బాలకృష్ణ కోసం మోదీకి చంద్రబాబు కీలక సిఫార్సు..!!

ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. నందమూరి, మెగా హీరోల కేంద్రంగా ఏపీలో రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఈ రెండు కుటుంబాలకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా సీఎం చంద్రబాబు నందమూరి హీరో బాలకృష్ణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి కీలక సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇక బాలయ్య అభిమానుల ఆనందం అన్ స్టాపబుల్ గా మారనుంది.

కేంద్రం ప్రతీ ఏటా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఇందు కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పలు కేటగిరీల్లో విశిష్ట వ్యక్తుల పేర్లను సిఫార్సు చేయటం ఆనవాయితీ. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తాజాగా నందమూరి బాలకృష్ణ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ సినీ రంగంలో తన 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. దీంతో.. సినీ రంగంతో పాటుగా సేవా రంగంలోనూ బాలకృష్ణ కు ప్రత్యేకత ఉంది.

బాలకృష్ణ సినిమాలతో పాటుగా బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పేదలకు క్యాన్సర్ వైద్యం అందిస్తున్నారు. దీంతో..బాలకృష్ణ పద్మభూషణ్ కు అర్హుడిగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తో పాటుగా మరో సినీ ప్రముఖుడు మురళీ మోహన్ పేరును జత చేసినట్లు సమాచారం. అదే విధంగా వైద్యం, విద్య, సామాజిక రంగాల నుంచి మరి కొందరి పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రధానం చేసింది.

ప్రస్తుతం బాలయ్య సినీ, సేవా రంగాలతో పాటుగా ఓటీటీ లోనూ దూసుకుపోతున్నారు. ఎన్‌బీకే అన్ స్టాపబుల్ వరుస సీజన్లతో హంగామా చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో ఇందు కోసం షూటింగ్ పూర్తి చేసారు. సహా చిరంజీవి - పవన్ కల్యాణ్ కాంబోలో ఇదే షో లో ఒక ఎపిసోడ్ బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేంద్రంలోనూ టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉంది. అటు కేంద్రం..ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో .. ఏపీ ప్రభుత్వం సిఫార్సులకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేయటంతో కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.

ఏపీ డిప్యూటీ సీఎంకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీచేసింది. తిరుమల లడ్డూపై పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 22వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.

తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే కల్తీ నెయ్యి అంశం ఇంకా కాకరేపుతూనే ఉంది. పంది కొవ్వు ఉపయోగించారని తెలిసి శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు. తిరుపతి లడ్డూపై రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. గత పాలక మండలి కల్తీ నెయ్యి ఉపయోగించిందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే అంశంపై హైదరాబాద్‌కు చెందిన అడ్వకేట్ ఇమ్మనేని రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

భక్తులకే కాదు.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా తిరుపతి లడ్డూ పంపించారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ చేసిన కామెంట్లతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల లడ్డూ తయారీ కోసం జంతువులు కొవ్వు కలిపారని అనడం దారుణం. ఆ ఆరోపణలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను కోర్టు ముందు ఉంచాం. లడ్డూ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానెళ్ల నుంచి ఆ కామెంట్లను తొలగించాలి అని’ పిటిషనర్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తిరుమల లడ్డూకు సంబంధించి ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి వై రేణుకతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 22వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీచేసింది. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించాల్సి ఉంది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలతో రాజకీయ దుమారం నెలకొంది. ఆ అంశంపై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో.. న్యాయస్థానం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ చేసింది.

గుర్లలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన - మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం

విజయనగరం జిల్లాలో గుర్లలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పర్యటించారు. నెల్లిమర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించారు. అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా బాధితులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు.

గుర్లలో గ్రామస్థులతో డిప్యూటీ సీఎం పవన్‌ ముఖాముఖి నిర్వహించారు.మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం: గ్రామస్థులు 3 ప్రధాన సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రపరచడంలేదని, ఒకే ఒక్క ట్యాంకు వల్ల తాగునీటి సమస్య తలెత్తుతోందని గ్రామస్థులు ఆరోపించారు.

సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు వినతి పత్రాలు అందజేశారు. అదే విధంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షను నిర్వహించారు. అతిసారం వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తన తరఫున మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

విచారణకు సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ విజయానంద్‌: ఘటనపై నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పవన్‌ భరోసానిచ్చారు.

