ప్రపంచానికే డ్రోన్ హబ్‌గా ఏపీ.

నేను మంత్రిని అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయి‌ర్‌పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఎయిర్‌పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్‌ల ప్రాధాన్యం గురించి మాట్లాడారు’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

దేశంలో మొదటిసారి డ్రోన్ సమ్మిట్ ఢిల్లీ బయట జరుగుతోందని కేంద్రం పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) అన్నారు. మంగళవారం డ్రోన్ సమ్మిట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ... ‘‘నేను మంత్రిని అయ్యాక చాలా మంది ముఖ్యమంత్రులు ఎయి‌ర్‌పోర్టులు, హెలిపోర్టుల గురించి అడిగారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఎయిర్‌పోర్టులతో పాటు కనెక్టివిటీ, డ్రోన్‌ల ప్రాధాన్యం గురించి మాట్లాడారు’’ అని తెలిపారు.

ఇంత మంచి వాతావరణంలో డ్రోన్ సమ్మిట్ కోసం ఏర్పాటు చేయడం పట్ల ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ భవిష్యత్తును విజన్ చేసి విజన్ 2020 గురించి ఆలోచించారని.. 1996 నాడే ఆయన 2020 గురించి ఆలోచించారని తెలిపారు. వచ్చే ఎన్నికల గురించి చంద్రబాబు ఆలోచించరని.. భవిష్యత్తును ఊహిస్తారని చెప్పారు. అందుకే హైదరాబాద్ అన్ని రంగంగాల్లో నేడు అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. 1996లో చంద్రబాబు హైదరాబాద్ గురించి ఎలా మాట్లాడారో అలాగే ఇప్పుడు అదే జీల్‌తో డ్రోన్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్ట్రీలో ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలని భావించి.. తనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు.

డ్రోన్ నెట్‌వర్క్‌లో ఎంతో పొటన్షియల్ ఉందని ఆయన గుర్తించారన్నారు. విజయవాడలో వరదల సమయంలో డ్రోన్‌‌లను సహయ కార్యక్రమాలకు, పుడ్ సప్లైకి వాడారన్నారు. డ్రోన్ ద్వారా ఆహారం, పాలు, మందులు అందించారని తెలిపారు. డ్రోన్‌లను ఇలా వాడడాన్ని ప్రధాని మోడీ కూడా చూసి ఆనందించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాను ప్రపంచంలోనే గొప్ప పొజిషన్‌లో నిలిపారని కొనియాడారు. ఇండియాను చూసి నేర్చుకోవాలని వివిధ దేశాల నాయకులు అనుకుంటున్నారన్నారు. గత పది సంవత్సరాలుగా సివిల్ ఏవియేషన్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. అంతకుముందు ఇండియాలో 74 ఎయిర్‌పోర్టులు ఉంటే.. ఇప్పుడు 157 ఎయిర్‌పోర్టులు ఏర్పాటయ్యాయన్నారు. రానున్న రోజుల్లో వీటిని మంరింతగా పెంచుతామని స్పష్టం చేశారు.

డ్రోన్‌లో వర్టికల్ టేకాఫ్‌ అండ్ ల్యాండింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందన్నారు. ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తేవాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తారన్నారు. ఈ డ్రోన్ సెక్టర్‌లో ఇక్కడి వారు ముందుకు రావాలని.. నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అందుకే డ్రోన్ రూల్స్ 2021ను చాలా సరళతరం చేశామని వెల్లడించారు. దీనికి అదనంగా డ్రోన్ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామని.. డ్రోన్ ఇండస్ట్రీపై మరింత రీసెర్చి జరగాలనేది తమ అభిమతమన్నారు. 26,500 డ్రోన్‌లు రిజిస్టర్ అయి ఉంటే ప్రధాని దాన్ని లక్షకు చేర్చాలని చెప్పారన్నారు. డ్రోన్ దీదీ ప్రోగ్రాం ద్వారా దేశంలో మహిళలకు ఉపాధి కూడా కలుగుతోందన్నారు. ఏపీ ఇప్పుడు డ్రోన్ పాలసీని రూపొందిస్తోందని.. అందరితో మాట్లాడి దాన్ని రూపొందించడంతో ఇదే బెస్ట్ పాలసీ అవుతుందని స్పష్టం చేశారు. 6000 మంది కంటే ఎక్కవ మంది ఈ ఈవెంట్‌లో పాల్గొనాలని ఉత్సాహం చూపారన్నారు. ఇండియాలోనే కాదు ప్రపంచానికే ఏపీ డ్రోన్ హబ్‌గా మారాలని కోరుతున్నానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ప్లీజ్ మా గోస చూడండి..

