నిజందాగదుక్షణంఆగదు

Jun 07 2024, 19:24

బోధనాసుపత్రుల్లో రోగులకు ‘ఆభా’ తప్పనిసరి: ఎన్‌ఎంసీ

బోధనాసుపత్రుల్లో రోగులకు ‘ఆభా’ తప్పనిసరి: ఎన్‌ఎంసీ

హైదరాబాద్‌: దేశంలోని అన్ని వైద్య కళాశాలల(బోధనాసుపత్రులు)కు వచ్చే రోగుల ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య ఖాతా(ఆభా) గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఆదేశించింది. ఎవరికైనా ఈ గుర్తింపు సంఖ్య లేకుంటే ఆధార్‌తో వెంటనే ఇవ్వొచ్చని స్పష్టంచేసింది. 2025-26 నుంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపు, కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, కళాశాలల రెన్యువల్‌ వంటి అంశాలన్నీ ఆసుపత్రికొచ్చే రోగుల సంఖ్యతో ముడిపడి ఉంటాయంది. అదే సమయంలో ఆభా గుర్తింపు లేదనే కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యాన్ని తిరస్కరించకూడదని తెలిపింది.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 16:53

రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు... దేశంలోనే తొలిసారి.. వేదికగా తెలంగాణ..

రేపటి నుంచి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు

దేశంలోనే తొలిసారి.. వేదికగా తెలంగాణ

రెండు రోజుల పాటు నిర్వహణ

హాజరుకానున్న 30 దేశాల ప్రతినిధులు

హైదరాబాద్‌: అంతర్జాతీయ సరకుల (కమాడిటీస్‌) సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024) జరగనుంది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థల కన్సార్షియం, భారతదేశ వరి పరిశోధన సంస్థ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతదేశ వరి ఎగుమతిదారుల సమాఖ్య, ఫిక్కి తదితర సంస్థల ప్రతినిధులతో పాటు దాదాపు 30 దేశాల నుంచి వరి ఎగుమతి, దిగుమతిదారులు, భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శరైతులు ఇందులో పాల్గొననున్నారు. గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌కు భారత్‌లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను దీనికి వేదికగా ఎంచుకున్నారు. ప్రపంచంలో బియ్యం వినియోగం ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో వరిపంట ప్రాధాన్యం పెంచడంతో పాటు విస్తీర్ణాన్ని వృద్ధి చేయడం ద్వారా ఆహారభద్రత, సాగుకు సాంకేతిక సాయం, బియ్యం మార్కెటింగ్‌ను విశ్వవ్యాప్తం చేయడం, ఎగుమతుల పెంపు లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. వరిసాగులో ఎరువుల వాడకం తగ్గింపు, వాతావరణ పరిస్థితులను అధిగమించేలా సాగు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను సదస్సులో చర్చించనున్నారు.

*తెలంగాణకు ఎంతో ఉపయోగం

ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ తొలిసారిగా ఆతిథ్యమిస్తుండగా.. ఇందుకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణం. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. వరి సాగులో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్‌ వైపు చూస్తున్నాయి. ఈ సదస్సు ద్వారా ఎగుమతి, దిగుమతిదారులకు ఒక వేదిక కల్పించే వీలుంటుంది. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే మన దేశం, ముఖ్యంగా తెలంగాణ రైతులకు సరైన ధరతో పాటు పెద్దమొత్తంలో ఉన్న మార్కెట్‌ నిల్వల సమస్యను పరిష్కరించుకోవచ్చు.వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 16:36

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌....

చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫోన్‌. ..

చంద్రబాబుకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌. రెండు రాష్ట్రాల విభజన హామీలు.. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబును కోరిన రేవంత్‌ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరిన రేవంత్‌.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 11:36

తెలంగాణలో 3 లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!

3 లక్షల ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు!

ప్రైవేటు వైద్య కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద వచ్చే చాన్స్‌

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త కాలేజీలు అందుబాటులోకి రానుండటం వల్లే..