గత ప్రభుత్వ తప్పిదాలు వారసత్వంగా వచ్చాయని, గుర్లకు వెళ్లే చంపావతి నీరే కలుషితమైందని అన్నారు. గత ప్రభుత్వం కనీసం మంచినీరు అందించలేకపోయిందన్న పవన్, విచారణకు సీనియర్‌ ఐఏఎస్‌ విజయానంద్‌ను నియమించారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

విమానాలకు బాంబు బెదిరింపులు.. రామ్మోహన్ నాయుడు సీరియస్

దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు వస్తుండటం తీవ్ర ఆందోళనకరంగా మారిన వేళ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాలకు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. అవసరమైన చట్టాలు మార్చేందుకు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో విమానాలకు బాంబు హెచ్చరికలు వస్తుండటం అటు ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సంస్థలతోపాటు ఇటు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. అవి ఎవరు చేస్తున్నారు.. అందులో ఎంతవరకు నిజం ఉంది అని కనుక్కోవడం ప్రస్తుతం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇప్పటివరకు వచ్చిన బెదిరింపులు అన్నీ నకిలీవి అని గుర్తించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇక ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా విమానాలకు బెదిరింపులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సీరియస్‌ అయ్యారు.

విమాన ప్రయాణికులకు భద్రత కల్పించడమే తమ ప్రభుత్యానికి మొదటి ప్రాధాన్యత అని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇక విమానాలకు బెదిరింపులు చేసేవారిని నో ఫ్లై లిస్ట్‌లో చేర్చేలా ఇప్పటివరకు ఉన్న విమానయాన చట్టాలను సవరిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వచ్చిన విమాన బెదిరింపులు అన్నీ ఫేక్ అని తేలిందని చెప్పారు. పౌర విమానయాన శాఖకు కఠినమైన ప్రొటోకాల్‌ ఉందని.. దాన్నే అనుసరిస్తున్నట్లు పేర్కొ్న్నారు. అయితే విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినపుడు పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ విధివిధానాలను కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు.

అక్టోబర్‌ 14వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 100 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ బెదిరింపులపై సంబంధిత వర్గాలతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. విమానయాన భద్రతా నిబంధనలను సవరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. 1982 సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ చట్టం సవరణకు వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. విమానాలకు బెదిరింపులు రావడంతో వాటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ప్రతి బెదిరింపును క్షుణ్ణంగా విశ్లేషించి వేగంగా, అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

అయితే ఇవి తప్పుడు బెదిరింపు కాల్స్‌ అయినా.. ప్రయాణికుల భద్రత, సురక్షిత విషయంలో రాజీ పడటం లేదని.. ప్రయాణికుల ప్రాణాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి ఈ విమానాలకు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రోజున 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. ఆదివారం మరో 24 విమానాలకు అలాంటి బెదిరింపులు వచ్చాయి.

ఇక ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌ సహా దాదాపు అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలతోపాటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ కూడా ఈ బెదిరింపులు వచ్చిన విమానాల జాబితాలో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇండిగో, విస్తారా, ఎయిరిండియాకు చెందిన ఆరు చొప్పున విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ బాంబు హెచ్చరికల గురించి అధికారులకు తెలిపామని.. వారి ఆదేశాల మేరకు భద్రతా విధానాలను పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్‌ అని అధికారులు గుర్తించారు.

తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్నదర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఏడుకొండలవాడిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దర్శించుకున్నారు.

అనంతరం తిరుమాడ వీధుల్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...తిరుమలలో స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల జారీ చేసే సిఫార్స్ లేఖలు అనుమతించకపోవడం బాధాకరమన్నారు. డయిల్ యువర్ ఈవో కార్యక్రమంలో సైతం టీటీడీ ఈవో సైతం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖను అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు.

అయితే తమ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాచలంలో దేవుడు దర్శనానికి వచ్చే ఆంధ్ర ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలను తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. కానీ తమ తెలంగాణ విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని టీటీడీ అధికారులను ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తాం.. రూమ్ ఇప్పించండి అంటే.. ఇప్పించలేని దుస్థితి నేడు నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతారని పేర్కొన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం కొలువు తీరితే.. వైసీపీ వాళ్లు హైదరాబాద్‌ వచ్చి ఉంటారన్నారు. ఏపీ వాళ్లు హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకున్నా.. తెలంగాణ వాళ్లు ఏనాడు ఒక్క మాట కూడా వాళ్లని అనలేదన్నారు.

