నట సార్వభౌముడిని స్మరించుకున్న మెగాస్టార్..
హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కలకాలం మన మనస్సుల్లో మిగిలిపోతారని అన్నారు..
ఆయనతో అనుబంధం తనకెప్పుడూ చిరస్మరనీయం అన్నారు. 'నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు… చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు.
చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం' అని చిరంజీవి ట్వీట్ చేశారు..
SB NEWS
బైక్ పై వెళ్తూ కుప్పకూలిన రేషన్ డీలర్. ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
వరంగల్జిల్లా :
హన్మకొండకు చెందిన రాజు అనే వ్యక్తి బైక్పైన వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలంకార్ జంక్షన్ వద్ద ఆదివారం ఘటన చోటుచేసుకోగా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామి వెంటనే స్పందించి రాజుకి గుండెపోటు వచ్చినట్టు గుర్తించి ఆలస్యం చేయకుండా వెంటనే సీపీఆర్ చేసాడు.
అనంతరం ఎంజీఎం ఆస్పత్రికి తలరించాడు. దాంతో రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. గుండెపోటుకు గురైన రాజు స్థానిక రేషన్ షాపు డీలర్గా గుర్తించారు.
సీపీఆర్ ద్వారా అతని ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వామిని సిటీ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు. CPR పట్ల పోలీస్ సిబ్బందికి సీపీ ఇప్పించిన శిక్షణ సత్పలితాలిస్తుండడంతో ప్రశంసలు కురిపించారు.......
SB NEWS
నీట మునగాల్సిందేనా❓️
భూపాలపల్లి జిల్లా గోదావరి ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు కష్టాలు తీరటం లేదు. వానాకాలం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. గత ఏడాది జూలైలో భారీ వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వేలాది కుటుంబాల పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. గోదావరి కరకట్టలు కోతకు గురికావటం వల్లే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించినప్పటికీ వాటి మరమ్మతుల ఊసెత్తటం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ కరకట్టల పునరుద్ధరణకు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవటం లేదు. వానాకాలం సమీపిస్తుండటంతో మళ్లీ తమకు ఇబ్బందులు తప్పవేమోనని లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఏటా గోదావరి తీరం కోత..
గోదావరి పరీహవాక ప్రాంతాలకు వానాకాలం భయం వెం టాడుతోంది. జూలైలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద బీభత్సం సృష్టించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాల పంట లు ముంపునకు గురయ్యాయి. వరద నీరు గోదావరి తీరం పక్కన ఉన్న గ్రామాల్లో ప్రజలను ఊళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో నీట మునిగిన ఇళ్లను వదిలేసి, పునరావాస కేంద్రా ల్లో తల దాచుకున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సాగు భూములు గోదావరిలో కలిసి పోవటంతోపాటు ఇసుక మేటలు వేయటంతో రైతన్నలకు కన్నీరే మిగిలింది. ప్రతి ఏటా గోదావరి తీరం వెంట కరకట్టలు కోతకు గురవుతండటంతో పంటపొలాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఊళ్ల కు ఊళ్లే నీట మునుగుతున్నాయి. కరకరట్టలకు మరమ్మతులు లేకపోవటంతో ఏటేటా మరింత ఎక్కువ కోతకు గురై నష్టం భారీగా పెరుగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ప్రమాదపుటంచున బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
రూ.88 కోట్లతో ప్రతిపాదనలు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో లక్ష్మీపురం, గంగారం గ్రామాల మధ్య కరకట్ట కోతకు గురవుతున్నాయి. లక్ష్మీపురం వద్ద గోదావరిలో మానేరు నది కలుస్తుంది. రెండు నదులు కలిసే చోటు కావటంతో పాటు గోదావరిలోకి వచ్చే వరద వెనక్కి మానేరులోకి వస్తుండటంతో మానేరు, గోదావరి తీరాలు కోతకు గురవుతున్నాయి.
జూలైలో దామెరకుంట గ్రామం మొత్తం గోదావరి వరదలో మునిగిపోయింది. వానాకాలం వచ్చిందటే దామెరకుంట, గంగారం, లక్ష్మీపురం, గుండ్రాజుపల్లి, విలసాగర్ తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో లక్ష్మీపురం నుంచి గంగారం వరకు తొమ్మిది కిలో మీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టడానికి రూ.88కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మూడు నెలల్లో పనులు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం పైసా నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ముంపు తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు....
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సేఫ్గా బయటపడినట్లేనా..? అతి త్వరలోనే కవితకు క్లీన్చిట్ కూడా వచ్చేస్తుందా..? ఇన్నిసార్లు విచారించిన తర్వాత కూడా కవిత విషయంలో స్పష్టమైన ఆధారాల్లేవా..? ఈ స్కామ్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మోత మోగగా.. ఇకపై ఎక్కడా కవిత పేరు వినిపించదు.. కనిపించదా..? అంటే తాజా పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇదే అక్షరాలా నిజమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత సడన్గా ఢిల్లీ వేదికగా ఏం జరిగింది..? తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..