విభజన చట్టంలో పేర్కొన్న 15% ఉమ్మడి కోటా గడువు ముగియడమూ కారణమే..

వారం రోజుల్లో వెలువడనున్న నీట్‌ రాష్ట్ర ర్యాంకులు

నీట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరో వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశముంది. ఈసారి అర్హత మార్కులు పెరగడంతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో సీట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్ని ర్యాంకులు వచ్చిన వారికి కన్వీనర్‌ సీట్లు వచ్చాయన్న విషయమై విద్యార్థులు ఆరా తీస్తున్నారు

లక్షల్లో ర్యాంకు వచ్చినా..

 

గతేడాది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కన్వీనర్‌ కోటా కింద నీట్‌ జాతీయ స్థాయిలో 2.66 లక్షల ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీటు లభించింది. మేడ్చల్‌లోని సీఎంఆర్‌ మెడికల్‌ కాలేజీలో బీసీ సీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి ఆ ర్యాంక్‌కు సీటు వచ్చింది. అలాగే 2.62 లక్షల ర్యాంకు పొందిన బీసీ సీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్ధికి సిద్దిపేటలోని సురభి మెడికల్‌ కాలేజీలో సీటు లభించింది. సంగారెడ్డిలోని టీఆర్‌ఆర్‌ కాలేజీలో బీసీ సీ కేటగరీకే చెందిన విద్యార్థికి 2.58 లక్షల ర్యాంక్‌ వచ్చినా కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు లభించింది.

ఈ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇక ఓపెన్‌ కేటగిరీ లోకల్‌ కోటాలో వరంగల్‌లోని ఫాదర్‌ కొలంబో మెడికల్‌ కాలేజీలో 1.60 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు లభించింది. ఓపెన్‌ కేటగిరీలోని అన్‌ రిజర్వ్‌డ్‌ కోటాలో సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలో 58,727 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు లభించింది.

పెరిగిన సీట్లతో ఈసారి విస్త్రుత అవకాశాలు...

రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెరిగాయి. 2023-24 వైద్య విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 56 మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా 29 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద కేటాయిస్తారు.

మరోవైపు ఈ ఏడాది కూడా మెడికల్‌ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. 2024-25 విద్యాసంవత్సరంలో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్‌ కాలేజీలు రానున్నాయి. వాటికి సంబంధించి ఇంకా నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈసారి ఆరు కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని.. ఈ లెక్కన కనీసం 300 సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. అంటే ఆ మేరకు ఎంబీబీఎస్‌లో విద్యార్థుల చేరికలకు అవకాశాలు పెరగనున్నాయి.

15 శాతం ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో..

తెలంగాణలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు 15 శాతం కోటా కింద పదేళ్లపాటు సీట్లు పొందేందుకు వీలు కల్పించిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని నిబంధన గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ నిబంధన వల్ల 2014 నుంచి 2022 వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 15 శాతం సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి కోటా కింద వర్తింపజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందుబాటులోకి వచ్చిన కొత్త మెడికల్‌ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను రద్దు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనే ఉమ్మడి కోటాను అమలు చేసింది. ఆయా కాలేజీల్లో 1,950 కన్వీనర్‌ కోటా సీట్లలో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే అందులో 200కుపైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో ఇకపై ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇలా కూడా అదనంగా సీట్లు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి 3 లక్షల ర్యాంక్‌ పొందిన విద్యార్ధికి కూడా కన్వీనర్‌ కోటాలో సీటు లభిస్తుందని కాళోజీ నారాయణరావు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గతేడాది ఉస్మానియా, గాం«దీ, కాకతీయల్లో ఏ ర్యాంక్‌కు సీట్లు వచ్చాయంటే?

ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ఓపెన్‌ కేటగిరీలోని లోకల్‌ కింద 19,239 ర్యాంకుకు, అన్‌ రిజర్వుడ్‌లో 7,943 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వారికి 30,522 ర్యాంకు వరకు కూడా సీటు లభించింది. ఎస్సీ విద్యార్థులకు లోకల్‌ కేటగిరీలో 89,253 ర్యాంకు సాధించినా సీటు వచ్చింది. అన్‌రిజర్వ్‌డ్‌లో 48,358 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీ లోకల్‌ కేటగిరీలో 90,658 ర్యాంకర్‌కు, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 73,500 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు వచ్చింది. బీసీ ఏలో లోకల్‌ కేటగిరీ కింద 79,611 ర్యాంకు, అన్‌రిజర్వ్‌డ్‌లో 42,349 ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చాయి. బీసీ బీలో లోకల్‌కు 30,944... అన్‌ రిజర్వుడుకు 12,788 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ సీలో లోకల్‌కు 69,344... అన్‌ రిజర్వ్‌డ్‌లో 21,822 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ డీలో లోకల్‌కు 30,465... అన్‌ రిజర్వ్‌డ్‌లో 20,069 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ-ఈలో లోకల్‌కు 34,482... అన్‌ రిజర్వ్‌డ్‌లో 20,497 ర్యాంకర్లకు సీట్లు లభించాయి.

గాంధీ మెడికల్‌ కాలేజీలో ఓపెన్‌ కోటాలో లోకల్‌ కేటగిరీ కింద 8,164 ర్యాంకుకు, అన్‌ రిజర్వ్‌డ్‌లో 3,225 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వారికి 26,245 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కోటాలో లోకల్‌ కేటగిరీ కింద 80,215 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు వచ్చింది. అన్‌ రిజర్వ్‌డ్‌లో 39,519 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. ఎస్టీలో లోకల్‌కు 78,656... అన్‌ రిజర్వ్‌డ్‌కు 47,860 ర్యాంకుకు సీటు వచ్చింది. బీసీ-ఏ లోకల్‌ కేటగిరీలో 36,691 ర్యాంకుకు సీటురాగా బీసీ-బీలో లోకల్‌ కింద 15,625 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. అలాగే బీసీ-సీలో లోకల్‌కు 55,674 ర్యాంకుకు సీటు లభించింది. బీసీ-డీలో లోకల్‌కు 14,598 ర్యాంకుకు... అన్‌ రిజర్వ్‌డ్‌లో 8,257 ర్యాంకుకు సీట్లు వచ్చాయి. బీసీ-ఈలో లోకల్‌కు 30,495... అన్‌ రిజర్వ్‌డ్‌లో 5,737 ర్యాంకర్లకు సీట్లు లభించాయి.

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఓపెన్‌లోని లోకల్‌ కేటగిరీలో 36,905 ర్యాంకుకు, అన్‌ రిజర్వ్‌డ్‌లో 25,305 ర్యాంకర్లకు సీట్లు లభించాయి. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వారికి 47,684 ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీల్లో లోకల్‌ కేటగిరీలో 1.14 లక్షల ర్యాంకుకు సీటు వచ్చింది. అన్‌ రిజర్వ్‌డ్‌లో 98,658 ర్యాంకుకు సీటు వచ్చింది. ఎస్టీ కోటాలో లోకల్‌ కింద 1.07 లక్షల ర్యాంకు వచ్చిన వారికి... అన్‌ రిజర్వ్‌డ్‌లో 95,831 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ-ఏ లోకల్‌ కేటగిరీలో 1.09 లక్షల ర్యాంకుకు... అన్‌ రిజర్వ్‌డ్‌లో 66,831 ర్యాంకులకు సీట్లు వచ్చాయి. బీసీ-బీలో లోకల్‌కు 43,616... అన్‌ రిజర్వ్‌డ్‌కు 37,381 ర్యాంకర్లకు సీట్లు వచ్చాయి. బీసీ-సీలో లోకల్‌కు 94,902 ర్యాంకర్‌కు సీటు వచ్చింది. బీసీ-డీలో లోకల్‌కు 42,838, బీసీ-ఈలో లోకల్‌ కోటా కింద 50,030 ర్యాంక్‌ పొందిన వారికి సీట్లు లభించాయి.