తెలంగాణ ఎమ్మెల్యే అంతా ఏపీ వాళ్లను తమ రాష్ట్రానికి రావొద్దని ఓ తీర్మానం చేసుకుంటే.. ఆ బాధేమిటో మీకు తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు టీటీడీ అనుమతించక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాము తీసుకునే నిర్ణయంతో బాధ పడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే అనిరుధ్ హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములన్నారు. అలాగే ఉందాం. కేవలం వ్యాపారం కోసం హైదరాబాద్‌కు రాకండీ.. నిజమైన అన్నదమ్ముల వలే ఉందమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్ రాజు ఛార్లెస్ 3కి ఘోర అవమానం

గతేడాది మే నెలలో బ్రిటన్ రాజుగా ఛార్లెస్ 3కి పట్టాభిషేకం జరిగింది. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 2022 సెప్టెంబర్‌లో మరణించడంతో రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్‌ నియమితులయ్యారు. రాజు అయిన తర్వాత తొలిసారి ఆయన కామన్వెల్త్ దేశాల పర్యటనకు బయలుదేరారు. ముందుగా ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అక్కడ పాలన బ్రిటన్ రాణి చేతుల మీదుగానే జరుగుతుంది. అందుకే ఆయన అధికారికంగా ఆ దేశానికి పాలకుడు

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన బ్రిటన్ రాజు సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్‌ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘మా భూమిని తిరిగి ఇచ్చేయండి.. మా నుంచి దోచుకున్న సంపద మొత్తం వెనక్కి ఇవ్వండి. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజూ కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపై ఐరోపా వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు’ అని ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. దాదాపు నిమిషం పాటు పెద్దపెద్దగా కేకలు వేశారు.

తరుచూ వలస విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ థోర్పే వార్తల్లో నిలుస్తారు. 2022లో పార్లమెంట్‌కు ఎన్నికైప్పుడు బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2ను వలస రాజ్యపాలకురాలని అభివర్ణిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నాటి ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ సు లిన్స్‌ అభ్యంతరం తెలిపారు. ‘‘సెనెటర్‌ థోర్పే.. మీరు ప్రమాణస్వీకారం ప్రతిలో ప్రచురించిన అంశాన్ని మాత్రమే చదవాలి’ అని సూచించారు.

ఆస్ట్రేలియాలో పాలన ఇంగ్లాండ్ రాణి పేరు మీదనే జరుగుతోంది. రాణి హోదా నుంచి క్వీన్‌ ఎలిజిబెత్‌-2ను తొలగించి, పార్లమెంట్‌ సభ్యులు ఎన్నుకొన్నవారిని నియమించేలా 1999లో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ నిర్వహించగా.. స్వల్ప మెజార్టీతో ఈ తీర్మానం వీగిపోయింది. మరోవైపు, దేశంలో ఆదివాసీ కన్సల్టేటీవ్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానం కూడా గతేడాది పార్లమెంట్‌‌లో భారీ మెజార్టీతో వీగిపోవడం గమనార్హం.

దాదాపు 100 ఏళ్లకుపైగా ఆస్ట్రేలియా సైతం బ్రిటన్‌ వలస రాజ్యంగా ఉంది. ఈ సమయంలో ఆస్ట్రేలియాలోని వేలాది మంది ఆదివాసీలు హత్యలకు గురయ్యారు. చివరకు 1901లో ఆ దేశం అప్రకటిత స్వాతంత్ర్యం సాధించింది. కానీ, పూర్తిస్థాయి రిపబ్లిక్‌గా అవతరించలేదు. ప్రస్తుతం దానికి కింగ్‌ ఛార్లెస్‌-2 రాజుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా ఆస్ట్రేలియా, సమవో దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటన ప్రారంభించారు. ముందుగా ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించి.. ఆ తర్వాత అక్కడకు వెళ్లనున్నారు.

సిద్దంగా ఉండండి - సీఎం రేవంత్ కీలక ప్రకటన..!!

విధి నిర్వహణలో అసువులుబాసి అమరులైన పోలీసులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. రాష్ట్రం అభివృద్ధి పదంవైపు నడవాలంటే పోలీసులు కీలకమన్నారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని, పండుగల నిర్వహణలో శాంతిభద్రతలను కాపాడడంలో అలసత్వం వద్దని సూచించారు. సైబర్ క్రైం ఛేదనలో తెలంగాణ విధానాన్ని కేంద్రం కూడా మెచ్చుకుందని గుర్తు చేశారు.

శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావని.. రాష్ట్రం అభివృద్ధికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అభినందించారు. రాష్ట్రంలో క్రైం రేటును నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోందని రేవంత్ వివరించారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేసామని గుర్తు చేసారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

తీవ్రవాదులు, మావోయిస్టు చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికి స్ఫూర్తిదాయకమని రేవంత్ ప్రశంసించారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. డ్రగ్స్ మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. పంజాబ్ రాష్టంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు టీజీఎన్‌ఏబీను ఏర్పాటు చేశామని గుర్తు చేసారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ఇదే సమయంలో రేవంత్ ప్రార్ధనా మందిరాల పైన దాడులు చేస్తున్న వారిని హెచ్చరించారు.

