ఘోరం: తనను చూసి నవ్వారని.. నిలబెట్టి ఏడుగురిని చంపేశాడు..!

బ్రెజిల్‌ (Brazil)లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆటలో ఓడిపోయిన తనను చూసి నవ్వారని.. ఓ వ్యక్తి వారిపై విచక్షణారహితంగా కాల్పులు (Gun Firing) జరిపాడు.

ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్‌ నగరానికి చెందిన ఎడ్గర్‌ రికార్డో డి ఒలివిరా గత మంగళవారం స్థానిక పూల్‌ హాల్‌ (Pool Hall)కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్‌ (బ్రెజిల్‌ కరెన్సీ)కు పందెం కాసి పూల్‌ గేమ్‌ (Pool Game)లో ఓడిపోయాడు. దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్‌ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చిన ఒలివిరా.. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా అతడు ఓడిపోవవడంతో పూల్ హాల్‌లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు.

దీంతో కోపోద్రిక్తులైన ఒలివిరా, అతడి స్నేహితుడు దారుణానికి పాల్పడ్డారు. రెబిరో గన్‌తో బెదిరించి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టగా.. ఒలివిరా వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పూల్‌ యజమాని సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Guntur: ఐటీ అధికారులమంటూ డబ్బు, బంగారంతో పరారీ.. గుంటూరులో ఘరానా మోసం

గుంటూరు: ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాత గుంటూరు ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో గురువారం ముగ్గురు వ్యక్తులు వచ్చారు..

తాము ఐటీ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చి సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను చెల్లించకుండా భారీగా బకాయి ఉన్నారంటూ ఆస్తిపత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తింపు కార్డులు చూపించాలని కల్యాణి నిలదీయడంతో ఆమెను తుపాకీతో బెదిరించి డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు తీసుకుని ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. వెంటనే బాధితురాలు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విమానాశ్రయాల మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

అభివృద్ధి పనులకు 720 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విమానాశ్రయాలు ఉండే విధంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఆ దశలో అడుగులు వేస్తుంది. దీంట్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కోసం రూ 720 కోట్ల రూపాయలను కేటాయించింది ఆ నిధులతో శరవేగంగా పనులు సాగుతున్నాయి.

2025 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో కేంద్రం పని చేస్తుంది. ప్రయాణికులు బయటకు రావడానికి లోనికి వెళ్లడానికి ప్రత్యేకంగా వేరే వేరే లిఫ్టులు ఎక్స్ లెటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ స్థలం విశ్రాంతి భవన నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రయాణికుల నీటి వినియోగం కోసం ఫోర్ జి ఎల్ ఆర్ పైపులతో నిర్మాణం చేపడుతుంది.

ప్రయాణికుల రాకపోకల సంబంధించిన విషయమై ప్లాన్ మార్పులు చేపడుతున్నారు. స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తుల కొరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేయడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. 40 ఏళ్ల అవకాశాలకు అనుగుణంగా డిజైన్ రూపకల్పన చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు అత్యధిక భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు.

2025 నాటికి ఈ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది...

తెలంగాణ గురుకులాల్లో పురుగుల అన్నం:బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం పురుగుల అన్నం తింటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారలేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, వాటి పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ లోకమంతా ఏవీఎన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపేయేనని ఆమె స్పష్టం చేశారు. విద్యావంతులు, ఉపాధ్యాయులు బీజేపీ బలపరిచిన అభ్యర్థికి అండగా నిలవాలని ఆమె కోరారు. ఏవీఎన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా తీసిన ర్యాలీలో డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు పాల్గొన్నారు.

kanna Laxminarayana: తెదేపాలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna Laxminarayana) తెలుగుదేశం (TDP) పార్టీలో చేరారు. గురువారం మధ్యాహ్నం గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని తెదేపా పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు..

వందలాది వాహనాల్లో కన్నా అనుచరులు నినాదాలు చేస్తూ ఆయన వెంట వచ్చారు.

ముందుగా నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2.48 గంటలకు అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు వేలాదిగా తెదేపా కండువా కప్పుకున్నారు.

Hyderabad: షూ కింద ప్రత్యేక ఏర్పాట్లతో.. శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు..

సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు..

యాసంగి సాగు రికార్డు.. రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల్లో పంటలు..

సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు.

53.08 లక్షల ఎకరాల్లో వరి

8 ఏండ్లలో కొత్తగా 49 లక్షల ఎకరాల సాగు

యాసంగి పంటలకు జీవధారగా కాళేశ్వరం

సీఎం కేసీఆర్‌ కృషితో సాగునీరు పుష్కలం

నిరంతర విద్యుత్తు, ఆపై పెట్టుబడి సాయం

యాసంగి వచ్చిందంటే భూములన్నీ బీడు పెట్టి రైతులంతా ఇంటికాడ కూర్చునేటోళ్లు. లేదంటే కూలీనాలీ పనులకు వెళ్లేటోళ్లు.. ఇది ఎనిమిదేండ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు సాగు సీజన్‌ సీన్‌ మారింది. జీవధార కాళేశ్వరంతో పుష్కలమైన సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్తు, పెట్టుబడిసాయంతో మండుటెండల్లోనూ పసిడి పంటలు పండుతున్నాయి. ఈసారి యాసంగిలో ఏకంగా 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తెలంగాణ యాసంగి చరిత్రలో ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు.