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 11:22

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతల సమావేశం..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతల సమావేశం..

హాజరైన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 10:41

తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..

తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,320 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,919 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jun 06 2024, 10:30

ఏపీ:రోజా ఓటమితో నగరికి పట్టిన శని వదిలింది...: నగరి మున్సిపల్ చైర్మన్

తిరుపతి: రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం, రోజాపై నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్ శాంతి విమర్శలు.. రోజా ఓటమితో నగరికి పట్టిన పదేళ్ల పీడ విరగడైంది.. నగరి ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాం, రోజా అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీకి శని పట్టింది రోజాకు టికెట్ ఇవ్వకపోయి ఉంటే వైసీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు-శాంతి

నిజందాగదుక్షణంఆగదు

Jun 05 2024, 17:08

భద్రాచలం: చర్ల: ఏ పార్టీ గెలిచిన ఓడేది ప్రజలే: ముసలి సతీష్(PYL)

ఏ పార్టీ గెలిచినా ఓడేది ప్రజలే!

ముసలి సతీష్ 

ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ పోతుంది? దేనికి ఎన్ని సీట్లు? ఎన్ని? ఇన్నా? అన్నా? అన్నేనా? చర్చలు! చర్చలు! వాదాలు! కాలక్షేపపు వాదాలు! ఎన్ని చేసినా పార్టీల సమర్ధకులైతే ఫరవాలేదు! కానీ, మేధావులు! ఆలోచనాపరులు! పత్రికల్లో! టీవీల్లో! ఎన్నికల ఫలితాలకోసం రాత్రింబవళ్ళూ కబుర్లు! ఏ పార్టీ? ఏ పార్టీ? శ్రమ దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీల్లో ఏదో ఒక పార్టీ కోసం వెతుకులాటా, నిరీక్షణా!

ఇప్పుడున్న ఎన్నికల తంతునీ, అమలులో వున్న రాజ్యాంగాన్నీ, చలామణీలో వున్న ప్రజాస్వామ్యాన్నీ మేధావులు కూడా పసిపిల్లలకన్నా అమాయకంగా నమ్ముతూ అంచనాలు కడుతున్నారు. ఈ మేధావులు, ప్రజలకు మేలు చేసే పార్టీ ప్రభుత్వం వస్తే బాగుండునని కోరుకుంటారు. తక్షణ ఉపశమనం గురించి మాత్రమే ఆలోచించే అల్పసంతోషులైన వీరు, శ్రమ దోపిడీ విషయాలను కనీసంగా కూడా ఎత్తరు. ఉన్న పరిస్తితుల్లో, ఎప్పటికప్పుడు తక్షణ ఉపశమనాల గురించే ఆలోచిస్తే, దీర్ఘకాలిక పరిష్కారం గురించి ఎప్పుడు? ‘శరీరంలో పెద్ద జబ్బు యేదో వున్నా, తలనొప్పిని పట్టించుకోకూడదా?’ అంటారు. నిజమే. తాత్కాలిక సమస్యల్ని కూడా పట్టించుకుంటేనే ఒక అడుగు ముందుకు వెయ్యగలం. అయితే, అసలు జబ్బు సంగతి ఎప్పుడు? తల నొప్పీ, ఈ నొప్పీ, ఆ నొప్పీ రావడం అసలు జబ్బువల్లే అయితే, జబ్బుతో సంబంధం లేకుండా చిన్న నొప్పులు రాకుండా చూడడం సాధ్యమేనా? ‘శ్రమ దోపిడీ’ అనే జబ్బువేపు ఎప్పుడు చూస్తారు? అది సాధారణ ప్రజలకు తెలీదు. మేధావులకీ తెలీదా? దాని గురించి ప్రజలకు ఎప్పుడు తెలుపుతారు?