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే జనాలు జడుసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు నడపడం లేదనే ఆరోపణలు అధికమవుతున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే జనాలు జడుసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు నడపడం లేదనే ఆరోపణలు అధికమవుతున్నాయి. తాజాగా ఇదే సమస్యపై ఆమన్‌ గల్‌కు చెందిన విద్యార్థులు పలువురు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఓ లేఖ రాశారు. తమ సమస్యను ఆర్థం చేసుకుని.. అవసరమైనన్ని బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. బస్ పాస్ అంశంలో తాను ఎదుర్కొంటున్న అంశాలను సైతం సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి విద్యార్థులు ఒక లేఖ రాశారు.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ విద్యార్థులు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులను సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. బస్సుల్లో ఫుట్‌బోర్డుపై వేలాడుతున్న వీడియోలను సజ్జనార్‌కు షేర్ చేశారు. ప్రయాణాల గురించి నిరంతరం ప్రజల్లో అవేర్‌నెస్ కల్పిస్తున్న సజ్జనార్.. బస్సుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పట్టించుకోవాలని విద్యార్థులు వేడుకున్నారు.

షాద్‌నగర్-ఆమన్ గల్ రూట్లలో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. షాద్ నగర్-ఆమన్‌గల్ రూట్‌లో గతంలో 10 బస్సులు నడిపితే.. ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రూట్‌లో బస్సుల సంఖ్యను పెంచాలంటూ విద్యార్థులు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. బస్ పాస్ విషయంలో ఆర్టీసీ విధించిన నిబంధన సైతం తమకు ఇబ్బందిగా మారిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండటంతో.. ఆర్టీసీ 35 కిలోమీటర్ల పరిమితి సరిపోవడం లేదన్నారు. డిగ్రీ, హైయ్యర్ ఎడ్యూకేషన్ చేసే వారి కోసం 45, 60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితిని పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో ఆర్టీసీ బలోపేతం కోసం సంస్థ యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తోంది. అనేక స్కీమ్స్ ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించడంతో.. మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాగిస్తున్నారు. అయితే, ఈ ఫ్రీ బస్సు పథకం కారణంగా బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సంస్థ నడిపే బస్సులు.. ప్రయాణికులకు సరిపోవడం లేదు. బస్సులో నిలబడి మరీ ప్రయాణం సాగిస్తున్నారు. ఇక స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైతే.. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. బస్సుల్లో ఫుట్‌బోర్డు‌పై ప్రయాణిస్తూ ఎంతో మంది విద్యార్థులు ప్రమాదానికి గురైన ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కనుమరుగైన ప్రాచీన నగరం

ఆ నగరం పేరు ద్వారకాపురి 12వ శతాబ్దంలో దాని వైభవం అంతా ఇంతా కాదు. ఒకవైపు సిరి సంపదలతో తుల తూగుతుండగా.. మరోవైపు సంగీత, సాహిత్య శిల్పకళలకు కాణాచిగా నిలిచిందని తమ పూర్వీకులు చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు.

దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ద్వారకాపురి పట్టణం సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సగభాగం బుగ్గవాగు రిజర్వాయర్లో మునిగిపోగా, మిగిలిన సగభాగం వ్యవసాయ భూమిగా మారింది. వ్యవసాయ భూమిలో ఎక్కడ చూసినా పగిలిపోయిన కుండ పెంకులు, గాజు ముక్కలు కనిపిస్తుంటాయి. అంగుళానికి ఈ కుండపెంకులు విస్తరించి కనిపిస్తున్నాయి. దుక్కి దున్నుతున్నప్పుడు మట్టి కుండలు, పిడతలు పైకి రావడం సర్వసాధారణం. పొలం గట్లపై దేవతామూర్తుల విగ్రహాలు పడి దర్శనమిస్తాయి. వీటిలో నాగ దేవత, వినాయకుడు, గజలక్ష్మి, ఏనుగును అదిరోహించిన వీరవనిత తదితర విగ్రహాలు ఉన్నాయి.