అసలేం జరిగింది..!?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై శనివారం నాడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అనుబంధ ఛార్జ్షీట్పై విచారణ జరిగింది. అయితే ఈ ఛార్జ్షీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్లపై అభియోగాలు మోపుతూ సీబీఐ పేర్కొంది. అయితే ఈ ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా..? లేకుంటే మరేదైనా కారణమా..? అని ఢిల్లీ వేదికగా చర్చలు నడుస్తోంది. గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జ్షీటులో ఎక్కడా కవిత పేరు కనపడలేదు. అయితే.. కవితను అన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో కూడా కవిత పేరు లేకపోవడం గమనార్హం.
దీంతో కవితకు దాదాపు క్లీన్ చిట్ వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్దీప్ ధల్లకు మాత్రం ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్- 25న సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఇవాళ విచారణకు రాగా కవిత పేరు లేదనే విషయం వెలుగుచూసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తదుపరి విచారణ జూన్-02కి కోర్టు వాయిదా వేసింది.
సీబీఐ ఛార్జ్షీటులో కూడా లేదుగా..!
కాగా.. సుమారు 5,700 పేజీలతో రెండో ఛార్జ్షీటును సీబీఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జ్షీటు నవంబర్-25న దాఖలు చేయగా.. ఆ తరువాత డిసెంబర్-11న కవితను హైదరాబాద్లో సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటివరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను ఛార్జ్ షీట్లో సీబీఐ ప్రస్తావించింది. అయితే.. కవిత పేరు ఎందుకు రాలేదు..? కవిత విషయంలో స్పష్టమైన ఆధారాల్లేవా..? లేకుంటే మరో కారణం ఏమైనా ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. మే-4న నాలుగో అనుబంధ అభియోగపత్రాన్ని ఈడీ దాఖలు చేసింది. 270 ప్రధాన పత్రాలు సుమారు రెండువేల అనుబంధ పేజీలతో నాలుగవ అదనపు ఛార్జ్షీటు ఈడీ దాఖలు చేసింది. అయితే దీనిపై మే-30న పరిగణనలోకి తీసుకోవడంపై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్నది. ఈ రెండు ఛార్జ్షీట్లలోనూ ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అయితే ఈడీ తాజా ఛార్జ్షీట్లోనూ కవితపై సర్వసాధారణ అభియోగాలనే మోపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. నిందితులను కవిత కలిశారని.. సమావేశం కూడా అయ్యారని.. మాట్లాడారని ఇలా పలు అభియోగాలనే గతంలో దర్యాప్తు సంస్థలు మెపాయి. తాజా అభియోగపత్రంలో ఈడీ పునరుద్ఘాటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటు ఈడీ ఛార్జ్షీటులోనూ లేదు..!
అయితే.. ముడుపుల వ్యవహారానికి సంబంధించి కూడా ఈడీ ఛార్జ్షీటులో కవిత పేరు ఎక్కడా లేనట్లు విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలోనూ లేని కవిత పేరు లేనట్లు సమాచారం. అయితే.. గతంలో మూడు సార్లు కవితను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదిగో అరెస్ట్ చేస్తారు.. ఇదిగో అరెస్ట్ చేస్తారని ఢిల్లీ వేదికగా అప్పట్లో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది. కవిత పేరు పలుమార్లు ప్రస్తావించినప్పటికీ ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో కవిత పేరు లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయ్. నిందితులతో ఆమె పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీనని అరుణ్ పిళ్ళై కూడా చెప్పారనే సాధారణ అభియోగాలనే మరోసారి ఈడీ మోపినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. అటు సీబీఐ, ఇటు ఈడీ ఛార్జ్షీటులో కానీ కనీసం విచారించిన వారి జాబితాలో కూడా కవిత పేరు రాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చే విషయమని సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు కవిత సేఫ్.. అని బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అయితే ఫైనల్గా కవిత విషయంలో సీబీఐ, ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి. ఒకవేళ క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితుంటే ఇన్నిరోజులు విచారణ పేరుతో ఇబ్బందిపెట్టిన కవితకు దర్యాప్తు సంస్థలు ఏం చెప్పబోతున్నాయన్నది కూడా ఆసక్తికర విషయమే..
లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే కేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ...
హైదరాబాద్: లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే సీఎం కేసీఆర్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ అవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ పక్కనే ఉండే అన్నా హాజరే ఎటు పోయారని ప్రశ్నించారు. 69 ఏళ్ళలో రూ. 71 వేల అప్పు చేస్తే... కేవలం 9 ఏళ్ళలో కేసీఆర్ రూ. 5 లక్షలు అప్పు చేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మరలించడానికి ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంపై మోదీకి విశ్వాసం ఉందా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. బీజేపీ పాలన తమకొద్దంటూ జనం చేతులు ఎత్తి దండం పెడుతున్నారన్నారు. దేశంలో ఆర్డినెన్స్ల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పార్లమెంట్ భవనం ఏదైనా బీజేపీ అప్రజాస్వామికపాలనలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
నల్లధనం తెస్తామన్నారు. ఏమైంది?