సరిగ్గా ఎనిమిదేండ్లలో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అద్దెకరం పారితే గొప్ప అనుకొనే రోజులు పోయి, ఏకంగా పదెకరాల పంటలను పారిస్తున్నరు మన తెలంగాణ రైతన్నలు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి ఫలితం. ఆ ఫలితం ఎంతటిదంటే.. ఈ యాసంగి సీజన్‌ పంటల సాగులో ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ఉమ్మడి పాలనలోనూ ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 68.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. 2020-21 రికార్డును బద్ధలు కొడుతూ సరికొత్త రికార్డు నమోదైంది. మొత్తం పంటల సాగుతో పాటు వరి సాగు కూడా నయా రికార్డులను సృష్టించింది. ఏకంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం లెక్కలను బుధవారం వ్యవసాయ శాఖ విడుదల చేసింది. సాగుకు ఇంకా 10 రోజుల సమయం ఉన్నది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది.

49 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు

సాగునీటికి కరువుండే యాసంగిలోనూ రాష్ట్రంలో అనూహ్య రీతిలో పంట సాగు పెరుగుతుండటం గమనార్హం. ఎనిమిదేండ్లలోనే రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం ఏకంగా 48.61 లక్షల ఎకరాలు పెరిగింది. 2015-16 యాసంగిలో సీజన్‌లో తెలంగాణ అంతటా 19.92 లక్షల ఎకరాలే సాగైంది. అదిప్పుడు 68.53 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక, యాసంగి వరి గత ఎనిమిదేండ్లలో 45.73 లక్షల ఎకరాలు పెరగటం విశేషం. 2015-16 యాసంగిలో 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. అంటే.. వరి సాగు ఏడింతలు పెరిగింది.

అంచనాలను మించి..

ఉమ్మడి ఏపీ, తెలంగాణ వ్యవసాయ చరిత్రలో 2020-21 యాసంగిలో అత్యధిక సాగు నమోదైంది. ఆ సీజన్‌లో మొత్తం 68.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇదే స్థాయిలో వరి కూడా రికార్డు స్థాయిలో 52.80 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక భవిష్యత్తులో ఈ సాగును మించి కాబోదని అందరూ అంచనా వేశారు. కానీ ఈ సీజన్‌లో సాగు 68.53 లక్షలకు చేరుకోగా, వరి సాగు 53.08 లక్షలకు చేరింది.

సీఎం కేసీఆర్‌ కృషి ఫలితమే

అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవటానికి ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన నిరంతర శ్రమ, పట్టుదల వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయాన్ని గాడిలో పెట్టి రైతులు సగర్వంగా జీవించేలా ప్రణాళికలు అమలు చేశారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీరు, కరెంటు గోస తీర్చారు. రైతుబంధు అందించి రైతులకు అండగా నిలిచారు. వ్యవసాయ రంగంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రికార్డు స్థాయిలో పంటలు సాగు చేసేలా చేశారు. సీఎం కేసీఆర్‌ చేయూతతో ఇప్పుడు తెలంగాణ రైతులు అధిక పంటలు సాగు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు..కీలక నిర్ణయం

హైదరాబాద్: గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఐదున్నర లక్షల వీధి కుక్కలున్నాయని, గతంలో 8 లక్షల 50వేలు ఉండేవని (2011) స్టెరిలైజేషన్‌ ఆపరేషన్స్‌ నిర్వహించడం వల్ల వాటి సంఖ్య ఐదు లక్షల 50వేలకు తగ్గిందని అర్వింద్‌కుమార్‌ తెలిపారు.

వాటికి వెంటనే ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీల్లో కొన్ని నీటి నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, చికెన్‌ , మటన్‌ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. నగరంలో కుక్కల సంఖ్యను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.

పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక యాప్‌

పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు అర్వింద్‌కుమార్‌ సూచించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను 'మై జీహెచ్‌ఎంసీ' యాప్‌, 040 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుకల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ యాప్‌లో సంబంధిత యాజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని చెప్పారు. ఎకువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలోకి

రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ నిర్దేశం

దిల్లీ: నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఇకపై ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. ‘‘చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది.

పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు పాఠశాల ముందస్తు విద్య (ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌), 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్‌ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం.

అందువల్ల అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు, ఎన్‌జీవోలు నిర్వహించే ప్రీ స్కూల్‌ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ లక్ష్యం సాకారం కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనల్లో సవరణలు చేయాలి.

అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్‌ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేయడానికి వీలుగా ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి, అమలుచేయాలి. ఈ కోర్సును స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా రూపొందించి, డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ల (డైట్‌) ద్వారా అమల్లో పెట్టాలి. ఈ కార్యక్రమాన్ని ఎస్‌సీఈఆర్‌టీ పర్యవేక్షణలో నిర్వహించాలి’’ అని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది.

Viveka Murder Case: వివేకా రాజకీయాలు అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డికి నచ్చలేదు అందుకే: సీబీఐ

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.

‘‘వైఎస్‌ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగింది. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారు. తనకు ఇవ్వకపోయినా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని పట్టుబట్టారు.

ఈ విషయంలో వివేకా రాజకీయ కదలికలు అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డికి నచ్చలేదు. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి.. వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. దీంతో వివేకాను సునీల్‌ యాదవ్‌ ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు. హత్య జరిగిన రోజు రాత్రి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్‌ యాదవ్‌ వెళ్లాడు.

ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సీఐకి సమాచారం ఇచ్చారు. హత్యను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కుట్రలో భాగంగానే గుండెపోటు, విరేచనాల కథ అల్లినట్లు కనిపిస్తోంది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారు. వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజ్‌ కట్టారు’’ అని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.