చేనేత వస్త్రాలకు రంగులు తయారుచేసే ఒక యూనిట్ ఈనాటికీ శిదిలావస్థలో అక్కడ దర్శనమిస్తుంది. ప్రాంతంలో కొంతభాగాన్ని నాగులకట్ట, మరి కొంత బాగాన్ని కుమ్మరి గుట్ట అని పిలుస్తుంటారు. ఈ భూములను సాగు చేస్తున్న రైతులకు తరచూ బంగారు నాణాలు, ఆభరణాలు ఇప్పటికీ లభిస్తున్నాయి. ఇక్కడ నాలుగు శిథిలాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఊరికి పక్కన నిరంతరం నీరు ప్రవహించే బుగ్గవాగు ఉండగా, వాగుకు ఆవలవైన బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం మెట్లకు దిగువ భాగాన పాతాళగంగా నిరంతరం భూమిపైకి పొంగుతూ ఉంటుంది. ఆ నీరు ఆనాటి ద్వారకాపురి పట్టణ వాసుల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేది. 1964లో నిర్మించిన బుగ్గవాగు రిజర్వాయర్ వల్ల బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు భూమిపైకి ఉబికి వచ్చే పాతళగంగ కూడా మునిగి ఉనికి కోల్పోయాయి.

శిథిల ఆలయం ముందు కనిపిస్తున్న శిలాశాసనంలో ఓరుగల్లు రాజుల ప్రసక్తి ఉంది. దీన్ని బట్టి 12వ శతాబ్దంలో ఈ పట్టణం విలసిల్లినట్లు ఊహించవచ్చు. వైభవ ప్రాభవాన్ని అనుభవించిన ఆ పట్టణం ఎందుకు శిథిలస్థితికి చేరిందో ఇప్పటికీ అర్ధం కాదు. ఆనాటి ముస్లిం రాజుల దండయాత్ర వల్లనో, లేక ప్రకృతి వైపరీత్యాల కారణంగానో ద్వారకావురి విధ్వంసానికి గురై ఉండవచ్చు. అయితే స్థానికులు మరో కథనం చెబుతుంటారు. శ్రీశైలం అడవుల్లో నివసించే చెంచు తెగల దాడి వల్లనే ఈ పట్టణం ధ్వంసమైందని ఈ ప్రాంత వాసులు విశ్వసిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. చెంచు తెగకు చెందిన ఓ మహిళ తేనె అమ్మడానికి తన కుక్కతో ఈ పట్టణానికి వచ్చింది. ఓ ఇంట్లో తేనె విక్రయిస్తుండగా అక్కడ తిరుగుతున్న పిల్లిని చూసి ఆ కుక్క దానిపై దాడి చేసి చంపింది.

ఈ విషయమై ఆ చెంచు మహిళకు కుటుంబ సభ్యులకు ఘర్షణ జరిగి చివరకు ఆ తేనే అమ్ముకునే మహిళ హత్యకు దారితీసింది. ఆమె హత్య విషయం తెలుసుకున్న చెంచులు ప్రతీకారంతో రగిలిపోయారు. రాత్రికి రాత్రే ద్వారకాపురి పట్టణంపై దాడి చేసి మగ వారి గొంతులు కోశారని, ఈ దాడితో పట్టణం శవాల గుట్టలతో శ్మశానంగా మారిందని చెబుతుంటారు. మగ దిక్కు కోల్పోయిన మహిళలంతా పట్టణం వీడిపోగా, తప్పించుకున్న మగవారు కొన్నాళ్లకు తిరిగివచ్చారు. వారిలో కొందరు దర్మవరంలో అంతర్భాగంగా ఉన్న దారివేముల గ్రామాన్ని ఏర్పరుచుకోగా.. కొందరు దుర్గి ప్రాంతానికి వచ్చి నేటి దుర్గి గ్రామాన్ని నిర్మించుకున్నారు.

చరిత్ర నుంచి అదృశ్యమైన వాటి ద్వారకాసురి చరిత్ర నేటికీ పురావస్తు శాఖ దృష్టికి రాలేదు. అపురూప శిల్పసంపద, శిలాశాసనాలు, చారిత్రక అవశేషాలకు నిలయమైన ద్వారకాపురి ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి నిలువటద్దంలా నిలిచి ఉంది.

ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి.

భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.

భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.

ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మెుట్టమెుదటి జలాంతర్గామి కావడం విశేషం. ఇటీవల తెలంగాణలో నేవీ ర్యాడార్ కేంద్రం ప్రారంభించిన మరసటి రోజే అంటే.. అక్టోబర్ 16న విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 జలాంతర్గామి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన ఎస్ఎస్‌బీఎన్ అరిఘాత్‌ను విశాఖ కేంద్రంగా రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. మరోవైపు అక్టోబర్ 9, 2025న అణుశక్తి కలిగిన మరో జలాంతర్గామిని అరిధామాన్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొత్తగా ప్రారంభించబడిన ఎస్ఎఎస్‌బీఎన్ ఎస్-4ను దాదాపు 75శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.

దీనిలో 3,500 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కె-4 అణు బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. అయితే మెుట్టమెుదటి అణు జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిహంత్ కేవల 750కి.మీ. పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. దీనిలో కె-15 అణు క్షిపణులు ఉన్నాయి. కొత్తగా మరో అణు జలాంతర్గామి రక్షణ వ్యవస్థలోకి చేరి దేశానికి సేవలు అందించనుంది.

మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం !

హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు.

స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ ల్యాండ్స్, హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్ముతామని ఏజెంట్లను పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. మొదట్లో పెద్ద ఎత్తున లగ్జరీ కార్యక్రమాలు నిర్వహించింది. ఏజెంట్లకు ఆడికార్లు వంటివి బహుకరించింది.

ఈ బిల్డప్ చూసి భారీగా భూములున్నాయని చాలా మంది అనుకున్నారు. పద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్లాట్ల కోసం డబ్బులు కట్టించుకున్నారు. ఏవో ఒప్పంద పత్రాలు ఇచ్చారు కానీ అందులో భూమి, ప్లాట్ల వివరాలు లేవు.

మూడేళ్ల నుంచి వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. డబ్బులు కట్టిన వారు తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అడుగుతున్నా స్పందించడం లేదు.

చివరికి వారు స్పెక్ట్రా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు ప్లాట్లు అని చెబితే… సర్వం పోగొట్టుకున్న కుటుంబాలు లబోదిబోమంటున్నాయి.

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులశ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలులో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో తెలిపారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం దేవీనవరాత్రులు అంగరంగవైభవంగా ముగిశాయి. ఇప్పుడు కార్తీక మాసోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. కార్తీకమాసమంతా శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశామని వెల్లడించారు.

శని, ఆది, సోమవారం కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసి.. అమ్మవారి ఆశీర్వచన మండపంలో కొనసాగింపు ఉంటుందన్నారు. కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి కావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం కార్యక్రమం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు ఇటీవల శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దసరాశరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతీరోజు ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలను దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఉత్సవాలలో స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, జపపారాయణలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహించారు. ఉత్సవాల్లో నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో సుందరీకరించారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు ప్రధాన ఆలయానికి ముందుభాగాన ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 1,60,146 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,77,040 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. దాంతో పాటు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210.9946 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి

హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన యువకుడు అక్కడ ఓ పెంపుడు కుక్క వెంటపడంతో ప్రమాదవశాత్తు కిటికీలో నుంచి కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

హైదరాబాద్‌ చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో పెంపుడు కుక్క వెంటపడటంతో ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు ఉదయ్‌ (23) నివాసం ఉంటున్నాడు.

ఆదివారం (అక్టోబర్ 20) స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్‌ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. హోటల్‌ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే అతడికి ఓ పెంపుడు కుక్క కనిపించింది. ఉదయ్ దాన్ని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో కుక్క ఉదయ్ వెంట పడటంతో.. దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోటల్‌ కిటికీ నుంచి ఉదయ్‌ కిందపడిపోయాడు. గమనించిన స్నేహితులు కిందకు వెళ్లి చూడగా.. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు హోటల్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. విషయం బయటకు రాకుండా హోటల్ యాజమాన్యం జాగ్రత్త పడింది. తాజాగా విషయం బయటపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇక గతేడాది హైదరాబాద్‌లో ఇటువంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. కస్టమర్ పెంపుడు కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. డెలివరీ ఇవ్వడానికి వెళ్లి కస్టమర్‌కు చెందిన పెంపుడు కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి ప్రాణాలు దురదుష్టవశాత్తు ప్రాణాలు విడిచాడు. నగరానికి చెందిన 23 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ స్విగ్గీ ఏజెంట్ బాయ్‌గా పనిచేస్తుండగా.. గతేడాది జనవరిలో బంజారాహిల్స్‌లోని లుంబిని రాక్ కాజిల్ అపార్ట్‌మెంట్స్‌లో డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు.

