ప్రభుత్వ స్టాప్ నర్సుల పరీక్ష ఫలితాలు విడుదల

రాష్ట్రంలో 7,094 స్టాఫ్ నర్సుల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా తుది ఫలితాలు విడుదలయ్యాయి.
కటాఫ్, ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ ను రాష్ట్ర మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. 7094 పోస్టుల్లో 6956 మందిని ఎంపిక చేసినట్లు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.

జోన్ల వారీగా రిజర్వేషన్, కటాఫ్లను పొందుపరుస్తూ మెరిట్ లిస్టును విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్ సైట్లో తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

గతేడాది ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించగా దాదాపు 40 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాసిన సంగతి తెలిసిందే. నూతనంగా నియమించబడిన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఎల్.బీ.స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చొంగ్తూ హాజరు కానున్నారు.

గంగ మౌనికకు మొదటి ర్యాంకు…
తాజా ఫలితాల్లో సూర్యాపేట పట్టణానికి చెందిన గంగ మౌనిక రాష్ట్రంలో మొదటి ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన లూత్ మేరీ మూడో ర్యాంకు సాధించినట్టు- నిధ్యా నర్సింగ్ అకాడమీ డైరెక్టర్ కవితా రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

తమ అకాడమీ నుంచి మొదటి, మూడో ర్యాంకుతో పాటు- ఫైనల్ మెరిట్ లిస్టులో 3,800 మంది ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన లూత్ మేరీ రాష్ట్ర 3ర్యాంకు సాధించారు.ఏకంగా 3800 మంది అభ్యర్థులు నీధ్యా నర్సింగ్ అకాడమీ నుంచి ఎంపికయ్యారు..
Feb 01 2024, 09:54