Mane Praveen

Aug 08 2023, 07:29

ప్రజా యుద్ధనౌక' ప్రయాణాన్ని కొనసాగిద్దాం: టివివి, డిటిఎఫ్, కెవిపిఎస్ నేతలు
NLG: రాజ్య హింస పైన, ప్రజా సమస్యలపై ప్రజా ఆకాంక్షల కోసం రాజ్యంతో యుద్ధం చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రయాణాన్ని కొనసాగిద్దామని డి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అన్నారు. గద్దర్ అకాల మరణం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం గద్దర్ చిత్ర పటం ముందు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన గళంతో ఉర్రూతలూగించి, కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న  ప్రజా ఉద్యమ గొంతుక మూగబోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. నాలుగు దశాబ్దాల పోరాట జీవితంలో, ఏనాడు కూడా పాలకులకు తలవంచ లేదన్నారు. గద్దర్ ఆడితే తెలంగాణ ఆడిందని, గద్దర్ పాడితే తెలంగాణ పాడిందని, గద్దర్ కదిలితే తెలంగాణ యావత్ సమాజం కదిలిందన్నారు. ఎంతోమంది కవులను, కళాకారులను తయారుచేసి తెలంగాణ ఉద్యమానికి అందించిన గొప్ప యోధుడు గద్దర్ అన్నారు. సాంస్కృతిక విప్లవోద్యమానికి గద్దర్ చేసిన మార్గ నిర్దేశం విప్లవ పోరాటాలలో మైలురాయి గా నిలిచిందని అన్నారు. అజ్ఞాతంలో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా, నిరంతరం ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు అన్నారు. తన జీవిత ప్రయాణంలో ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యను పాట రూపంలోకి మలిచి ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో గద్దర్ దిట్ట అన్నారు. రాజ్యం తుపాకితో కాల్చినా, హత్య చేయడానికి ప్రయత్నం చేసినా, సమాజంలో జరుగుతున్న ఆడపిల్లల హత్యల పైన, అత్యాచారాల పైన, దోపిడీ పీడల పైన గొంతు విప్పడంలో ఏనాడు వెనకంజ వేయలేదని తెలిపారు. గద్దర్ హృదయం ఉద్యమాల హృదయముగా పేరుగాంచిందన్నారు. గద్దర్ పోరాట పఠిమను, వారి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల పై ఉందని అన్నారు. గద్దర్ ఆకాంక్షించిన ప్రజాస్వామిక తెలంగాణ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణలోని కవులు, కళాకారులు మేధావులు, విద్యావంతులు, బుద్ది జీవులందరి పైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో  డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖుర్షీద్ మీయా, పి.వెంకులు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, కార్యదర్శి పెరుమాల వెంకటేశం, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రత్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాశయ్య, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, ఏఎం.ఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జ చిన్న, ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా కో-కన్వీనర్ ఇరిగి శ్రీశైలం తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, కత్తుల చందన్, సోహేల్, సామాజిక కార్యకర్త పలస యాదగిరి, డి టి ఎఫ్ జిల్లా బాధ్యులు టి.వెంకటేశ్వర్లు, ఈద అంజయ్య, ఇమ్మడి జగతి, కె.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2023, 20:33

TS: గద్దర్ పార్ధీవదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
హైద‌రాబాద్: ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్ధీవదేహానికి సోమవారం సాయంత్రం, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌ లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సిఎం కేసీఆర్ చేరుకొని గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించి, వారి కుటుంబ స‌భ్యులను ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు ర‌స‌మ‌యి బాల‌కిష‌న్,  బాల్క సుమ‌న్, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, తదితరులు  నివాళుల‌ర్పించారు.

