ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..
ఖైరతాబాద్ మహా గణపయ్యకు పూజలు ప్రారంభమయ్యాయి. అయితే..ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది బడా గణేష్ 70 అడుగుల ఎత్తులో కొలువుదీరారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు.
ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేశుడి విగ్రహం తయారీ పనులు ఆలస్యంగా ప్రారంభమైనా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈసారి భక్తులకు శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు
విగ్రహంలో మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు ప్రతిష్టించబడ్డాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. అంతే కాకుండా.. బడా గణేష్ విగ్రహ పాదాల చెంత అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ కు రానున్నారు. వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది దాదాపు 22 లక్షల మంది భక్తులు బడా గణేష్ను దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ్ కమిటీ అంచనా వేస్తోంది.
Sep 07 2024, 12:32