అధికారంలోకి రాగానే నల్లధనం తెస్తామని నరేంద్రమోదీ అన్నారని, అది ఏమైందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. పార్లమెంట్లో నల్లధనం గురించి చర్చించే దమ్ము బీజేపీకి ఉందా? అని నిలదీశారు.
ఉద్యోగాల గురించి డిబేట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా?..అదాని కంపెనీలలో పెట్టుబడుల గురించి మాట్లాడమంటే మోదీ ఎందుకు భయపడుతున్నారన్నారు. పార్లమెంట్పై నమ్మకం లేని ప్రధాని లాంటి వ్యక్తికి పార్లమెంట్ కొత్త భవనం అయితే ఏంటి, పాత భవనం అయితే ఏంటి? అంటూ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు..
UPSC: ఆ ఇద్దరూ నకిలీ ర్యాంకర్లే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటాం: యూపీఎస్సీ
దిల్లీ: యూపీఎస్సీ ఫలితాల్లో తమకు ర్యాంకు వచ్చిందంటూ మధ్యప్రదేశ్, హరియాణాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు చేసిన ప్రకటనలు మోసపూరితమని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) స్పష్టంచేసింది..
వారిద్దరూ తమలాంటి పేర్లతో ఉన్న వేరే అభ్యర్థుల నంబర్లను చూపించి తమకే ర్యాంకులు వచ్చినట్లు తప్పుదోవపట్టించారంది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రటకనలో పేర్కొంది. మధ్యప్రదేశ్కు చెందిన అయేషా మక్రానీ, అయేషా ఫాతిమాల్లో తొలి వ్యక్తి అబద్ధాలు చెప్పారని, రెండో వ్యక్తి నిజమైన అభ్యర్థి అని, ఆమెకు 184వ ర్యాంకు వచ్చినట్లు స్పష్టంచేసింది. ''అయేషా మక్రానీ (తండ్రి సలీముద్దీన్ మక్రానీ) తనకు ర్యాంకు వచ్చినట్లు డాక్యుమెంట్లను ఫోర్జ్ చేసింది..
ఆమె రోల్ నంబరు 7805064తో... 2022 జూన్ 5న జరిగిన ప్రిలిమ్స్ను రాయగా జనరల్ స్టడీస్ పేపర్-1లో 22.22, పేపర్-2లో 21.09 మార్కులు వచ్చాయి. ఈమె తదుపరి దశకు వెళ్లలేదు. మరోవైపు రోల్ నంబరు 7811744తో పరీక్ష రాసిన అయేషా ఫాతిమా (తండ్రి నిజాముద్దీన్) నిజమైన అభ్యర్థి.
ఆమె 2022 సివిల్స్లో 184వ ర్యాంకు పొందారు. అలాగే... హరియాణాలోని రేవారీ ప్రాంతానికి చెందిన తుషార్దీ అబద్ధపు కథే. ఇతను 2022లో రోల్ నంబరు 2208860తో ప్రిలిమ్స్ రాశాడు.
అతనికి జనరల్ స్టడీస్ పేపర్-1లో మైనస్ 22.89, పేపర్-2లో 44.73 మార్కులు వచ్చాయి. ఇతను కూడా ప్రిలిమ్స్ స్థాయిలోనే ఫెయిల్ అయ్యాడు. మరోవైపు రోల్ నంబరు 1521306తో పరీక్ష రాసిన బిహార్కు చెందిన తుషార్ కుమార్ నిజమైన అభ్యర్థి. అతనికి 44వ ర్యాంకు వచ్చింది'' అని యూపీఎస్సీ పేర్కొంది.
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు 24 మంది మంత్రుల పేర్లను ఖరారు చేస్తూ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసింది..
అయితే లింగాయత్ ఓటు బ్యాంకును బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదిలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
మంత్రుల జాబితాను రాజ్భవన్కు పంపించారు. ఈరోజు ఉదయం 11.45 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది..
SB NEWS
Terror conspiracy case: ఉగ్రవాద కుట్ర కేసులో ఎన్ఐఏ దాడులు
జబల్పూర్ (మధ్యప్రదేశ్): ఉగ్రవాద కుట్ర కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతంలో శనివారం నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది..
జబల్పూర్ లోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు.(Terror conspiracy case) భోపాల్ ఉగ్రవాద కుట్ర కేసులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ నిధులు సమకూర్చిందనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.
( NIA raids) ఉగ్రవాద కుట్ర కేసులో జబల్పూర్(Jabalpur) ప్రాంతంలోని అనుమానితుల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.ఈ కేసులో ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సోదాలు చేసింది.
ఈ ఉగ్రవాద కుట్ర కేసులో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10మందిని, బంగ్లాదేశ్ కు చెందిన మరో ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టింది..
SB NEWS
May 28 2023, 15:15