Mane Praveen

Aug 07 2023, 19:27

NLG: న్యాయం చేయమని బీఎస్పీ అధ్వర్యంలో కలెక్టర్ కు పిర్యాదు
నల్లగొండ జిల్లా, కేతేపల్లి మండల పరిధిలోని ఇనుపాముల గ్రామానికి చెందిన మేకల బిక్షమయ్య అనే వ్యక్తికి 70 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 96, పట్టా నెంబర్ 559 లో  రెండు ఎకరాల అసైన్డ్ భూమిని పంపిణీ చేయడం జరిగిందని, అప్పటి నుండి అట్టి భూమిని సేద్యం చేసుకుని జీవనం సాగిస్తున్నట్టు, తర్వాత ఆర్ధిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల 8 సంవత్సరాల క్రితం తమ గ్రామస్తుడైన బత్తుల నర్సింహా రెడ్డి (రిటైర్డ్ టీచర్) కి కౌలు కి ఇవ్వడంతో  నిరక్షరాస్యులైన నన్ను మోసం చేసి కౌలు కాగితం రాయాలని చెప్పి రూ.100/- బాండ్ పేపర్ పై రూ.40,000/- కి విక్రయించినట్టు పేపర్ రాసి సంతకం చేయించడం జరిగిందని, ఇప్పుడు అట్టి భూమి అతనిది అని అప్పటి కాగితం తీసుకవచ్చి ఇబ్బందులకు పెడుతున్నారని, ఇంతకముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా అప్పటి కలెక్టర్ మండల తహశీల్దార్, అర్ఐ లను పంచనామా చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. వారు మా బాధ వినకుండా అతను చెప్పిందే విని రిపోర్ట్ పంపించారని, మీము చెప్పంది రికార్డు చేయకుండా ఎలా రిపోర్ట్ ఇస్తారని ప్రశ్నించగా.. మరల ఆర్ఐ ను అక్కడి ప్రదేశం కి వెళ్లి మరల రిపోర్టు ఇవ్వమని కోరగా అక్కడ ఆర్ఐ దురుసుగా ప్రవర్తిస్తూ, మా కుటుంబ సభ్యుల పట్ల అసభ్య పదజాలంతో ఏమీ చేసుకుంటారో చేసుకొమ్మని బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జి మేడి ప్రియదర్శిని ని కోరగా.. బాధితులకు న్యాయం చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ప్రియదర్శిని ఆధ్వర్యంలో పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కేతెపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మేకల నర్సింహా, మేకల బిక్షం, మేకల భారతమ్మ, మేకల రవి, వంటేపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 07 2023, 18:52

గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలకు సోంత భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా, దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంను ముట్టడి చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు రామావత్ లక్షణ్ నాయక్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతున్నామని పత్రిక ప్రకటన మాత్రమే ఇచ్చి విద్యార్థుల కడుపులు మాత్రం మాడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని విద్యార్ధి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళుగా 5,177 కోట్లు రూపాయలు స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ ప్రభుత్వం విడుదల చేయకుండా, విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్ళకుండా నిర్లక్ష్యం చేస్తుందని, బడ్జెట్లో 0.1 శాతం కూడా కాదు ఈ నిధులు విడుదల చేయడానికి అని అన్నారు. మూడేళ్ళ నుండి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్య మంత్రికి కానీ, ఒక్కమంత్రి, ఎమ్మెల్యే కి కానీ  ఒక్కనెల కూడా వాళ్ళు జీతాలు పెండింగ్ లేవు మరి విద్యార్థులకు ఎందుకు అని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికి యూనిఫామ్ ఇవ్వలేదు, ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేవు, లెక్చరర్స్, టీచర్స్ ఖాళీలు భర్తీ లేదు, పంద్రాగస్టు కూడా పాత బట్టలతోనే విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్ళాలా అని ప్రశ్నించారు.
- ప్రభుత్వం గోప్పగా చెప్పుకుంటున్న గురుకులాలు మరింత ఆధ్వానంగా ఉన్నాయి. 1008 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కనీసం సౌకర్యాలు లేవు, సన్నబియ్యం పెడుతున్నామని చెబుతున్నా, ఆచరణలో అమలు లేదని విమర్శించారు.
- మెనూ అమలు లేదు, మెస్ బిల్లులు రాక నాణ్యమైన భోజనం పెట్టక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాస్మోటిక్ ఛార్జీలు నెలకు హస్టల్స్ విద్యార్ధులకు 62/- బాలురు, 150/- బాలికలకు  ఇస్తున్నా, గత 8 నెలలుగా పెండింగులో ఉన్నాయని,  ఎలా విద్యార్ధులు చదువుకోవాలని ఎస్ఎఫ్ఐ అడుగుతుందన్నారు. - 2018లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. గోప్పగా అసెంబ్లీలో ప్రకటించిన పథకం అమలు జరగడం లేదు. తక్షణమే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని అన్నారు.
- తక్షణమే విద్యా రంగం సమస్యలు పరిష్కారం చేయకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లను మంత్రులను  అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  నాయకులు కిరణ్, శ్రీకాంత్, రాజేష్, మల్లేశ్వరి మౌనిక, రోజా, శ్రీవాణి, మంజుల రాహుల్, శ్రవణ్, చందు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2023, 17:18

