Bhojpur

Jan 04 2024, 18:08

ఏపీ అప్పు కేవలం రూ.1,34,452 కోట్లు మాత్రమే: మంత్రి బుగ్గన ప్రకటన

ఏపీ అప్పులపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీ ఆర్థిక అంశాలపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు శనివారం మంత్రి బుగ్గన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై టిడిపి రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

స్థిర ధరల వృద్ధిరేటులో 2021-22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఏ విధంగా లెక్క చేసిన మైనస్ 4 శాతం వృద్ధి అనేది అసాధ్యమన్నారు. కోవిడ్ సమయంలో దేశ వృద్ధిరేటు -6.60 శాతంగా నమోదు అయితే ఏపీ 0.08% మేర వృద్ధి నమోదు చేసిందన్నారు. 2019లో టిడిపి దిగిపోయే నాటికి రూ.2,64,451కోట్ల అప్పు ఉంటే, 2022 నాటికి రూ.3,98,903కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. అంటే, గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,34,452కోట్లు మాత్రమేనని బుగ్గన వివరించారు.