ప్రజానుకూల మేధావులకు దురుద్దేశాలను ఆపాదించలేము. కానీ, ఆ విషయాల్ని పైపైనే చూసే, రాసే రాతలూ, ఎన్నికల్లో సీట్ల సంఖ్యలూ, ప్రజల్ని భ్రమల్లోనే వుంచుతాయి. మేధావులు కూడా భ్రమల్లో ఉండడానికే అలవాటై పోతున్నారా? ఎన్నికల్లో నిలబడ్డ పార్టీల్ని, అధికారంలో వున్నా, లేకపోయినా, ప్రతీ ఒక్క పార్టీనీ వేరు వేరు స్వభావాలతో, వేరు వేరు లక్ష్యాలతో వున్నదాన్నిగా, ఈ మేధావులు భావిస్తారు. ఆ భావనలు నిజం కావని ఆ పార్టీలు అమలు చేసే విధానాల్ని బట్టి తెలిసిపోతుంది. ‘ప్రైవేటీకరణ’ విధానాన్ని ప్రతీ పార్టీ అమలు చేస్తుంది, కాకపోతే, కొన్ని హెచ్చు తగ్గులతో! ఉద్యోగ భద్రత పోయి, ప్రైవేటు యజమానుల దయాదాక్షిణ్యాల మీద బతికే జీవితాన్నే ఇస్తాయి పార్టీలు. అలాగే, ‘సరళీకరణ’ పేరుతో ఏమి చేస్తారో చూడండి: వాతావరణ కాలుష్యం జరగరాదనే దృష్టి గానీ, పని పరిస్తితుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు వుండాలనే దృష్టిగానీ, ఏదీ లేకుండా, పరిశ్రమలకు తేలిగ్గా (సరళంగా) అనుమతులిచ్చేసే పార్టీలే కదా ఇవి! పైగా, దోపిడీదారులకే భూముల్ని అడ్డగోలుగా నామమాత్రపు ధరలకు ఇవ్వడాలూ, కరెంటూ–నీళ్ళూ ఉచితంగానో, చవగ్గానో ఇవ్వడాలూ! ‘ప్రపంచీకరణ’ పేరుతో, విదేశీ కంపెనీలకు ఇక్కడి తలుపులూ, కిటికీలూ తెరిచి పెట్టడం! ఈ విధానాల్ని తిరస్కరించే పార్టీ ఒక్కటైనా వుంటుందా?

‘స్వతంత్రం! స్వతంత్రం వచ్చేసింది! పోరాడి సాధించాం’– అంటారు! నిరుద్యోగ సమస్యకి పరిష్కారాన్ని సాధించారా? 75 ఏళ్ళగా వుంటూనే వుందే! ఏ సమస్యకైనా, ఏ దరిద్రానికైనా కారణం, శ్రమ దోపిడీని పెద్ద స్తాయిలో నడిపించే ‘పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానమే’ అని గ్రహించలేరా మన ప్రజానుకూల మేధావులు? గ్రహించినా ప్రజలకు తెలపలేరా? ధరల పెరుగుదలకు కారణమేమిటో గ్రహించినా బైటపెట్టలేరా? తిండీ, బట్టా, నివాసమూ, విద్యా, వైద్యమూ అనే కనీస అవసరాల్ని తీర్చని విషయంలో పార్టీల మధ్య ఏమిటి తేడా? దేశంలో కలిమి అంతా ఒక వర్గం దగ్గిరా, లేమి అంతా ఇంకో వర్గం దగ్గిరా పోగుపడడానికి ఈ పార్టీలు కారణమని మేధావులకి తెలీదా? కోటి రూపాయలతో కార్లు కొనేవాళ్ళు ఒక వేపూ, పొట్టకూటికోసం ప్రాణాలకి తెగించి డ్రయినేజీ గోతుల్ని శుభ్రం చేసేవాళ్ళు ఇంకోవేపూ వుండడానికి ఈ పార్టీలు కారణం కాదా?

