నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:35

Rain Alert: వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన

హైదరాబాద్(Hyderabad Rains)లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు..

వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 

వర్షాలపై సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Streetbuzz News

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:29

chandrababu: షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు..

మహారాష్ట్రలో గల కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ వెళ్లారు. షిరిడీలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహుకరించారు.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:27

AP Election 2024: ఈసీ ముందు హాజరైన ఏపీ సీఎస్ డీజీపీలు

రాష్ట్రంలో ఈ రెండ్రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు..? ఇంతకూ ఏపీలో ఏం జరుగుతోంది..? మీరిద్దరూ ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వండి'' అంటూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే..

దీంతో జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఇద్దరూ నేడు (గురువారం) ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీకి అధికారులు వివరణ ఇస్తున్నారు.

అసలు విషయం ఇదీ..

కాగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) మండిపడిన విషయం తెలిసిందే. 'పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరగడమేంటి? రాష్ట్రంలో ఈ రెండ్రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు..? పోలింగ్‌ రోజు నిర్లక్ష్యం వహించారు.. ఆ తర్వాత కూడా నిర్లిప్తత కనిపిస్తోంది.. ఇంతకూ ఏపీలో ఏం జరుగుతోంది..? మీరిద్దరూ ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వండి' అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిని, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాలకు బుధవారం సమన్లు జారీ చేసింది. పోలింగ్‌ ముందు రోజు అర్ధరాత్రి నుంచి మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందా.. నిఘా వర్గాల సమాచారం లేదా.. పోలీసు బందోబస్తు చర్యల్లో లోపముందా తదితర అంశాలపై తమకు వివరణ ఇవ్వాలని స్పష్టంచేసింది. హింసాకాండ జరుగుతుందని గతానుభవాలు ఉన్నా.. ఎందుకు నిర్లక్ష్యం వహించారని నిలదీసింది. పోలింగ్‌ రోజు పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, మాచర్లలో ప్రతిపక్షాల ఏజెంట్లపై దాడులు, ఇళ్లలోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించడం.. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థిపై దాడులకు దిగడం.. కత్తులు, కర్రలతో రోడ్లపై స్వైరవిహారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌ రూముల వద్దే మారణాయుధాలతో దాడి చేయడాన్ని గట్టిగా నిలదీసిన విషయం తెలిసిందే.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:26

సీఏఏ అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్

లఖ్‌నవూ: సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు..

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు

''భారత్‌కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ జీవిస్తున్నారు. ఆ బాధితులకు కేంద్రం సీఏఏ ద్వారా పౌరస్వతం కల్పిస్తోంది. కానీ, ఎస్పీ, హస్తం పార్టీ ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అని ప్రధాని దుయ్యబట్టారు. యూపీలోని అజంగఢ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

అలా ఎన్నటికీ జరగదు..

''అధికారం సాధిస్తే సీఏఏను రద్దు చేసేందుకు ఇండియా కూటమి యోచిస్తోంది. కానీ, అది ఎన్నటికీ జరగదు. ఈ చట్టాన్ని తొలగించడం అసాధ్యం. వారంతా మోసగాళ్లు (ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ). మతోన్మాద మంటల్లో దేశం కాలిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు''అని మోదీ ప్రతిపక్షాలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాగా.. సీఏఏ చట్టం ప్రకారం.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 12:03

AP News: అలిపిరి వద్ద కారు దగ్ధం

తిరుపతి : తిరుపతిలోని (Tirupati) అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని పక్కక నిలిపివేశారు..

వెంటనే డ్రైవర్‌తో పాటు కారులో నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు. ఆ తరువాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..

నిజంనిప్పులాంటిది

May 16 2024, 11:11

హోం గార్డులకు జీతాల కోతలు !

