బోను లో చిక్కిన చిరుత

తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు.

తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అటవీ అధికారులు గుర్తించారు.
రెండు రోజుల క్రితం నరశింహస్వామి ఆలయ సమపంలో బాలికపై చిరుత దాడి చేసింది. చిరుత సంచరించే ప్రాంతాలను గుర్తించి అటవీ అధికారులు నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు చిరుత చిక్కిన ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.
కాగా.. తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత సంచారం తాజాగా కలకలం రేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న వాహనదారులకు 38వ మలుపు వద్ద చిరుత కనపడింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకున్న తర్వాత నడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు...
Aug 14 2023, 10:05