NLG: సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం
నల్లగొండ: సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని జిల్లాలోని సెకండ్ ఏఎన్ఎం లు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్ హెచ్ ఎం లలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లుగా గత 15 సంవత్సరాలుగా, పిఎస్సీలలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఎన్ఎం లు మాట్లాడుతూ.. వీఆర్ఏ పంచాయతీ కార్యదర్శిలతో పాటు, ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ పరం చేయడం జరిగింది. కానీ కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న మమ్మల్ని మాత్రమే ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఏఎన్ఎంలు చనిపోయిన కానీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, వారి కుటుంబాలు  ఈరోజు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నిరసిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో, ఈ నెల 4వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, కార్యక్రమంలో సుమారు 3500 మంది సెకండ్ ఏఏఎంలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి, ఏఎన్ఎంలు స్వప్న, సుచిత్ర, సరిత, పద్మ , రోజా, మమత, మంజుల, సుమలత, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2023, 14:23

మర్రిగూడెం: ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళి                    
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు దళిత రత్న అవార్డు గ్రహీత నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో, సోమవారం ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం చాలా బాధాకరం అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారు మరణించడం కళాకారులకు తీరనిలోటు అని అన్నారు. కార్యక్రమంలో బిక్షం నర్సిరెడ్డి ముత్యాలు మామిడి కృష్ణ, కేశగోని  రామచంద్రం, ఈద అభి సందేశ్, నవీన్, వాకిటి హరీష్, కొడిచర్ల అభి, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 07 2023, 10:47

NLG: ఇండియన్ లైబ్రరీ ఫెస్టివల్ 2023 లో పాల్గొన్న ఎన్జీ కళాశాల గ్రంథ పాలకుడు దుర్గాప్రసాద్
ఇండియన్ లైబ్రరీ ఫెస్టివల్ 2023, ఈ నెల 5,6 తేదీలలో ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విచ్చేసి గ్రంధాలయాల ఆవశ్యకతను, గ్రామ గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ప్రసంగించారు. ముగింపు సమావేశానికి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ కర్ విచ్చేసి ప్రతి మారుమూల ప్రాంతంలో జిల్లాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గ్రంథ పాలకులు, దేశవ్యాప్తంగా పేరు పొందిన గ్రంథ పాలకులు పాల్గొని వారి యొక్క అనుభవాలను వేదిక పై పంచుకున్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గ్రంథ పాలకుడు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ మరియు  హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాలలో పనిచేస్తున్న గ్రంథ పాలకుడు డాక్టర్ రవి కుమార్ చెగొని పాల్గొన్నారు.

Mane Praveen

Aug 07 2023, 09:49

TS: అధికార లాంఛనాలతో గద్దర్ అంతక్రియలు
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్ అంతక్రియలను అధికార లాంఛనాలతో చేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుండి గద్దర్ ఇంటి వరకు అంతిమయాత్ర నిర్వహించనుంది. అల్వాల్ లోని మహాబోధి స్కూల్ గ్రౌండ్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు.

Mane Praveen

Aug 06 2023, 22:26

గద్దర్ పార్థివ దేహానికి పూలమాలలు వేసిన పలువురు రాజకీయ ప్రముఖులు
HYD: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదివారం, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో..  తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ మృతికి సంతాపం తెలిపి, గద్దర్ పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మరియు పలువురు రాజకీయ ప్రముఖులు, తదితరులు గద్దర్ పార్టీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Mane Praveen

Aug 06 2023, 21:01

NLG: మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో  టి.జి.సి.జి.టి.ఏ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలుపొందిన సంఘ నాయకుల గౌరవార్థం, ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా కళాశాలల అధ్యాపకులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  అధ్యక్షత వహించిన నల్లగొండ జిల్లా సంఘ అధ్యక్షులు డా. మునీర్ మాట్లాడుతూ.. ప్రాథమిక సభ్యుల కొరకు పనిచేస్తున్న సురేందర్ రెడ్డి నాయకత్వంలో భాగమైనందుకు తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన డా. మారం గోనారెడ్డి  మాట్లాడుతూ.. విద్యా సమస్యల పై పోరాటం చేస్తున్న ఈ నాయకత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యా రంగంలోని సమస్యలపై, అధ్యాపకుల హక్కులకై  నిరంతరం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవ సలహాదారు, ప్రముఖ కవి  డా. బెల్లి యాదయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభి వృద్ధికి సంఘ నాయకులు, ప్రాథమిక సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎన్. గోపి, సంఘ నిర్వాహక కార్యదర్శి డా. ఎస్. రాజారాం, మహిళా కార్యదర్శి డా.ఇ. పావని, కార్య నిర్వాహక సభ్యురాలు డా. ఐ. వాణి, నల్లగొండ జిల్లా కార్యదర్శి డా. సి.హెచ్. రామరాజు, యాదాద్రి జిల్లా అధ్యక్షులు డి. కిషన్ మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వివిధ విశ్వవిద్యాలయాల సమన్వయ కర్తలు   పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయ కర్తగా జిల్లా ఉపాధ్యక్షులు టి. భాస్కర్ రెడ్డి వ్యవహరించారు.