నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:46

తడిసిన ధాన్యం పై రాష్ట్ర సర్కార్ సైలెంట్ ?

- అకాల వర్షాలకు తడిసిన ధాన్యం 

- అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం

- తడిసిన ధాన్యంతో అన్నదాతల అగులు బుగులు 

 

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు.

మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే.. ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం !

ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండాముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలోకి ధాన్యం తీసుకొచ్చి వారం పది రోజులవుతున్నా.. కాంట పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలు ఉందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా రైతుల నష్టాన్ని మరింత పెంచాయి. అధికారులంతా పోలింగ్‌లో నిమగ్నంకావడంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

2వేల కోట్ల బకాయిలు ఎప్పుడో ?

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం… రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ ఇదే తరహా నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ. 5700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రూ. 3700 కోట్ల వరకు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రైతులకు రూ. 2వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన వారం పది రోజులకు కూడా డబ్బులు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:44

కొత్త చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి

- నూతన చట్టాల అవగాహన పై సిబ్బందికి విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తాం.

- ఎస్పీ రాహుల్ హెగ్డే సమావేశం

కొత్త చట్టాల అవగాహన కార్యక్రమానికి హాజరైన అదనపు ప్రజా న్యాయవాది ఉపేందర్ నూతన చట్టాల గురించి వివిధ సెక్షన్ల ల గురించి అవగాహన కల్పించారు. మారిన సెక్షన్స్ మరియు చాప్టర్లను ప్రతి ఒక్కరికి క్లుప్తంగా వివరిస్తూ.. గత సెక్షన్లతో పోల్చినప్పుడే తొందరగా అవగతం అవుతాయని అన్నారు. 

 ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ 2024 సం. జూలై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా జూలై 1వ తేది నుండి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క అధికారి, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా జిల్లా పోలీసులందరికీ విడతలవారీగా శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. 

కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023. వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలం అని, కొత్త చట్టాలపై అవగాహణ రావాలంటే నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడే సాద్యం అవుతుందని అన్నారు.

కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరం అని, అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పుల గురించి వివరించారు. 

 అనంతరం అదనపు ఎస్పీ. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన చేయడం జరుగుతుందని నూతన చట్టాల నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు రవి, శ్రీధర్ రెడ్డి, సి ఐ లు శ్రీను, రాము, సురేందర్ రెడ్డి, చరమంద రాజు, రజిత రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రఘువీర్ రెడ్డి, స్టేషన్ ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:42

ద్వారకా తిరుమల ఆలయాన్ని సందర్శించిన కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ : టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం ద్వార‌కా తిరుమ‌ల ఆల‌యాన్ని కుటుంబ స‌మేతంగా సంద‌ర్శించారు.

కేశినేని శివ‌నాథ్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు వెంక‌ట్ వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మొక్కులు చెల్లించుకున్నారు. 

అనంతరం అర్చకులు శివ నాథ్ ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ఎదురుచూస్తున్న ఉషోద‌యం జూన్ 4వ తేదీన ఉద‌యించాల‌ని...

చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కావాల‌నే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చాల‌ని వేంక‌టేశ్వ‌ర‌స్వామ‌ని కోరుకోవ‌టంతో పాటు.. రాష్ట్ర ప్రజలందరిపై స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించిన‌ట్లు కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 03 2024, 15:39

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్.. ఈసారి ఏకంగా నెల రోజులు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన ఈడీ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కే. కవిత‌కి కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు.

తాజా కేసులో జ్యుడీషియల్ కస్టడీ గడువు సోమవారంతో ముగియడంతో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. వార్తా సంస్థ ANI ప్రకారం, కోర్టు నుండి జూలై 3 వరకు కవితను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్న సమయంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మే 29న వారెంట్‌ జారీ చేయడం గమనార్హం. అంతకుముందు మే 6న, ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది, కవితకు బెయిల్ లభిస్తే, ఆమె సాక్షులను ప్రభావితం చేయగలదని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.

నిజంనిప్పులాంటిది

Jun 02 2024, 09:33

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం..!!

- అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సోనియా గాంధీ 

- సోనియమ్మ లేకుండానే ఆవిర్భావ వేడుకలు

మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.

పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. 

ఉదయం 9.35లకు పరేడ్ గ్రౌండ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తారు.

9.55కు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ స్వాగతం

10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ

10.35కు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ

10.38కు సోనియా గాంధీ ప్రసంగం (షెడ్యూల్‌లో ఉంది. అనారోగ్య కారణాల వల్ల హాజరుకావడం లేదు)

10.43కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం11.08కు పోలీస్ సిబ్బందికి అవార్డుల ప్రదానం

తెలంగాణ ఆవిర్భవ వేడుకల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఆవిర్భావ వేడుకల కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలొస్తున్నారు. ఆ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 02 2024, 08:40

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.

హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో వేడుకలు. 

పరేడ్‌ గ్రౌండ్స్‌ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్‌, సీఎం రేవంత్ రెడ్డి. 

సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 19:18

జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు..!

•వాహనదారులకు అలర్ట్‌..