కస్టమర్ ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి తలుపు తీశాడు. కొత్త వ్యక్తి కావటంతో కస్టమర్ జర్మన్ షెపర్డ్ కుక్క రిజ్వాన్‌పై దాడికి ప్రయత్నంచింది. భయపడిపోయిన రిజ్వాన్ దాన్నుంచి తప్పించుకునే క్రమంలో బిల్డింగ్‌ పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

నవంబర్‌ నుంచివిద్యుత్తు చార్జీలు పెంచేందుకు కసరత్తు.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్‌ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల ధరలు నవంబర్‌ నుంచి పెరగనున్నాయి. దాదాపు రూ. 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్‌టీ క్యాటగిరీలో విద్యుత్తు చార్జీల పెంపు, ఎల్‌టీ క్యాటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఈఆర్సీ ముందు డిస్కంలు ప్రతిపాదించాయి. ఎల్‌టీ క్యాటగిరీలో ప్రతి కిలోవాట్‌కు రూ. 10 ఫిక్స్‌డ్‌ చార్జీలుగా వసూలు చేస్తుండగా, ఇప్పుది కిలోవాట్‌కు 30 రూపాయలు పెరగనుంది. ఇలాంటి వినియోగదారులు 26 లక్షల మంది ఉన్నారు. ఈ పెంపుతో రూ. 400 కోట్లను డిస్కంలు రాబట్టుకోనున్నాయి. హెచ్‌టీలో 11కేవీ, 33కేవీ, 132 కేవీ కెపాసిటీ కనెక్షన్లకు వేర్వేరు చార్జీలుండేవి. 33 కేవీకి యూనిట్‌కు రూ. 7.15, 11 కేవీకి యూనిట్‌కు రూ. 7.65, 132 కేవీ ఆపైన యూనిట్‌కు రూ. 6.62 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని క్యాటగిరీల వారికి యూనిట్‌కు రూ. 7.65 చొప్పున వసూలు చేసేందుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. దీంతో ఆయా వినియోగదారులపై రూ. 800 కోట్ల భారం పడనుంది. ఈఆర్సీ చైర్మన్‌, సభ్యుల కాలపరిమితి ఈ నెల 29తో ముగియనుంది. ఈనేపథ్యంలో డిస్కం ప్రతిపాదనలకు ఈఆర్సీ అనుమతినివ్వడం లాంఛనంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే నవంబర్‌ ఒకటి నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయి.

విద్యుత్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణలు చేపట్టింది. సోమవారం జెన్‌కో ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, ట్రూప్‌ అప్‌ చార్జీలపై టీజీఈఆర్సీ బహిరంగ విచారణ జరిపింది. ఇంధన సర్దుబాటు చార్జీల కింద రూ. 963.18 కోట్లకు అనుమతించాలని జెన్‌కో కోరింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్‌ చార్జీలు, 2024-25 నుంచి 2028-29 కాలానికి (ఐదో నియంత్రణ కాలానికి) మల్టీ ఇయర్‌ టారిఫ్‌పై విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం బహిరంగ విచారణ జరిపింది. టీజీజెన్‌కో సమర్పించిన పిటిషన్‌పై తొలుత జెన్‌కో అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేయగా, ఆ తర్వాత పలు ఎఫ్‌టీసీసీఐ, తెలంగాణ స్పిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌, స్టీల్‌ రంగ నిపుణులు తమతమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ట్రాన్స్‌కో దాఖలు చేసిన రూ. 16, 346 కోట్ల ఏఆర్‌ఆర్‌ పిటిషన్‌పై ఈఆర్సీ మంగళవారం విచారణ జరపనుంది. 23న టీజీఎస్పీడీసీఎల్‌ పిటిషన్‌పై హైదరాబాద్‌లో, 24న టీజీఎన్పీడీసీఎల్‌ పిటిషన్‌పై నిజామాబాద్‌లో, 25న సెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సిరిసిల్లలో ఈఆర్సీ బహిరంగ విచారణలు జరపనుంది.