- గతంలో మధ్యప్రదేశ్‌లో హోంగార్డు మృతి

- ఆ కుటుంబానికి ఇంకా అందని సాయం

- హోంగార్డులకు జీవిత బీమా దక్కని వైనం

- ఇక్కడ గైర్హాజరంటూ డీడీఏలోనూ కోత

- ఇతర రాష్ట్రాల్లో అదనపు భత్యాలు

- ఇక్కడ మాత్రం జీతాల్లో కోతలు

వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్‌ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది.ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది. నిజానికి భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చెప్పిన సంఖ్యలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆయా రాష్ట్రాల ఎన్నికల విధులకు పోలీసులను పంపాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అధికారులు రెండో ఆలోచన లేకుండా పంపించేది హోంగార్డులనే..! లోక్‌సభతో పాటు.. పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కూడా హోంగార్డులను ఆయా రాష్ట్రాలకు తరలించారు. ముఖ్యంగా తెలంగాణ హోంగార్డులు ఛత్తీ్‌సగఢ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు తమ సొంత యూనిట్లలో గైర్హాజరు వేస్తున్నారు. దాంతో వేతనంలో కోతతోపాటు.. రోజువారీ విధులకు సంబంధించిన భత్యం(డీడీఏ) కూడా దక్కడం లేదు. ఎన్నిరోజులు పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తే.. అన్ని రోజులు ఇక్కడ వేతనంలో కోత విధిస్తున్నారు. నిజానికి హోంగార్డుకు రోజంతా పనిచేస్తే.. ఓ తాపీ మేస్త్రీకి దక్కే కూలీ కంటే తక్కువగా గౌరవ వేతనం(రూ.921) వస్తోంది.

ఇక్కడ విధులు నిర్వర్తించినప్పుడు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం 24 గంటలూ నిలువుకాళ్ల జీతం చేస్తున్నారు. 24 గంటలూ కష్టపడ్డా వారికి ఈసీఐ ద్వారా అదే రూ.921 దక్కుతోంది. ఆయా రాష్ట్రాల్లో డైట్‌ చార్జీల కింద రూ.250 అదనంగా ఇస్తారు. డైట్‌ చార్జీల వంకతో ఉన్నతాధికారులు వీరికి భోజన వసతులను సైతం కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ చేతిలో లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేకుండా పనిచేసే తమ పట్ల ఇంతటి వివక్ష తగదని హోంగార్డులు వాపోతున్నారు. 

పక్కా రాష్ట్రాల్లోనే నయ్యం!

ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో హోంగార్డులకు గౌరవ వేతనంతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్నందుకు అదనపు భత్యం, ఈసీఐ ఇచ్చే వేతనం లభిస్తోంది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు పలువురు హోంగార్డులు వచ్చారు. వారి డైట్‌ చార్జీలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర హోంగార్డులు వివరిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్నే ఇక్కడా అమలు చేయాలని కోరుతున్నారు.

హోం గార్డులు చనిపోతే అంతే..?

పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించే హోంగార్డులను మరో భయం వెంటాడుతోంది. అక్కడ విధి నిర్వహణలో మరణిస్తే.. తమ కుటుంబాలు రోడ్డున పడడం తప్ప.. ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు వెళ్లిన శ్యామ్‌కుమార్‌అనే హోంగార్డు.. గుండెపోటుతో మృతిచెందారు. అప్పట్లో ఉన్నతాధికారులు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఇచ్చిన రూ.10 వేలు తప్ప.. శ్యామ్‌కుమార్‌ కుటుంబానికి దక్కిందేమీ లేదు.

హోంగార్డులకు ప్రభుత్వం జీవిత బీమాను కల్పిస్తున్నా.. శామ్‌కుమార్‌ది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, అది సహజ మరణమని పేర్కొంటూ బీమా కంపెనీ చేతులెత్తేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కానిస్టేబుళ్ల విషయంలో భద్రత ఉంటుందని, వారిని కాదని.. తమను ఇతర రాష్ట్రాలకు పంపడమేంటని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 11:12

నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఅర్ఎస్ నిరసనలు !

- ఎక్కడబడితే అక్కడ దేవుని పై ప్రమాణాలు - కేసిఆర్

- రైతు వ్యతిరేక చర్యలను సహించం: కేసీఆర్‌

- సిగ్గులేని ముఖ్యమంత్రి పదవి కి రాజీనామ చేయాలి - కేసిఆర్ 

- కరెంట్ కోతలు చేయడం సిగ్గుచేటు - కేసిఆర్

ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగిస్తోందని, సర్కారు చర్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే ధాన్యానికి రూ.500బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ఇప్పుడు సన్న రకాల ధాన్యానికి మాత్రమే బోనస్‌ ఇస్తామనడం వంచించడమేనని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో సన్న రకం ధాన్యాన్ని 10శాతం మాత్రమే పండిస్తారని, 90శాతం ఇతర రకాల ధాన్యం వస్తుందని పేర్కొన్నారు. ఓట్లు వేసుడు అయిపోగానే కాంగ్రెస్‌ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, మాటమార్చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు... రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

కరెంటు కోతల నియంత్రణ ఏది?