•ట్రాఫిక్‌ రూల్స్‌లో మార్పులు..!

ఇక మే నెల ముగిసింది. జూన్‌ నెల ప్రారంభం కానుంది. జూన్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఒకవైపు దేశ పొలిటికల్ కారిడార్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు, మొదటి తేదీ నుండి మీ జేబుకు సంబంధించిన అనేక విషయాలలో మార్పులు ఉండబోతున్నాయి. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మొదటి తేదీ ఉదయాన్నే నిర్ణయించబడతాయి..

 ఒకటో తేదీ నుంచి ఆధార్‌కు సంబంధించిన నిబంధనలలో కూడా మార్పులు రానున్నాయి. దీంతోపాటు ట్రాఫిక్ రూల్స్‌లో కూడా అనేక మార్పులు రానున్నాయి. వీటిని పాటించకుంటే సామాన్యుల జేబులపై పెనుప్రభావం పడుతుంది.

జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్పుకుందాం.

గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు: గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో ప్రతి నెలా ఒకటో తేదీన మార్పు ఉంటుంది. దేశీయ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. జూన్ 1న రెండు రకాల గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పు ఉండవచ్చు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై డేటా ప్రకారం, గృహ గ్యాస్ సిలిండర్ ధరలో చివరిసారిగా మార్చి 9న తగ్గుదల కనిపించింది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు చౌకగా మారాయి.

ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌పై ఉపశమనం: సామాన్యులకు గొప్ప ఉపశమనం ఇస్తూ, UIDAI ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌ తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. అంటే ఎవరైనా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకుంటే ఒక్కో అప్ డేట్ కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

25 వేల జరిమానా విధించే నిబంధన: మరోవైపు, మైనర్ వాహనం నడుపుతున్నట్లు తేలితే, అతనికి భారీ జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం, దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ పొందే వయస్సు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. మైనర్ ఇలా చేస్తే రూ.25,000 జరిమానా విధించవచ్చు. అలాగే, అతనికి 25 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి లైసెన్సు లభించదు.

ట్రాఫిక్ రూల్స్‌లో కూడా మార్పులు: జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం.. అతి వేగంతో వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 19:16

అవమానించారు ... నేను రాను ..!

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR)ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు తాను హాజరుకాబోవడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకుగల కారణాలను పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) శనివారం బహిరంగ లేఖ రాశారు.

అమరుల చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ(Congress).. ప్రస్తుతం వారి పేరు చెబుతూ రాజకీయాలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రజలు మరువరని అన్నారు. రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్రను కాంగ్రెస్ సర్కార్ తక్కువ చేసి చూపుతోందని.. ఇది రాష్ట్ర సాధకుడైన తనకు అవమానమని.. అందుకే వేడుకలకు హాజరుకావట్లేదని వెల్లడించారు.

ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్ర్యాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుండీ ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. 

చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ప్రజా పాలన అని చెబుతూ ఒక్క హామీ నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్నారు. ముందు వాటిని నెరవేర్చండి" అంటూ కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 19:14

లోక్‌సభ ఎన్నికలు సమాప్తం.. ముగిసిన ఏడో దశ పోలింగ్

లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Elections 2024) భాగంగా.. ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1న (శనివారం) ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ (ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా) ఫలితాలు రానున్నాయి.

తొలి దశ: ఏప్రిల్ 19వ తేదీ :20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 101 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. తొలి దశలో మొత్తం 64 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది.

రెండో దశ: ఏప్రిల్ 26వ తేదీ: 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ రెండో దశలో మొత్తం 60.96 శాతం పోలింగ్ నమోదు అయింది

మూడో దశ: మే 7వ తేదీ: 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ మూడో దశలో మొత్తం 64.58 శాతం పోలింగ్ నమోదు అయింది.

నాలుగో దశ: మే 13వ తేదీ: 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నాలుగో దశలో మొత్తం 69.16 శాతం పోలింగ్ నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ దశలోనే.. ఒకే సారి జరిగాయి.

అయిదో దశ: మే 20వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ జరిగింది. ఈ అయిదో దశలో మొత్తం 62 శాతం పోలింగ్ నమోదు అయింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఆ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్ జరిగింది.

ఆరో దశ: మే 25వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఆరో దశలో మొత్తం 59.06 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ దశలో ఒడిశా అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ జరిగింది.

ఏడో దశ: జూన్ 01వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఏడో దశలో సాయంత్రం 5.00 గంటల వరకు 58.34 శాతం పొలింగ్ నమోదు అయింది. ఒడిశా అసెంబ్లీకి మూడో దశ లేదా తుది దశ పోలింగ్ పూర్తి అయింది.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 12:43

నేడే కొండగట్టు అంజన్న జయంతి ..!

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.

అంజన్న జయంతి వేడుకలల్లో భాగంగా భద్రాచలం సీతారాముల దేవస్థానం తరుపున ఈవో రమాదేవి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా కళాకారులతో నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. అనంతరం అర్చకులు.. ఆలయంలోని ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు.

మూడు రోజుల పాటు యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం వైభవంగా నిర్వహించనున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.