మందిరాల మీద, మజీద్‌ల మీద దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలని రేవంత్ ఆదేశించారు.

నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్ హెచ్చరిక

విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. గతేడాది కూడా అతడు ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు. 

సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీచేశాడు.

ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడు.

వారంలో 90 విమానాలకు బెదిరింపులు

గత కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నిన్న కూడా 25 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇందులో ఉన్నాయి. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విమనాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

దక్షిణ కొరియా పర్యటనలో తెలంగాణ మంత్రులు (Telangana Ministers), అధికారుల బృందం బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. సియోల్ నగరంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎమ్‌ఏపీఓ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను మంత్రులు, అధికారులు సందర్శించారు. అనంతరం చియంగ్‌ చు నదిని ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది.

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్‌లో యాన్, చీయంగ్ చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియోల్‌లో మంత్రులు, అధికారులు పర్యటిస్తున్నారు. బృందంలో మంత్రులు పొంగులేటి , పొన్నం ప్రభాకర్ , ఎంపీ చామల కిరణ్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ , ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ , మూసీ రివర్ ప్రంట్ అధికారులు ఉన్నారు.

కాగా.. రాష్ట్రంలో ఆక్రమణల తొలగింపుపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ప్రజారోగ్యం, హైదరాబాద్‌ పర్యాటక, వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మూసీ ప్రక్షాళనలో ముందుకేసాగాలని ప్రభుత్వం భావించింది. ఖాళీ చేసిన నివాసాల కూల్చివేత చేపట్టిన ప్రభుత్వ విభాగాలు.. మార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి. నిర్వాసితులను ఒప్పించాకే తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఉన్నతస్థాయి ఆదేశాల నేపథ్యంలో వేచి చూస్తున్నాయి. ప్రాజెక్టులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తొలినుంచి యోచిస్తున్న సర్కారు వారిని దక్షిణ కొరియా తీసుకెళ్లాలని నిర్ణయించింది. సుందరకీరణ తర్వాత నది రూపు ఎలా మారనుందో అవగాహన కల్పించేందుకు అధ్యయనానికి తీసుకెళ్లనుంది. 21 మందితో కూడిన బృందం పర్యటనకు ఇటీవల సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఉన్నతాధికారులతో కూడిన బృందం దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లింది. అక్కడి చాంగి చియోన్‌లో హన్‌ నది, సియోల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి.. తిరిగి 25వ తేదీన స్వదేశానికి రానుంది. గతంలో నది, తీరం ఎలా ఉండేది? తర్వాత ఎలా మారాయో ప్రజాప్రతినిధులకు చూపించనున్నట్టు సమాచారం.

తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఆయనే.. కావాలంటే రాసి పెట్టుకోండి' .. ప్రశాంత్ కని

2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు..? కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి రేవంత్ రెండోసారి సీఎం అవుతారా..? లేక పడిలేచిన కెరటంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని కేసీఆర్ మూడోసారి సీఎం కుర్చీ ఎక్కుతారా..? ఈ రెండు పార్టీలు కాకుండా కమలం పార్టీ తొలిసారిగా తెలంగాణలో అధికారంలోకి రానుందా..? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో ఈ చర్చ జరగుతున్న నేపథ్యంలో తెలంగాణకు కాబోయే సీఎం ఆయనే అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కని జోష్యం చెప్పారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఓటమి పాలైంది. మెుత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. 64 సీట్లతో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ పూర్తి డీలా పడింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది. పార్టీ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిథ్యం లేకపోవటం ఇదే తొలిసారి

అంతకుముందు కేసీఆర్ తుంటి ఎముక విరగటం, ఆయన ఇంటికే పరిమితం కావటం, కవిత జైలుకు వెళ్లటం, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, ద్వితయశ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. కేడర్‌ పూర్తి నిరాశంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనైనా ఆ పార్టీ పుంజుంకుంటుందా..? కేసీఆర్ మరోసారి సీఎం అవుతారా..? బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటనేది తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తిర చర్చ జరుగుతోంది. ఇక రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ? బీజేపీకి అవకాశాలు ఉన్నాయా..? అనే చర్చ కూడా నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తన ప్రిడిక్షన్ ఇచ్చారు ప్రస్తుతం పొలిటికల్‌గా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని జోతిష్యం చెప్పారు. ఆయనకు త్వరలోనే శుభ గడియలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ మేరకు ఆయన్ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.