రాష్ట్రంలో కరెంటు కోతల నియంత్రణపై చిత్తశుద్ధి లేని సీఎం రేవంత్‌.. అనవసరంగా ప్రతిపక్షాలు, విద్యుత్‌ ఉద్యోగులపై నిందారోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యుత్‌ రంగ వైఫల్యాలకు తమను బాధ్యులను చేసి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను కుప్ప కూల్చిందని విమర్శించారు.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 17:53

వారు నాకు శత్రువులు కాదు నా శిష్యులే:కేఏ పాల్

విశాఖపట్నం: ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పడిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. విశాఖలో భారీగా ఓట్లు పోల్ అయ్యాయని...ఎప్పుడూ ఓటు వేయని వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు..

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి తానే అడ్డుకున్నాను..ఇది దేవుడి కృపా వల్లేనని అన్నారు.విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అంటే విశాఖలో ఎవరికీ తెలియదని.. బొత్స కుటుంబంపై ఎన్నో అవినీతి, ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు.ప్రత్యర్థులు డబ్బులు పంచినా...తాను ఒక్క పైసా పంచలేదని చెప్పుకొచ్చారు. విశాఖ ప్రజలు మార్పును కోరారని...ఈ సారి ఎన్నికల్లో తాను గెలుస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు..

తాను పార్లమెంటుకు వెళ్తే.. నరేంద్రమోదీ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ అందరినీ కలిపిస్తానని తెలిపారు. చంద్రబాబు, జగన్ ఈ ఎన్నికల్లో గాని సీఎం అయినా వారు తనకు శత్రువులు కాదని... వారు తన శిష్యులేనని చెప్పుకొచ్చారు. మా నాన్నకు విశాఖ నార్త్‌లో ఓటు ఉందని.. తాను సహాయకుడిగా వెళ్లానని అన్నారు.మా నాన్న జేడీ లక్ష్మీనారాయణకు ఓటు వేశారని తెలిపారు. ఈ ప్రభుత్వాలు ఎందుకో తనను సరిగా వాడుకోవటం లేదన్నారు. ఈవీఎంలు రీ ప్లేస్ కాకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరుతానని అన్నారు. తనకు మంచి కవరేజ్ ఇచ్చినందుకు ఏబీఎన్‌కు కేఏ పాల్ కృతజ్ఞతలు తెలిపారు..

నిజంనిప్పులాంటిది

May 14 2024, 15:23

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో గెలిచేదెవరో ?

- పోల్‌ మేనేజ్‌మెంట్లో ముందున్నామని విశ్లేషణ

- మోదీ క్రేజ్‌ గ్రామాల్లోనూ ఉందని విశ్వాసం

- ఆరు గెలుచుకుంటామని బీఆర్‌ఎస్‌ అంచనా

- 10-12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌ అంచనా..ముస్లిముల ఏకపక్ష పోలింగ్‌పై భరోసా

- 9-10 గెలుస్తామంటున్న బీజేపీ వర్గాలు

రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్‌ ధీమాగా చెబుతోంది.

సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు. పది నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల సీట్లలో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్‌ను వదిలేస్తే... సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నట్లు వివరిస్తున్నాయి. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ఓటర్లు సహజంగా అధికార పార్టీకి మెగ్గు చూపుతారని, ముస్లిం మైనార్టీలూ కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రెండూ తమకే దక్కుతాయని అంచనా వేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనితీరు పట్ల ఉన్నసానుకూలత, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారాలకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల్లో మెజారిటీ ఓటర్లు కాంగ్రె్‌సకు మద్దతుగా నిలవడడంతో కాంగ్రె్‌సకు సానుకూల పరిస్థితి స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు .

కేసిఆర్ బస్ పోరాట యాత్రతో పెరిగిన ఓట్లు !

కనీసం ఆరు స్థానాల్లో గెలుపు తథ్యమని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయడం లేదన్న అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. మెదక్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి లోకసభ స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నట్లు తెలిసింది. ఓటింగ్‌ శాతం ఏ మాత్రం తగ్గదని అంచనా వేస్తున్నారు. మెదక్‌ ఏళ్ల తరబడి కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న స్థానమని, అక్కడ గెలుపు తేలికేనని, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం, సికింద్రాబాద్‌లో పార్టీ అభ్యర్థికి ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభించడం కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు.