‘రాజ్యాంగాన్ని రక్షించాలి!’ అంటారు. అసలు రాజ్యాంగమే అనేక అసమానతలకి మూలం. ఇతరుల శ్రమని దోచి, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ అనే ఆదాయాలకు వీలునిచ్చే ఆస్తి హక్కుల్ని ఇస్తుంది. కొందరు పౌరులు, జీవితాంతమూ అట్టడుగు శారీరక శ్రమలే చేసే వారిగానూ, కొందరు పౌరులు ఎప్పుడూ మేధా శ్రమలే చేసే వారిగానూ వుండే అసమాన శ్రమ విభజనను నిలిపివుంచుతుంది. ఇలాంటి రాజ్యాంగాన్ని రక్షించమని శ్రామిక ప్రజలకు బోధించి ప్రయోజనం లేదు. నామమాత్రమైన హక్కుల్ని కూడా లేకుండా చేసే పార్టీని గెలిపించవద్దంటారు మేధావులు. కానీ, ఉన్న అన్ని పార్టీలూ, అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించేవే.

‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అంటారు. అసలు ఉన్న ప్రజాస్వామ్యమే కొద్దిమంది అనుభవించే ప్రజాస్వామ్యం అని ఈ మేధావులకి తెలియదా? ఓటు హక్కు ఇచ్చి, ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు అని భ్రమింపజేస్తే ఎలా? జీవితావసరాలూ, వాటి తయారీకి కావలసిన ఉత్పత్తి సాధనాలూ ఒక వర్గానికి రిజర్వ్ అయివుండగా, మిగతా కోట్ల మంది మొహాన ‘రిజర్వేషన్లు’ అనే మెతుకులు విసిరితే, ఆర్థిక రంగంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? దుర్మార్గమైన నిర్బంధ చట్టాల్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం వద్దంటారు. శతృ వర్గాలున్న సమాజంలో, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఆ నిర్బంధ చట్టాలు లేకుండా పాలించలేదు. 75 ఏళ్ళ చరిత్రలో ఈ పార్టీలు, ఎన్నో నిర్బంధ చట్టాలను కొత్తగా తయారు చేయడమో, ఉన్నవాటిని మరింత కఠినం చేయడమో చూడవచ్చును.

అన్ని రంగాలలోనూ అసమానతలున్న ఈ సమాజంలో ఎన్నికలు అనేవి, ‘‘పాలకవర్గం లోని ఒక ముఠా చేతుల్లోనించీ ఇంకో ముఠా చేతుల్లోకి బదిలీ చేసే సాధనంగా వుంటున్నది’’ అని ఈ ప్రజానుకూల మేధావులు గుర్తించి, ప్రజలకు చెప్పకపోతే ఎలాగ? ఎప్పుడో 155 ఏళ్ళ కిందటే, మార్క్సు అనే మేధావి గుర్తించిన విషయాన్ని, మనం 75 ఏళ్ళ అనుభవంలో చూడలేదా? (‘‘సార్వత్రిక ఓటింగు ఎటువంటిదిగా వుంటుందంటే, కొన్ని సంవత్సరాలకు ఒక మారు పార్లమెంటరీ వర్గ పాలన కోసం అనుమతిని మంజూరు చెయ్యడానికి మాత్రమే ఉపయోగపడుతూ వుంటుంది.’’ –మార్క్స్.) ఎన్నికలు ‘‘పాలక వర్గాల చేతిలో ఒక ఆటబొమ్మగా దుర్వినియోగం’’ అవుతున్న విషయం, ఎన్నికలు జరుగుతున్న తీరులోనే కనపడుతున్నది గదా? డబ్బూ, కులం, మతం, ఉచితాల పేరుతో పడేసే ముష్టి పధకాలూ ఉపయోగించి పార్టీలు అధికారంలోకి రావడానికే గదా ఈ ఎన్నికలు? ఎన్నికలకూ, పార్టీలకూ, వాటి విధానాలకూ సంబంధించిన నిజాల్ని ప్రజలకు వివరించే రాతలూ, చర్చలూ అవసరం. అంతేగానీ, ఈ పార్టీ గెలిస్తే ఏమి జరుగుతుందీ, ఆ పార్టీ వస్తే ఏమి జరుగుతుందీ అనే రాతలూ, చర్చలూ కాలక్షేపం కబుర్లుగా మిగిలిపోతాయి.

