గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు: సి పి, డిఎస్ చౌహన్


రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు.
కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో నిర్వాహకులతో, ఇన్స్పెక్టర్లు సమన్వయం చేసుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో అందరు అధికారులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

నిమజ్జనం ఎక్కువగా సాగే చెరువులు, కుంటల మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, విద్యుత్, రవాణా శాఖ తదితర శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గణేష్ నిమజ్జనం శాంతియుతంగా సజావుగా సాగేలా చూడాలన్నారు.
సీసీటీవీల ద్వారా నిమజ్జనం సాగే మార్గాల ట్రాఫిక్ ను , నిమజ్జనం జరిగే చోట పరిస్థితులను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలన్నారు, విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఎలాంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు, మార్గాల్లో బందోబస్తును పెంచాలని సూచించారు.
అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతవరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Sep 26 2023, 19:55