ఆ కంపెనీలో వాటా కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ కొనుగోలుకు అనుమతులు పొందిన వేళ స్టీమింగ్ రంగంపై అంబానీ దృష్టి మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే మరో పెద్ద కొనుగోలుకు చూస్తున్నట్లు తెలుస్తోంది

అవును ముఖేష్ అంబానీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ కంపెనీలో కీలక వాటాదారుగా మారాలని చూస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. స్టేక్ కొనుగోలుకు ఇప్పటికే చర్చలు మెుదలయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు కరణ్ జోహార్ సంస్థ పూర్ & సన్స్, యే జవానీ హై దీవానీ, కల్ హో నా హో, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటెంట్ ప్రొడక్షన్ వ్యాపారంలో ముందుకు వెళ్లేందుకు ఈ వాటాల కొనుగోలుకు దిగుతోందని తెలుస్తోంది. అయితే డీల్ పరిమాణం ఎంత అనే వివరాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు.

ధర్మా ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ప్రస్తుతం 90 శాతానికి పైగా వాటాలను హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన 9.24 శాతం వాటాను ఆమె తల్లి హిరూ జోహార్ కలిగి ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన తన వాటాలను లిక్విడేట్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. వ్యాల్యుయేషన్ విభేదాలతో గతంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైనారిటీ వాటా విక్రయానికి సంజీవ్ గోయెంకా మద్దతు ఉన్న సరేగామాతో ధర్మా ముందుగా చర్చలు జరిపింది. హిందీ చిత్ర పరిశ్రమలో హిట్స్ సంఖ్య తగ్గటంతో అనుకున్న స్థాయిలో విలువ లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు మారిపోవటంతో థియేటర్‌లలో ఫుట్‌ఫాల్స్ దెబ్బతినడంతో సినిమా నిర్మాణ ఖర్చులు కూడా పెరిగాయి.

అయితే రిలయన్స్ కంటెంట్ ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం జియో స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, కొలోస్సియం మీడియా అండ్ బాలాజీలో మైనారిటీ వాటాలు ఉన్నాయి. అంబానీ నేతృత్వంలో కొనసాగుతున్న జియో స్టూడియోస్ ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. FY23లో ధర్మ ప్రొడక్షన్స్ ఆదాయం రూ.1,040 కోట్లుగా ఉంది. ఇది దాదాపు నాలుగు రెట్లు పెరుగుదల. అంతకు ముందు ఏడాది ఆదాయం కేవలం రూ.276 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో నికర లాభం 59 శాతం పడిపోయింది. సినిమా నిర్మాణంలో ఉన్న ఇబ్బందులపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జోహార్ తన బాల్యంలో కొన్నిసార్లు నష్టాల నుంచి కోలుకోవడానికి, ఫైనాన్షియర్‌లకు తిరిగి డబ్బు చెల్లించడానికి వారు ఆస్తులు, ఆభరణాలను అమ్మేసిన సందర్భాలను సైతం గుర్తుచేసుకున్నారు.

హర్యానాలో ఓటమి తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం..

మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధతపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు. హర్యానాలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దశాబ్ద కాలంగా అధికార వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయిన కాంగ్రెస్‌కు ఈ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

కావునా, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్‌తో పాటు విజయ్ వాడెట్టివార్, పృథ్వీరాజ్ చవాన్, బాలాసాహెబ్ థోరట్, వర్షా గైక్వాడ్, రమేష్ చెన్నితలతో సహా ఇతర పార్టీ నేతలు ఈ సమావేశానికి రానున్నారు. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నేటి (సోమవారం) ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు.

అయితే, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలను గెలుచుకుంది. కాగా, అనేక మంది ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన నేతలు ఉత్తరాది రాష్ట్రంలో కాంగ్రెస్ రచించిన వ్యూహాన్ని ప్రశ్నించారు. హస్తం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు.

మహా వికాస్ అఘాడి (MVA)కి చెందిన పలువురు సభ్యులు మహారాష్ట్రలో పోటీ చేసేందుకు మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నందున కాంగ్రెస్ యొక్క ఎన్నికల సంసిద్ధతపై నేటి సమావేశానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎంవీఎస్ లో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి — కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) వర్గం, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఉన్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో వచ్చే నెల లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత

సికింద్రాబాద్‌ (Secunderabad) మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

సికింద్రాబాద్‌ (Secunderabad) మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు.. ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

కాగా, విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. గుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర కిషన్‌ రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మత విద్వేషాలను ప్రేరిపించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. నిన్నటివరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామత నవరాత్రులు, బతుకమ్మ వేడుకులు జరుపుకున్నారని చెప్పారు. విగ్రహం ధ్యంసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు.