క్రాస్ ఓటింగ్ తో కేసిఆర్ కు భారీ దెబ్బ !

పోలింగ్‌ తేదీ నాటికి రాష్ట్రంలోని మెజారిటీ లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ముఖాముఖీ పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు భారీగా క్రాస్‌ అయినట్లు చెబుతున్నారు. ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తున్న క్రమంలో క్రాస్‌ అయిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఓట్లు.. ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ వర్గాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరీ, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ ,నాగర్‌ కర్నూలు, జహీరాబాద్‌, నిజామాబాద్‌ వంటి చోట్ల క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగిందని చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సలోని కాంగ్రెస్‌ వ్యతిరేకులు బీజేపీ వైపు, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్‌ పార్టీకి క్రాస్‌ చేసినట్లూ వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీతో మంచి కోసమూ కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు క్రాస్‌ చేయడానికే మెగ్గు చూపినట్లూ చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనూ క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందంటున్నారు.

చేవెళ్ల నియోజకవర్గం తీసుకుంటే ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, అటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇద్దరూ గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే. ఆ పార్టీ నాయకులతో ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు, ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎవరికి వీలైనంతగా వారు బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ను తమవైపునకు తిప్పుకున్నట్లు చెబుతున్నారు.

ముక్కోణపు పోటీలు జరిగితే మెజారిటీ సీట్లలో రెండో ప్లేసు దక్కించుకునైనా ఉనికి నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆశలకు.. ఈ క్రాస్‌ ఓటింగ్‌ భారీగా గండి కొట్టినట్లు చెబుతున్నారు. మెజారిటీ సీట్లలో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికే ప్రమాదంలో పడేందుకూ ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో మోడి క్రేజ్ ! 

రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు తామే సాధించబోతున్నామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరుగుతోందని, ఇది తమకు అనుకూలిస్తుందని అంటున్నారు. ఓటుబ్యాంకు భారీగా పెరుగుతోందని, 9-10 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ‘‘పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా బీజేపీకిఆదరణ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజ్‌ విస్పష్టంగా కనిపించింది’’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. 

ఒక ప్రధాన కులం ఈసారి పూర్తిగా తమ ప్రత్యర్థి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం అందిందని, అయితే, దీని ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పారు. యువత పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారని, మోదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం కలిసి వచ్చిందని చెబుతున్నాయి. ప్రధానిగా మోదీ మరోసారి కొనసాగాల్సిన అవసరాన్ని ప్రచారం చేశామని, యువత కూడా అనుకూలంగా స్పందించిందని తెలిపాయి.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 13:49

ఎన్నికల్లో తెలంగాణ కషాయమయం !

- బంపర్ మెజార్టీతో బీజేపి దిగ్విజయం - బండి సంజయ్ 

- కరీంనగర్ నా హిందువుల అడ్డా - బండి సంజయ్ 

రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రె్‌సకు ఓటమి తప్పదన్న టెన్షన్‌ ఆయన ముఖంలో కనిపించిందని, అందువల్లే కోడ్‌ ఉల్లంఘించి మాట్లాడారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బాలుర ఉన్నత పాఠశాల, కళాశాలలోని బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు ..

ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించిన సీఎం రేవంత్‌ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రె్‌సకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే.. ఆయనకు ఎన్నికల కోడ్‌ వర్తించదా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఓటర్లకు మద్యం, డబ్బు పంచుతూ ప్రలోభాలకు గురిచేసినా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి మెజారిటీ సీట్లు తథ్యమని, కరీంనగర్‌లో బంపర్‌ మెజారిటీ ఖాయమని సంజయ్‌ తేల్చి చెప్పారు.

కొడంగల్‌లో ఓటు వేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఉద్దేశపూర్వంగా ప్రధాని మోదీని కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం సంగారెడ్డిలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డిపై తమ పార్టీ ప్రత్యక్షంగా, మెయిల్‌ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌తో గెలవబోతుందని, రేవంత్‌రెడ్డి ఓటమిని అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్థానాలకు ఇబ్బందవుతుందనే అనుమానంతో రైతుబంధు వేశామని, రేపు రుణమాఫీ చేస్తామంటూ వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని రఘునందన్‌ అన్నారు.