సరైన రాజకీయ జ్ఞానం అందకపోతే, ప్రతీ ఎన్నికలోనూ ఓడిపోయేది ప్రజలే కదా?

ముసలి సతీష్

నిజందాగదుక్షణంఆగదు

Jun 05 2024, 16:32

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఎన్ హెచ్-69 రహదారిపై ఇకపై ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు...

ఎన్‌హెచ్‌ 65పై 17 బ్లాక్‌స్పాట్లు

ప్రమాదాల నివారణకు చర్యలు

అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లకు తక్షణ ఏర్పాట్లు

త్వరలోనే పనులు ప్రారంభం*

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై 17 ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు (బ్లాక్‌స్పాట్‌) జరుగుతున్నట్టు గుర్తించారు. ఆయాచోట్ల ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టబోతున్నారు. ఈ హైవేపై సహజంగానే ట్రాఫిక్‌ రద్దీ అధికం. ఈ రహదారిపై గ్రామాలు, మూలమలుపులు, క్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా 17 ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్లు తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర పోలీసుశాఖ నమోదుచేసిన వివరాలను జాతీయ రహదారులశాఖ పరిధిలోని ట్రాన్స్‌పోర్ట్‌ రిసెర్చ్‌ వింగ్‌ (టీఆర్‌డబ్ల్యూ) పరిశీలించి బ్లాక్‌స్పాట్‌లను ఖరారు చేస్తుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం, 500 మీటర్లలో వరుసగా మూడేండ్లలో ఐదు రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు, తీవ్ర గాయాలు సంభవించడం, లేక ఒకేసారి జరిగిన ప్రమాదంలో 10 మరణాలు సంభవించడం.. ఈ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. ఇటువంటి బ్లాక్‌స్పాట్లు హైదరాబాద్‌-విజయవాడ హైవేపై 17 ఉన్నాయి. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలతో కూడిన నివేదికను జాతీయ రహదారులశాఖ రూపొందించింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

17 బ్లాక్‌స్పాట్లలో అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి ప్రతిపాదనలు ఇలా..

ఇరువైపులా లైటింగ్‌తో కూడిన సర్వీసు రోడ్ల నిర్మాణం- కటకమ్మగూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, ఇనుపాముల.

   

రోడ్‌ సైనేజెస్‌తోపాటు స్ట్రీట్‌ లైటింగ్‌తో కూడిన జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్‌- నవాబ్‌పేట్‌ జంక్షన్‌, ఆకుపాముల, కట్టంగూర్‌, దురాజ్‌పల్లి జంక్షన్‌.

   

అండర్‌పాస్‌(వీయూపీ)లు- రామాపురం క్రాస్‌రోడ్స్‌, కోమరబండ క్రాస్‌రోడ్‌, ముకుందాపురం, పెద్దకాపర్తి, చిట్యాల, చౌటుప్పల్‌, టేకుమట్ల, ఎస్వీకాలేజ్‌, జనగామ జంక్షన్‌.

నిజందాగదుక్షణంఆగదు

Jun 05 2024, 16:19

ఢిల్లీ: మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి తొలి సమావేశం..

ఢిల్లీ: మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి తొలి సమావేశం..

మోడీ నివాసంలో NDA సమావేశం. NDA సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నితీశ్‌కుమార్‌. ప్రధాని నివాసంలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, గడ్కరీ. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం. ఎన్డీఏ కూటమికి ఎన్నిక్లలో 292 సీట్లు.