మత కలహాలు జరుగకుండా అడ్డుకోవాలని కేంద్ర కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి గేట్లు విరగొట్టారని చెప్పారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు. ఆలయాలపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించాలన్నారు.

తిరుమలలో కన్నుల పండుగగా భాగ్‌ సవారి - హుండీ కానుక‌లు రూ.26 కోట్లు..!!

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ ⁠సౌక‌ర్య‌వంతంగా శ్రీవారి మూల‌మూర్తి, వాహ‌న సేవ‌ల‌ ద‌ర్శ‌నం కల్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు "భాగ్‌సవారి" ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌సవారి ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.

అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.

తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ "భాగ్‌సవారి" ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు.

బ్రహ్మోత్సవాల వేళ 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోగా..15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు విక్షించారు. ⁠గరుడసేవనాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవ‌లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.

నేడే లాటరీ

3396 మద్యం షాపులు... వాటి కోసం 89,882 దరఖాస్తులు! ఇదీ తుది లెక్క! అంటే సగటున ఒక్కో షాప్‌ కోసం 26.46 మంది పోటీ పడుతున్నారు. మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షల చొప్పున... 89,882 అప్లికేషన్లకు రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాపునకు సగటున 52 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పోటీ నెలకొంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక షాప్‌ కోసం 132, మరో షాప్‌ కోసం 120దరఖాస్తులు అందాయి. ఇదో రికార్డు! పలు జిల్లాల్లో అనేక షాపులకు 70కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక స్వయంగా సీఎం హెచ్చరించినా తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో రాజకీయ జోక్యం ఆగలేదు.

ఫలితంగా ఈ జిల్లాల్లో ఆశించిన దానికంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ ఒక్కో షాపునకు 17 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. సిండికేట్లుగా ఏర్పడి తక్కువ దరఖాస్తులు వేసి... పోటీని తగ్గించుకున్నారు. బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోనూ అనేక షాపులకు సింగిల్‌ డిజిట్‌ దరఖాస్తులే వచ్చాయి.

మద్యం షాపులకు సోమవారం జిల్లాల్లో లాటరీ నిర్వహిస్తారు. కలెక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి దుకాణానికి వేర్వేరుగా లాటరీ తీసి, ఎంపికైన వారికి లైసెన్స్‌ పత్రాలు అందజేస్తారు. ఉదయం నుంచే లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నూతన మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిపడింది. ఒక్క దరఖాస్తుల రూపంలోనే రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది.

సోమవారం లాటరీలో షాప్‌ దక్కించుకున్న 24గంటల్లోపు మొదటి విడత లైసెన్స్‌ రుసుము చెల్లించాలి. తద్వారా సుమారు రూ.300 కోట్లు వస్తాయి. వీరు బుధవారం (ఈ నెల 16) నుంచి షాపులు ప్రారంభించుకోవచ్చు. ఆ సమయంలో లైసెన్సీలు కనీసం వారం రోజుల సరుకు కొనుగోలు చేస్తారు. ఆ రూపంలో మరో రూ.300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభ దశలోనే ప్రభుత్వానికి రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

కేబీఆర్‌ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్‌

గ్రేటర్‌లో అతి పెద్ద అండర్‌పాస్‌ కేబీఆర్‌ పార్క్‌ వద్ద అందుబాటులోకి రానుంది. సిగ్నల్‌ చిక్కులు లేకుండా వాహనదారులు నిరాటంకంగా ప్రయాణించేలా బహుళ మార్గాలకు రూపకల్పన చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న పలు జంక్షన్లలో సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం చేసేలా వీటిని రూపొందించారు.

నగరంలోని కేబీఆర్‌ (కాసు బ్రహ్మానందరెడ్డి)పార్క్‌ చుట్టూరా సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణాలు సాగేలా అండర్‌పాస్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు(ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌) వైపు 740 మీటర్ల మేర అతిపెద్ద భూగర్భ మార్గం నిర్మించనున్నారు. దీంతో ఐటీ కారిడార్‌, ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీ చెక్‌పోస్ట్‌ కంటే ముందు ఉండే అండర్‌పాస్‌ నుంచి సిగ్నల్‌ చిక్కులు లేకుండా రాకపోకలు సాగించే వెసులుబాటు కలగనుంది.