కొత్త విద్యుత్తు ప్లాంట్లు 65 శాతమే పనిచేస్తే ఎలా అని ఎనర్జీ కన్సల్టెంట్‌ రణదీప్‌ ప్రశ్నించారు. ఇవి 85 శాతం పనిచేయాల్సి ఉండగా, కొన్ని 65 శాతమే పనిచేస్తున్నాయని, దీంతో నష్టాలొస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణ విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు బయట అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం, స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. పరిశ్రమలే డిస్కంలకు వెన్నెముకలాంటివని, కానీ డిస్కంల చర్యలు పరిశ్రమలను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని విమర్శించారు. పిటిషన్ల దాఖలు తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు తక్కువ సమయం ఇస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. అధ్యయనం చేసి, అభ్యంతరాలు వ్యక్తం చేసేంత సమయం తమకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ట్రూ అప్‌ చార్జీల పెంపునకు విద్యుత్తు సంస్థలు పేర్కొన్న కారణాలు సహేతుకం కాదని సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌ ప్రతినిధి వేణుగోపాలరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యుత్తు ప్లాంట్ల పీఎల్‌ఎఫ్‌ సామర్థ్యం పెరిగితే ఇన్సెంటివ్‌లు ఇస్తున్నట్టేనని, పీఎల్‌ఎఫ్‌ పడిపోతే జరిమానాలు ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్తు ప్లాంట్లల్లో సామర్థ్యానికంటే తక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసి, ఓపెన్‌ మార్కెట్‌లో విద్యుత్తును కొనడంతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తాము 25 ఏండ్లుగా సూచనలిస్తున్నా, వాటిని పరిగణిలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

వైఎస్‌ జగన్‌ రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటన

శాంతిభద్రతలు క్షీణించడంతో ఆకతాయిల చేతుల్లో మోసపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఆయన షెడ్యూల్‌ ఇలా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.

స్వయంగా బాధితులను కలిసి వారికి జీవితంపై భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌ బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈ మేరకు జగన్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. అత్యాచార, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

ఇంజనీరింగ్‌ కాలేజీలు సొంతంగా సీట్లు భర్తీ చేసుకోవచ్చు!

ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.

ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏఐసీటీఈ అనుమతించిన మేరకు కొత్త కోర్సులు, పెంచిన సీట్లు భర్తీ చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పెంచిన సీట్లకు, కోర్సులకు మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సెప్టెంబర్‌ 9న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

వాటి ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించనందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ధిక్కరణ చర్యల కింద శిక్ష విధిస్తే దానిపై సుప్రీంకు వెళ్లడం ద్వారా కాలయాపన చేద్దామని అనుకుంటున్నారు. టెక్నికల్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియకు అక్టోబర్‌ 23వ తేదీ దాటిపోతే గడువు తీరిపోతుంది కాబట్టి చేతులెత్తేద్దామనుకుంటున్నారు’’ అని పేర్కొంది.

కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేసిన కాలేజీలకు సీట్లు భర్తీ చేసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ తీర్పును సుప్రీంలో సవాల్‌ చేయాలని సర్కారు నిర్ణయించింది. సీట్ల పెంపుకు ఏఐసీటీఈ అనుమతినిచ్చినా, జేఎన్టీయూ అనుమతిలేనిదే కోర్సులకు గుర్తింపు ఉండదు. ఇప్పటికే కౌన్సెలింగ్‌ పూర్తయిన వాటిలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే గతంలో వేరే కోర్సుల్లో చేరిన వారు, దూరం కాలేజీలో చేరినవారు మళ్లీ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తారు. కాలేజీలు భర్తీ చేసుకున్నా ప్రభుత్వ అనుమతి లేనందున విద్యార్థులకు సర్టిఫికేట్స్‌ వచ్చే అవకాశం లేదు. ఇంకోవైపు, సింగిల్‌ జడ్జి బెంచ్‌ నుంచి వెలువడే పూర్తిస్థాయి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని డివిజన్‌ పేర్కొంది. ఒకవేళ ఆ తీర్పుకు దీనికి వ్యతిరేకంగా వస్తే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారు.