.

బ్యాంకులో కూడా దళిత బంధు లబ్ధిదారులతో జీరో ఎకౌంటును తీయించారని వెల్లడించారు. దళిత బందులో నిధులను విడుదల చేశారని, లబ్ధిదారులకు రూ. 10 లక్షలు జమాయ్యాయి. గ్రౌండింగ్ జరిగే లోపు ఎన్నికల నియామవళి రావడంతో లబ్ధిదారులకు గ్రౌండిగ్ చేయలేదన్నారు.

ఎన్నికల తర్వాత గ్రౌండిగ్ చేస్తారు అనుకున్నాం కానీ ఎకౌంటు లను ఫ్రీజింగ్లో పెట్టి ఇప్పటివరకు గ్రౌండిగ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

తక్షణమే దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి దళిత జాతికి రావాల్సిన దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దళిత బంధు కోసం సాగే పోరాటంలో దళిత బంధు లబ్ధిదారులంతా పాల్గొనాలని కోరారు.

కార్యక్రమంలో పోతేపాక నవీన్, దొడ్డి రమేష్, పుల్లెంల ఏడుకొండలు, కొప్పోలు విమలమ్మ, మామిడి ఎల్లయ్య, పేరపాక నరసింహ, అద్దంకి రవీందర్, బాకి నరసింహ, బొజ్జ శ్రీను, బొజ్జ సురేష్, దర్శనం రాంబాబు, అప్పల మధు, ఉదారి శ్రీకాంత్, కొండేటి నాగయ్య, బాలస్వామి, చింతకింది సైదులు, పోలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:42

అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు

అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంలో దేశం విడిచిన హసీనా .. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన తిరుగు బాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ హసీనా ఈ ఆరోపణలు చేశారు.

ఆమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుండి వైదొలగానని పేర్కొన్నారు. వారు విద్యార్ధుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని, దానిని తాను సహించలేదన్నారు.

ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి .. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని, దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు.

తాను బంగ్లాదేశ్ లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని, అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగినట్లు చెప్పారు.

దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని అన్నారు.

తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు. చాలా మంది అవామీలీగ్ నాయకులు హత్యకు గురి కావడం ఆవేదన కల్గించిందన్నారు.

తమ పార్టీ మరోసారి నిలదొక్కుకుంటుందన్న ఆశాభావాన్ని షేక్ హసీనా వ్యక్తం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:40

తగ్గిన సిమెంట్‌ ధరలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం సిమెంట్‌ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ, శ్రీ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌ వంటి ప్రధాన కంపెనీల సిమెంట్‌...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం సిమెంట్‌ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కాలంలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ, శ్రీ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌ వంటి ప్రధాన కంపెనీల సిమెంట్‌ అమ్మకాలు 3 నుంచి 9 శాతం పెరిగాయి. అయితే ధరలు తగ్గటంతో కంపెనీల ఆదాయాలు, లాభాలకు గండి పడింది.

గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 50 కిలోల సిమెంట్‌ బస్తా సగటు ధర 3 శాతం తగ్గి రూ.348కు చేరింది. ఇదే సమయంలో ఫ్లైయాష్‌, స్లాగ్‌ వంటి ప్రధాన ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరిగాయి.

ఇది కంపెనీల ఆదాయాలు, లాభాలను దెబ్బతీసింది. ఇవి చాలవన్నట్టు పులి మీద పుట్రలా సూర్యుడి భగభగలు, ఎన్నికల ప్రచార హోరుతో నిర్మాణ రంగంలో కార్యకలాపాలకు బ్రేక్‌ పడింది.

ఈ కారణంగానే అలా్ట్రటెక్‌ కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో 1.87 శాతం వృద్ధి రేటుతో రూ.18,069.56 కోట్లకు చేరినా నికర లాభం మాత్రం ఫ్లాట్‌గా రూ.1,696.56. కోట్లుగా నమోదు చేసింది.

ఏసీసీ నికర లాభాలకైతే జూన్‌ త్రైమాసికంలో 22.46 శాతం గండి పడి రూ.361.40 కోట్లకు చేరింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.5,154.89 కోట్లుగా నమోదైంది.

అయితే జూన్‌ త్రైమాసికం నిరాశ పరిచినా భవిష్యత్‌కు మాత్రం ఢోకా లేదని కంపెనీలు కొండంత ఆశాభావంతో ఉన్నాయి. పుంజుకుంటున్న గృహ, మౌలిక సదుపాయాల నిర్మాణం, బడ్జెట్‌లో మౌలిక, గృహ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు కావటం సానుకూల అంశాలుగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:38

హై కోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం

ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు.

ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు. తాజాగా స్మితా సబర్వాల్ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.

దివ్యాంగులపై స్మిత సబర్వాల్ చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర ఈ పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె తెలిపారు. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్‌కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగులారని అడ్వకేట్ తెలిపింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పంచుకున్నా విషయం తెలిసిందే. ఈ చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా. ( IAS/ IPS/IFoS) అనేది ఫీల్డ్ వర్క్, పన్నులు విధించడం, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్‌కు ఈ కోటా అవసరమా అని తన అభిప్రాయాలను స్మితా సబర్వాల్ వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు(netizens) తీవ్రంగా స్పందించారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఈ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు.

వికలాంగులను 'సంకుచిత దృక్పథం'తో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడటం సరికాదని స్మితా సబర్వాల్ వైఖరీపై మండిపడుతున్నారు. దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత, సైకియార్టిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ప్రత్యక్ష ఉదాహరణలతో గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలుకి పోలియో సోకి సరిగా నడవలేనివారు, అయినా కూడా ఎడమచేత్తో రాసి, పాఠాలు చెప్పారని గుర్తు చేశారు. ఇలా చాలా మంది దివ్యాంగులు పలు రంగాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు.

అలాగే, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు(officers) ఇలా ట్వీట్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ‘మీ పని మీరు సరిగ్గా చేయండి చాలు. అంతేకానీ మీకు సలహాలు ఇచ్చే స్థాయి ఇంకా రాలేదని చెబుతున్నారు’ అని అన్నారు. అంతేకాదు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఈ అధికారిణిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణల మధ్య ఈ వివాదం మొదలైంది.

యూపీఎస్‌సీ పరీక్షలో తన అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం, ఇతర వెనుకబడిన తరగతి (నాన్-క్రీమీ లేయర్) కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:16

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ.. పీలా గోవింద్, బైరా దిలీప్‌ ముందు వరుసలో ఉన్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. దీంతో.. ఈ రోజు వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్‌ వేయనున్నారు.

ఇక, వైజాగ్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 838 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో వైసీపీకి 598.. కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. అయితే, ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే అధికార పార్టీకి టచ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. మ్యాజిక్‌ ఫిగర్‌ 425 కాగా.. కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో సునాయసంగా గెలుపు సాధ్యం అవుతుంది.

కానీ, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంపై వైసీపీ మండిపడుతోంది.. సంఖ్యాబలం లేకపోయినా.. ఎన్నికల బరిలోకి దిగడం అంటే.. కచ్చితంగా ప్రలోభాలకు గురిచేయడం.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయపెట్టడంలో భాగమేనని ఆరోపిస్తోంది వైసీపీ.. మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యింది.. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఇప్పటికే తమ ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే, విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి వైపే కూటమి మొగ్గుచూపుతుందన్న ప్రచారం సాగుతోంది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..

ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.. వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అనుకున్నట్టుగా జరిగితే.. బొత్సను ఢీకొనబోతున్నారు బైరా దిలీప్ చక్రవర్తి..

దాదాపు బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్టు వినిపిస్తోంది.. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తిని.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధం అవుతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, హైకమాండ్‌ నుంచి పోటీపై.. అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 12 2024, 15:10

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్..

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్టే ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది.

సీబీఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్షులను విచారించామని ధర్మాసనం పేర్కొంది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె ఆశలన్నీ సుప్రీంకోర్టు పైనే పెట్టుకున్నారు. ఇవాళ తనకు బెయిల్ వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(క్రిమినల్‌) దాఖలు చేశారు. అక్కడ కూడా వాయిదా పడింది. ఇక బెయిల్ కోసం మరో వారం పాటు కవిత వేచిచూాడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడైనా బెయిల్ వస్తుందో రాదో వేచిచూడాల్సి ఉంది.

ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ కవితకు బెయిల్‌ అంశంపై చర్చించారని జోరుగా ప్రచారం సాగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కోర్టులో నిరాశే ఎదురవ్వడం గమనార్హం.

ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయని... అందులో కవిత మాత్రమే మహిళ అని ఆమె తరుఫు సీనియర్ న్యాయవాదులు గతంలో ఢిల్లీ హైకోర్టులో వాదించారు. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయని తెలిపారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్‌ ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల తీరును ఆమె తరుఫు న్యాయవాది తప్పుబట్టారు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని.. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని వాటి కింద కవితకు బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.