మూడు లేన్లుగా అండర్‌పాస్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారు. గతంలో నిర్మించిన అండర్‌పాస్‌లలో మెజార్టీ 200–300 మీటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కేబీఆర్‌ పార్కు వద్ద నిర్మించే అండర్‌పాస్‌ అతిపెద్దది కానుంది. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటీవ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటీవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(హెచ్‌– సిటీ)లో భాగంగా కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు అండర్‌పాస్‌లు నిర్మిస్తుండగా, మెజార్టీ 300 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి. ఇవి నగర ప్రయాణంలో వాహనదారులకు వినూత్న అనుభూతి కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు.

సిగ్నల్‌ చిక్కులు లేకుండా జంక్షన్ల వారీగా బహుళ మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ వద్ద మాత్రం రెండో లెవల్‌లో ఓ వంతెన ప్రతిపాదించారు.

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ చౌరస్తా వద్ద రూ.192 కోట్లతో రెండు అండర్‌పాస్‌లు, (ముగ్ద జంక్షన్‌తో కలిపి) ఓ వంతెన ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనాలు మూడు లేన్ల వంతెన నుంచి జూబ్లీచెక్‌పోస్ట్‌ వైపు వెళ్లనున్నాయి. జూబ్లీచెక్‌పోస్ట్‌ నుంచి వచ్చే వాహనాలు ఫ్రీ లెఫ్ట్‌ ద్వారా యూసుఫ్‌గూడ వైపు, కేన్సర్‌ ఆస్పత్రి వైపు వెళ్లాల్సిన వాహనాలు అండర్‌పాస్‌ వినియోగించాల్సి ఉంటుంది.

జూబ్లీచెక్‌పోస్ట్‌ వద్ద రెండు వంతెనలు, ఓ అండర్‌పాస్‌ నిర్మించనున్నారు. ఇందుకు రూ.229 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ –36 (పెద్దమ్మ గుడి వైపు) మూడు లేన్ల చొప్పున రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఆరు లేన్ల వంతెన అందుబాటులోకి రానుంది. రోడ్‌ నెంబర్‌–45 వైపు నుంచి కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు వెళ్లేందుకు మూడు లేన్ల అండర్‌పాస్‌, యూసుఫ్‌గూడ వైపు వాహనాల కోసం మరో అండర్‌పాస్‌ ప్రతిపాదించారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 వైపు వెళ్లే వాహనాల కోసం సెకండ్‌ లెవల్‌లో రెండు లేన్ల వంతెన నిర్మించనున్నారు.

కేన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఓ అండర్‌పాస్‌, ఓ వంతెనను రూ.83 కోట్లతో ప్రతిపాదించారు. కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ నుంచి మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా (తెలంగాణ భవన్‌) వైపు వెళ్తాయి. తెలంగాణ భవన్‌ నుంచి వెళ్లే వాహనాలు వంతెన మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10, రోడ్‌ నంబర్‌–1 వైపు వెళ్లొచ్చు.

మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా వద్ద రూ.110 కోట్లతో ఓ అండర్‌పాస్‌, వంతెన ప్రతిపాదించారు. కేన్సర్‌ ఆస్పత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ మీదుగా ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా వైపు వెళ్లాలి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –12 నుంచి వచ్చే వాహనాలు వంతెన మీదుగా ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాకు వెళ్లొచ్చు.

ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా వద్ద అండర్‌పాస్‌, ఓ వంతెనను రూ.115 కోట్లతో నిర్మించనున్నారు. మహారాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ నుంచి జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా మహారాజ అగ్రసేన్‌ జంక్షన్‌ వైపు వెళ్లే అవకాశం కలుగుతుంది.

రోడ్‌ నంబర్‌ –45 జంక్షన్‌ వద్ద రూ.97 కోట్లతో ఓ అండర్‌పాస్‌, వంతెన నిర్మాణం ప్రతిపాదించారు. జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు నుంచి అండర్‌పాస్‌ ద్వారా జూబ్లీ చెక్‌పోస్ట్‌కు వెళ్లొచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి వచ్చే వాహనదారులు వంతెన మీదుగా కేబుల్‌ బ్రిడ్జి వైపు వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్‌ బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను వినియోగించుకుంటే జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్లొచ్చు.

అండర్‌పాస్‌ల వివరాలు..

రోడ్‌ నంబర్‌–45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేటు వైపు మూడు లేన్ల అండర్‌పాస్‌– 740 మీటర్లు

జూబ్లీ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేట్‌ చౌరస్తా మీదుగా క్యాన్సర్‌ ఆస్పత్రి వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌– 330 మీటర్లు

కేబీఆర్‌ పార్కు మెయిన్‌ గేట్‌ జంక్షన్‌ వైపు నుంచి పంజాగుట్ట వైపు (ముద్ర చౌరస్తా వద్ద) మూడు లేన్ల అండర్‌పాస్‌ – 260 మీటర్లు

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ జంక్షన్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రి జంక్షన్‌ మీదుగా మహరాజ్‌ అగ్రసేన్‌ చౌరస్తా వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌– 330 మీటర్లు

క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా వైపు నుంచి మహారాజ్‌ అగ్రసేన్‌ జంక్షన్‌ మీదుగా ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌– 410 మీటర్లు

మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు నుంచి ఫిల్మ్‌నగర్‌ చౌరస్తా మీదుగా జర్నలిస్టు కాలనీ చౌరస్తా వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌ – 340 మీటర్లు

జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 జంక్షన్‌ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్‌ వరకు రెండు లేన్ల అండర్‌పాస్‌ – 290 మీటర్ల

కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ – 36 వరకు ఒక్కోవైపు రెండు లేన్ల చొప్పున ఫస్ట్‌ లెవల్‌ వంతెన – 745 మీటర్లు

యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్‌ నంబర్‌ –45 జంక్షన్‌ వైపు సెకండ్‌ లెవల్‌లో రెండు లేన్ల వంతెన – 770 మీటర్లు

పంజాగుట్ట వైపు నుంచి కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌గేట్‌ జంక్షన్‌ మీదుగా జూబ్లీచెక్‌పోస్ట్‌ వైపు మూడు లేన్ల వంతెన – 900 మీటర్లు

మహరాజ అగ్రసేన్‌ జంక్షన్‌ వైపు నుంచి క్యాన్సర్‌ ఆస్పత్రి చౌరస్తా మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10 వైపు రెండు లేన్ల వంతెన –540 మీటర్లు

ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ వైపు నుంచి మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా మీదుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–12 వైపు రెండు లేన్ల వంతెన – 590 మీటర్లు

ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి మహరాజ అగ్రసేన్‌ చౌరస్తా వైపు రెండు లేన్ల వంతెన – 600 మీటర్లు

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపు నుంచి రోడ్‌ నంబర్‌–45 చౌరస్తా మీదుగా కేబుల్‌ బ్రిడ్జి వైపు రెండు లేన్ల వంతెన – 500 మీటర్లు

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కాల్చిచంపిన దుండగులు

ముంబైలో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత బాబా సిద్ధిక్ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో ఆయనను దండగులు కాల్చిచంపారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో షూటర్లు ఆయనపైకి ఆరు బుల్లెట్లు కాల్చారు. బాబా సిద్దిక్‌కు 4 బుల్లెట్లు తగిలాయి. అతడి సహాయకులలో ఒకరికి గాయాలయ్యాయి. కాగా తన కొడుకు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషాన్ కార్యాలయానికి సమీపంలోనే బాబా సిద్దిక్‌పై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

బాబా సిద్దిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -2008 మధ్య రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హస్తం పార్టీని వీడి అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గంలో చేరారు. మరోవైపు ఆయన కొడుకు జీషాన్ సిద్ధిక్‌ను ఈ ఏడాది ఆగస్టులో పార్టీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది.

బాబా సిద్దిక్ హత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ‘‘ ఈ ఘటన చాలా దురదృష్టకరం. సిద్ధిక్ చనిపోయారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, మరొకరు హర్యానాకు చెందినవారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నేను కోరాను. ముంబయిలో శాంతిభద్రతలను ఎవరూ వారి చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు’’ అని ఆయన అన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. సిద్దిక్ హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయానని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని కొన్ని నెలల ముందు నుంచే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాబా సిద్దిక్ హత్యపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

అత్యధికంగా సంపాదించిన భారతీయుడిగా గౌతమ్ అదానీ.

అదానీ గ్రూపు కంపెనీల అధినేత గౌతమ్ అదానీ ప్రస్తుత ఏడాది 2024లో అత్యధిక సంపాదన పొందిన భారతీయ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో హయెస్ట్ వెల్త్ గెయినర్స్ జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 2024లో గౌతమ్ అదానీ సంపద ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్లు) మేర పెరిగింది. గతేడాది కంటే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.

ఒక సంవత్సరంలో ఒక భారతీయుడు ఆర్జించిన అత్యధిక సంపద కూడా ఇదే కావడం గమనామర్హం. ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓపీ జిందాల్ గ్రూప్‌ గౌరవ చైర్మన్ సావిత్రి జిందాల్‌ల ఉమ్మడి సంపద పెరుగుదల కంటే ఎక్కువగా గౌతమ్ అదానీ ఆర్జించడం గమనార్హం. దీంతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ సంపద 116 బిలియన్ డాలర్లకు చేరింది. 

ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో ఈ ఏడాది అత్యధిక సంపద పొందిన వ్యక్తుల జాబితాలో అదానీ తర్వాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 2024లో ఆయన సంపద 27.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో అతడి నికర ఆస్తి విలువ 119.5 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతమ్ అదానీతో పోల్చితే 3.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ సంపదను కలిగివున్నారు.

ఇక 2024లో సావిత్రి జిందాల్ 19.7 బిలియన్ డాలర్లు సంపాదించి నికర ఆస్తిలో శివ్ నడార్‌ను అధిగమించారు. సావిత్రి జిందాల్ దేశంలో అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో హిసార్ నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు.

ఇక సునీల్ మిట్టల్ సంపద 13.9 బిలియన్ డాలర్లు, దిలీప్ షాంఘ్వి సంపద 13.4 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. ఈ ఏడాది అత్యధిక సంపాదించిన సంపన్నుల జాబితాలో వీరిద్దరూ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచిచారు.

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మీ పొలాలకు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ రైతులకు(Farmers) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వరావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. రూ.36కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.." న్యూ ఎనర్జీ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా రైతులకు కరెంట్ ఖర్చు ఉండదు. పైగా సోలార్ ప్యానల్స్ ద్వారా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. పంటతోపాటు పవర్‌పైనా అన్నదాతలు అదనపు లాభం పొందేలా పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నాం. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చుతో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టు చేపడతాం. విజయ దశమి రోజు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో బయో మాస్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచమంతా థర్మల్ పవర్ నుంచి గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు. మేము చేసిన మంచిని చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రూ.73వేల కోట్లు తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించాం" అని చెప్పారు.

అనంతరం అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ రైతులకు సాగు, పంట విస్తరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని, రాగమయి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరయ్యారు.

శారద పీఠం భూముల వ్యవహారంలో ట్విస్ట్, వైసీపీకి ఎఫెక్ట్ !!

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు రాజగురువుగా పలువురు బావించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో శారదా పీఠానికి మేలు చేకూర్చేలా వ్యవహరించారని, వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం రూ. 15 లక్షలకే 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి అప్పగించిందని వెలుగు చూడటంతో ఆ విషయంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి వివరాలను బయటకు లాగుతోంది.

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతిని వైఎస్ జగన్ కు ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ జిల్లాలోని భీమిలి సమీపంలో వేద విద్యాలయం ఏర్పాటు చెయ్యడానికి భూమి కేటాయించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మనవి చేసింది. గురువు అడిగిన వెంటనే అప్పటి సీఎం జగన్ శారదా పీఠానికి భూమి ఇవ్వడానికి అంగీకరించారు.

భీమిలి మండలంలోని కొత్తవలసలో ఎకరం భూమి బహిరంగ మార్కెట్ లో సుమారు రూ 15 కోట్లు ఉందని స్థానికులు అంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం శారద పీఠంపై ప్రేమతో ఎకరం భూమి రూ 1 లక్షకు ఇవ్వడానికి అంగీకరించింది. రెండు సర్వే నెంబర్లలోని 15 ఎకరాల భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించారు. శారదా పీఠానికి అప్పగించిన భూమి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 225 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

రూ. 225 కోట్ల విలువైన భూమిని కేవలం రూ 15 లక్షలకు శారదా పీఠానికి అప్పగించడంతో ఆ సమయంలో జగన్ ప్రభుత్వంపై అనేక మంది విమర్శలు చేశారు. గురుభక్తి చాటుకోవాలంటే ప్రభుత్వ భూములు దానం చెయ్యాల్సిన అవసరం లేదని విశాఖకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అప్పటి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదే సందర్బంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ఎదురు దాడికిదిగడంతో మాటల యుద్దం జరిగింది.

వేద విద్యాలయం కోసం తీసుకున్న భూములను వాణిజ్య అవసరాలు, రెవెన్యూ, నివాస అవసరాల కోసం ఉపయోగించుకునేలా మార్పులు చెయ్యాలని శారదా పీఠం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ దెబ్బతో గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు అంత తక్కువ ధరకు శారదా పీఠానికి వందల కోట్ల విలువైన భూములు అప్పగించింది అంటూ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శారదా పీఠానికి సుమారు రూ. 22 కోట్లకు భూమి కేటాయించవచ్చు అని అప్పట్లో అధికారులు నివేదిక ఇచ్చినా జగన్ ప్రభుత్వం మాత్రం ఆ నివేదిక పట్టించుకోకుండా కేవలం రూ 15 లక్షలకు 15 ఎకరాల భూమి ఇచ్చేసిందని వెలుగు చూడటంతో ఇప్పుడు ఆ భూముల వ్యవహారంపై విచారణ జరుగుతోంది.